Monday 18 April 2022

వీరేశలింగం జాతీయతావాదం డా|| జి. వి. పూర్ణచందు 9440172642

 

వీరేశలింగం జాతీయతావాదం

డా|| జి. వి. పూర్ణచందు

9440172642          

          కందుకూరి వీరేశలింగం (1848-1919) ఆధునిక తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవ శకానికి ఆద్యులు. 1907 బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు బెంగాళీల తరువాత మొదటగా స్వాతంత్రోద్యమంలో తెలుగువారు దూకటానికి కావలసిన రంగాన్ని సిద్ధం చేసిపెట్టి, జాతిని సన్నద్ధం చేసిన వాడాయన!

దిట్టమైన శిల్పాలు దేవళాలు

కట్టుకథల చిత్రాంగి కనకమేడలు

కొట్టుకొనిపోయి ఉన్న కోటిలింగాలు

వీరేశలింగము ఒకడు మిగిలెను చాలుఅని జాతి ఆయన్ని ఘనంగా సంస్మరించుకుంది.

          జాతీయతాభావం అంటే సంస్కరణతో కూడిన బలమైన జాతి పునర్నిర్మాణం. భారత సంస్కరణోద్యమాల ఫలసిద్ధి అంతా ఏకమై. జాతీయోద్యమంగా ఆవిర్భవించిందిఅని భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు కాంగ్రెస్ చరిత్రలో వ్రాశారు. తెలుగువారికి సంబంధించినంత వరకూ జాతీయోద్యమ సౌధానికి కందుకూరివారి సంస్కరణోద్యమమే మూలస్తంభం. అంతటి సన్నద్ధత లేకుండానే, బిపిన్ చంద్రపాల్ రాత్రికి రాత్రే తెలుగు వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా మార్చేశా రనటం అర్థసత్యం. బిపిన్ చంద్రపాల్ సభకు విశాఖపట్టణం కన్నా కాకినాడలో, కాకినాడకన్నా రాజమహేంద్రవరంలో ఎక్కువ ప్రజలు వచ్చారు. రాజమహేంద్రవరంలో కందుకూరి సిద్ధపరచిన సాంస్కృతిక చైతన్యం అక్కడ జాతీయోద్యమభానుడు ప్రకాశించేలా చేసింది.

          చరిత్ర ఎప్పుడూ గెలిచినవాడి పక్షానే ఉంటుంది. ఎవరు ఎక్కువగా వార్తల్లో కనిపిస్తారో వారే విజేతలు. వారి చుట్టూనే చరిత్ర తిరుగుతుంది. తెలుగునాట ఒకనాడు కందుకూరి ఆరాధ్యుడు. బిపిన్ చంద్రపాల్ రాకతో కందుకూరి ప్రభ మసకబారింది. బిపిన్ చంద్ర ప్రభ కూడా ఎక్కువకాలం నిలవలేదు. 1921 స్వాతంత్రోద్యమ రంగస్థలిపైన గాంధీ పాత్ర రాగానే బిపిన్ కనుమరుగయ్యాడు. ఇప్పుడు ఆధునిక గాంధీలు వచ్చాక గాంధీ మహాత్ముడే కనుమరుగై పోయాడు. చరిత్ర ఎప్పటికప్పుడు వెలుగులో ఉన్నవాళ్ల చుట్టూరా తిరుగుతుంది. దానికి వర్తమానమే ప్రముఖం.

          సూర్యరశ్మిని స్వీకరించి ఆకులు పత్రహరితాన్ని తయారుచేసుకున్నట్టే సాంస్కృతిక చైతన్యాన్ని గ్రహించి, జాతి పునర్వికాసం పొందుతుంది. సాంస్కృతిక చైతన్యం అనేది సూర్యుడిలా ఒక తరగని ఇంధనం. రాజకీయ సామాజిక రంగాల్లో ప్రభవించే ఉద్యమా లన్నింటికీ ఈ సాంస్కృతిక చైతన్యమే ఆలంబన. సాంస్కృతిక చైతన్యం కొరవడిన ఉద్యమాలు ప్రజాహితాన్ని కోరేవిగా నిలబడలేవు.

సాంస్కృతికంగా ఆధునిక యుగం యూరపులో ‘రోజర్ బేకన్’తోనూ, భారతదేశంలో రాజా రామమోహన్ రాయ్ తోనూ ప్రారంభం కాగా, కందుకూరి తెలుగువారికి యుగకర్త. రాజా రామమోహన్ రాయ్ఈశ్వరచ౦ద్ర విద్యాసాగర్, బ౦కించ౦ద్ర చటర్జీలను కలగలిపి ఒక విగ్రహంగా పోతపోస్తే ఆ విగ్రహం కందుకూరి ఆకారంలో ఉంటుంది.

          “ఒకటి రెండు పుస్తకములు వ్రాయుటలో తప్ప నేను తలపెట్టిన కార్యములన్నియు నీశ్వరానుగ్రహము వలన నెరవేరినవి. ఇక నేనీ లోకములో నుండవలసిన ప్రయోజనమంతగా నా బుద్ధికి పొడగట్టదు. అని ఒక నిర్ణయానికి వచ్చినా, వీరేశలింగంగారు ఆ చివరి రోజుల్లో సంఘసంస్కరణతోపాటు భాషా సంస్కరణను కూడా చేపట్టి, వాడుక భాషా ఉద్యమానికి అండగా నిలిచారు. 1919- ఫిబ్రవరి తే 28 దిని రాజమహేందవరమునందు కీ.శే.రా.బ. కందుకూరి వీరేశలింగం పంతులుగారు అధ్యక్షులుగా, “వర్తమానాంద్ర భాషా ప్రవర్తక సమాజముస్థాపించుటకు ఏర్పాట్లు జరిగినవి; గాని పంతులుగారు మరి మూడు మాసములలోగానే పరమపదము పొందుట చేత, సమాజము ఉద్దేశించిన కార్యములు నెరవేరలేదు.అని, గద్య చింతామణి [1933]లో శ్రీ గిడుగు రామమూర్తి వ్రాశారు. చివరి వరకూ ఆయన భాష సంస్కృతుల సంస్కరణ కోసమే పాటుబడ్డారనటానికి ఇది సాక్ష్యం.

          తెలుగు సాహిత్యానికి వీరేశలింగం లాగానే, బంకించంద్ చటర్జీ ఆధునిక వంగసాహిత్యానికి ఆద్యుడు. గొప్ప దేశభక్తుడు. ఆనందమఠం నవలలో ఆయన వ్రాసిన వందేమాతరం గేయం ఆనాటి స్వాతంత్రోద్యమానికి ప్రాణం పోసింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆరంభమైన ఉద్యమాన్ని వందేమాతరం ఉద్యమంగా పిలుచుకున్నారు ప్రజలు. కానీ, బంకించంద్ర చటర్జీ కోరింది పూర్వ సాంఘిక వ్యవస్థ పునరుద్ధరణని మాత్రమే! దాని పునర్నిర్మాణాన్ని కాదు. వీరేశలింగం ఆ వ్యవస్తలో లోపాల్ని సంస్కరించి పూర్వ సాంఘిక వ్యవస్థ పునరుజ్జీవనం కొసం పాటుపడ్డాడు. బంకించందు రచనల్లోని భావపటిమ, శిల్చచాతుర్యాలతో పోలిస్తే వీరేశలింగం తక్కువగా కనపడవచ్చు. కానీ, బంకించందు ఒక భావావేశం కలిగిన సాహితీపరుడు మాత్రమే! వీరేశలింగం బహుముఖీనమైన ప్రతిభతో జనజాగృతి కోసం పాటుబడిన వ్యక్తి. అనేక నూతన సాహితీ ప్రక్రియలకు ఆరంభం పలికిన సృజనశీలి. తన రచనా కౌశల్యాన్ని ఒక మహోద్యమ నిర్వహణకు వజ్రాయుధంగా వినియోగించుకొన్న సంఘనాయకుడు. సంస్కర్త.

          “దీర్ఘకాలము నిద్రాణమైయున్న ఆంధ్రజాతి మేధాసంపత్తి, పునరుజ్జీవనము పొందుచున్న సంధికాలములో వివిధ దృక్పథముల, సంస్కృతుల, సాహిత్యముల సమన్వయ దృష్టితో చూడగల ప్రజ్ఞతో వీరేశలింగం పంతులుగా రుద్భవించిరి’ అనీ, “కందుకూరి వీరేశలింగం పంతులుగారు రంగమున అడుగు పెట్టినంతనే; మన సాహిత్యము పరిణామదశ నుండి ఒక్కసారి వికాస దశకు వచ్చెను.” అనీ “తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం” గ్రంథంలో ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు వ్రాశారు.

          జాతీయోద్యమం అంటే కేవలం ఆనాటి కాంగ్రేస్ రాజకీయాల్లొ చేరటమే ననుకుంటే, వీరేశలింగం అలాంటి జాతీయవాది కాదు. తన జీవిత చరమాంకంలో “అస్మద్దేశీయులైన యాంధ్ర మహాజనులారా! రాజమహేంద్రపుర వాస్తవ్యులగు భ్రాతృవరులారా! నా కడపటి దైన చిన్న విన్నపము నొకదానిని మీకు చేయుచున్నాను... ధార్మిక సాంఘికాభివృద్ధి ప్రయత్నము నుపేక్షించి యొక్క రాజ్యాంగ స్వాతంత్రాభివృద్ధిని గూర్చియే యుద్యమించుట సంపూర్ణ సుఖసాధకము కాజాలదు” అని నొక్కి చెప్పారు. రాజకీయ స్వాతంత్ర్యం ఒక్కటే ఉంటే ఇంట్లో ఆడపిల్లలు చదువు లేక వితంతువులుగా తిరగటం సుఖకరం కాదు కదా! అలాగని రాజకీయ స్వాతంత్ర్యం లేకుండా కట్టు బానిసల్లా జాతి పడి ఉండలేదు కదా... కాబట్టి, ఇంటాబయట కూడా సుఖశాంతులు సమానంగా ఉండేలా చూసుకోవా లన్నారు. “నిజమైన దేశక్షేమము నపేక్షించిన పక్షమున దేనిని నుపేక్షింపక సమస్త స్వాతంత్ర్యముల నిమిత్తమును సమస్తాభివృద్ధుల నిమిత్తమును సమానముగ కృషి జేయుడు. అప్పుడు మీరు మీ దేశమును సౌఖ్యవంతముగాను, సంతోషవంతముగాను నభ్యుదయవంతముగాను జేయగలుగుదురు” అని వేడుకున్నారు. ఒక విధంగా ఇది వీరేశలింగం గారి ఆఖరి కోరిక. బలమైన సామాజిక వ్యవస్థ ఉన్నప్పుడే జాతి స్వాతంత్ర్యానికి సార్థకత ఏర్పడుతుందనేది కందుకూరి జాతీయతావాదం.

          గాంధీజీ కూడా సంఘసంస్కరణ లేని స్వాతంత్ర్యం వ్యర్థం అనే భావించాడు. కానీ, మన రాజకీయనాయకులు, ఈనాడే కాదు, ఆనాడూ అత్యుత్సాహపరులే! చాలామంది రాజకీయవేత్తలకు తమ వలనే ఈ భూగోళం మనగడలో ఉందని మితిమీరిన నమ్మకం. వారి మాట చేత అలానే ఉంటాయి. 1935లో వివిధ ప్రావిన్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వా లేర్పడినప్పుడు సంస్కరణల మీద మొదట దృష్టి పెట్టవలసిందిగా గాంధీజీ సూచించాడు. కానీ, సంస్కరణలు, సత్యవాదాలు, అహింసా సూత్రాలు స్వాతంత్ర్యాన్ని తెస్తాయనే నమ్మకం ఆనాటి రాజకీయనాయకుల్లో మనస్ఫూర్తిగా ఉందనేది నిజంగా అనుమానమే! ఆయన మాటలు పెడచెవుల్లోక్కూడా దూరలేదు. చౌరీచౌరా అలజడుల తర్వాత గాంధీ, సత్యాగ్రహాన్ని ఆపుచేసి సంస్కరణలపైన దృష్టిపెట్టినప్పుడు ఆయన్ని కేవలం ఒక సంస్కర్తగానే బావించారు చాలామంది. భరతమాతకు దాశ్య శృంఖలాలు కేవలం బ్రిటిష్ వలసపాలకుల వలన మాత్రమే కాదని, జాతీయతని మరిచి, మనల్ని మనం సంస్కరించుకోకుండా జీవించటం కూడా దాస్యమే నన్నారు గాంధీ.        స్వతంత్రోద్యమానికి సంఘసంస్కరణ ఒక ప్రధాన ఆయుధం అనీ, రాజకీయాల పేరుతో సంస్కరణల్ని అలక్ష్యం చేయవద్దని దేశప్రజలకు ఇటు వీరేశలింగంగారు, అటు గాంధీజీ ఒకే విఙ్ఞాపన చేశారు.

          జాతీయోద్యమం వలన సామాజికంగా వచ్చిన మార్పుల్ని వీరేశలింగంగారు స్వాగతించారు. “నాటికీ నేటికీ ఎంతమార్పు?” అని ఆయన ఆశ్చర్యపడ్డారు. కన్నులు తెరిచి, మాంద్యము మాని చురుకుదనము పూని దేశాభివృద్ధికరములైన నానాక్షేత్రముల యందు మహోత్సాహముతో కృషి చేయుచున్నందుకు నేనెంతయు సంతోష మొందుచున్నాను” అన్నారు. “అయినను, సాంఘిక సంస్కారాదులయందు మనవారికి మాటల్లో గల శూరత్వము కార్యములలో నింకను నేనభిలషించినంత కనబడుచుండలేదు” అని హెచ్చరించారు. రాజ్యాంగ సంస్కారాలకి మాటలెక్కువ, చేతలు తక్కువ కావాలి. కాని, సంస్కరణల విషయంలో అలా కాదు చేతలు ఎక్కువ కావాలి. అది ప్రస్తుతం కనబడట్లేదని భావించారు.

          కొత్త కెరటంలాగా వచ్చిన ఆనాటి వందేమాతరం ఉద్యమంలోకి తొలిగా దూకిన వారంతా వీరేశలింగంగారి శిష్యులే! ఛాందస వాదులు, గ్రాంథికవాదు లెవరూ ముందుగా ఈ ఉద్యమంలోకి రాలేదు. కానీ, ఉద్యమస్ఫూర్తితో వందేమాతరం ఉద్యమాన్ని స్వాగతించ వలసిన ఈ ఉద్యమకారులు తాము వీరేశలింగాన్ని వదిలి బిపిన్ చంద్రపాల్ వెంట నడుస్తున్నామనే భావనకు ఎందుకు లోనయ్యారో తెలీదు. వారిలో కొందరు అపోహలు, అపార్థాలు, అభాండాలతో వీరేశలింగంగారి మనసుని గాయపరిచి వెళ్లారు కూడా!         

          దిగవల్లి శివరావుగారు “వీరేశలింగం వెలుగు నీడలు” పుస్తకంలో వేమనను పొగడటానికి వీరేశలింగాన్ని తిట్టటం, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రి  ఓ జేబు సైజు పుస్తకంలో వీరేశలింగం గారిని బృహస్పతి అని ఎద్దేవాచేస్తూ ఆయన గ్రంథ చౌర్యం చేశాడనటం, “వీరేశలింగంతో మధురవాణి” అనే వ్యంగ్యంతో పరోక్షంగా చీమకుర్తి శేషగిరిరావు ఆయన శీలంపై నీలాపనిందలు వేయటం లాంటి విషయాల్ని సమర్థవంతంగా తిప్పికొట్టి మంజుశ్రీ అక్కిరాజు రమాపతిరావు అనేక వాస్తవాలను వెల్లడించారు. “స్వర్గంలో వీరేశలింగం” అని ఎవరైనా రచన చేస్తే అబ్బెబ్బె వీరేశలింగానికి స్వర్గం ఏమిటీ? అని తగువుపెట్టుకున్నట్టుంది శ్రీ చీమకుర్తి శేషగిరిరావు మిసిమి పత్రికలో వ్రాసిన లేఖ” అని ఆక్షేపించారాయన. ఒక వ్యక్తి మరణించిన వందేళ్ళ తరువాత కూడా పాత అబద్ధాల్నే ప్రచారం చేసే విచిత్ర మనస్తత్వం తెలుగువారికి ఎక్కడిదో అర్థం కాదు.

          కందుకూరి ఒక సంస్కర్తగా బాల్యవివాహాల్ని వ్యతిరేకించారు, వృద్ధవివాహాల్ని నిరసించారు, కన్యాశుల్కాన్ని ఖండించారు, వరకట్నాల్ని చీదరించారు, వితంతువివాహాల్ని ప్రోత్సహించారు. స్త్రీలకు విద్య చెప్పించటం దోషం కాదని నచ్చచెప్పపటాని క్కూడా ఆయన శ్రమించవలసి వచ్చింది. వేదం వెంకటరాయశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం లాంటి సనాతనధర్మపరాయణులు ఆయన్ని వ్యతిరేకించి కత్తికట్టారు. ఈయన బ్రహ్మసామాజికుడు. జంధ్యం తీసేశాడు. విగ్రహారాధనని నిరశించాడు. ఇలాంటివి టంగుటూరి శ్రీరాముల్లాంటి వాళ్లకి గిట్టకపోవచ్చు. ఆ కాలం అలాంటిది. కాని, వీళ్లు తమ వ్యతిరేకతను ప్రకటించటానికి స్వంత పత్రికల్లో నీలివార్తలు సృష్టించటం, శీలహననానికి పాల్పడటం క్షంతవ్యం కాదు.

          స్త్రీలకు చదవటం వ్రాయటం వస్తే విటులకు ప్రేమలేఖలు రాస్తారని, భారత నారి శీలానికే ప్రమాదం రాగలదంటూ వీరేశలింగం మీద దాడి చేసినవారిని ఒక్క మాట కూడా అనకుండా మనతరం పండితులు కొందరు యంగ్ వర్జిన్ విడోల కోసం వెంపర్లాడే గిరీశంతో కందుకూరిని పోలుస్తూ, తమ వ్యంగ్య వచో వైభవాన్ని చాటుకోవటం వారిలోని జాతీయతాభావ లేమికి నిదర్శనం.

          జాతీయత అంటే సంస్కరణతో కూడిన స్వాతంత్ర్యం. విధవా పునర్వివాహ సమస్య ఇప్పుడు మనకి అంత లేకపోవచ్చు. కానీ, ఆహారం నుండి విహారం దాకా మనల్ని మనం సంస్కరించుకోవలసిన రంగాలు ఇంకా చాలా ఉన్నాయి. మేథావులు వాటి మీద దృష్టి సారిస్తే జాతీయత బలపడ్తుంది. జాతీయతాభావం అంటే సంస్కరణతో కూడిన బలమైన జాతి పునర్నిర్మాణం!!!

19/4.2022 ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)