Wednesday 30 March 2016

ఆంధ్రభూమి బుధవారం సంజీవని పేజీలో నా శీర్షిక


Monday 28 March 2016

ఏరు దాటిన వాగ్దానాలు :: డా. జివి పూర్ణచందు

ఏరు దాటిన వాగ్దానాలు 

డా. జి వి పూర్ణచందు

“దాయమెత్తనో యీ సారె దాక నీక/కట్టి గెలిచెద నిదె పాసికలను వచ్చి
పట్టునో భూతమిందేమి ముట్టగలదొ/పొందవచిన వ్రాలకు బోవు గాక”

కృష్ణుడు తన దేశానికి పాలకుడు. లోకపాలకుడు, విశ్వలోక పాలకుడు కూడా! ఆయనకు సత్యభామతో పాచికలాడే తీరిక దొరికింది. ఆటలో సత్యభామది పైచెయ్యి అయ్యింది. ఒక నిష్కంతో మొదలు పెట్టి, నాలుగు ఎనిమిది, పన్నెండు, పదారు ఇలా వరుసగా పందేన్ని రెట్టిస్తూ గెలుస్తోందామె!. కృష్ణుడి నిలవ సొమ్ము మొత్తం ఆమె మూలధనంలోకి చేరి పోతోంది. కృష్ణుడు లోలోపల కుతకుతలాడిపోతున్నాడు.
సరిగ్గా ఆ సమయంలో పురప్రముఖులు గగ్గోలు పెట్టుకుంటూ వచ్చారు. పౌండ్రకుడిని చంపినందుకు ప్రతీకార చర్యగా కృత్య అనే భూతాన్ని కాశీరాజు ద్వారక మీదకు పంపాడని, అది జనాన్ని చంపుకు తింటోందనీ మొత్తుకున్నారు. ‘ఆకొన మృత్యువులా, వెలిబ్రాకిన లయకాల రుద్ర ఫాలాగ్నిలా ఉన్నదా భూతం’ అని చెప్పుకున్నారు.
కృష్ణుడు వినీ, విననట్టే కూర్చున్నాడు. పలక చెరిగిపోతుంది ఇంకో ఎత్తు వెయ్యమంటూ ఆమెను రెచ్చగొడుతున్నాడు. వాళ్ళేమో “విన్నపం బంగారు దేవా” అంటున్నారు. ఆమె పాచికలు ‘దాలించి’ వేస్తోంది... ఇదీ సందర్భం. నాచన సోముడి ఉత్తరహరివంశంలో తృతీయాశ్వాసంలోది ఈ పద్యం.
సత్యబామ పాచికలు తాలించి వేసిందట. తాలించటం అంటే చేతిలో అటూ ఇటూ పొర్లించటం. కూర. పప్పు, పచ్చడి, పులుసు, చారు, ఇలాంటి వంటకాలను వండి నప్పుడు చివరలో తాలింపు పెడతారు. పోపు పెట్టటం, సాతాళించటం అని కూడా అంటారు. ఒక ఇనుప గరిటలో పోపు గింజల్ని లేదా సంబారాల్ని నూనెతోనో, నేతితోనో దోరగా వేయించి ఆ గరిటతో సహా తెచ్చి, వండిన వంటకంలో బోర్లించి అటూ ఇటూ కలియపెడతారు. అందుకనే “తిరుగబోత” పెట్టటం అనే మాట కూడా వ్యాప్తిలోకి వచ్చింది. సత్యభామ పాచికల్ని చేతిలో తాలించింది అనటంలో వంట చేసే చెయ్యి పాచికల ఆటలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోందనే వ్యంగ్యం ధ్వనిస్తోంది.
పురజనం భూత భయంతో వణికి పోతున్నారు. సత్యభామ తటపటాయిస్తోంది. కృష్ణుడు పాచికలు వెయ్య మంటున్నాడు. ఈ సారి పందెంలో ఇప్పటిదాకా నువ్వు గెలిచిందంతా తిరిగి నేను గెలిచేస్తాను...అన్నాడు. ఇంకోసారి నీకు పాచికలు ముట్టుకునే అవకాశం లేకుండా గెలుస్తానన్నాడు. ఆ భూతం వచ్చి ఈ పాచికల్ని ఎత్తుకెడుతుందా ఏంటి అని కూడా అనేశాడు. ఊరు జనం బిక్కచచ్చి పోతున్నారు.
‘ఈ ఎత్తులో ఎవరికి లాభం రానుందో ఎవరికి తెలుసు... నువ్వు పాచికలు వెయ్యి’ అంటున్నాడు. సత్య పాచికల్ని తాలిస్తోంది.
‘త్వరగా వెయ్యి... పోయిన సొమ్మంతా గెలుచుకుని వెళ్ళి ఆ భూతం పని పడతాను...” అన్నాడు. ఆ మాత్రం భరోసా ఇచ్చాడు...చాలనుకుని సంతృప్తి పడ్డారు పౌరులు.
కష్టాలు, తుఫాన్లు, భూతాలు చెప్పిరావు. ముందుగా పసిగట్టి, రాకుండా అడ్డుకోగలిగే సమర్ధత కలిగిన యంత్రాంగం లేనప్పుడు, జనం పోలీసులతోనూ, పోలీసులు మంత్రి తోనూ, మంత్రి ముఖ్యమంత్రితోనూ మొరపెట్టుకుంటారు, సదరు పెద్దాయన భార్యతో ఏకాంతంగా ఉడి, ‘కాసేపాగి వస్తాలే! ముందు మీరు పదండి...’ అనే అంటాడు.
ప్రజలకు పెనుముప్పు ముంచు కొచ్చిందంటే కచ్చితంగా ముందుగా పసిగట్టడంలో తాని విఫలమయ్యానని ప్రభుత్వం నడిపేవాడు అంగీకరించినట్టే లెక్క!
ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడంటే కామరాజుగారి పార్‘కలామ్... ‘చూద్దాం’ సిద్ధాతాన్ని పాటిస్తున్నట్టే లెక్క.
అయ్యా మీరొచ్చి కాపాడండీ అని ప్రజలు వచ్చి మొరపెట్టుకోవలసి వచిందంటే అయ్యగారి పాలన అంతంత మాత్రంగానే ఉన్నటు లెక్క! చిట్ ఫండ్ కంపెనీవాళ్ళు బోర్డెత్తేసి పారిపోతుంటే, ‘ఎవ్వరైనా కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకుంటాం’ అని పోలీసు వారన్నట్టే ఉంటుంది ఇది. తీరా కంప్లైంట్ ఇచ్చాక ‘చూద్దాం’ సిద్ధాంతమే అమలౌతుంది. "అయ్యా! నా భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆసుపత్రిలో చేర్చాలంటే, "కానీ, చూద్దాం" అనే యజమానులూ ఉంటారు.
ఎన్నికలైపోయాక ఏరు దాటిన తెప్ప తగ్గలేసినట్టు, చూద్దాం చేద్దాం అనేవి ప్రభువుల ఊతపదాలుగా మారి పోతాయి.
భార్యతో జూదం ఆడుతూ, ఉన్నదంతా పందెంలో పోగొట్టుకుని, చూద్దాం చూద్దాం అంటూనే ఆఖరు ఎత్తు వేసి, పోయిందంతా గెలుచు కున్నాకే భూతాన్ని చంపటానికి వెళ్ళాడు కృష్ణుడు
భూతం అక్కడ కొచ్చి ఆగడాలు చేయక మునుపే దాని రాకను పసిగట్టే సామర్ధ్యం ఉంటే, జనం భయభ్రాంతు లయ్యే వారు కాదు కదా! అయినా, అంతిమ విజయం తరువాత తొలి కష్టాలను ప్రజలు పూర్తిగా మరిచిపోతారు, ఎన్నికల నాటికి ప్రభువుల పూర్వ పాపాలన్నీ జనం మరిచిపోయినట్టు!

Sunday 13 March 2016

మక్కజొన్న పొత్తులు డా. జి.వి.పూర్ణచందు

మక్కజొన్న పొత్తులు 


డా. జి.వి.పూర్ణచందు



కొలంబస్ అమెరికాని కనుగొన్నాకే, మిరప కాయలు, పొగాకు, బ౦గళాదు౦పలు, మక్కజొన్నల గురించి బైట ప్రపంచానికి తెలిసి౦ది. బ్రిటిషర్లు వీటీని 16, 17 శతాబ్దాలలో భారతదేశంలో పండింప చేశారు. వానాకాలంలో రోడ్డుప్రక్కన తాటాకుల గొడుకు క్రింద కూర్చుని ముసలమ్మలు కాల్చి ఇచ్చే మక్కజొన్న కండెలు మాత్రమే మనకు తెలుసు. సినిమాలకో షికార్లకో వెళ్ళినప్పుడు పాప్ కార్న్ కొనుక్కొని తినడమూ తెలుసు. అంతకు మించిన ఆహార ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనం పట్టించుకోము. ఈ రోజున మక్కజొన్నల్ని ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు ప్రధాన ఆహారద్రవ్య౦గా తీసుకొ౦టున్నారు.


మక్కజొన్న పొత్తుల్ని రెడ్ ఇండియన్లలో అరవక్ భాష మాట్లాడే ప్రజలు ‘మైజ్’ అని పిలుస్తారు. అదే పేరు ప్రపంచం అంతా వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగువాళ్ళు చాలా ప్రాంతాల్లో వీటిని మొక్కజొన్న పొత్తులు అని పిలుస్తారు. ఇది సరైన పిలుపు కాదనుకుంటాను. మక్క అంటే, స్త్రీల పొత్తికడుపు. పొత్తిళ్ళలో పాపాయిలా అనేక రేకుల మధ్య దీని కండె భద్రంగా ఉంటుంది. అందుకని, తెలుగువాళ్ళు వీటిని మక్కజొన్న పొత్తులని పిలిచి ఉంటారనుకుంటాను. జొన్నకండెలకూ మక్కజొన్న కండెలకూ ప్రధానమైన తేడా ఈ పొత్తిళ్ళే (రేకులు). జొన్న కండెలకు పొత్తులుండవు. పొత్తులు (పొరలు, రేకులు) కలిగినది కాబట్టి, దాన్ని మక్కజొన్న పొత్తు అన్నారు. తెలంగాణా ప్రా౦తంలో మక్కజొన్న అనే అంటారు. అదే సరయిన పిలుపు. మొక్క జొన్న అనటం దానికి రూపా౦తరమే! హి౦దీలో దీన్ని ‘మక్క’, ‘భుంటే’ పేర్లతో పిలుస్తారు. కన్నడంలో ‘మెక్కేచోళా’, అరవంలో ‘మక్కాచోళ౦’ అని పేర్లు. మక్కాకీ ఈ కండెలకూ ఏ సంబంధం లేదు. అది మక్కజొన్న అనే అర్ధంలో ఏర్పడిన తమిళపదం.


అమెరికా ఖండంలో మక్కజొన్న అడవులే ఉన్నాయి. స్థానిక అమెరికన్ ఆటవిక జాతులకు ఇవి రక్షణ కవచంలా ఉపయోగ పడతాయి. ఒకసారి ఈ మక్కజొన్న అడవుల్లోకి ప్రవేశిస్తే బైటకు రాగలగట౦ అసాధ్య౦ అన్న౦త దట్ట౦గా ఉంటాయి. అందువలన తక్కిన ప్రపంచం మొత్త౦ ఎ౦త మక్కజొన్నని పండిస్తోందో అమెరికా ఖండం ఒక్కటీ అంత ఉత్పత్తి చేయగలుగుతోంది.


మనం జొన్నలతో చేసుకునేవన్నీ అమేజాన్ రెడ్డిండియన్లు మక్కజొన్నల్తో వండుకొ ౦టారు. మక్కజొన్నల తరవాణి వాళ్ళకి చాలా ఇష్టమైన వంటకం. పిండిగా విసిరి రొట్టెలు చేసుకొ౦టారు. ధర కాస్త అందుబాటులో ఉంటే మనం కూడా జొన్నపిండి లాగానే మక్కజొన్న పిండితో రొట్టెలు కాల్చుకోవచ్చు.


మక్కజొన్నగింజ లోపల 14 శాతం నీరు ఉంటుంది. 400 డిగ్రీల వరకూ వేడిని ఈ గింజలకు ఇచ్చినప్పుడు గింజ లోపలి నీరు ఆవిరయి, వత్తిడి కలిగించడంతో గింజలో ఉన్న పిండిపదార్ధం పేలి, దాని అసలు పరిమాణానికన్నా 40% ఎక్కువగా పువ్వులా విచ్చుకుంటుంది. వీటినే మక్కజొన్న పేలాలు (పాప్ కారన్) అంటారు. అమెరికన్ ఆటవిక జాతులవారు దేవతా విగ్రహాలను మక్కజొన్న పేలాల ద౦డలతో అలంకరిస్తారట. వాటిని ధరి౦చి నృత్యం చేస్తారట ఈ మక్కజొన్న పేలాలను బెల్ల౦ పాకం పట్టి ఉండలు చేసుకొని తి౦టారట కూడా!


మక్కజొన్న పేలాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఉప్పు, కొవ్వు కలవకుండా ఉంటే, స్థూలకాయులూ, షుగరు రోగులు కూడా తిన దగినవిగా ఉంటాయి. కూరలు ఇతర ఆహార పదార్థాల్లో ఈ గింజల పిండిని విసిరి, కలిపి వండితే పోషక విలువలు బాగా అందుతాయి.


శనగపిండి బదులు మక్కజొన్న మంచి ప్రత్యామ్నాయం. ఇప్పుడు కొత్తగా లేత మక్కజొన్న గింజల్ని ఉడికించి మషాల పొడి కలిపి పెళ్ళి విందుల్లో స్వాగతం ఆహార పదార్ధంగా ఇస్తున్నారు. కూరల్లో ఈ గింజల్ని బాగా వాడుతున్నారు. సమోసాలు కూడా చేస్తున్నారు.


ఇవి పుష్టి కలిగిన ధాన్యమే గానీ, వీటిని అరిగించు కోవటానికి బలమైన జీర్ణ శక్తి కావాలి. కాల్చిన గింజలు, పేలాలు అరిగినంత తేలికగా మక్కజొన్న పిండి అరగక పోవచ్చు. అరగని ఆహారపదార్ధం ఏదయినా వాతాన్ని పెంచుతు౦ది. అందువలన వాత వ్యాధులున్నవారు మక్కజొన్నల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. మక్కజొన్న పిండిని గానీ గింజల్ని గాని బాగా ఉడికించి తయారు చేసే కారన్ సూప్ అనే గంజి ఎక్కువ పోషకంగా ఉంటుంది. వెంటనే నీరసం తగ్గుతు౦ది. ఇంటికి రాగానే పిల్లలకు, శ్రీవారికీ ఇవ్వదగిన ఆహార పదార్ధం ఇది..


తక్కిన ధాన్యాలతో పోల్చినప్పుడు మక్కజొన్నల్లో బి విటమినూ, ఇతర ప్రొటీన్లూ అత్యధికంగా ఉన్నాయి. మాంసం, మక్కజొన్నపిండీ కలిపి వండితే అది తిరుగులేని ఆహార పదార్ధం అవుతు౦ది. జీర్ణశక్తి బలంగా ఉన్నవారికి పెట్టదగిన వంటకం.