Monday 8 February 2016

అనన్య ప్రతిభామూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి :: డా. జి. వి పూర్ణచందు

అనన్య ప్రతిభామూర్తి వేటూరి ప్రభాకరశాస్త్రి
డా. జి. వి పూర్ణచందు 9440172642
“ఆంధ్ర భాష పుట్టుకయే గానాత్మకం” అని నిరూపించిన ఒక గొప్ప సారస్వత మూర్తి, తెలుగు సాహితీ పరిశోధనా పితామహుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఫిబ్రవరి 7, 1888, కృష్ణాజిల్లా పెద్దకళ్ళేపల్లిలో జన్మించారు. నిజాలను వెల్లడించటమే సాహిత్యానికి పరమావధి. పరిశోధనే అందుకు సరయిన మార్గ౦గా భావించారు. నూనూగు మీసాల నాడే సంపాదించుకున్న ‘శతావధాని వేటూరి ప్రభాకరశాస్త్రి’ అనే గొప్ప పేరును త్యాగ౦ చేసి, పరిశోధన వైపు నడక సాగించారు..
సాహిత్య పరిశోధనే నిజమైన సాహిత్య సేవ అనేది ఆయన తీర్పు. “వచన రచనలో ఏ మోసమూ లేని భావ ప్రసారం ఉంటు౦ది. ప్రశస్త రచన రసోల్బణమైన ప్రతిభా వికాసము గల సహృదయ వర్గమే చేసేదిగా ఉంటు౦ది.” అనే ఈ మాటల్లో ఒక పరిశోధకుడి మనోగతం ఆవిష్కృతం అవుతుంది. ‘భాష అడవి వంటిది- కవిత ఉద్యానవనం వంటిది. ఉద్యాన పె౦పు సొ౦పు లకు అరణ్య పరిశోధన అవసరమైనట్టే సుకవితకి భాషా పరిశోధన అవసరం’ అని గట్టిగా నమ్మారు. “జనులలో ఎన్ని అంతరములున్నవో భాషా రీతులకు నన్ని అంతరము లున్నవి. భూములకు వలె బాషలకును సర్వే జరగవలెను” (బాలభాష-పీఠిక) అంటారాయన!
ఒక కొత్త బాట వేసిన వారినీ, తన బాటలో అనేకమందిని నడుపుకు పోగలిగినవారినీ ‘సాహితీ శాస్త్రవేత్తలు’గా సంభావించాలని, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు అలాంటి సాహితీ శాస్త్రవేత్త అనీ శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు నా వాఙ్ఞ్మయ మిత్రులు గ్రంథంలో ప్రభాకరశాస్త్రి గారి గురించి వ్రాశారు. చెల్లపిళ్ళ వారి దగ్గర శిష్యరికం ప్రభాకర శాస్త్రిగారి శాస్త్రీయతా దృష్టికి మూలం.“తెలుగున నాకేమేని యెఱుక యేర్పడె నన్నచో నది శ్రీ వే౦కట శాస్త్రి గారి గురుతానుగ్రహ ప్రాప్తమే! వారి దగ్గర పుస్తకం పట్టి చదివిన దానికంటే, వారి ముఖతః వినోద గోష్ఠిలో విని నేర్చుకొన్నదే ఎక్కువ” అని స్వయ౦గా చెప్పుకొన్నారు. (వేటూరి ఆనందమూర్తి ‘మా నాన్న గారు’- డా. ద్వా.నా. శాస్త్రి సంకలనం)
వారి పరిశోధనా తృష్ణతీరేందుకు మద్రాసు ప్రాచ్యలిఖిత భాండాగారంలో కొలువు తోడ్పడింది. అక్కడ తెలుగు క్యాటలాగులు వ్రాసే ఉద్యోగి సెలవు పెడితే, ఆ స్థానంలో వేటూరివారు తాత్కాలిక ఉద్యోగిగా నియమితులయ్యారు. మానవల్లి రామకృష్ణ కవి ఆయనలో పరిశోధకుణ్ణి తట్టి లేపారు. “మానవల్లి వారు పూర్వకాలపు సంకలన గ్రంథమైన ప్రబంథ మణిభూషణాన్ని బైటపెట్టగా ప్రభాకర శాస్త్రిగారు దాని విలువను తెలిసినవారై, చాటు పద్య మణిమంజరి రె౦డు భాగాలను, ప్రబంథ రత్నావళిని వలవేసి బైటికి లాగేరు. రామకృష్ణకవి క్రీడాభిరామాన్ని తెలుగువారికి అందజేయగా, శాస్త్రిగారు ఆ పుస్తకాన్నే ముచ్చట లొలికే పండిత కూర్పును, చక్కని పీఠికతో విందు జేసేరు... మానవల్లి వారి దోవ ప్రభాకర శాస్త్రిగారికి
ఘ౦టాపథ మయి౦ది..” (నా వాఙ్ఞ్మయమిత్రులు).
కందుకూరు వీరేశలి౦గ౦ గారు ఆంధ్రకవుల చరిత్ర ప్రథమ భాగం సంస్కరణ చేసేప్పుడు శాస్త్రిగారే ఏ ఏ విషయాలు
ఎలా ఉండాలో సూచనలు, సంస్కరణ విధానాలు వ్రాసి ఒక పెద్దకట్ట సమాచారాన్ని పంపారట! పాల్కురికి సోమనాథ ‘శివతత్త్వ
సారం’ గ్రంథాన్ని కొమర్రాజు వారికి పరిష్కరించి ఇవ్వగా ఆయన 1922లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు పక్షాన ప్రచురించారు. (వేటూరి ఆనందమూర్తి)
తెలుగు లిపి ప్రాచీనతకు ఆధారంగా దొరుకుతున్న మొట్టమొదటి తెలుగు పదం ‘నాగబు’ గురించి వెల్లడించి౦ది కూడా ప్రభాకర శాస్త్రి గారే! ఆ తరువాత కాలంలో అది ‘నాగబుద్ధి’ అనే పేరులో చివరి అక్షరం విరిగి పోగా ‘నాగబు’ మాత్రమే ప్రబాకర శాస్త్రిగారికి దొరికిందని పండితులు తేల్చారు. పదం ఏదయినా మన లిపి ప్రాచీనతను వెదకటానికి అది గొప్పగా తోడ్పడింది. కోరాడ మహదేవశాస్త్రి తన ‘హిష్టారికల్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్’ గ్రంథంలో ఈ పదాన్ని విశ్లేషిస్తూ, శాతవాహనుల కాలం నాటి తెలుగులో “నాగ౦బు” అనే పదం మద్య సున్నా లోపి౦చి ‘నాగబు’ గా మారి ఉండవచ్చునని అనుమాని౦చారు. వివాహంబు అన్నట్టుగా పదం చివర- ‘౦బు’ పెట్టి పలికే ఆచారం తెలుగులో ఉంది. ఇది చదివిన ఐరావతం మహదేవన్ అనే తమిళ చరిత్ర పరిశోధకుడు సిందు నాగరికత లిపిలో కొన్ని పదాలకు చివర బాణం గుర్తు కనిపిస్తో౦దని, ‘౦బు’ ప్రయోగానికి సంకేతంగా ఈ అంబు(బాణం) గుర్తుని ప్రయోగించి ఉంటారని ఒక నిర్మాణాత్మక ఊహను అందించారు. ఈ ఊహ సింధూ నాగరికతలో తెలుగు వారి ఉనికి గురించి పరిశోధనలు సాగించేందుకు ఊతం ఇచ్చి౦ది. ప్రభాకర శాస్త్రిగారి ‘నాగబు’ తెలుగువారి చరిత్ర గురించిన కొత్త ఆలోచనలకు ఆ విధంగా దోహదపడింది.
తొలిసారిగా అన్నమయ్య ఉనికిని లోకానికి చాటి చెప్పింది కూడా ప్రభాకరులే! కనీసం 500 యేళ్ళపాటు మరుగున పడిన ఆ పదకవితా పితామహుడి గురించి ఏమీ తెలియని పరిస్థితుల్లో అన్నమయ్య జీవితం గురించి, ఆయన రచనల గురించీ ఎన్నో విశేషాలను శాస్త్రిగారు వెలుగులోకి తెచ్చారు. క్రీ.శ 1945 సం.లో `వె౦కటేశ్వర వచనా’లకు పీఠిక వ్రాస్తూ అన్నమయ్య జననం క్రీ.శ. 1408 గానూ, తాళ్ళపాక చిన తిరువే౦గళనాథుడి “శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర” గ్రంథానికి వ్రాసిన పీఠికలో క్రీ.శ. 1424 ను౦డీ 1503దాకా సంకీర్తనా రచనలు చేసినట్టు పేర్కొన్నారు(శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల జీవిత చరిత్ర, డా. కేసర్ల వాణి).
తాళ్ళపాక చిన్నన్న వ్రాసిన “అన్నమాచార్య చరిత్ర”ను పరిష్కరించి ప్రచురించారు. అన్నమాచార్య ఉత్సవాలకు శ్రీకారం చుట్టి, ఆయన వ్రాసిన పదాలకు ప్రాచుర్యం కల్పి౦చారు. సి.పి. బ్రౌను గురించి, తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్కను గురించీ ఈ తరానికి తెలియ జేసింది ప్రభాకర శాస్త్రిగారే! తిరుమల కొండపైన ఒక పురావస్తు ప్రదర్శన శాల ఏర్పాటు కోసం అడవులు, వాగులూ, వంకలూ అన్నీ తిరిగి ఎన్నో అపురూప శిల్ప సంపదను సేకరించి తెచ్చి భద్రపరచారు.
1914లో తంజావూరి ఆంధ్రరాజుల చరిత్రను ప్రకటించారు. బాసుని సంస్కృత నాటకాలు కొత్తగా వెలుగులోకి వచ్చిన కాలం అది! ప్రభాకర శాస్త్రిగారు ‘ప్రతిమా నాటకం’, ‘కర్ణభారం’, ‘మధ్యమ వ్యాయోగ౦’ మొదలైన వాటిని తెలుగులోకి అనువదించి ప్రకటించారు. 1913లో ‘కనకాభిషేకం’ అనే చిన్న పుస్తకం ద్వారా శ్రీనాథ మహాకవి జీవితాన్నితెలియచెప్పారు. ఆ తరువాత 1923లో “శృంగార శ్రీనాథం” అనే మరో ప్రామాణిక రచన చేశారు. వెంకటేశ్వర వచనములు, శృంగారామరుకము, సుభద్రాకళ్యాణం గ్రంథాలను ప్రకటించారు. 1914లో చాటుపద్యమణిమంజరిలో “నవరత్నములు” పేరుతో “గుండభూపాలు నరసింహ మండలేంద్ర!” అన్న మకుటంతో ఉన్న పద్నాలుగు పద్యాలను – ప్రచురించారు. వీటి కర్త ఎవరో తెలియదు. “గ్రంథకర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు కాదగును” (పు. 39) అని అభిప్రాయ పడ్డారు. 1918లో ప్రబంధ రత్నావళి ప్రకటించారు.
అయితే సృజనాత్మక రచనలను ఆయన వ్యతిరేకించలేదు. “నేటి నవ్యసాహిత్య విశారదుల నవ నవోజృంభణములన్నీ, నాకు పరమానంద ప్రదములే! మన పరిపూర్ణత రేపటి రోజుల్లో ఉన్నదిగానీ, నిన్నటి రోజుల్లో లేదు” సాహిత్యం ఏ ఒక్కరికో కాక అన్నివర్గాలవారికి అనుభవింపదగినదిగా ఉండాలంటారాయన. లోకోపకారక భావాలు కలగాలంటే, రచయిత మనసు గొప్ప పరిపాకం కలిగి ఉండాలనీ, ఆ పరిపాకపు టంతరవుల్ని అనుసరించి భావప్రజ్వలనం ఉంటుందనీ ఆయన సూత్రీకరిస్తారు.
‘పావులూరి మల్లన్న’ శాస్త్రిగారి మొదటి వచన రచన. 1910లో శశిరేఖ పత్రికలో వచ్చింది. ‘శతావధాని వేటూరి ప్రబాకర శాస్త్రి’ అని అప్పట్లో వ్రాసుకున్నారు. ఆ తరువాత పరిశోధన వైపు మొగ్గు చూపి అవధానాలు మానుకున్నారని శాస్త్రిగారి కుమారులు శ్రీ ఆనంద మూర్తి వ్రాశారు. అయినా, సృజనాత్మక సాహిత్య సేవను వదులుకో లేదు. ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనము’, ‘మూణ్ణాళ్ల ముచ్చట’, ‘కపోతకథ’ సాక్ష్యం లాంటి కావ్యాల ద్వారా ఖండకృతుల ప్రక్రియకు నాందీ పలికారు. ‘కలికి చిలుక’, ‘కరుణకము’ లాంటి కథలు కూడా అనేకం వ్రాశారు.
ప్రభాకరశాస్త్రి గారు మాష్టర్ సి.వి.వి. అనుగ్రహి౦చిన యోగ విద్యను ఉపయోగించి ఎ౦దరికో స్వస్థత చేకూర్చారు. ఆయుర్వేద వైద్యుడి పుత్రుడు కావటం వల ఈ వ్యాధి నివారక యోగ౦ బహుశా ఆయనకు జన్యుపరంగా సమకూరిన వరం కావచ్చు. మాష్టర్ వి.పి.యస్.అని శిష్యులు ఆయన్ని గౌరవంగా పిలుస్తారు. తాళపత్ర గ్రంథాల సేకరణ కోసం వెళ్ళి, తూర్పు గోదావరి జిల్లాలో ఒక బ్రాహ్మణుని ఇ౦ట్లో బస చేసినప్పుడు ఆ బ్రాహ్మణుడి విధవా కుమార్తెకు పట్టిన దయ్యాన్ని మాష్టర్ సివివి యోగవిద్య ద్వారా నయం చేసిన సంఘటనను తిరుమలరామచంద్ర ఉదహరించారు:
ప్రభాకరశాస్త్రిగారు ఆ యింటికి వెళ్ళినప్పుడు ఆమెకు దెయ్యం పూనింది. వెంటనే మాష్టరు సివివిని ధ్యాని౦చి, ‘ఇలాటిది ఇక రాకూడదు, ఈ ఏష్ట్రల్ బోడీ ఆమెను వదిలిపోవాలి’ అన్నారు. బక్కపల్చని ఏష్ట్రల్ బోడీ ఆమె శరీరం ను౦చి బైటికి వచ్చి, ‘నేను ఈవిడ భర్తను, కొత్తవారు వచ్చినప్పుడు ఏమయినా అకార్య౦ చెస్తారేమోనని నా సందేహం-’ అన్నాడు. “ఇక ఆమెను పీక్కొని తినక. వేరే జన్మ చూసుకో, ఆమె మంచి వంశ౦లో పుట్టి౦ది. అపమార్గ౦ తొక్కదు” అన్నారు శాస్త్రిగారు. అతడు వదిలి పోతానన్నాడు. మళ్ళీ ఎప్పుడూ ఆమెకు దయ్యం సోకలేదట. ఈ కథని తిరుమల రామచ౦ద్రగారికి శాస్త్రి గారే స్వయంగా చెప్పారట. చెప్పి, “ఇదంతా ఏమిటని అనుమానిస్తావు గదూ? మరణి౦చిన వ్యక్తి సూక్ష్మశరీరం, అతని ఆశాపాశాన్ని బట్టి, చనిపోయిన పరిసరాలలో తిరుగుతూ ఉంటుంది” అని వివరణ ఇచ్చారట.
ఆయనకు కుల, మత వివక్ష ఉండేది కాదు. ఒక హరిజనుడు, ఒక మహమ్మదీయుడు ఆయన ఇ౦ట్లో ఉండి చదువు కున్నారు. (పోచిరాజు శేషగిరిరావు-మణిమంజరి 9వ భాగం) తిరుపతి గుడికి తొలిసారిగా హరిజనుల్ని వె౦ట తీసుకు వెళ్ళారు.
నిడదవోలు వె౦కట రావు గారి పెళ్ళి చేయి౦చి౦ది ప్రభాకరశాస్త్రి గారే! ఆయనకు ఉత్తరం వ్రాస్తే, “నీ అంతఃపురిక క్షేమమా?” అని అడిగే వారట. చెరుకువాడ నరసింహం గారి అమ్మాయి తన కుమారుడికి ప్రబాకరశాస్త్రి అని పేరు పెట్టుకోవటం లాంటి సన్నివేశాలు ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తాయి.
తిరుమలలో ప్రాచీన కన్నడ సాహిత్య పీఠం కూడా నెలకొల్పటం కోసం ఆయన ఎ౦తగానో కృషి చేసారు. నన్నెచోడుని కుమార సంభవంలో కన్నడ సా౦ప్రదాయాలు ఎన్నో ఉన్నాయని వాటిని అర్ధం చేసుకొంటే గానీ పరిశోధన పూర్తి కాదని ఆయన అనే వారని తిరుమల రామచ౦ద్ర వ్రాశారు.
ఆయన సామాన్యం ఎత్తుకంటే కొంచె౦ తక్కువేనని, కుదురైన మొహం. పచ్చని చాయ. పూర్వకాలపు లక్షణాలన్నీ
ప్రకటించే తలకట్టు ఉండేదనీ, ఆఫీసుకు వెళ్ళేప్పుడు పంచ, కోటు ధరించేవారనీ ఆయనకు అత్యంత సన్నిహితులైన టేకుమళ్ల కామేశ్వరరావు వ్రాశారు.
ప్రభాకరశాస్త్రిగారు వాడుక భాషా వాది. “ప్రఖ్యాత సంకీర్తనాచార్యుల పాటలన్నీ వాడుక భాషలోనే యున్నవి. వాడుక భాషలో ఉన్న పాటలను పదాలను ప్రౌఢవ్యాకరణం ప్రకారం తీర్చి దిద్దటం పువ్వును నలిపి వాసన చూడటం లాంటిది(భారతి-1941 ఫిబ్రవరి) అంటారాయన. విద్యాశాలలో విద్యాబోధన దేశ భాషలలో సాగించడం, ప్రజాపాలన తంత్రమంతా దేశ భాషలలో సాగించటం ఎ౦త శీఘ్రంగా సాగుతుందో అంత శీఘ్ర౦గా దేశ భాషా వికాసం కలుగుతుంది (మద్రాసు ఆకాశవాణి ప్రసంగ౦-తెలుగు వ్యాసమండలి కృ. జి.ర.సం ప్రచురణ) అనేది భావన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ఎ౦తో ముందుగా ఆయన ఈ మాటలు అన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి ఆరున్నర దశాబ్దాలయ్యింది. ఇ౦కా దేశభాష అమలుకాలేదు. ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పట్లో అలాంటిది జరుగుతుందని అనిపించట్లేదు.
08-02-2016 ఆంధ్రభూమి సాహితీ పేజిలో ప్రచురితం