Sunday 6 June 2021

తిరునాళ్ల పానీయాలు:: డా|| జి. వి. పూర్ణచందు

 తిరునాళ్ల పానీయాలు:: డా|| జి. వి. పూర్ణచందు

 బడలినవారికి వడపప్పు పానకా/లనఁటిపండ్లోపిన యన్ని గలవు

యెళనీరు బిసనీరు లెందు హేరాళంబు/నీరుచల్లయుఁబెరు గపార మచటఁ

 గప్పుర గంధంబు కైరవాల్పట్టీలు/తట్టుపునుంగును జుట్టుపూవు

లెందువేడినవెల్ల యే చప్పరంబున/విప్పైన గొడుగులు విసనకఱ్ఱ

లేలకులు శొంఠియును లవంగాలు పనస

తొలలు చెఱుకులు ఖర్జూరఫలము లెన్ని

వేడినను గొండను జాటు వేంకటేశు

భక్త జాలంబు తిరునాళ్ల ప్రజకు నపుడు

          17వ శతాబ్ది నాటి గణపవరపు వేంకట కవి-ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కావ్యంలో పెరుమాళ్ల తిరునాళ్లకు తరలి వచ్చిన భక్తజనానికి వడదెబ్బ తగలకుండా చేసిన ఏర్పాట్ల గురించి ఈ పద్యంలో వివరిస్తున్నాడు.

1.      అలిసిపోయిన వారికి బడలిక కలగకుండా వడపప్పు, పానకాలు కావలసినంత ఇస్తున్నారట. వడపప్పు అనటంలోనే ఇది వడదెబ్బకు విరుగుడుగా పనిచేస్తుందని అర్ధం స్ఫురిస్తోంది.

2.      యెళనీరు, బిసనీరు: ఎల నీరు అంటే లేత కొబ్బరి నీళ్లు. బిసము= తామరపూవు. బిసనీరు అంటే పుష్పోదకము.  తామర పూలు, తూడులతో తయారైన చలవనిచ్చే ఒక పానీయం కావచ్చు. వచ్చిన జనానికి వడదెబ్బ తగలకుండా హేరాళంగా అంటే సమృద్ధిగా వీటిని అందుబాటులో ఉంచారట

3.      నీరుచల్ల, పెరుగు: ఒక లీటరు పెరుగులో షుమారుగా 3 లీటర్ల నీరు కలిపి చిలికితే ఆ మజ్జిగకు వగరు రుచి కలుగుతుంది. వగరు రుచి పోషకంగా పనిచేస్తుంది. ఈ నీరుచల్లని, పెరుగును కూడా సిధ్ధంగాదుంచారట

4.      గంథపట్టీలు, కైరవాల పట్టీలు: పచ్చకర్పూరం పలుకులు కొద్దిగా వేసి గంధం చెక్కతో సానమీద అరగదీస్తే అది కర్పూర గంథం. ఈ గంథాన్ని జేబురుమాలా లాంటి వస్త్రానికి పట్టించి నుదుటి మీదా పెట్టి తడుపుతుంటే అది గంథపట్టీ. తెల్లకలువ పూలను నూరి ఆ గుజ్జుతో వేసిన పట్టీని కైరవాల పట్టీ అంటారు. వేడి, జ్వరం కలగకుండా ఈ పట్టీలు చలవ నిస్తాయి. 

5.      తట్టుపునుగు: “అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో...” అంటాడు అన్నమాచార్య. స్వామికి చెల్లించుకునే ముడుపులను పునుగుతో కలిపి మూటగట్టి సమర్పించేవారు కాబోలు. పునుగు జవాది, కస్తూరి ఇవన్నీ మృగ సుగంధ ద్రవ్యాలు. పునుగుపిల్లి అనే జంతువు (civet cat) నుండి దీని సేకరిస్తారు. ‘సంకుమదము’ అనికూడా పిలుస్తారు. ఖరీదైనది. పునుగుతైలం (civet oilకూడా తయారు చేస్తారు. ఇది సుగంధభరితంగా ఉండి చలవనిస్తుంది.

6.      జుట్టుపూవు: జుట్టుపుతీగ మొక్కని అజశృంగి, జుష్టపు తీగ, దుష్టపు తీగ అని పిలుస్తారు. అంటువ్యాధులు రాకుండా కాపాడే వాటిలో ఇది తేలికగా దొరికే తీగ. కంపల మీద పాకుతుంది. దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి pergularia daemia, Pergularia Extensa దీని వృక్షనామాలు. దీని కాయలు మేకకొమ్ము ఆకారంలో చిన్నవిగా ఉంటాయి. గొప్ప వనౌషధి ఇది.

7.      చప్పరాలు (చలువపందిళ్లు), గొడుగులు విసనకఱ్ఱలు, ఏలకులు శొంఠి, లవంగాలు పనసతొలలు చెఱుకులు, ఖర్జూర ఫలాలు ఇలా భక్తులకు వేడి నుండి రక్షణ కల్పించే ఏర్పాట్లన్నీ చేశారట.

          ప్రాధమిక ఆరోగ్య రక్షణకు ఆయుర్వేద ఆరోగ్య సూత్రాలను ఆరోజుల్లో పాటించేవారు కాబట్టి, వేసవిలో ఇలాంటి ద్రవ్యాలను సిద్ధంగా ఉంచుకునే వారు. ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించటానికి నామోషీ పడి రంగు విషరసాయనాలు కలిసిన కూల్ డ్రింకులు త్రాగుతున్నాం ఇప్పుడు. తిరునాళ్లప్పుడు పాలకవర్గాలుగానీ, దాతలుగానీ తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ పద్యంలో కనిపిస్తాయి. శ్రీరామ నవమి వేసవి పండుగ. ఆ రోజున పందిళ్ల నిర్వాహకులు ఈ తిరునాళ్ల పానీయాలను భక్తులకు అందుబాటులో ఉంచటం మంచిది.  *

Wednesday 2 June 2021

మనం అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి వి పూర్ణచందు

 మనం అట్టేపెట్టుకున్న అట్టు:: డా. జి వి పూర్ణచందు

                                                            చమ్మచక్క.. చారడేసి మొగ్గా..

                                                            అట్లుపొయ్యంగా.. ఆరగించంగా..

                                              (బాలక్రీడా విశేషం)

          పండగలు పబ్బాలప్పుడే కాదు, నలుగురు బాలికలు ఎప్పుడు కలిసినా చమ్మచక్క ఆటని ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ పాడుతారు. ఈ చేతులు తట్టడంలోనే ఉన్నది కథంతా!

          చమ్మచక్క ఏమిటీ? చారడేసి మొగ్గేమిటి? ఆ తరువాత అట్లుపోయడమేమిటీ? అట్లను హాయిగా ఆరగించటానికి ముందు ఎంత శ్రమ ఉంటుందో, అమ్మ ఎంత కష్టపడితే వంట తయారౌతుందో పిల్లలకు తెలియాలికదా! పెద్ద వాళ్లను పిల్లలు అనుకరిస్తారని ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. అమ్మ వంటింట్లో ఏం చేస్తుందో ఇక్కడ పిల్లలు అదే చేస్తున్నారు.

          చమరు లేదా చమురు అంటే అరచేతుల్తో తట్టటం (To give a slap with the palm) అని! గోధుమ పిండిని మర్దించి ఉండగా చేసి, బిళ్ళలా నొక్కి రెండు అరచేతుల మధ్య ఉంచి చమరుతూ అంటే తడుతూ ఉంటే అది గుండ్రంగా చక్రంలా సాగుతుంది. చమరి చక్రంలా తట్టింది చమ్మచక్క”. చక్రానికి చక్క అనేది పిల్లల భాషా రూపం.

          ఇలా చమ్మచక్కకొడితే అది చారెడంత అవుతుంది. దాన్ని పిల్లిమొగ్గలు, నెమలిమొగ్గలు వేయించి గిర్రున తిప్పుతుంటే ఆ చక్రం మరింత పెద్దదిగా సాగుతుంది. చారెడేసి మొగ్గలుఅనే మాటకు బహుశా ఇదే భావం కావచ్చు!! 

          రుమాల్ రోటీలు చేసేవాళ్లను ఎప్పుడైనా గమనించి చూడండి. అరచేతుల్లో ఆ పిండిని గిర్రున తిప్పుతూ పైకెగరేస్తూ అనేక మొగ్గలు వేయిస్తుంటారు. చారడేసి మొగ్గలతో అలా అట్టు (రోటీ) తయారౌతుంది.

          అట్అంటే తడి ఆరిపోయేలాగా పొడిగా (dry) కాల్చటం, శుష్కింపచేయటం అనే అర్థాలున్నాయి. అడుఅంటే పూర్తిగా పొడిగా అయ్యేలా చేయటం. అన్నం అడుగంటింది అంటే తడి అంతా ఆవిరైపోయిందని! అట్టగట్టింది అంటే, ఎండి, మృదుత్వాన్ని కోల్పోయి, గట్టిగా అయ్యిందని! ఇంకా ఉంచితే మాడుతుంది. తమిళంలో కూడా అటు’, ‘అటువ్’ ‘అట్ట్అనే పదాలు వండటం, కాల్చటం, వేయించటం, ఉడికించటం అనే అర్ధాల్లోనే ఉన్నాయి. అటుక్కలై, అట్టుంబల, అడకల=వంట గది; అట్టు=తీపి రొట్టె.. అట్టము=ఆహారం. ఇలా అట్టుఅనే పదం ఆహార పదార్ధం అనే అర్ధంలోకి పరిణమించింది.

          అట్టుని దోసె అనే అర్థంలోనూ, చపాతీ, పుల్కా అనే అర్థంలో కూడా వాడుతున్నాం. పెనం లేకుండా నేరుగా నిప్పుల సెగ మీద కాల్చిన అట్టుని తెలుగులో నిప్పట్టు’ (నిప్పు+అట్టు) అంటారు. తండూరీ ప్రక్రియ ఇది. అరటి లేదా పనస ఆకుమడతల మధ్య ఉంచి కూడా కాలుస్తారు. నిప్పటి, ఇపటి, నిపటి (DEDR3670) అనే పేర్లూ ఉన్నాయి.

          గుండ్రని ఆ చమ్మచక్కల్ని మధ్యకు మడిచి, రెండు రెండు పొరలు మీద వత్తితే దౌపాతి, మూడు మడతల మీద త్రిపాతి, నాలుగు మడతల మీద చపాతీ అయ్యింది. పుల్కాకీ చపాతీకీ పిండి ఒకటే అయినా పొరకీ పొరకీ మధ్య నెయ్యి లేదా నూనె ఎక్కించటం వలన రుచి మారిపోతోంది.

          అట్టు మనదే! మనం అట్టే పెట్టుకున్నదే! బొబ్బట్లు, నిప్పట్లు, నీరట్లు, చాపట్లు...ఇలా చాలా అట్లు మనకున్నాయి. తండూరీ రోటీలు మనకూ ఉన్నాయి. తప్పాల చక్కలు లేదా మండెగలు అనేవి మన ప్రాచీన అట్టుకు మిగిలున్న సాక్ష్యాలు. వాటిగురించి మరోసారి చర్చిద్దాం. 

‘నల్లీనది’ పచ్చడి:: డా. జి వి పూర్ణచందు

 ‘నల్లీనది’ పచ్చడి:: డా. జి వి పూర్ణచందు

నల్లీనదీ సంయుక్తం విచారఫలమేవచ

గోపత్నీ సమాయత్తం గ్రామ చూర్ణంచ వ్యంజనం(చాటువు)

            ఇది ఎవరు రాశారో తెలియదు గానీ, ఇందులో ఓ గొప్ప వంటకం తయారీని అతి రహస్యంగా చెప్పారు. ఒక్కక్క పాదాన్నే జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి:

          1)‘నల్లీ నదీ సంయుక్తం’ నల్లీనది అంటే నల్లి+ఏరు=నల్లేరుకాడలతో ఈ వంటకం తయారౌతోంది. 2. విచారఫలమేవచవిచార ఫలాన్ని తెలుగులోకి మారిస్తే చింతపండు. 3) గోపత్నీ సమాయత్తం” –గో+పత్ని అంటే, ఆవు+ఆలు=ఆవాలు. 4) గ్రామచూర్ణంఅంటే  ఊరుపిండి. రుబ్బిన పిండిని ఊరుపిండి, ఊరుబిండి లేక ఊర్బిండి అంటారు.

          ఈ మొత్తానికి భాష్యం ఏమంటే, లేతనల్లేరు కాడలు తీసుకుని, కోణాలు చెక్కేసి చింతపండు, ఆవపిండి కలిపి మెత్తగా రుబ్బితే అది నల్లేరు కాడలపచ్చడి అవుతుందని! తింటానికి ఇంకేమీ దొరకలేదా...? నల్లేరుకాడలు తిని బతకాలా..? అనకండి. నల్లేరుకాడలు, బూడిద గుమ్మడికాయలు, అరటి దూట, అరటి పూలు, అరటి దుంపలు, కలువ దుంపలు, సొరమొక్క ఆకులు ఇలాంటి వాటిని మనలో చాలామంది వండుకోదగిన కూరగాయలనే విషయాన్ని మరిచిపోయారు. తమిళులు వీటిని శ్రద్ధగా తింటున్నారు.

          నల్లేరు కాడలు రోడ్డు పక్కన కంపల మీద పాకుతూ పెరుగుతాయి. వృక్షశాస్త్ర పరంగా సిస్సస్ క్వాడ్రా౦గ్యులారిస్ అంటారు దీన్ని. షుగరు వ్యాధి, ఎలర్జీ వ్యాధులు, స్థూలకాయం, చెడ్ద కొలెస్ట్రాల్ పెరగటం, ఆస్తమా, ఎముకలు మెత్తబడిపోవటం, కీళ్లవాతం, గౌట్ వ్యాధి, మొలలు ఈ వ్యాధుల్లో ఇది పనిచేస్తోందని ‘హెల్త్ లైన్’ 2019 మే 15 సంచికలో ఒక నివేదిక ప్రచురితం అయ్యింది. స్త్రీబాలవృద్ధు లందరికీ ఔషధమే ఇది! విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉన్నాయి.  

లేత నల్లేరు కాడలకు కడుపులో నొప్పి తగ్గి౦చే గుణం ఉంది. ఆగకుండా వచ్చే ఎక్కిళ్ళు తగ్గుతాయి. మొలల తీవ్రతను తగ్గిస్తుంది. విరేచనం అయ్యేలాగా చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరానికి కాంతినిస్తుంది. అజీర్తిని, కఫ దోషాలను, కీళ్లవాతాన్ని, గౌట్ వ్యాధిని పైత్యాలను తగిస్తుంది. మెనోపాజ్ వయసులో ఉన్న స్త్రీలు నల్లేరు కాడల్ని తప్పనిసరిగా  తింటూ ఉండటం మంచిది. ఆ వయసులోనే ఎముకలు శక్తినీ, ధృఢత్వాన్నీ కోల్పోయి గోగుపుల్లల్లాగా తయారు కాకుండా నిలుపుతుంది. పళ్లలోంచి, చిగుళ్లలోంచి రక్తం కారుతున్న స్కర్వీ వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. అతిగా తింటే వేడి చేస్తుంది. చలవచేసేవాటితో కలిపి తింటే మంచిది. కొన్ని శరీరతత్వాలకు సరిపడకపోవచ్చు. చూసుకుని తినాలి.  

cissus is known to have gum forming properties” అంటే నల్లేరుకు కడుపులో జిగురును తయారుచేసే గుణం ఉంది. దీనిని భోజనంలో ముందుగా తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా స్థూలకాయాన్ని తగ్గిస్తుందని ఆధునిక పరిశోధనలు చెప్తున్నాయి. 

ఎముకలు విరిగినచోట అనుభవం మీద కట్లు కట్టే వారిలో చాలామంది నల్లేరు గుజ్జును పట్టించి కట్టు కడుతుంటారు. నల్లేరులో కాల్షియమ్ ఆగ్జలేట్స్, కెరోటీన్ బాగా ఉన్నాయి. మూత్రంలోంచి కాల్షియం ఆగ్జలేట్స్ పోతున్నవారు తప్ప అందరూ ఈ నల్లీనది పచ్చడి తినవచ్చు.

    మినప్పండిని రుబ్బి అందులో ఈ పచ్చడి కలిపి వడియాలు పెడతారు. చాదువడియాలంటారు వీటిని. నేతిలో వేయించి తింటే రుచిగా ఉంటాయి. అట్లు పోసుకోవచ్చు. ఇలాంటివి వదులుకుంటే, సాంస్కృతిక వారసత్వాన్నే కాదు, సాంస్కృతిక సంపదను కూడా కోల్పోయిన వాళ్ళం అవుతాం.                                                        

కూరగాయల రారాజు “కాకర”: డా. జి వి పూర్ణచందు

 కూరగాయల రారాజు “కాకర”: డా. జి వి పూర్ణచందు

వేయారు వగల కూరలు
కాయ లనేకములు ధాత్రి కల వందులో
నాయకములురా కాకర
కాయలు మరి కుందవరపు కవి చౌడప్పా !
(కవి చౌడప్ప శతకం)
“వెయ్యిపైన ఆరు రకాల కూరలు, కాయలూ ఉన్నాయి. వాటిలో కాకర కాయలది నాయక స్థానం” అంటాడు కవి చౌడప్ప. కాకరంటే చాలా మందికి ఇష్టమే! కాకర ప్రియులు ఇతరులకన్నా భిన్నంగా కనిపిస్తారు, కాకర ‘చేదు టానిక్’ కదా!
క్రీ.పూ. 2వ శతాబ్దిలో ఈనాటి శ్రీకాకుళం ఒడీసా ప్రాంతాలను పాలించిన మేఘవాహన రాజవంశ (చేది) ప్రభువు ఖారవేల్ల, ఖారబేల్ల లేదా కారవేల్లుడు ప్రసిద్ధుడు. హాతిగుంఫ గుహల్లో కనిపించిన శాసనం ఈ జైన ప్రభువు చరిత్రకు ఆధారం. కారవేల్లం అంటే కాకర. కాయలలో కాకర లాగానే రాజులలో ఈ కళింగరాజు కారవేల్లుడు ప్రసిద్ధుడు.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు...ఈ ఆరు రుచులతో కూడితేనే అది షడ్రసోపేతమైన భోజనం. వగరూ చేదూ లేకపోతే అది ‘రిచ్చి’ కాదు!
లేత కాకరని సూపులో, టీ పొడిలో, బీరు తయారీలో కూడా చైనీయులు ఉపయోగిస్తున్నారు. ఆలూ, కాకర కూర వీళ్లకి ఇష్టం. దక్షిణాసియా దేశాల్లో కాకర, కొబ్బరి తురుము, మషాలాకూర బాగా తి౦టారు. పాకిస్తానీయులు ఉల్లిముక్కలతో కాకర వేపుడు ఇష్టపడతారు. తైవానులో కాకర ఖిచిడీ ప్రసిద్ధి. ఫ్రెంచి గుయానాలో కాకరకాయల ‘టీ’ని పురుషత్వం పెంచే ఔషధంగా తాగుతారు.
కాకర నిజానికి పండు జాతికి చెందిన మొక్క. కాకర పండు మంచిదే కానీ, దాని గింజల్లో vicine అనే విషపదార్ధం ఉంది. అందుకని గింజల్ని తినకూడదు.
1962లో లొలిత్కార్, రావు అనే ఇద్దరు పరిశోధకులు కాకరకు రక్తంలో షుగరుని తగ్గించే గుణం ఉందని కనుగొన్నారు. చరాంటిన్ అనే రసాయనం ఇందుకు తోడ్పడుతోంది. కాకరలోని మొమోర్డిసిన్ పేగుల్ని బలపరచి, నులి పురుగుల్ని పోగొడుతుంది.
కాకరని తినడం వలనే తమ ఆయుష్షు పెరిగిందని జపానీయుల నమ్మకం. ఫిలిప్పైనులో కాకర రసంతో చేసిన మాత్రలు బాగా వాడుతారు. ఉప్పు వేసి పిసికి నీరు పిండేసిన నిమ్మరసం, పసుపు కలిపి ఎండించిన కాకర ఒరుగులు ఫిలిప్పైన్ కాకర మాత్రల్లా పనిచేస్తాయి. ఈ ఒరుగులకు సమానంగా ఉసిరికాయల బెరడు, పసుపు కొమ్ములూ కలిపి దంచిన పొడిని రెండు పూటలా టీలాగా కాచుకుని తాగితే షుగరు మీద బాగా పనిఒచేస్తుంది. అనేక షుగరు ఉపద్రవాలు ఆగుతాయి. ఇది గ్లూకోజుని శక్తిగా మార్చే ప్రక్రియని వేగవంతం చేసి, రక్తంలో గ్లూకోజు నిల్వల్ని తగ్గిస్తుంది. అతిగా తీసుకోకూడదు. షుగర్ డౌన్ అవుతుంది.
షుగరు వ్యాధి వచ్చిన పిల్లలకు కాకర ఒక నిరపాయకర ప్రత్యామ్నాయం. కాకరను తరచూ ఆహార పదార్ధంగా తింటే, మెదడు మీద పని చేసి, ‘అతితిండి’ (బులీమియా) వ్యాధిని తగ్గిస్తు౦ది! దగ్గు, జలుబు, ఉబ్బసం, నీళ్ళ విరేచనాలు, కలరా, అతిసారం కడుపు నొప్పి, జ్వరం, నెలసరి నొప్పి, బొల్లి, సొరియాసిస్, ఎగ్జీమా అమీబియాసిస్, లివర్ వ్యాధులు, కామెర్లు, కీళ్ళవాతం, గౌట్, సయాటికా వ్యాధులలో కాకర ఒక ఔషధం. గర్భవతులు కాకరను ఇష్టంగా తింటే ఆమె కడుపున పెరిగే బిడ్డకు నరాల బలం కలుగుతుంది. మలేరియా జ్వరంలో క్వినైన్ బిళ్ళ లాగా కాకర పనిచేస్తుంది. ఆగాకర కాయలక్కూడా ఇవే గుణాలున్నాయి.
కనీసం వారానికి మూడుసార్లయినా కాకరని వండుకుంటే ఇంటిల్లిపాదికీ మంచిది. కాకర రాజుగారి జేజేలు.

దేవుడి భోజనం:: డా|| జి. వి. పూర్ణచందు

           దేవుడి భోజనం:: డా. జి వి పూర్ణచందు

        ఇందిర వడ్డించ నింపుగను/చిందక యిట్లే భుజించవో స్వామి

        అక్కాళపాశాలు అప్పాలు వడలు/పెక్కైన సయిదంపు పేణులును

        సక్కెర రాసులు సద్యోఘృతములు/కిక్కిరియ నారగించవో స్వామి

        మీరిన కెళంగు మిరియపు దాళింపు/గూరలు కమ్మనికూరలును

        సారంపుబచ్చళ్ళు చవులుగ నిట్టే/కూరిమితో జేకొనవో స్వామీ

         పిండివంటలును పెరుగులు/మెండైన పాశాలు మెచ్చి మెచ్చి

         కొండలపొడవు కోరి దివ్యాన్నాలు/వెండియు మెచ్చవే వేంకటస్వామీ" 

                                                                                                                (అన్నమయ్య కీర్తన)

          వేంకటేశ్వరుడి దివ్యాన్నాల వివరాలతో అన్నమయ్య  ఇచ్చిన మెనూకార్డ్ ఈ కీర్తన. వీటిని లక్ష్మీదేవి ఇంపుగా వడ్డించి తినిపిస్తోందట. వాటిని ఒక్క మెతుక్కూడా వదలకుండా భుజించవో స్వామీఅంటున్నాడు అన్నమయ్య. ఆ వంటకాలను చూద్దాం:

అక్కాళ పాశాలు, అప్పాలు,వడలు:: అక్కుళ్లు అనే బియ్యంతో చేసిన నేతి పాయసాలు, బూరెలు, గారెలు

పెక్కైన సయిదంపు పేణులు: అనేక రకాల గోధుమ సేమ్యా వంటకాలు

చక్కెర రాసులు, సద్యోఘృతములు: పంచదారతో చేసిన తాజా నేతి వంటకాలు

మీరిన కెళంగు మిరియపు దాళింపు గూరలు: మిరియాల పొడి చల్లి వండిన తాళింపు కూరలు

కమ్మని కూరలును సారంపుబచ్చళ్ళు: కమ్మని కూరలు, చక్కని సుగంధ ద్రవ్యాలు వేసి చేసిన పచ్చళ్ళు

చవులుగ నిట్టే కూరిమితో జేకొనవో స్వామీ: ఇట్టే నోరూరే ఈ రుచుల్ని ఇష్టంగా తినవయ్యా స్వామీ

పిండివంటలును పెరుగులు: ఇంకా అనేక పిండివంటలు, పెరుగుతో చేసిన వంటకాలు

కిక్కిరియ నారగించవో స్వామి: దగ్గరగా పెట్టుకుని ఆరగించవయ్యా స్వామీ!

          తమ దేవుడికి ఏ ఆహారం నైవేద్యంగా పెట్టుకున్నారో అది ఆ ప్రజల నాణ్యమైన ఆహారంగా చరిత్రవేత్తలు భావిస్తారు. బూరెలు గారెలు, నేతి స్వీట్లు, తాలింపు కూరలు, సుగంధభరితమైన పచ్చళ్ళు, పెరుగు వంటకాలు, పాలవంటకాలూ వీటిలో ఉన్నాయి.

          ఇవే గదా ఇప్పుడు మనం తింటున్నవీ...అని అడగొచ్చు. కానీ, ఇప్పటికీ అప్పటికీ చాలా తేడా ఉంది...! చింతపండు రసం కలిపినవీ, అల్లం-వెల్లుల్లి దట్టించిన మసాలా కూరలు, నూనె వరదలు కట్టేలా వండిన వేపుడుకూరలు, ఎర్రగా మంటెత్తే ఊరుగాయలూ ఇంకా అనేక భయంకర వంటకాలేవీ ఈ పట్టికలో లేకపోవటం గమనార్హం.

          అన్నమయ్య తరువాత ఈ 500 యేళ్ళలో చింతపండు, మిరప కారం, నల్లగా వేయించిన కూరబొగ్గులు ఇవే చివరికి మనకు తినేందుకు మిగిలాయని ఈ వంటకాలు మనల్ని వెక్కిరిస్తున్నాయి. యాంటీ బయటిక్సు లేకుండానే మన పూర్వులు జీవితాన్ని ఆరోగ్యంగా ఆనందించారంటే కారణం ఏమిటో అర్ధం చేసుకోగలగాలి.

          మనది ముప్పొద్దుల భోజన సంస్కృతి. ఉదయాన్నే పెరుగు/చల్లన్నం తినటం మన ఆచారం. అది ఇప్పుడు నామోషీ అయ్యింది. దాని స్థానంలో ఇడ్లీ, అట్టు, పూరీ బజ్జీ, పునుగులు తినటం నాగరికం అయ్యింది. అన్నమయ్య కాలానికి మిరప కాయలు మనకింకా పరిచయం కాలేదు. ఇప్పటి ఆవకాయ లాంటి ఊరగాయలు అప్పటి ప్రజలకు తెలీవు. వాళ్లకు తెలిసిన ఊరుగాయల్లో మిరపకారం ఉండదు. అల్లం, శొంఠి మిరియాలనే కారపు రుచికి వాడుకునే వాళ్ళు. అదే వాళ్ళ ఆరోగ్య రహస్యం.

          విదేశీ వ్యామోహం పెరిగి, ఇప్పుడు మనకు పీజ్జాల్లాంటి నిరర్థకాలే పవిత్ర వంటకా లయ్యాయి. ఏడుకొండలవాడి దగ్గరికి సూటూ బూటూ వేసుకు వెళ్ళి హాయ్/బాయ్ చెప్పి, ఐదు నక్షత్రాల చాక్లేట్లు నైవేద్యం పెట్టటమే గొప్ప అనుకునే రోజుల్లోకి మనం ప్రయాణం చేసేముందు దేవుడి భోజనం అంటే ఆరోగ్యదాయకమైన వంటకాలు ఎలా ఉండాలో గుర్తు చేసుకోవటానికే ఈ పద్యం! *