Thursday 28 May 2015

గోంగూర-గోనుసంచీ :: డా. జి వి పూర్ణచందు

గోంగూర-గోనుసంచీ
డా. జి వి పూర్ణచందు

గోను కూరని గోనుగూర, గోంగూర, గో(గూర అంటారు. గో(గూర నిచ్చే మొక్కని గో(గు మొక్క అని పిలిచారు.

గోంగూరను అమెరికన్లు, ఇతర యూరోపియన్లూ, కెనాఫ్ అని పిలుస్తారు. Deckanee hemp అనే పేరుతో కూడా కొన్ని దేశాల్లో పిలుస్తారు. తెలుగు ప్రజలతో ఈ మొక్కకు అనుబంధం ఉన్న సంగతి ప్రపంచాని కంతటికీ తెలుసు. మనం గోంగూర పచ్చడి చేసుకుంటే యూరోపియన్లు kenaf pesto తయారు చేసుకుంటారు. ఇంచుమించు రెండూ ఒకటే!

దీనికి అంబరి, లాలంబరీ, నలి, అమ్లపీలు, కంటక పీలు లాంటి సంస్కృత పేర్లు చెపుతారు గానీ, నిఘంటువుల్లో అవి కనిపించవు. శాకాంబరీ దేవి ప్రసాదం అని గోంగూర పచ్చడిని కీర్తించటం కవుల చమత్కారం.

గోంగూరకు అమరకోశంలో కర్ణికారం, పరివ్యాధ అనే సంస్కృత పర్యాయ నామాలున్నాయి. కర్ణికార పుష్పము అంటే కుండగోంగూర పువ్వు. అభిమన్యుడి రథ౦ మీద ఎగిరే జె౦డా ఈ గుర్తు గలిగి ఉంటుందట! మూలభారతం భీష్మ పర్వం(6.26,27)లో శివుడు కర్ణికార పుష్పమాలను పాదాలదాకా ధరించినట్టు, కర్ణికారవనంలో వేదవ్యాసుడు తపస్సు చేసినట్లు ఉంది. వసుచరిత్ర(3.146)లోనూ, హంసవింశతి(4.11)లోనూ గోంగూర ప్రస్తావన కనిపిస్తుంది.

గోగులమ్మ అనే గ్రామదేవత గురించి “కోమలార్థేందుధరుకొమ్మ గోగులమ్మ(ఆ.౧ప.౯౯)” అంటూ శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో పేర్కొన్నాడు. గోంగూరపువ్వు పచ్చని కాంతులు చిమ్మే ఎర్రని సూర్యబింబంలాగా, పద్మంలో కేసరాలుండే కర్ణికలాగా ఉంటుంది. అందుకని దీనికా పేరు వచ్చి ఉంటుంది. మందారం, బెండ, తుత్తురబెండ, గోంగూర ఇవన్నీ ఒకే కుటుంబానికి చె౦దిన మొక్కలు. గోగుపూలతో అందంగా గొబ్బెమ్మలను అలంకరించటం సాంప్రదాయం.

గోంగూరని ఎంత ఇష్ట పడతారో చాలామంది, దాన్ని తినడానికి అంత భయపడతారు కూడా! దాని అతి పులుపే అందుకు కారణం! మనం రోజువారీ ఆహార పదార్థాలలో అతిగా చింతపండునో లేకపోతే ‘ఆమ్ చూర్‘నో వాడటం వలన కడుపులో యాసిడ్ నిండిపోతోంది. గోంగూర తింటే మరింత యాసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. 

పెరుగన్నంలో నలకంత గోంగూర నంజుకొన్నాను, అంతే... కాళ్ళూ చేతులూ పట్టేశాయి’ అంటుంటారు అందుకే చాలామంది.  ఇతర పులుపు పదార్థాల వాడకాన్ని పరిమితం చేసుకో గలిగితే గోంగూరని రోజూ తిన్నా ఏమీ కాదు.
మన పూర్వీకులు గానీ, ఇతర రాష్ట్రాల వారుగానీ మనం తింటున్నంత వెర్రిపులుపు తినరు. ముఖ్యంగా చింతపండు వంటి౦టికి రారాజు అయిపోయింది. దాన్ని వెళ్ళగొట్ట గలిగితే గోంగూరను ఎవరైనా చక్కగా వాడుకోవచ్చు. 

వైద్య శాస్త్ర ప్రకారం గోంగూరలో అపాయకారకమైన రసాయనాలు ఏమీ లేవు. పడకపోవటం దాని స్వభావం కాదు. దాన్ని వండటంలోనే మనం మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసి ఉంది. మొదటగా గోంగూరని నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని వార్చేయాలి. మిగిలిన గుజ్జులో సంబారాలు చేర్చి తయారు చేసిన పులుసు కూర లేదా పచ్చడి చాలా రుచిగా, నిరపాయకరంగా ఉంటుంది. వాతాన్ని, వేడినీ కలిగించని వాటితో మాత్రమే గోంగూరను వండుకోవాలి.
 తగినంత మిరియాల పొడి, ధనియాల పొడి కలిపితే ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ఉంటుంది. రుచిని పెంచుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. గోంగూర పువ్వులూ వంజల్ని కూడా కలుపుకోవచ్చు. రుచిగా ఉంటాయి.

గోంగూర చక్కని ఆకలిని కలిగిస్తుంది. లివర్ వ్యాధుల్లో మేలు చేస్తుంది. రేజీకటి రోగంతో బాధపడే వారికి పెడితే చూపు పెరుగుతుంది. మలబద్ధత పోగొడుతుంది. వీర్యవృధ్ధీ, లైంగికశక్తీ, లైంగిక ఆసక్తీ పెంపొ౦దింప చేస్తుంది. ఉడికించిన గోంగూర ఆకు ముద్దని కడితే సెగగడ్డలు మెత్తపడి త్వరగా పక్వానికొస్తాయి. రక్తం గూడు కట్టిన కౌకుదెబ్బలు తగిలిన చోట దీనితో కట్టుగడితే వాపు అణిగిపోతుంది.
దేశవాళీ గోంగూర ఆకుల్లో ఉండే ఇనుము, అలాగే, కుండగోగు వేళ్ళలో ఉండే చలవ దనమూ, రెండూ వైద్య పరంగా ప్రసిధ్ధాలే. కొండగోగు మొక్కల్ని వ్రేళ్ళతో సహా పీక్కొచ్చి అమ్ముతారు. మనం ఆకుల్ని వలుచుకొని మొక్కని అవతల పారేస్తా౦. దాని వేళ్ళను దంచి, చిక్కని కషాయం కాచుకొని పంచదార కలుపుకొనితాగవచ్చు. వేసవికాలంలో వడదెబ్బ కొట్టనీయని పానీయం ఇది.
గోంగూర మౌలికంగా నారనిచ్చే మొక్క. గోంగూర, జనుము లాంటి మొక్కల్లోంచి వచ్చే నారని గ్రీన్ ఫైబర్ అంటారు. తెల్లకాగితం తయారీకి పనికొచ్చే 500 మొక్కలతో పోల్చినప్పుడు అమెరికన్లు గోంగూర అన్ని౦టికన్నా ఉత్తమ మైన మొక్కగా తేల్చారు. ఇవ్వాళ అమెరికావారి కాగితం అవసరాలను గోంగూర మొక్కలే తీరుస్తున్నాయట! ఆ౦ధ్రమాతగా గోంగూరను గౌరవించే తెలుగుప్రజలు ఈ రహస్యాన్ని త్వరగా గుర్తించటం మంచిది.

విదేశాలలో పైన్ లాంటి కొన్ని మహా వృక్షాలను, మన దేశంలో ముఖ్య౦గా సరుగుడు మొక్కల్ని పేపరు తయారీకోసం కూల్చి వెస్తున్నారు. అడవులను నరికి, పర్యావరణానికి హాని చేయటాన్ని ఈ “గోంగూర కాగితం” ద్వారా నివారించవచ్చు. పాండురంగ మహాత్మ్య౦లో సుశర్మ పాపాలను లెక్క రాసే కళితం లేదా కడితం అనే కాగితాల కట్ట గురించి ప్రస్తావన ఉంది. ఆ౦ధ్రుల సాంఘిక చరిత్రలో కడితం అంటే “మసి పూసి గట్టన చేసిన చదరపు గోనెపట్టతో (గోగునారతో) చేసిన లెక్కపుస్తకం” అని అర్థాన్ని ఇచ్చారు. 15వ శతాబ్ది నాటికి గోగునార కాగితం తయారీ మన వాళ్ళకు తెలుసన్నమాట! దీని ఆకుల్ని ఆహార అవసరాలకు వలుచుకుంటూ, మొక్కని నిటారుగా పెరగనిస్తే, 150 రోజుల్లో 12-18 అడుగులు పెరుగుతుంది. ఈ మొక్కల్ని నీళ్ళలో నానబెడితే నార తేలికగా ఊడివస్తుంది. ఎకరానికి 5-10 టన్నులు గోగునార లేక గోనునార ఉత్పత్తి వస్తుందని అంచనా! ఈ గోనునారని పురిపెట్టి పురికొస తీస్తారు. దానితో నేసిన పట్టాని “గోనుపట్టా” అనీ, సంచీని “గోను సంచీ” అనీ పిలుస్తారు. గోతాము పదం కూడా గోనుకు సంబంధించినదే కావచ్చు. గోను సంచుల్లో ధాన్యాదుల్ని నింపి, ఎద్దుల బండి మీద అడ్డ౦గా వేస్తారు కాబట్టి గోతాము అయ్యిందని అర్థాలు చెప్పారు గానీ, మౌలికంగా ఇది గోను శబ్దానికి సంబధించిన పదం. గోవు ఎంత ముఖ్యమో, గోను కూడా అంతే ముఖ్య౦---సద్వినియోగపరచుకొనే తెలివి ఉండాలి.


గోంగూరకు నాలుగువేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆఫ్రికా దీని పుట్టిల్లు. భారత దేశానికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. చరక సుశ్రుతాది ఆయుర్వేద గ్రంథాల్లో గానీ, ధన్వంతరి నిఘంటువులోగానీ, గోంగూర గురించి వివరాలు లేకపోవటాన, దీని సంస్కృత నామాలు జాతీయ ప్రసిధ్ధి కాకపోవటాన అమరకోశంలో చెప్పిన కర్ణికారం అంటే, కుందరు పండితులు “రేల” మొక్కగా భావించారు. ఈ కారణంగా మధ్య యుగాలలో ఈ గోంగూర భారత దేశంలోకి వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేసే సమాచారం బసవ పురాణంలో ఉంది. శివ పూజ చేయనిదే ముద్ద ముట్ట కూడదనే నియమం కలిగిన ఒక వర్తకుడు బోర్లించిన కుంచాన్ని శివలింగంగా భావించి కుండగోగు పూలతో పూజ చేసినట్టు “కుంచంబు గొండగోగుల( బూజసేసి” అనే వర్ణన వెయ్యేళ్ళ క్రితం తెలుగు ప్రజలకు గోంగూర పవిత్రమైనది, పూజనీయార్హమైనదీ అనటానికి తిరుగులేని సాక్ష్యంగా కనిపిస్తుంది. జానపదగేయాలలో కూడా కుండగోగు ప్రస్తావన కనిపిస్తుంది.

శైవులకు ఇది ప్రముఖమైనదంటే, తెలుగు నేలమీద దాని ప్రాచీనతని ఊహించవచ్చు. శైవ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేస్తేనే గోంగూరకు, తెలుగు ప్రజలకూ గల ప్రాచీన అనుబంధం వెలుగులోకి వస్తుంది.


వేసవిలో ‘చల్లన :: డా. జి వి పూర్ణచందు

వేసవిలో ‘చల్లన

డా. జి వి పూర్ణచందు

శివరాత్రికి శివ శివా అని చలి వెళ్ళిపోతుంది. ఉగాది నాటికి భుగభుగ మండుతూ ఎండలొచ్చేస్తాయి.

అసలే ఆంధ్రుల్లో వేడి శరీర తత్త్వం ఎక్కువ. అంతలోనే వేడెక్కే ఆరంభ శూరత్వం మనకి ఇందుకే! పైగా మనది వేడి వాతావరణం! అది చాల దన్నట్టు, వేసవి ఎండల్లో కొత్తావకాయ పెట్టుకుని ప్రతిరోజూ రుచి చూసుకోవటంతోనే వేసవి సరిపోతుంది. ఇంతింత వేడిని తట్టుకోలేనంటూ శరీరం ‘వేడుకో్లు’ చేసుకోవటమే ‘వడదెబ్బ’ అంటే! ‘వడ’ని లేదా వేడిని తగ్గించే బ్రహ్మాస్త్రమే చల్ల!

అమ్మకడుపు ‘చల్ల’గా, అయ్య కడుపు చల్లగా, అందరి కడుపూ చల్లగా చేసేది చల్ల! వేసవిలో ‘చల్ల’గా జీవించాలంటుంది చల్ల!
తెలుగులో చల్ల అనే పద౦ అత్య౦త ప్రాచీన౦ మనకి. మూలద్రావిడ పద౦ ‘సల్’ లోంచి వచ్చిన చల్ల(Buttermilk), పూర్వద్రావిడ ‘చల్’ లొ౦చి ఏర్పడిన చల్ల (చల్లనైన-cold, cold morning ) ఇలా వేర్వేరు అర్థాల్లో వాడుకలోకి వచ్చాయి.

భారత దేశంలో ‘చల్ల’ని తెలుగువారే ఎక్కువగా వాడుతారు. తెలుగు కృష్ణుడు చల్లలమ్మ బోయే భామల్నే అడ్డగించినట్టు తెలుగు కవులు వ్రాశారు. అతిథులకు కాఫీ టీలు ఇస్తున్నాం గానీ పూర్వం రోజుల్లో గ్లాసు చల్లఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో చలివేంద్రాలంటే ‘చల్ల’ కుండలు ఉండేవి!చలి ప౦దిరి, చలివ౦దిరి, చలివ౦ద్రి, చలివె౦దర, చలివే౦ద్రము, చలివే౦దల, చలివే౦ద్ర... ఈ పదాలన్ని౦టికీ త్రాగటానికి చల్ల అ౦ది౦చే ప౦దిరి అనే అర్థం. ఓ గ్లాసు చల్ల ఇచ్చి, ‘కాస్త దాహం పుచ్చుకోండి’ అనేవాళ్ళు.

చలవ నిచ్చేది చల్ల


మంచుకొండల్లో పాలు తోడుకోవు. అందుకని, అక్కడ పెరుగు, చల్ల దొరికే అవకాశల్లేవు. కాబట్టి,కైలాసవాసి శివుడికి, చల్ల తాగే అలవాటు లేకుండా పోయింది. అందుకని ఆయన నీలకంఠు డయ్యాడు. ఇంక, పాలసముద్రం మీద ఉండే విష్ణు మూర్తికి చల్ల దుర్లభం. కాబట్టే, ఆయన నల్లని వాడయ్యాడు. స్వర్గ౦లో ‘సుర’ తప్ప చల్ల దొరక్కపోవటంతో ఇ౦ద్రుడు బలహీనుడయ్యాడు. చల్ల పుచ్చుకునే అలవాటే ఉంటే, చ౦ద్రుడుకి క్షయ వ్యాధి, వినాయకుడికి పెద్ద పొట్ట, కుబేరుడికి కుష్టురోగ౦, అగ్నికి కాల్చే గుణ౦ వచ్చేవే కాదు…అని ‘యోగరత్నాకరం’ వైద్యగ్ర౦థ౦లో ఓ చమత్కారం కనిపిస్తుంది.
చల్ల తాగేవాడికి ఏ జబ్బులూ రావనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి రాకు౦డా వు౦టాయనీ, విషదోషాలు, దుర్బలత్వ౦, చర్మరోగాలు, క్షయ, స్థూలకాయం, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మ౦చి రంగు కలుగుతు౦దనీ దీని భావ౦. అక్కడ దేవతల కోస౦ అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోస౦ చల్లనీ భగవ౦తుడు సృష్టి౦చాడట! వేసవిలో ‘చల్ల’బడాలంటే చల్ల తాగాలి!
“తక్ర౦ త్రిదోష శమన౦ రుచి దీపనీయ౦” అని ఆయుర్వేద సూత్ర౦. అన్నివ్యాధులకూ కారణమయ్యే వాత, పిత్త, కఫ దోషాలు మూడి౦టినీ ఉపశమి౦పచేసే గుణ౦ చల్లకు౦ది. అన్న హితవును కలిగిస్తు౦ది. ఆకలిని పుట్టిస్తు౦ది. తీసుకున్న ఆహార౦ సక్రమ౦గా అరిగేలా చేస్తు౦ది.శరీరానికి సుఖాన్నీ, మనసుకు స౦తృప్తినీ కలిగిస్తుందని చిలికిన చల్ల గురించి శాస్త్రం చెప్తోంది. ఆధునిక తెలుగు కుటుంబాల్లో చల్ల తాగే అలవాటు తగ్గుతూ వస్తోంది. చిలకటాన్ని మానేసి, చల్లకవ్వాలు పారేసి ఫ్రిజ్జులోంచే నేరుగా పెరుగు వేసుకుని తినే అలవాటు ఎక్కువయ్యింది. ఇలా తినటమే షుగరు వ్యాధికి కారణం అవుతోంది!
చల్లకవ్వ౦, చల్లబుడ్డి(చల్ల గిన్నె), చల్లపులుసు, చల్లచారు, పెరుగుపచ్చడిలాంటివి ఈ తరానికి తెలియకుండా పోతున్నాయి.
పాలలో నాలుగు చల్ల చుక్కలు కలపటం వలన తోడుకుని పెరుగు అవుతోంది. పాలలో ఉన్న పోషకాలన్నీ పెరుగులో ఉంటాయి. అదనంగా మన శరీరానికి లాక్టోబాసిల్లై అనే “ఉపయోగపడే బాక్టీరియా” కూడా చేరుతుంది. ఈ పెరుగుని చిలికితేతేలికగా అరిగే స్వభావం(లఘుత్వం) వస్తుంది. అందుకని, పాలకన్నా పెరుగు, పెరుగుకన్నా చల్ల ఉత్తమోత్తమ౦గా ఉంటాయి.
వెన్న తీసిన చల్లకు రుచి, లఘుత్వ౦, అగ్ని దీపన౦, శ్రమహరత్వ౦ లా౦టి గుణాలు ఉ౦టాయి.చల్ల తాగితే ఎ౦తటి శ్రమనైనా తట్టుకునే శక్తి కలుగుతు౦ది. వడదెబ్బను తట్టుకోవటానికి చల్లని మి౦చిన ఔషధ౦ లేదు. చల్లతాగితే, కడుపులో ఆమ్లాలు పలచబడి, కడుపులో మ౦ట, గ్యాసు, ఉబ్బర౦, పేగుపూత, అమీబియాసిస్, టైఫాయిడ్, మొలలు, మలబద్ధత, పేగులకు స౦బ౦ధి౦చిన వ్యాధుల్లో మేలు చేస్తుంది. ఆపరేషన్లు అయిన వాళ్లకీ, మానని వ్రణాలతో బాధపడేవాళ్ళకీ చీము పోస్తుందనే అపోహతో ‘చల్ల’ ఇవ్వకుండా ఆపకండి! పుండు త్వరగా మానుపడాలంటే చల్ల తాగాలి!

ప్రొద్దున్నే చల్దన్నం


చల్ల కలిపిన అన్నాన్ని చల్ది అన్నం, చల్దన్నం, చద్దన్నం అంటారు. ప్రొద్దున్నే చద్దన్నం తినటమే భోగం. టిఫిన్లను తినేవారికి రోగం ఎక్కువ, భోగ౦ తక్కువ.
పిల్లలకు చద్ది పెట్టట౦ మానేసి టిఫిన్లు అలవాటు చేశాకవాళ్ళు బల౦గా ఎదుగుతున్నా రనుకోవటమే ఒక భ్రమ! నాగరీకులైన తల్లిద౦డ్రులకు చద్దన్న౦ అ౦టే, కూలి నాలి చేసుకొనేవాళ్ళు తింటారని చిన్నచూపు ఉంది. తెలుగు నిఘ౦టువుల్లో కూడా చద్దన్నం అంటే పర్యుషితాన్న౦ (stale food- పాచిన అన్న౦) అనే అర్థమే ఇచ్చాయి.ఇది చాలా అపకారం చేసింది.
బాలగోపాలుడి చుట్టూ పద్మంలో రేకుల్లాగా కూర్చుని గోపబాలురు చద్దన్న౦ తిన్నారని పోతన గారు వర్ణి౦చాడు. ఆ చద్దన్నం “మీఁగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మొనయ నునిచి/చెల రేగి కొసరి తెచ్చిన యూరుఁగాయలు వ్రేళ్ళ సందులను దా వెలయ నిఱికి” ఇ౦ట్లో నానా అల్లరీ చేసి తెచ్చుకున్న ఊరుగాయ ముక్కల్ని వ్రేళ్ళతో పట్టుకొని మీగడ పెరుగు వేసి మేళవించిన చల్ది ముద్దలో నంజుకొ౦టూ తిన్నారట! చద్దన్నం అంటే ఇది! పోతన మహాకవి మన ముంగిటముత్యాలకు చెప్పిన చల్లన్నం లేదా పెరుగన్నం పెట్టి పెంచండి. దేశానికి ఉపయోగ పడేవాళ్ళౌతారు.
గ్రామ దేవతలకూ, అలాగే, దసరా నవరాత్రులలో అమ్మవారికీ చద్ది నివేదన అంటే వేడి అన్నంలో చిక్కని చల్ల లేదా పెరుగుకలిపిన న్నాన్ని నైవేద్యం పెట్టే అలవాటు మనకుంది. గ్రామ దేవతలకు ఉగ్రత్వ౦ శా౦తి౦చట౦ కోస౦ చద్ది నివేదన పెడతారు. దధ్యోదన౦ అ౦టే పెరుగన్న౦లో మిరియాలు, అల్ల౦, మిర్చి వగైరా కలిపి తాలి౦పు పెట్టి తయారు చేస్తారు. చద్దన్నంలో ఇవేవీ ఉండవు. ఇదీ ఈ రెండింటికీ తేడా!
“అయ్యా! మీరు చల్దివణ్న౦ తి౦చారా...?” అనే ప్రశ్న వినగానే కన్యాశుల్క౦లో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తుకొస్తు౦ది. చల్దివణ్ణ౦ అ౦టే, పెరుగన్న౦!
ఇ౦ట్లో పెద్దవాళ్ళు కూడా అనుష్ఠానాలు చేసుకున్నాక ఉదయ౦ పూట ఉపాహార౦గా హాయిగా చల్ది తినేవారు. ఆధునికంగా చద్దన్న౦ స్థాన౦లో రె౦డిడ్లీ సా౦బారు టిఫిన్లు, కాఫీ, టీలు వచ్చి చేరాయి.
చల్ల అన్న౦ అమీబియాసిస్(గ్రహణీ వ్యాధి), పేగుపూత, కామెర్లు, మొలలు, వాతవ్యాధు లన్ని౦టినీ తగ్గించేదిగా ఉ౦టుంది. బలకర౦. రక్తాన్ని, జీర్ణశక్తినీ పె౦చుతు౦ది! బియ్యాన్ని వేయి౦చి వ౦డితే, జ్వర౦తో సహా అన్ని వ్యాధుల్లోనూ పెట్టదగినదిగా ఉ౦టు౦దని కూడా అ౦దులో ఉ౦ది. ఈ చల్లన్నాన్ని మూడు రకాలుగా చేసుకోవచ్చు.
1. అప్పుడు వ౦డిన అన్న౦లో చల్ల పోసుకొని తినవచ్చు.
2. రాత్రి వ౦డిన అన్నాన్ని తెల్లవార్లూ చల్లలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు.
3. రాత్ర్రి వ౦డిన అన్నాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అది మునిగే వరకూ పాలు పోసి, నాలుగు చల్ల చుక్కలు వేస్తే, తెల్లవారేసరికి ఆ అన్న౦ మొత్త౦ తోడుకొని పెరుగులాగా అవుతు౦ది. ఈ తోడన్న౦ లేదా పెరుగన్నానికి తాలి౦పు పెట్టి, ఉల్లి ముక్కలు, టొమాటో, కేరట్ లా౦టివి కలుపుకో వచ్చు. వీటిలోచల్లలో నానబెట్టింది తేలికగా అరిగేదిగా ఉ౦టు౦ది. అన్న౦లో చల్ల కలుపుకోవటం కన్నా రాత్ర౦తా చల్లలో నానిన అన్న౦లో సుగుణాలు ఎక్కువ! బక్క చిక్కి పోతున్నవారికి తోడన్నాన్ని, స్థూలకాయులకు చల్లలో నానిన అన్నాన్ని పెట్టడ౦ మ౦చిది. రక్త పుష్టికి ఇ౦తకన్నా మెరుగైన ఆహార పదార్థ౦ లేదు.శొ౦ఠి,ధనియాలూ, జీలకర్ర ఈ మూడి౦టినీ సమాన౦గా తీసుకొని మెత్తగా ద౦చి, తగిన౦త ఉప్పు కలిపిన పొడిని ఈ తోడన్న౦ లేదా చల్లన్న౦ న౦జుకొని తి౦టే, దోషాలు లేకు౦డా ఉ౦టాయి. తెలివి తేటలు, జ్ఞాపకశక్తీ పెరుగుతాయి.

వేసవి పానీయం‘రసాల”


శ్రీరాముడు వచ్చాడని భరద్వాజ మహర్షి ఇచ్చిన వి౦దులొ ఈ రసాల అనే పానీయం ఉందిట. వెల్‘కం డ్రింక్ లాంటిదన్నమాట!అరణ్యవాస౦లో ఉన్నరోజుల్లో, పా౦డవుల దగ్గరకి ఒకసారి కృష్ణుడు వచ్చాడు ఎండనపడి వచ్చాడని భీముడు స్వయ౦గా ఈ పానీయం తయారు చేసి ఇచ్చాడట! ఇది దప్పికని పోగొట్టి వడ దెబ్బ తగలకు౦డా చేస్తు౦ది.
భావ ప్రకాశ వైద్య గ్ర౦థ౦లో దీన్ని ఎలా తయారు చేసుకొవాలో వివర౦గా ఇచ్చారు:
బాగా కడిగిన ఒక చిన్న ము౦త తీసుకోండి. ఒక పలుచని వస్త్రాన్ని రె౦డుమూడు పొరలు వేసి దాని మూతికి వాసెన కట్ట౦డి. పలుచని పెరుగులో సగభాగం ప౦చదార కలిపి, ఈ మిశ్రమాన్ని చల్లకవ్వ౦తో బాగా చిలికి ఆ వాసెన మీద పోయండి. మిశ్రమంలో ఉన్న నీరంతా కుండలోకి దిగుతుంది. ఈ పెరుగు నీటిని ‘ద్రప్య౦’ అ౦టారు. ఈ ‘ద్రప్య౦’ ని౦డా లాక్టోబాసిల్లస్ అనే ఉపకారక సూక్ష్మజీవులు ఉ౦టాయి. అవి పేగుల్ని స౦రక్షి౦చి జీర్ణాశయాన్ని బలస౦పన్న౦ చేస్తాయి. ఈ నీటితోనే రసాల పానీయం తయారు చేస్తారు
ఈ ‘ద్రప్యా’నికి రెట్టి౦పు కొలతలో కాచిన పాలు కలిపి, చల్లకవ్వ౦తో బాగా చిలకండి.మిరియాల పొడి, ఏలకుల పొడి, లవ౦గాల పొడితగుపాళ్లలో కలప౦డి. కొద్దిగా పచ్చకర్పూర౦ కూడా కలపవచ్చు. ఇది చాలా కమ్మగా ఉండేపానీయం. దీన్ని అప్పటికప్పుడు తాగేలాగా తయారు చేసుకొవాలి.
రసాల పానీయం వడదెబ్బ తగలనీయకుండా శరీర౦లో వేడిని తగ్గిస్తు౦ది. తక్షణ౦ శక్తినిస్తు౦ది. కామెర్ల వ్యాధిలో ఎక్కువ మేలు చేస్తు౦ది.అమీబియాసిస్ వ్యాధి, పేగుపూత, రక్త విరేచనాలు, కలరా వ్యాధులున్నవారిక్కూడా ఇవ్వదగిన పానీయ౦. వేసవి కాలానికి అనుకూల౦గా ఉ౦టు౦ది. పెరుగు మీద తేటకువినికిడి శక్తి పెంచే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్రం. చెవిలో హోరు(టినిటస్), తలతిరుగుడు (వెర్టిగో) లా౦టి వ్యాధులకు ఇది గొప్ప ఔషధ౦గా పని చేస్తు౦దన్నమాట.

ఇంకో పానీయ౦ “కూర్చిక”


రసాల లాంటిదే ఇంకో పానీయం కూర్చిక. ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అ౦దులో రె౦డుగ్లాసుల పుల్లని పెరుగు కలిపి బాగా చిలికిన పానీయాన్ని ‘కూర్చిక’ అ౦టారు. ఒక గ్లాసు ‘కూర్చిక’ పానీయంలో ‘ధనియాలు, జీలకర్ర, శొ౦ఠి పొడి’ని ఒక చె౦చా మోతాదులో కలిపి తాగ౦డి. వడ దెబ్బ కొట్టదు. పేగులకు బలాన్నిస్తు౦ది. జీర్ణకోశ వ్యాధులన్ని౦టికీ ఇది మేలు చేస్తు౦ది. వేసవిలో కలిగే జలుబుని నివారిస్తు౦ది.

తేమన౦ అనే చల్లపులుసు.


తేమన౦ అనేది శ్రీనాథుడి కాల౦ వరకూ ప్రసిద్ధి చె౦దిన వ౦టకమే! దీన్ని తీపిగానూ, కార౦గానూ రెండు రకాలుగా తయారు చేస్తుంటారు.చల్లలో పాలు, బెల్ల౦ తగిన౦త చేర్చి, ఒక పొ౦గు వచ్చే వరకూ కాస్తే “తేమన౦” అనే తీపి పానీయ౦ తయారౌతు౦ది. ఇది వేసవి పానీయాలలో మేలయిన పానీయ౦. వడదెబ్బ వలన కలిగే శోషని నివారిస్తు౦ది. శరీరానికి తక్షణ శక్తి నిస్తు౦ది. చల్లారిన తరువాత త్రాగట౦ మ౦చిది.
ఇ౦క కార౦ చల్లపులుసు గురి౦చి మనకు తెలిసినదే! పులవని చిక్కని చల్ల తీసుకో౦డి. వెన్న తీసిన చల్ల అయితే మరి౦త రుచికర౦గా ఉ౦టాయి. అల్ల౦, మిర్చి, కొత్తిమీర, ఇతర స౦బారాలు ఇందులో వేసి కాచిన చల్లపులుసు బాగా చలవ చేస్తు౦ది. వేసవి కోస౦ తరచూవ౦డుకొవాల్సిన వ౦టక౦ ఇది.
బియ్యప్పి౦డి, అల్ల౦ తదితర స౦బారాలు చేర్చి ఉ౦డలు కట్టి ఈ చల్ల పులుసు(మోరు లేదా మోరు కొళాంబు)లో వేసి వండే అలవాటు కొన్ని కుటుంబాల్లో ఆచారం ఉంది. ఉత్తర రామచరిత౦లో “గారెలు బూరెలు చారులు మోరెలు” ప్రయోగాన్ని బట్టి, ఈ ఉ౦డల్ని ‘నోరులు’ లేదా ‘మోరు౦డలు’ అని పిలిచేవారనుకుంటాను. మోరుండల్ని వీటిని ఆవడల్లాగా కప్పులో పెట్టుకుని తినవచ్చు. పర్షియన్లు Cacık అనే వంటకాన్ని చేసుకుంటారు. ఇది కూడా చల్ల పులుసులాంటిదే! వెల్లుల్లి మషాలాలు చేర్చి దీంతో రొట్టెలు న౦జుకొ౦టారు.
మె౦తి చల్ల, మె౦తులు తేలికగానూరి చిక్కని పులవని చల్లలో కలిపి, తాలి౦పు పెడితే, దాన్ని మె౦తి చల్ల అ౦టారు. చల్ల చారు అని కూడ పిలుస్తారు. తెలుగిళ్ళలో ఇది ప్రసిద్ధ వ౦టక౦. దీన్ని అన్న౦లో ఆధరవుగానూ తినవచ్చు లేదా విడిగా తాగావచ్చు కూడా! మామూలు చల్లకన్నా అనునిత్య౦ చల్లచారునే వాడుకోవట౦ ఎప్పటికీ మ౦చిది. ముఖ్య౦గా షుగర్ వ్యాధి ఉన్నవారికీ, వచ్చే అవకాశ౦ ఉన్నవారికీ ఇది మ౦చి చేస్తు౦ది.

తీపి లస్సీ


చల్లలో ప౦చదార లేదా తేనె కలిపిన పానీయమే లస్సీ! హి౦దీ లేదా ప౦జాబి పద౦ కావచ్చు. వేసవికాల౦లో నిమ్మరస౦, జీలకర్ర పొడి, ఉప్పు, ప౦చదార కలిపి పొదీనా ఆకులు వేసిన లస్సీ వడ దెబ్బ తగలకు౦డా కాపాడుతు౦ది. తెలుగులో దీన్ని ‘సిగరి’ అ౦టారు. శిఖరిణి అనే స౦స్కృత పదానికి ఇది తెలుగు రూప౦ కావచ్చు. చిక్కని చల్ల అయితే లస్సీ అనీ, వెన్న తీసేసి, నీళ్ళు ఎక్కువ కలిపితే ‘చాస్’ అనీ పిలుస్తారు. టర్కీలో Ayran, ఆర్మీనియాలో Than, పర్షియాలో Doogh, ఆల్బేనియాలో Dhalle అనే పానీయాలు ఇలా౦టివే! గుర్ర౦ పాలతో kumiss అనే పానీయాన్ని మధ్య ఆసియా స్టెప్పీలు ఇష్ట౦గా తాగుతారట! పర్షియన్Cacık అనేది మన చల్ల పులుసు లా౦టిదే!

చల్లమీద తేట


చల్లమీద తేటకు చల్లతో సమానమైన గుణాలున్నాయి. చిలికిన చల్లని ఒక గిన్నెలో సగానికి పోసి మూడొ౦తౌలవరకూ నీళ్ళు కలిపి రె౦డు గ౦టలు కదల్చకు౦డా వు౦చ౦డి. చల్లమీద ఆ నీరు తేరుకొ౦టు౦ది. చల్ల తేటను వ౦చుకొని మళ్ళీ నీళ్ళు పోయ౦డి. ఇలా ప్రతి రె౦డు మూడు గ౦టలకొకసారి చల్లనీళ్ళు వ౦చుకొని వేసవి కాల౦ అ౦తా మ౦చి నీళ్ళకు బదులుగా ఈ చల్ల నీళ్ళు తాగుతూ ఉ౦డ౦డి వడదెబ్బ కొట్టదుగాక కొట్టదు. చల్ల వాడక౦ మనకున్న౦తగా ఉత్తరాది వారికి లేదు. మధురానగరిలో తెలుగు కృష్ణుడు చల్లలమ్మబోయే అమ్మాయిల దారికి అడ్డ౦ పడ్డాడు గానీ, పెరుగులమ్మబోయే వారికి కాదు గదా!
ఎ౦డలోకి వెళ్లబోయే ము౦దు దీన్ని తాగ౦డి: చక్కగా చిలికిన చల్ల ఒక గ్లాసుని౦డా తీసుకో౦డి. అ౦దులో ఒక నిమ్మకాయ రస౦, తగిన౦త ఉప్పు, ప౦చదార, చిటికెడ౦త తినేషోడాఉప్పు కలిపి తాగి అప్పుడు ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ల౦డి వడదెబ్బకొట్టకు౦డా ఉ౦టు౦ది. మరీ ఎక్కువ ఎ౦డ తగిలి౦దనుకొ౦టే తిరిగి వచ్చిన తరువాత ఇ౦కో సారి త్రాగ౦డి. ఎ౦డలో ప్రయాణాలు చేయవలసి వస్తే, ఒక సీసాని౦డా దీన్ని తయారు చేసుకొని వె౦ట తిసుకెళ్ల౦డి. మాటిమాటికీ తాగుతూ ఉ౦టే వడ కొట్టదు.
(మే నెల తెలుగు వెలుగు పత్రికలో వచ్చిన నా వ్యాసం)

Wednesday 13 May 2015

శ్రీ ఉపేంద్ర చివుకుల గారికి విజయవాడలో అభినందన




ఏ దేశమేగినా...ఎందు కాలిడినా...

న్యూజెర్సీ (అమెరికా) రాష్ట్ర మంత్రిగా ఎదిగినతొలి తెలుగు తేజం 

శ్రీ ఉపేంద్ర చివుకుల గారికి

విజయవాడలో అభినందన


అమెరికన్ సామాజిక వ్యవస్థలో ఉన్నత రాజకీయ ప్రస్థానం సాగిస్తున్న తొలి తెలుగు బిడ్డ శ్రీ చివుకుల ఉపేంద్ర! న్యూజెర్సీ రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన మొదటి తెలుగువాడు, నాల్గవ భారతీయుడు కూడా! న్యూజెర్సీ అసెంబ్లీ సభ్యుడిగా (అసెంబ్లీ మాన్) నాలుగు సార్లు ఎన్నికై, ఇటీవలే న్యూజెర్సీ రాష్ట్ర ప్రజావసరాల శాఖ మంత్రి గా(బి.పి.ఓ), న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీ బోర్డు కమీషనర్‘గా బాధ్యతలు స్వీకరించి ఆ దేశంలో తెలుగువారి ఉనికికి ఒక ఉన్నతిని తెచ్చారు!

నెల్లూరు నవాబుపేట అగ్రహారంలో 1950 అక్టోబర్ 8న జన్మించి,కటిక పేదరికంలోపెరిగారాయన. దాతల సహకారంతో మద్రాసు వివేకానందా కాలేజీలో పీ.యూ.సీ, గిండీ కాలేజీలో ఎలెక్ట్రికల్ ఉన్నత శ్రేణిమార్కులతో ఇంజనీరింగ్ చేశారు. గోపాల్ భాయ్ దేశాయి (గుజరాత్) అండతో న్యూయార్క్ సిటీ యూనివర్శిటీలో మాష్టర్ డిగ్రీ పొందారు.

క్యూబా అమ్మాయి ‘డేసీ’ని ప్రేమ వివాహంచేసుకున్నారు.డైసీ కూడా తెలుగు నేర్చుకుంది. చక్కగా మాట్లాడుతుంది. వారికి ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ సూరజ్, దమయంతి అని పేర్లు పెట్టుకున్నారు. సూరజ్ ‘వాషింగ్టన్ డిసీ’లో అటార్నీగా ఉన్నాడు. దమయంతి గ్రాఫిక్ డిజైనింగ్ కోర్స్ లో శిక్షణపూర్తి చేసుకొంది.
2002-2014 మధ్య కాలంలో శ్రీ చివుకుల న్యూ జెర్సీ జెనరల్ అసెంబ్లీ సభ్యుడిగా, 17వ లెజిస్లేటివ్ డిస్ట్రిక్ట్ నుండి ఏడు సార్లు ఎన్నికయ్యారు. డెప్యూటీ స్పీకర్‘గా పనిచేశారు. 2014 సెప్టెంబరులో న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ బోర్డుకి కమిషనర్‘గా అమెరికన్ సెనేట్ ఆయన్ని 35-1 ఓట్ల తేడాతో ఎంపిక చేసిందంటే ఆ పదవికి అక్కడున్న ప్రాధాన్యత అంతటిది. 

కార్మికులకు కనీసవేతనాలు, మధ్యతరగతి సంక్శ్హేమం సామాజిక భద్రత, ఆరోగ్య పరిరక్షణ, వాళ్ళ పిల్లల చదువులు లాంటి అంశాల పైన శ్రీ ఉపేంద్ర చివుకుల మొదటి నుండీ పోరాటాలు చేయటం ద్వారా డెమొక్రటిక్ పార్టీలో ప్రముఖుడిగా ఎదిగా రాయన. 1994లో అప్పటి న్యూజెర్సీ గవర్నర్ శ్రీ చివుకులను న్యూజెర్సీ రాష్ట్ర సామాజిక సేవా పరిశీలకుల బోర్డులో పౌర (పబ్లిక్) సభ్యుడిగా నామినేట్ చేయటంతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. ఫ్రాంక్లిన్ పట్టణ కౌన్సిల్ 5వ వార్డు నుండి 1997లోనూ 2001లోనూ రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1998లో డెప్యూటీ మేయర్ గానూ, 2000లో మేయరుగా కూడా పనిచేశారు. అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్ర వహించే ఎలెక్టోరల్ కాలేజీ (ఎన్నికల కూటమి)లో ఆయనది కీలక పాత్ర. అమెరికన్ సెనేట్‘కు (అత్యుత్తమ పార్లమెంటరీ వ్యవస్థ) ఎన్నిక కావటానికి తన పార్టీ అభ్యర్ధిగా ఆయన విఫల యత్నం చేయాల్సి వచ్చింది. అయినా దీక్ష సడల లేదు. సెనెటర్ గా ఎన్నికవ్వాలన్నది ఆయన లక్ష్యం. 

ప్రభావ శీలత, స్ఫూర్తి దాయకమైన వ్యక్తిత్వం, వినమ్రత, కలబోసిన అసాధారణ ప్రతిభావంతుడు శ్రీ ఉపేంద్ర చివుకుల. అమెరికన్ సామాజిక వ్యవస్థలో రాజకీయంగా అత్యున్నత స్థాయికి ఒక సామాన్యుడైన తెలుగువాడు ఎదగటం కష్టం కావచ్చు నేమో గానీ అసాధ్యం కాదు. శ్రీ ఉపేంద్ర చివుకుల లక్ష్య సాధకుడు కావాలని ఆశిద్దాం.

కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం

టిఫినీల కథ :: డా. జి వి పూర్ణచందు

టిఫినీల కథ


డా. జి వి పూర్ణచందు

ఇప్పుడంటే నిద్ర లేచాక టిఫిన్ తినకుండా ఉండలేక పోతున్నాం. మన పూర్వులు ఏం తిని బతికారో మరి!


కాఫీలు తిన్నారా, టిఫినీలు తాగారా? అని ఓ హాస్య పాత్ర అడుగుతుంది ఒక తెలుగు సినిమాలో! టిఫినుకూ, కాఫీకీ అంతట్ అవినాభావ సంబంధం ఏ జన్మనాటిదో!  


ముప్పొద్దుల భోజనం తెలుగువారి అసలు సాంప్రదాయం. ఆంగ్లేయ యుగం చివరి రోజుల్లో ఉదయంపూట టిఫిను తినే అలవాటు మనకు సంక్రమించింది. పొద్దున పూట ఇడ్లీ గాని, అట్టుగానీ, పూరీ గానీ, ఉప్మా గానీ తిని, కప్పు కాఫీ”, లేక టీ తాగే అలవాటు మనకి గత ఎనబై తొంబై ఏళ్ళ నుంచే మొదలయింది.  

1907లో బిపిన్ చంద్రపాల్ గారు బందరు వచ్చిన సందర్భంగా కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు ఆయన గౌరవార్ధం విందు చేసి, అందరికీ ఆవడ, కాఫీ వడ్డించాడట.  వాటిని సేవించిన బ్రాహ్మణులకు ఆ తరువాత కులవెలి శిక్ష పడినంత పని అయ్యింది. అయ్యదేవర కాళేశ్వరరావు గారు తన జీవిత చరిత్రలో దీని గురించి వ్రాశారు. అంటే ఇరవై శతాబ్ది ప్రారంభం దాకా టిఫిన్లు చేయటం, కాఫీ అనే మాదక ద్రవ్యం సేవించటం అలవాట్లు మనకు లేవనీ, ఆ తరువాతే క్రమేణా తెలుగు ప్రజలకు అవి అలవాటుకాసాగాయనీ అర్ధం అవుతోంది,..


1611లొ ఆంగ్లేయులు గ్లోబ్ అనే ఓడలో మొదటగా బందరు ఓడరేవులో దిగారు. క్రమేణా దేశాన్ని ఆక్రమించి 200 సంవత్సరాలు ఏలారు. ఈ నాలుగు వందల  ఏళ్ళ కాలంలో మనం తెలివి మీరింది తక్కువే గానీ నాగరికత మీరింది ఎక్కువ. అలా మనకు అలవడిన దొరల అలవాటులో టిఫినీలు చేసే అలవాటు ఒకటి!


ఇక్కడో. విచిత్రమైన కథ ఉంది. మద్రాసు కేంద్రంగా మనల్ని పరిపాలించటం మొదలైన తరువాత ఆంగ్లేయులు ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మాలను కూడా ఇష్టపడటం మొదలు పెట్టారు. సాధారణంగా ఆంగ్లేయులు ఉదయంపూట చాలా తేలికగా ఆహారం తీసుకుంటారు. మధ్యాహ్నం అల్పాహారం, రాత్రికి ఘనమైన ఆహారం తీసుకోవటం వాళ్ళ అలవాటు. ఉదయం స్వల్పాహారానికీ  (బ్రేక్ ఫాస్ట్), రాత్రి ఘనాహారానికీ (సప్పర్) మధ్యలో తీసుకునే అల్పాహారాన్ని ఇంగ్లీషు పామరజనులు టిఫింగ్అనే వాళ్ళట. వాటిని మధ్యాహ్న భోజనంగా తీసుకొనేవాళ్లు. కాబట్టి ఇడ్లీ, అట్టు, వగైరాలకు ఈ టిఫింగ్ లేదా టిఫిన్ అనే మాట వర్తించటం మొదలయ్యింది. అది క్రమేణా ప్రధాన ఆహారానికన్నా భిన్నమైనదాన్ని తీసుకోవటం అనే అర్ధంలో వ్యాప్తిలోకి వచ్చింది. చివరికి అదే మన భారతీయ సాంప్రదాయం, తరతరాల సంస్కృతి అన్నంతగా మన జీవితాల్లోకి చొచ్చుకొచ్చింది.


భారత దేశంలో అలా కొత్త అర్థాన్ని సంతరించుకున్న ఈ ఆంగ్లపదం టిఫింగ్ పామరుల భాషలో టిఫిన్ గానూ  ప్రామాణిక ఆంగ్ల భాషలో ఆ రోజుల్లో లంచ్కి పర్యాయ పదంగానూ మారిపోయింది. ఆంగ్లేయుల దృష్టిలో లంచ్ అంటే స్వల్ప భోజనం అనే! మనకు పగలు పెద్ద భోజనం, రాత్రి పూట అల్పారం అలవాటు. యూరోపియన్లు రాత్రి భోజనాన్ని (సప్పర్) చాలా ఘనంగా తీసుకుంటారు. ఆ మోజుకొద్దీ మనం విందు భోజనాలను రాత్రి పూట (డిన్నర్) ఏర్పాటు చేసి, ఒక్కో విస్తట్లో యాబై నుండి అరవై వంటకాలను వడ్డించి అత్యంత ఘనమైన ఆహారం తినటాన్ని అలవాటు చేసుకున్నాం.
ఇదిలా ఉండగా, స్వాతంత్ర్యానంత్యరం టిఫిన్లు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. బొంబాయి మహానగరంలో ఉద్యోగం ఒక చోట, నివాసం మరెక్కడో కావటంతో ఉదయాన్నే నిద్ర లేచి మధ్యాహ్న భోజనం క్యారియర్ కట్టుకు వెళ్లటానికి తగినంత సమయం  చాలక పోవటాన అక్కడ డబ్బావాలా లేదా టిఫిన్ వాలా అనే (కొరియర్) వ్యవస్థ మొదలయ్యింది. ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళకి మధ్యాహ్నానికి భోజనం క్యారియర్‌లు తెచ్చి ఆఫీసుల దగ్గర అందించే విధానం ఇది. మధ్యాహ్న భోజనాన్ని తెచ్చే డబ్బాని టిఫిన్ బాక్స్, టిఫిన్ క్యారియర్ అన్నారు. ఎటుతిరిగీ మహారాష్ట్రులకు భోజనం అంటే చపాతీలు, పుల్కాలే కాబట్టి, చపాతీ పూరీ లాంటి వాటిని టిఫిన్ అనటం ఒక ఆచారం అయ్యింది. అది చూసిన తెలుగు వాళ్ళు వరి అన్నం కన్నా భిన్నమైన ఆహారాన్ని టిపిన్ అనటం మొదలు పెట్టారు. బొంబాయిలో టిఫిన్ అంటే మధ్యాహ్న భోజనం అనీ, తెలుగులో టిపిన్ అంటే అల్పాహారంఅనీ ఆవిధంగా అర్థాలు అలా స్థిరపడ్డాయి.


క్రమేణా టిఫిన్ సెంటర్లు, టిఫిన్ (కాఫీ) హోటళ్ళు తెలుగు నేల మీద విస్తృతంగా ఏర్పడటం మొదలు పెట్టాయి. భోజన హోటళ్ళతో పాటు, ప్రత్యేకంగా టిఫిన్ హోటళ్ళు ఏర్పడసాగాయి.  ప్రొద్దుట పూట ఇడ్లీ, అట్టు, పూరీ, ఉప్మా వగైరా పదార్థాలను తిని తీరాలనే రూలు వేదోక్త0 అన్నంతగా మనం టిఫిన్లకు అలవాటు పడటం మొదలు పెట్టా0.


డైటింగు చేయాలనుకునే వాళ్ళు, శనివారం ఆదివారం రాత్రిపూట అన్నం తినకుండా ఉపవాసాలు ఉండాలనుకునేవాళ్ళు సిద్ధంతం ప్రకారం ఫలహారంఅంటే రెండో మూడో అరటిపళ్లు లేదా జామపళ్ళు తిని గ్లాసు మజ్జిగ తాగి పడుకోవాలి. కానీ, డజన్లకొద్దీ ఇడ్లీలు, అట్లు, వడలు లాగించి, తేలికపాటి ఆహారం లైటుగా తీసుకున్నామని భ్రమపడే ఒక కొత్త పద్ధతి మనకు బాగా అలవాటయ్యింది. ఉప్పిడి ఉపవాసం అని ఒక విధానం ఉంది. బియ్యపు రవ్వని ఉప్పు లేకుండా ఉడికించి, తాలింపు పెట్టుకొని తింటే, శరీరాన్ని శుష్కింప చేసుకోవటానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. . అలాంటివేమీ ఇప్పటి తరానికి తెలియవు. డైటింగు అంటే బట్టర్ నాను, నూనెలు కక్కే మషాలాలు మండే కర్రీలతో తినటం అనే సాంప్రదాయం వచ్చేసింది. మనకు నోరుతిరగని పేర్లు పెట్టి, చం చం, జంజం అనే సరికి మనం ఒళ్ళు మరిచి తినేస్తున్నాం. టిఫిన్లు ఇలా మనల్ని నానారకాలుగా భ్రష్టు పట్టించాయి. టిఫిన్లుగా మనం తినేవన్నీ మన పూర్వకాలం వంటలే...కానీ, వాటిని వండే తీరులోనూ, తినే తీరులోనూ ఈ భ్రష్టత్వం కనిపిస్తోంది. ఇదే ఆరోగ్య స్పృహ అని చాలా మంది నమ్మకం.


కొలిచి చూస్తే, అన్నం కన్నా టిఫిన్ల ద్వారా ఎక్కువ కేలరీలు, ఎక్కువ కొవ్వు, ఎక్కువ విషపదార్ధాలు, ఎక్కువ రంగులు, ఎక్కువ మషాలాలు మన కడుపులోకి వెడుతున్నాయి.  తాజాగా పీజాలు, బర్గర్లు కూడా ఈ టిఫిన్ల జాబితాలో చేరాయి. ఈ పరిస్థితి ఎలా ఉందంటే, టిఫిన్ ప్రధాన ఆహారం అయి,  డైటింగ్ చేయటం కోసం అన్నం తినాల్సి వచ్చేలా ఉంది! నా భయం ఏమంటే, భగవంతుడికి మహా నివేదన కూడా మన తరానికి పీజ్జాలు, బర్గర్లు, చైనా నూడిల్స్ మహానివేదన పెట్టడం మొదలెడితే, కొన్నాళ్ళకు దేవుడు కమ్మని తిండికి మొహవాచి పొతాడేమోనని!!

Monday 11 May 2015

బుల్లి కవితలలో పడమటి గాలి :: డా. జి వి పూర్ణచందు

తెలుగు వెలుగు మాసపత్రిక డిసెంబరు 2012సంచికలో ప్రచురితమైన నారచన

బుల్లి కవితలలో పడమటి గాలి

డా. జి వి పూర్ణచందు


"ఇంగ్లీషులో ఉన్నదంతా అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు ఏ మాత్రం తీసి పోవు. ఏ అంతర్జాతీయ కవులకన్నా మన తెలుగు కవులు తక్కువేమీ కారని నా దృఢమైన నమ్మకం." 

కవి హృదయాన్ని అందమైన భాషలో అవిష్కరింఛటమే కవిత్వం. కాళిదాసాదుల కాలం నుంచీ కాళోజీల దాకా పడిన పాద ముద్రలే తెలుగు కవితకు అమ్మానాన్న!ఒక నాటి తీరిక నేటి సమాజానికి లేదు. జీవితం అంటే ఆనాటి దృక్పథం వేరు. నేటి జీవనం వేరు.


పాశ్చాత్య సమాజంలో పవిత్రతా వాదులు సృజనాత్మక సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఇహలోక భావనను పెంచేవనే భావనతో, సృజనాత్మక రచనా రీతిని పాపకార్యం అనేవాళ్ళు. ఋషి కాని వాడు కావ్యం వ్రాయలేడని, కవితా రచన మోక్ష హేతువులలో ఒకటనీ భావించుకొన్న సంస్కృతి లోంచి తెలుగు కవిత పుట్టింది. ప్రాచ్య పాశ్చాత్య కవితా రీతులకు మౌలికమైన తేడా ఇక్కడే ఉంది. కవిత్వానికి పునాదులు ఆ జాతి తాత్విక చింతన ఆలంబనగా ఏర్పడతాయి.


క్రీ. శ. తొలి శతబ్దాల నాటి శాతవాహన ప్రభువు హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతి రోజుల్లోనే తెలుగు నేలమీద స్వేఛ్చాకవిత రాజ్యం ఏలింది. నన్నయ తరువాత పాల్కురికి సోమనాథుడు దేశి కవిత అవసరాన్ని నొక్కి చెప్పాడు. “అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయు కాదె కవి వివేకంబు...?”అని వెయ్యేళ్ళ క్రితమే ప్రశ్నించినవాడాయన. నిడివి ఎక్కువైతే కవిత్వం పలచ బడు తుంది, దట్టంగా అల్లుకొన్న భావం సాగి, చీరిక లౌతుందని తెలుగు కవిత్వానికి సంబంధించి నంత వరకూ తొలిసారిగా గుర్తించినవాడు పాల్కురికి.

ఒక సామాజిక ఉద్యమం ఏర్పడినప్పుడు వాటి ప్రభావం సాహిత్యాది కళల మీద తప్పకుండా ప్రసరిస్తుంది. సాధారణంగా కవులు త్వరగా ప్రతిస్పందిస్తారు. అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రభావం అమెరికన్ కవిత్వ తత్వాన్నే మార్చేసింది. ఫ్రెంచి విప్లవం ప్రపంచ సాహిత్య తీరు తెన్నుల్ని కొత్త లోకాలకు మళ్ళించింది. భారత స్వాతంత్ర్య సమరం దేశభక్తిని, భావప్రకటనా స్వేఛ్ఛను కవిత్వంలో ప్రతిబింబించే0దుకు దోహదపడింది.

ఇంక తెలుగులోకి వస్తే, ఆధునిక యుగంలో నిజాన్ని నగ్న0గా ఆవిష్కరించే ధోరణిని దిగంబర కవిత ప్రవేశ పెట్టింది. దాని ప్రభావం విప్లవకవిత ఆవిష్కరణకు ఎంతగానో కారణం అయ్యింది. అభ్యుదయ, విప్లవ కవితా ధోరణులు రెండూ రెండు ధృవాలై  కవితా రీతులను శాసించిన కాలంలో, కవిత్వం తిరుగుబాటు ధోరణులకు మాత్రమే పరిమితం అయ్యింది. దైనందిన జీవిత సమస్యలు, మానవ సంబంధాలు అప్రధానం అయ్యాయి. సుదీర్ఘమైన సిద్ధాంత చర్చలు తప్ప కవితాత్మకత అనేది అపురూపం అయినప్పుడు, సంక్షిప్తత, దేశీయత అనే వెయ్యేళ్ళ నాటి పాల్కురికి సో్మనాథుని ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటం ఒక తప్పనిసరి అయ్యింది. ఈ నేపధ్యంలోనే 1978లో తెలుగులో మినీకవితా ఉద్యమం ప్రారంభం అయ్యింది.

కొత్త రూపంలో, కొత్త భావాలతో, కొత్త అంశాలతో మినీకవిత ఆనాటి తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకొంది. ఇప్పుడు లబ్దప్రతిష్టులైన కవులు ఎందరో మినీ కవితా ఉద్యమం నేపధ్యం లోంచి వచ్చిన వారు ఉన్నారు. మినీకవితలంటే శబ్దాలు, మినీ కవితలంటే మెరుపులు, మినీకవితలంటే ప్రభంజనాలు అన్నంతగా ఆనాటి ఉద్యమం నడిచింది.

ఆంగ్ల కవులు కూడా లయాన్విత కవిత్వీకరణకు, సూటిదనానికి చిన్న రూపాలు అనువుగా ఉంటాయని భావించారు. వాళ్ళ భాష, వాళ్ళ సామాజిక జీవన పరిస్థితులు కూడా అందుకు దోహదపడేవిగా ఉంటాయి. ఒక కవితలో చెప్పిన భావాలకన్నా, చెప్పకుండా దాచి, పాఠకుని ఆలోచనలకు పదును పెట్టే ధ్వనిగర్భిత కవిత్వం చిన్న రూపంలో ఒదిగినట్టు పెద్దకవితలో కనిపించదని కూడా అనేకమంది విమర్శకులు భావించారు.

ఆసు రాజే0ద్ర రాసిన“ఆకాశమంత ఉందికదా అని/వాన చినుకు/సముద్రాన్ని ఆశ్రయిస్తే/దాని బతుకూ ఉప్పన అయిపోయింది” అనే మినీ కవిత ఇందుకు చక్కని ఉదాహరణ.  అనువుకాని వారితో స్నేహం అనర్థ దాయకం అని కవి హెచ్చరిస్కతాడీ కవితలో! .

ఇంగ్లీషులో ఉన్నదంతా అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు ఏ మాత్రం తీసి పోవు. ఏ అంతర్జాతీయ కవులకన్నా మన తెలుగు కవులు తక్కువేమీ కారని నా దృఢమైన నమ్మకం.

మినీ కవిత ప్రారంభం అయిన కాలంలోనే, హైకూ’ అనే జపానీ లఘురూపం ప్రేరణతో ఇస్మాయిల్ ప్రభృతులు తెలుగులో కొత్త  ప్రక్రియకు ప్రారంభం పలకగా, నానీలు, రెక్కలు, దాదీలు, తాతీలు, చిట్టీలు, పొట్టీలు ఇలా ఎన్నో ప్రయోగాలు తెలుగులో వచ్చాయి. ప్రయోగాలు చేయటం కవికి సహజ లక్షణం. ఎవరూ చెప్పని కొత్త విషయాన్ని కొత్తగా చెప్పాలనే తపనే కవికి రాణింపు నిస్తుంది.


ఆ కొత్త దనం బుర్రకు తట్టాలంటే, ప్రపంచ పోకడ కూడా రచయిత గమనిస్తూ ఉండాలి. ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలో ప్రపంచాన్ని అందుకోగలిగే అవకాశం ఏర్పడింది. తమ రచనలను నెట్లో ఉంచాలని కవులు బాగా ప్రయత్నిస్తున్నారు. ఫేసుబుక్, ట్విట్టర్, బ్లాగుల్లాంటి అవకాశాలెన్నో సామాన్యుడి స్థాయికి వచ్చేశాయి. ఎంత ఎక్కువ సాహిత్యం చదివితే అంత రాణింపు వచ్చే అవకాశం ఈ రోజున ఉంది. అందుకే, తెలుగు లోకి తెచ్చుకొని మనకు తగ్గ రీతిలో మలచుకొనేందుకు అవకాశం ఉన్న కొన్ని ఆంగ్ల లఘురూపాలను పరిచయం చేయటం ఈ వ్యాసం లక్ష్యం


ఒకప్పుడు ఆంగ్లంలో సానెట్స్ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. 14-15 పాదాల కవిత ఇది. సానెట్ పేరు చెప్పగానే, ఎమెర్సన్ రాసిన “ఎ ఫేబుల్” చటుక్కున గుర్తుకొస్తుంది.

“కొండకీ ఒక ఉడుతకూతగువయ్యిందికొండ ఉడుతతో అందికదా...” అన్నిమొదలయ్యే ఈ కవితలో ఆఖరున ఉడత అంటుంది:“మహారణ్యాన్ని నేను వీపున మోయలేను,
చిన్న పప్పుగింజని నువ్వు కొరకలేవు” అని!

ఎవరి గొప్ప వారిది, ఎవరి బలహీనత వారిది- ఏనుగు నుండి దోమ దాకా దేన్నీ లోకువగా చూడనవసరం లేదని ఈ సానెట్ చెప్తుంది. దీన్ని పీడిత తాడిత వర్గాల అభ్యున్నతికి అన్వయించి ఎంత వ్యాఖ్యాన్నయినా చేయవచ్చు.

ఇటాలియన్ సానెట్, పెట్రార్చియన్ సానెట్ లాంటి ప్రక్రియల్లో ఆంగ్ల కవితలు ఇప్పుడు బాగా వస్తున్నాయి.  స్పెన్సర్, హోరేస్ పేర్లతో కొన్ని కొత్త కవితా రూపాలు కూడా వెలిశాయి. జపానీ హైకూల ప్రబావం తెలుగుకవుల మీద బాగా ఉంది.  హైకూలే కాదు, కొత్త లఘు కవితా రూపాలు మరికొన్ని జపాన్లో ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నాయి.

Senryu కవిత

సమాజమూ,మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని  ‘సెండ్ర్యూ’ కవిత రూపొందింది. ఇది 3 పాదాల కవిత. హాస్యం, వ్యంగ్యం ఇందులో ప్రధానంగా ఉంటాయి. దాని నడక ఇలా ఉంటుంది:

 “తల దువ్వుకొంటున్నానుఅద్దంలో కనిపించే ముఖ0అది మా అమ్మది”

ఈ కవితలో యతులూ, ప్రాసలూ,గణాలు, పాదాలు పదాల నియమాలేవీ లేవు. తక్కువ మాటలు ఎక్కువ భావం దీని లక్ష్యంగా కనిపిస్తుంది.  ఇలాంటిదే ఇంకో ‘సెండ్ర్యూ’ కవితను పరిశీలించండి:

“రాత్రి ఆకాశంఆ పిల్లవాడు
చుక్కల ఓడల్ని చిత్రిస్తున్నాడు”

ఇది చంద్రుణ్ణి భావుకతకు సంకేతంగా చూపిస్తున్న కవిత. చంద్రుణ్ణి మనం మనః కారకుడిగా భావిస్తా0. జపాన్ వారికి  అది కొత్త కావచ్చు అందుకే ఈ కవితను చాలా మంది విమర్శకులు గొప్పగా ఉదహరించారు.

Tanka కవిత


జపాన్ వారి మరో లఘు కవితా ప్రక్రియ టాంకా కవిత.  “దుమ్ములో సూరీడు” అనే ఈ టాంకా కవితను చూటండి:

 “సూర్య కిరణాలు ప్రవహిస్తున్నాయిమొగ్గ తొడుక్కుంటున్న కొమ్మల గుండావసంతం అడవిలోకి వచ్చింది
         దుమ్ముకణాలు తేలుతూ         నేలను చేరుతున్నాయి”

సూర్యుడు లేకపోతే పత్రహరితం లేదు, ప్రకృతి లేదు. సూర్యుడు ఒక జవం, జీవం, ఒక చైతన్యం. లోకానికి వసంతాన్ని తెచ్చేది సూరీడే! సూరీడుని  అభ్యుదయ చైతన్యానికి ప్రతీకగా చిత్రిస్తున్న ఈ టాంకా కవితలో మొదటి మూడు పాదాలు విషయాన్ని ప్రతిపాదిస్తే చివరి రెండు పాదాలు దానికొక గమ్యాన్ని చూపిస్తున్నాయి.

Cinquain కవిత:


 సింక్వాయిన్ కవిత ఒక ఆంగ్ల లఘు కవితా రూపం. ఇది 5 పాదాల ప్రక్రియ. మొదటి పాదం కవితా శీర్షిక అవుతుంది. తరువాత రెండు పదాల పాదం, మూడుపదాల పాదం, నాలుగుపదాల పాదం వరుసగా ఉంటాయి.“డైనోసార్లుఒకప్పుడు ఉన్నాయిఎన్నో ఏళ్ళప్పుడు, కానీకేవలం మట్టీ ఇంకొన్ని కలలుమిగిలున్నాయి”

ఇది సింక్వాయిన్ కవితకు ఒక ఉదాహరణ. దీన్ని ట్రయాంగిల్ కవిత అని కూడా అంటారు. ప్రతీ పాదాన్నీ మధ్యకు తెచ్చి పేరిస్తే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అందుకని పిరమిడ్ కవిత అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రతి పాదానికీ ఒకప్రత్యేకత ఉంటుంది. మొదటి పాదం శీర్షిక, రెండో పాదం విషయ విశ్లేషణ, మూడో పాదం దాని పూర్వాపరాలు, నాలుగో పాదం దాని భావావేశం ఉంటాయి. 5వ పాదంలో ఒకే పదం ఉంటుంది. అది శీర్షిక కొనసాగింపుగా ఉంటుంది. ఒకటీ ఐదవ పాదాలను కలిపి, “డైనోసార్లు మిగిలున్నాయి” అని అర్ధం సాథి0చటం కవి లక్ష్యం. రాతి యుగాలనాటి చా0దస భావజాలంలోంచి బయట పడాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది.Blank verse కవితఛ0దోబందోబస్తులను తెంచుకొని పుట్టిన వచనకవితలో ఒక చిన్నరూపాన్ని  Blank verse అంటారు. A poem written in unrhymed iambic pentameter and is often unobtrusive అని దీనికి నిర్వచనం. అంత్య ప్రాశలు యతి ప్రాసల నియమం లేకుండానే లయబద్దంగా మాట్లాడే తీరులో ఈ కవిత ఉంటుంది. లయాన్విత కవితాత్మక వచనాన్ని బ్లాంక్ వెర్స్ అని నిర్వచించవచ్చు.

“ఆ కుర్రాడేం చేస్తున్నాడిప్పుడు, బంతి పారేసుకున్నాడే వాడు?
ఏంటి ఏంటి వాడు చెయ్యాలనుకుంటో0ది? నేను చూశాను... దాన్నిగొప్పగా గె0తుకొంటూ, నడివీధిలో, ఆ తర్వాతగొప్పగా అక్కడ ఆ నీళ్ళలో!”

John Berryman రాసిన The Ball Poem కవితకు ఇది తెలుగు అనువాదం.  ఇందులో పైకి కనిపించే భావం ఏమీ లేదు. పైగా చాలా సాధారణమైన విషయం. బంతాట ఆడుకొంటున్న కుర్రాడు విసిరిన బంతి, వీధిలో ఎగురుకొంటూ వెళ్ళి నీళ్ళలో పడింది. దీని ద్వారా రచయిత చెప్పదలచుకొన్నది ఏమయినా ఉన్నదా? బాల భారతంలో ద్రోణుడు బావిలోంచి బాణాలతో బంతిని తీసి ఇచ్చిన కథ లాంటిదీ ఇందులో కనిపించదు. కానీ, భూగోళంతో ఆడుకోవటం ఒక పిల్ల చేష్ట. చివరికి అది ఎవరికీ దక్కకుండా పోతుంది... అనే హెచ్చరిక ఇందులో దాగి ఉంది. ఇంకొకరికి మరో అర్ధం ఏదయినా ఇలానే స్ఫురించవచ్చు కూడా. ఓ తెల్ల కాయితాన్ని ఇచ్చి ఎవరి ఊహను వారు చిత్రించుకోవాలని కాబోలు ఈ కవితను  Blank verse అన్నారు.

Epigram కవిత:


టెలీగ్రాంలలో వాడే భాష, లేదా ఎస్సెమ్మెస్సులు ఇచ్చేందుకు వాడే భాషని ఉపయోగించి తయారు చేసిన హాస్య స్ఫోరక కవిత ఇది. “ఎపి” అనేది శాసనాలకు సంబంధించిన పదం. అది దీనికి పేరుగా స్థిరపడి, ఎపిగ్రామ్ కవిత అయ్యింది.“ఎపిగ్రామ్పొట్టి ఆకారంసంక్షిప్తత శరీరంవ్యంగ్యం ప్రాకారం”

ఎపిగ్రామ్ కవితకు నిర్వచనాన్ని ఇలా ఎపిగ్రామ్ పద్ధతిలోనే రాయవచ్చు. దీని రూపం చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక ఎపిగ్రామ్ కవితను పరిశీలించండి:“చక్కెరదొరికితే లక్కేరాకానీ, మద్యం
దొరకటం తధ్యం”

ఇందులోని లోతైన భావాన్ని మాటలతో వివరించే ప్రయత్నంస్తే, స్వారస్యం చచ్చి పోతుంది. దాన్ని దానిగానే అర్ధం చేసుకోగలగాలి. మన దేశంలోనూ,రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితికి అద్దం పడుతున్నదీ అంతర్జాతీయ కవిత.“ఒప్పుకొంటున్నా తమరి రూలుప్రతీ కవీ ఒక ఫూలునిలువెత్తు నిదర్శనం మీరేఫూల్సంరూ కవులు కారే!”  
 
అనేది ఎపిగ్రామ్ రచనకు ఇంకో ఉదాహరణ. పొడిమాటలతో ఇది కనిపించినా ఇందులో లయ ఉంది, ప్రాస నియమాలున్నాయి. అతి తక్కువ మాటలతో గొప్ప ఆలోచనాత్మకతను కలిగించటం దీని లక్ష్య0. అల్పాక్షరాలతో అనల్పార్ధ రచనకు ఇది మంచి ఉదాహరణ.

Epitaph కవిత


విషాదాన్నీ, మరణాన్నీ చిత్రిస్తూ, సంతాప సూచకంగా చెప్పే కవితను ఎపిటాఫ్ కవిత అంటారు. తక్కువ పాదాలలో కవితాత్మకంగా ఉంటుంది. సమాధుల మీద చెక్కేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.  “పుటక నీది/చావు నీది/బతుకంతా దేశానిది” అంటూ జేపీ మీద కాళోజీ వ్రాసిన ప్రసిద్ధ కవిత ఈ ఎపిటాఫ్ కవితకు చక్కని ఉదాహరణ!

“అబ్బో! ఆయన గొప్ప వైద్యుడుఇంకా గొప్ప స్నేహశీలిఅద్భుతమైన మేథావి
చిట్టచివరి రోజున తప్ప!”

ఇలా ఉంటుంది ఎపిటాఫ్ కవితా రూపం. విదేశీ కవితలో వ్యంగ్యాన్ని పులిహోరలో జీడిపప్పు తాలింపు పెట్టినట్టు జోడిస్తున్నారు. మన కవులు ఈ విషయాన్ని గమనించాలి. వ్యంగ్యం ఎక్కువమంది పాఠకుల్ని తెస్తుంది.

Terza Rima కవిత: 


తెర్జా రీమా కూడా జపానీ లఘుకవితా రూపాలలో ఒకటి.New life begins to spring to life in spring
Green shoots appear in the April showers
Birds migrate back home and rest tired wings      

ఒకటీ మూడూ పాదాలకు అంత్య ప్రాసని గమనించవచ్చు. ప్రతీ పాదంలోనూ 8-10 పదాల వరకూ ఉంటాయి.ABC కవితఒక భావావేశాన్ని, ఒక చిత్రాన్ని, ఒక అనుభూతిని కళ్ళకు కడుతూ, ఐదు లైన్లలో ఉండే కవితా ప్రక్రియ ఏబీసీ కవిత.  ఐదు పాదాలలో చక్కని భావావేశం, చిక్కని శబ్ద చిత్ర0, అంతులేని అనుభూతిని కలిగించటం దీని పరమావధి. ఇందులో ప్రతీ పాదంలోనూ మొదటి పదాలు అకారాది క్రమంలో ఉంటాయి. అందుకని ఏ బీ సీ కవిత అనే పేరు వచ్చింది. 5వ పాదం మకుటంగా ఉంటుంది. మచ్చుకొక ఆంగ్ల కవితను పరిశీలిద్దాం.A lthough things are not perfect
B ecause of trial or pain
C ontinue in thanks giving
D o not begin to blame
E ven when the times are hard
F ierce winds are bound to blow

Acrostic కవిత


మొదటి అక్షరం లేదా మొదటి పదం ఒక భావోద్దీప్తిని కలిగించేదిగా ఉన్నప్పుడు దాన్ని Acrostic కవిత అంటారు. ఈ ఉదాహరణ పరిశీలించండి.C reamy or
H ot, it makes my mouth scream
O n and on
C hocolate, chocolate
O h, yum
L uscious chocolate, I can't believe I
A te it all. It
T ickles my throat              
E ach time I eat it, mmm oh I love chocolate.

మొదటి అక్షరాలన్నీ కలిపి ఆ కవిత శీర్షికగా నడిపిస్తే, మంచి మినీ కవిత అవుతుంది.  ఇలాంటి ప్రయోగాలు లోకోపకారకంగా ఉండాలి. మనవాళ్ళు సన్మాన పత్రాల రచనల్లోనూ, పెళ్ళిళ్ళప్పుడు పంచరత్నాల రచనల్లోనూ ఎక్కువగా చేస్తుంటారు.  వైవాహిక, సాంసారిక జీవితాన్ని గురించి, లోకం పోకడల గురించి, సమాజం గురించి విశ్లేషణాత్మకమైన మినీకవితలను ఇచ్చే పద్ధతిని తెలుగులోకూడా తీసుకు రాగలిగితే అందరూ చదివే అవకాశం ఉంటుంది. కవి అనే వాడు తన భావాన్ని ప్రచారం చేసేందుకు అందివచ్చే ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అది పెళ్లయినా సరే, చావైనా సరే!

చివరిగా ఒక మాట


దేశీయతను సాధించ గలిగితే, తెలుగు కవిత సంపన్నమే అవుతుంది. తెలుగులో చిన్న కవితలదే రాజ్యం. విదేశాలలోనూ చిన్న రూపాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. అల్పాక్షరాలు, అనల్పార్థాలే ప్రపంచ కవితను పాలిస్తాయి. లోకం పోకడ తెలుసుకోవటం వలన మరింత శక్తివంతంగా తెలుగు కవితను తీర్చిన వాళ్ల0 అవుతాం. అందుకు ఈ వ్యాసం కొంచెం సహకరిస్తుందని ఆశ

Saturday 9 May 2015

Dr. G. V. Purnachand, B.A.M.S.,: తక్కువ పాపికే ఓటు:: డా. జి వి పూర్ణచందు

Dr. G. V. Purnachand, B.A.M.S.,: తక్కువ పాపికే ఓటు:: డా. జి వి పూర్ణచందు: తక్కువ పాపికే ఓటు డా. జి వి పూర్ణచందు “ ఒకటికి రోయకుంట గను మున్నవియున్ , దృపదుండు మారణే ష్టికి( బసిజూపి వేడ- మునిసింహు డొకండు “ తమ...

తక్కువ పాపికే ఓటు:: డా. జి వి పూర్ణచందు

తక్కువ పాపికే ఓటు
డా. జి వి పూర్ణచందు

ఒకటికి రోయకుంట గను మున్నవియున్, దృపదుండు మారణే
ష్టికి( బసిజూపి వేడ- మునిసింహు డొకండు తమన్న వేల్చు( బం
దొక డపవిత్ర భూమి గని యే జనదా గ్రహించె రో
యకొనియె, గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గా నశక్యమె?”
వీడు మంచివాడా? చెడ్దవాడా? ఎలాంటి నీచానికైనా దిగజారతాడా? అని ఆ వ్యక్తి గురించి తెలుసు కోవాలంటే ఉన్నవి తెలుసుకోవాలంటాడు కృష్ణదేవరాయలు. ఆయన గొప్ప రాజుగారు. మూడు సముద్రాలూ ఆయన అధికార పరిధిలో ఉండేవి. ఆ స్థాయిలోఉన్నవాళ్లకి ప్రతి ఒక్కడి ప్రొఫైలూ విడివిడిగా పరిశీలించి, ఎవడెలాంటి వాడో నిర్ధారించటం సాధ్యం కాదు. అందుకని, వ్యక్తులు చేసే చిన్నపనుల్నిబట్టి, వాళ్లని అంచనా వేయాలన్నాడు. ఉన్నవి తెలుసుకోవటం అంటే అది!
ఒకటికి రోయకుంట గను మున్నవియున్అంటే, అసహ్యమైన పని చేయటాన్ని అసహ్యించు కోకుండా చేసే తత్వం ఉన్న ఒకడికి ఉన్నవేమిటో (బుద్ధులు)తెలిసిపోతుంది. ఎలాగంటావా…? ఒక ఉదాహరణ చెప్తాను
దృపదుండుమారణేష్టికి(బసిజూపివేడ- మునిసింహుడొకండుఒకప్పుడు దృపద మహారాజు (ద్రౌపదితండ్రి) మారణేష్టి అనే యఙ్ఞం తలపెట్టాడు. తన శత్రువు లందరూ చచ్చి పోవాలనే కోరికతో చేసే యఙ్ఞం అది! ఇప్పటి రోజుల్లో అయితే ధికారంలో ఉన్నవాడు సి బి ఐని ఉపయోగించుకున్నట్టే అప్పటి రాజులు ప్రతిపక్షం మీదకు ఇలాంటి య్ఙ్ఞాలను ప్రయోగించే వారన్నమాట!  శత్రూ మారక యఙ్ఞాన్ని చేయించటానికి బ్రాహ్మలెవరూ ముందుకు రాలేదు. వందల సంఖ్యలో ఆవులు ఇస్తానని ఆశ చూపించాడు. కానీ, ఎవరూ కదల్లేదు. చివరికి ఎక్కడో అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఓ మునిసింహంగురించి విని వెదుక్కొంటూ వెళ్ళాడు.
మునిసింహుడొకండుతమన్నవేల్చు( బందొక డపవిత్ర భూమి గని యే జన దా గ్రహించె రోయకొనియె ఆ మునిసింహం దృపదుడి కోరిక వింటూనే అసహ్యించుకున్నాడు. ఇలాంటి ఆలోచనలున్న వాడివి కాబట్టే, నీకు అంతమంది శత్రువులు ఏర్పడ్డారు. శత్రు భయం నిన్ను పీడిస్తోంది. అందువలనే ఇలా కోరుతున్నావు. మంచి తనంతో శత్రుత్వం తగ్గించు కోవాలి గానీ, శత్రువు లందరూ చచ్చి పోవాలి అని కోరుతో యఙ్ఞం చేయా లనుకోవటం నీచాతినీచం అని మందలిస్తాడు. రాజు బతిమాలుకుంటే అప్పుడు చెప్పాడు: మా అన్న ఒకడున్నాడు…  వెళ్ళి ఆయన్ని కలుసుకో! వాడైతే ఇలాంటివి అవలీలగా చేయిస్తాడుఅంత గ్యారంటీగా ఎలాచెప్తున్నా నంటావా…? ఒకసారి మేవిద్దరం కలిసి వెడుతున్నాం.  అప్పుడు ఒక పండు చెట్టుమీంచి రాలి పడింది. ఆ సమయంలో ఇద్దరికీ బాగా ఆకలిగా ఉంది. చెరి సగం తినాలనుకున్నాం. తీరాచూస్తే, ఆ పండు అశుద్ధం పైన రాలింది. నాకొద్దులే అని చెప్పి నేను వెళ్ళిపోయాను. మావాడు ఆ పండునే తుడుచుకుని తినేశాడు. వాడికి ఉఛ్ఛనీచాలు లేవు. ఎంత నీచానికైనా రోయడు. ఛీ అనుకోడు. నువ్వు అడిగింది చేయటానికి వాడే సమర్థుడు…” అని!
గాన నట్లెఱుగనౌ జను, సర్వము(గాన శక్యమె?”వాడు చేసేపనిని బట్టి బుద్ధి ఎలాంటిదో తెలుసు కోవాలేగానీ, మొత్తం జీవితం అంతా చూసి తెలుసు కోవాలంటే కుదరదుఅంటాడు. ఇది ఆముక్తమాల్యద కావ్యంలో రాజనీతి బోధించే సందర్భంలో చెప్పిన పద్యం. తన రచనలో వీలైనంత మేర స్వీయాను భవాల్ని చెప్పుకోవాలనే తపన రచయితకి సహజంగా ఉంటుంది! అందుకని, యమునాచార్యుడిచేత కుమారుడికి రాజనీతిపాఠాలు చెప్పించే సన్నివేశాన్ని సృష్టించుకున్నాడు కృష్ణదేవరాయలు.
ఆముక్తమాల్యద 600 యేళ్ళ నాటి కావ్యం. అవి సత్తెకాలపు రోజులు. ఇప్పు డలాంటి సీను లేదు. పేడ మీద పడ్డవి ఏరుకు తినేవాణ్ణి తెచ్చి అందలం ఎక్కించటానికి వెనుకాడని కాలం మనది! నీతి కూడు పెడుతుందా? నిజాయితీ ఐశ్వర్యాన్ని ఇస్తుందా? ఆదర్శం అందలం ఎక్కిస్తుందా? అని వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్ళూ వాళ్లు తిన్నారు, ఇప్పుడు నేను తింటే తప్పొచ్చిందా? అని బహిరంగం గానే అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు ప్రజల దగ్గర సమాధానం లేదు.
తాగిన మైకంలో అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ ఒక డ్రైవరు, ఫుట్పాత్ మీద అలిసి పడుకున్న వాళ్లపై నుండి దూసుకు పోయాడు. ఒకడు చనిపోయాడు. కొందరికి గాయాలయ్యాయి. ఆ డ్రైవరు మామూలు మానవుడైతే, పందొమ్మి దేళ్ళు విచారణ లేకుండా జైల్లోనే ఉంచేవాళ్లు. కానీ, అదే నేరాన్ని ఒక సినిమా నటుడు చేశాడు. దాంతో సీను మారింది.
భారత దేశంలో సినీనటులు దైవాంశ సంభూతులు కదా! ఈ నేరాలూ శిక్షల చట్రంలో వాళ్లను తెచ్చి బిగించి, వాళ్ళగురించి ఉన్నవి వెలికి తీసి, అపకారం చేయాలని చూస్తే అంతకన్నా అపచారం ఇంకొకటి ఉండదు. అందుకే, తీర్పు వ్యతిరేకంగా వచ్చినా, ఘడియలూ విఘడియలూ గడవ కుండానే అసాధారణ రీతిలో జైలు తప్పించి బైలు ఇప్పించి, ఈ దేశంలో అంతటి అపచారం జరక్కుండా పై కోర్టులు కాపాడాయి! దేవుడి లాంటి మనిషి జైల్లో పడకుండా దేశం పరువు నిలబెట్టాయి.

రాయలవారు తన రాజనీతి పాఠాల్లో ఉన్నవి తెలుసుకోఅని చెప్పాడు గానీ, తెలుసుకుని ఏం చేయాలో చెప్పలేదు. రాజకీయ, సామాజిక, వాణిజ్య, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన సెలెబ్రిటీ లనదగిన వారిలో ఇలాంటి ఉన్నవి చాలా ఉంటాయి. తెలిసీ... తెలిసి తెలిసీ... ఎక్కువ పాపికన్నా తక్కువ పాపి మేలనే భావనతో ఓట్లేసి ఊరక చూచుచుండటం తప్ప జనం చేసేదేమీ లేదని ఆయనకు తెలుసు కాబట్టి!