Wednesday 1 May 2019

దొందూ దొందే! డా. జి వి పూర్ణచందు


దొందూ దొందే!
డా. జి వి పూర్ణచందు
పరైః పరిభవేత్‌ ప్రాప్తే వయం పంచోత్తరం శతం
పరస్పర విరోధేతు వయం పంచ శతం చ తే!
పాండవులు అరణ్యవాసం చేస్తూన్నారు. అడవుల్లో ఆకులు, అలములు తిని జీవించాలన్నది నియమం. ఆ మాత్రం తిండి కూడా వాళ్లకు దొరక్కుండా చేయాలని దుర్యోధనుడు తన తమ్ముల్ని వెంటేసుకుని పాండవులున్న అడవికి వచ్చాడు.
అడవుల్లో చిన్నచిన్న పల్లెలుంటాయి. మనుషులు ప్రకృతిలో ప్రకృతిగా జీవిస్తుంటారక్కడ. పాండవులు వాళ్లతో కలిసిపోయి సుఖంగానే జీవిస్తున్నారన్నది వార్త. ఆ సమయంలో పాండవులు ఓ చిన్నపల్లెలో ఉన్నారు. ఆ ఊరి పేరు ఘోష. పాండవుల్ని అక్కణ్ణించి వెళ్లగొట్టాలన్నాడు దుర్యోధనుడు. కోడ్ అమల్లో ఉంది. పాండవులు అడవుల్లోనే ఉండాలి. జనంలో ఉంటే నిస్సందేహంగా కోడ్ ఉల్లంఘనే...” అనేది దుర్యోధనుడి నిశ్చితాభిప్రాయం.
ఆ సమయంలో ధర్మరాజు ఓ నదికి ఈవలి తీరంలో యజ్ఞం చేస్తున్నాడు. కోడ్ అమల్లో ఉండగా యఙ్ఞం ఏమిటీ? యఙ్ఞం అనేది డబ్బుతోనూ, మనుషుల్తోనూ కూడుకున్న వ్యవహారం. డబ్బునీ, మనుషుల్నీ సంపాదించే విధంగా జీవిస్తే అది అరణ్యవాసం ఎలా అవుతుంది...? ధర్మరాజు కోడుని ఉల్లంఘించాడు... అనేది దుర్యోధనుడి వాదన.
 ఆ నదికి ఆవలి తీరంలో విడిది చేశాడు దుర్యోధనుడు. అక్కణ్ణింఛి ఇక్కడ జరిగే తంతునంతా గమనిస్తున్నాడు. కోడ్ దాటినట్టు నిరూపించటానికి తగిన ఆధారాలు వెదుకుతున్నాడు. అవతల భీష్మ ద్రోణాదులు ఇప్పటి ఎలక్షన్ కమీషన్ లాగా విరోధి పార్టీకే అనుకూలంగా ఉన్నారు. మొత్తం నిఘా యంత్రాగాన్ని వాళ్ల గుప్పెట్లో పెట్టుకోవటంతో దుర్యోధనుడే స్వయంగా రంగంలోకి దిగి తన సర్వేలేవో తాను చేసుకుంటూ తన ఆత్మఘోష వెళ్ల గ్రక్కుకుంటున్నాడు.
 దుర్యోధనుడు ఇలా కోడు గీతల్ని లెక్కించే పనిలో ఉండగా, కౌరవ సోదరులు ఊరికే కూర్చోలేక అక్కడున్న ఓ సరస్సులో ఈతలు కొట్టేందుకు దిగారు. నిజానికి ఆ సరస్సు చిత్రసేనుడనే గంధర్వుడిది. మా అనుమతి లేకుండా సరస్సులో దిగారని గంధర్వులు కౌరవ సోదరుల మీద దాడి చేసి బంధించారు. దుర్యోధనుణ్ణి ఓ రథస్తంభానికి కట్టేసి లాక్కెళ్లారు.
అప్పుడు కౌరవ సైనికులు వచ్చి దుర్యోధనుణ్ణి కాపాడమని పాండవుల కాళ్లు పట్టుకున్నారు. దానికి భీముడు కాగల కార్యం గంధర్వులు తీర్చారుఅన్నాడు. కానీ, ధర్మరాజు అలా అనవద్దని వారిస్తూ, ఐకమత్యం అంటే ఏమిటో చెబుతాడు. మనలో మనం కొట్టుకునేప్పుడు వాళ్లు వందమంది, మనం ఐదుగురిమే! కానీ ఉమ్మడి శత్రువు వచ్చినప్పుడు మనం కూడా ఉమ్మడిగా ఉండి నూట ఐదుగురం అనుకోవాలని హితబోధ చేస్తాడు. పై పద్యానికి నేపథ్యం ఇది.
జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమాధికారాల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొన్ని ఈ మౌలిక సూత్రాన్ని పట్టించుకోకపోవటం నిస్సందేహంగా కోడు ఉల్లంఘనే!
“దేశభక్తి మాకు కద్దని వట్టి గొప్పలు చెప్పుకోకోయ్” అంటూ గురజాడ తన సమకాలీన రాజకీయ నాయకుల్లో తిలక్ ని అన్నాడో సురేంద్రనాథ్ బెనర్జీని అన్నాడో తెలీదు. “ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయ్” అంటూ గురజాడవారు దేశభక్తి గీతంలో ఎన్నో సుద్దులు చెప్పారు. 110 యేళ్ళ తరువాత కూడా ఈ సుద్దులు నేర్పించాల్సిన రీతిలో మన రాజకీయ పక్షాలు నడుస్తున్నాయంటే మనలో పురోగతి ఏమీ లేదనే అర్థం.
ప్రఙ్ఞాసాధ్వి అనే సన్యాసిని వుంది. ప్రఙ్ఞా సింఘ్ ఠాకూర్ ఆమె అసలు పేరు. ఆమె పైకి సన్యాసినేగానీ భయంకరమైన బాంబు ప్రేలుళ్ళ కేసుల్లో ఉన్న ఘనత ఆమెది! ఒకప్పుడు ముంబై యాంటీ టెర్రస్టు స్క్వాడ్  అధిపతి హెమంత్ కర్కరె ఆవిణ్ణి తనదైన పద్ధతిలో ప్రశ్నించి వాస్తవాలు రాబట్టే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత 2008 ముంబై పేలుళ్ళ సమయంలో ఈపోలీసు అధికారి ఉగ్రవాదులతో పోరాడి అమరుడయ్యాడు. ప్రభుత్వం ఆయనకు మరణానంతరం అశోక్ చక్ర ప్రదానం చేసి గౌరవించింది.
ఈ ప్రఙ్ఞాసాధ్వి గారు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోంది. సదరు కర్కరేగారు విచారణ పేరుతో తనను శారీరకంగా ఎంతలా హింసించాడో కథలుకథలుగా చెప్తూ కన్నీరోడుతూ, సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోంది. అతను పెట్టిన హింసను తట్టుకోలేక “నాశనమైపోతావని శపించాను. అలానే పోయాడు” అంది. ఈమె భావనలో పాకిస్థానీ ఉగ్రవాదులు అతన్ని చంపటం సబబే అని! కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనేది ఆమె అభిప్రాయం. ఆ విధంగా పాకిస్తాన్ మంచిపనే చేసిందంటుందావిడ.
ఆమె ప్రత్యర్థిగా పోటి చేస్తున్న మరో పెద్దమనిషి ఇంకో అడుగు ముందుకు వేసి హిందూ తీవ్రవాదులవలన తన ప్రాణానికి ముప్పు ఉందని కర్కరే తనతో ఏనాడో చెప్పినట్టు ప్రకటించాడు. హిందూత్వ వాదులు పాకిస్థాన్ కన్నా ప్రమాదం  అనడం ద్వారా పాకిస్థానే మంచిదనే అభిప్రాయాన్ని ఆయన ప్రకటించాడు.
దేశ సార్వభౌమాధికారం గురించి ఏ మాత్రం పట్టని ఈ ఇరుపక్షాలూ ధర్మరాజు చెప్పిన ‘వయం పంచ శతం-మేం నూట ఐదుగురం అనే సూత్రాన్ని మరిచిపోయారు. అందరూ కలిసి చివరికి పాకిస్థాన్ మంచినే కోరుతున్నారు. దొందూ దొందే!

No comments:

Post a Comment