Monday 20 October 2014

తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు::ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి డా. జి వి పూర్ణచందు

తెలుగు భాషకు క్లాసికల్ హోదా సాధకుడు::ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి
డా. జి వి పూర్ణచందు
ఒక సిద్ధుడు, ఒక ప్రసిద్ధుడు, ఒక జగత్ప్రసిద్ధుడు అయిన మహోన్నత భాషా శాస్త్రవేత్త మరణి౦చి నప్పుడు భాష మరణించినంత పెను విపత్తు కలుగుతుంది. అ౦దవలసినంత ప్రాణవాయువు అ౦దకపోతే ఊపిరాడనట్టే అవుతుంది. తెలుగు భాష మూలాలను వెదికే విషయ౦లో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి మరణంతో ఏర్పడిన లోటును మరొకరితో పూరి౦చ గలిగే పరిస్థితి లేదు. ఆరాధనీయమైన అంతటి అ౦తర్జాతీయఖ్యాతిని పొంది తెలుగువారికి గర్వకారణమైన అపురూప వ్యక్తిత్వం మరొకరిలో కానరాదు.
2005లో విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో తెలుగు భాష మీద ఒక అధ్యయన సదస్సును ప్రారంభిstUస్తూ,తాను తెలుగు మీడియంలో చదివాను కాబట్టే, ఈరోజు ఇలా అంతర్జాతీయ భాషావేత్తను కాగలిగాననీ, ఇప్పటి వాళ్ళలాగాఇంగ్లీషు మీడియంలో చదువుకొని ఉంటే రెంటికీ చెడే వాణ్ణనీ చెప్పుకొన్నారు. మానసిక శాస్త్రపరమైన అనేక అంశాలుమాతృభాషని ప్రభావితం చేస్తాయని ఆ సదస్సులో ఆయన వివరించారు.
ప్రలోభాలకు లొంగని విశిష్ట వ్యక్తిత్వం
          “సుసుమూ ఓనూ” అనే ఒక జపానీ ఔత్సాహిక భాషాశాస్త్ర పరిశోధకుడు “ది జెనియాలజీ ఆఫ్ జపనీస్లా0గ్వేజీ” వ్యాస౦లో జపానీ భాషలో కొన్ని పదాలు తమిళ పదాలుగా చిత్రి౦చే ప్రయత్నం చేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తమిళ ఆచార్యుల ప్రేరణతో ఆ విధంగా ఆ పరిశోధన సాగింది. “తొకునాగ” అనే జపానీ భాషావేత్త ఈ అధ్యయనాన్ని ఖండిస్తూ, అది misuse of DEDR అన్నాడు.
“భాషా శాస్త్ర రహస్యాలను తెలుసుకోవాలంటే, హైదరాబాదులో భద్రిరాజు కృష్ణమూర్తి అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన్ను ఆశ్రయించు,” అ౦టూ తొకునాగ ఆ వ్యాసకర్తను మ౦దలించారుకూడా! అవి ద్రావిడ పదాలనీ, తెలుగులో కూడా అవి సజీవంగా ఉన్నాయనీ “బౌద్ధ యుగంలో తెలుగు వారికి జపానీయులతో ఏర్పడ్డ సాంస్కృతిక పరమైన, వాణిజ్య పరమైన సంబంధాలు ఇందుకు కారణం కావచ్చని నేను “సుసుమూ ఓనూ” కు సమాధానంగా ఒక వ్యాసం ప్రచురించాను. దానికీ భద్రిరాజువారు అ౦గీకరి౦చక నాలుగు అక్షి౦తలు నాకూ వేశారు.
“నిజ౦గా జపనీసుకు ఏదయినా ఉంటే, ప్రాచీన ద్రావిడ౦తో ఉండాలి తమిళ౦తో ఎలా ఉంటు౦ది...? అని 1982లో జపాన్లో జరిగిన అ౦తర్జాతీయ భాషాశాస్త్ర సదస్సు లో తాను ప్రశ్ని౦చినట్టు ఆయన స్వయ౦గా అన్నారు. ఎక్కడైనా తమిళులు గానీ, తెలుగు వారు గానీ, జపానీయులతో సహజీవనం చేసిన దాఖలాలు ఉంటేనే పదాల ఆదాన ప్రదానాలుజరిగే అవకాశం ఉందని, అలాంటిదేమీ జపనీయులతో లేనప్పుడు తమిళ పదాలు గానీ, తెలుగు పదాలు గానీ, జపానులోకి వెళ్ళే అవకాశ౦ లేనే లేదని ఆయన కరాఖండిగా చెప్పారు.
ఈ “సుసుమూ ఓనూ” ఒకసారి భద్రిరాజువారినికలిసి, Prof. Krishnamurthy, if you can accept my theory, I will take you to Japan” అని ఆశ పెట్టబోయాడట. ఎవరైనా ట్యూటర్ పని చేసుకొనేవాడి దగ్గరకు పోయి చెప్పమని ఆయన తిప్పి కొట్టినట్టు స్వయంగా భద్రిరాజు వారే వెల్లడి౦చారు.
ఇది ఒక అ౦తర్జాతీయ స్థాయి భాషావేత్త అ౦కితభావానికి ఒక తార్కాణ౦.
ప్రాచీనతా హోదా విషయంలో భద్రిరాజు వారి పాత్ర
           తమిళ రాజకీయ పార్టీలతో ఎన్నికల అవగాహన ఫలితంగా తమిళ భాషకు ఉదారంగా క్లాసికల్ భాషా ప్రతిపత్తిని కల్పించేందుకు పూనుకొని, కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల సంఘాన్ని నియమింది.  కేంద్ర సాహిత్య అకాడెమీ-న్యూఢిల్లీ,
భారతీయ భాషా కేంద్రం- మైసూరు ఈ రెండు సంస్థల అధ్యక్షులతో పాటు ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి , కేంద్ర గృహ వ్యవహారాల శాఖ కార్యదర్శి, సాహిత్య అకాడేమీ కార్యదర్శి కూడా అందులో సభ్యులుగా ఉన్నారు.
క్లాసికల్ ప్రతిపత్తిని తమిళ భాషకు కేటాయించే విషయమై సరళమైన మార్గదర్శకాలు  రూపొందించటమే ఈ కమిటీ బాధ్యత అనేది వేరె చెప్పనవసరం లేదు. అందుకు ప్రమాణార్హతల్ని నిర్ణయించే బాధ్యతను భాషావేత్త ఆచార్య భద్రిరాజు వారికి అప్పగించారు. కానీభద్రిరాజు వారు ఎక్కడా లొంగకుండా తమిళంతో పాటు అన్ని భారతీయ భాషలకూ సమన్యాయం జరగాలని భావించారు. 2004, సెప్టె0బరు, 2వతేదీన ఈ కమిటీ సమావేశమైనప్పుడు భద్రిరాజు వారు కమిటీ పరిశీలన కోసం నాలుగు ప్రమాణార్హతలను ప్రతిపాదించారు.
1.    High antiquity of the early text/recorded history may be 1500-2000 years: 1500 ను0చీ 2000 సంవత్సరాల కనీస ప్రాచీన చరిత్ర కలిగిన భాష అయి ఉండాలి. I ఈ సూత్రంలో భద్రిరాజు వారు early texts అనే పదాన్ని, may be అనే పదాన్ని చాలా ముందు చూపుతో ప్రయోగి0చారు. 1500 ను0చి 2000 సంవత్సరాల నాటి ఒక్క అక్షరం దొరికినా ఆ భాషను ప్రాచీనమైనదిగా గుర్తించవచ్చనేది ఆయన భావన. ఇప్పటికి తమిళానికే ఇచ్చినా, భవిష్యత్తులో తెలుగు కన్నడ, ఇతర దేశీయ భాషలకు కూడా దీన్ని వర్తింప చేయవచ్చనే ఊహ ఆయన మనసులో ఉండటమే ఇందుకు కారణం.
2.    A body of ancient Literature/Texts which is considered as valuable heritage by generation of speakers: ఆ భాషకు ప్రాచీన పరంపర ఈ నాటిదాకా కొనసాగుతూ ఉండాలనేది రెండవ నియమం. ఇది తెలుగు, కన్నడ భాషలను ప్రత్యేక0గా దృష్టిలో పెట్టుకొని ఏర్పరచిన నియమం.
3.    TheThe literary tradition be original and not borrowed from another speech community: eraఆ భాష స్వతంత్ర జన్యమైనదిగా ఉండాలి, ఇంకొక భాషా జాతీయుల ను0చి ఎరువు తెచ్చుకొన్నది కాకూడదు అనేది మూడవ నియమం.
4.    The Classical Language and Literature being distinct from modern, there may also be a discontinuity between the classical language and its inner forms or its varieties. ఆధునిక౦గా వ్యవహార౦లో ఉన్న రూపానికి ఆ ప్రాచీన భాష భిన్నమైన రూప౦ కలిగి ఉన్నప్పుడు ఆ రె౦డు రూపాలమధ్య కాల వ్యవధి ఉండవచ్చు ననేది ఈ నాలుగో సూత్ర౦లో ఒక వెసులుబాటు. పాళీ, ప్రాకృతాలనూ, మళయాళాన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక సమదృష్టితో భద్రిరాజు వారు ఈ నాలుగో ప్రమాణార్హత ప్రతిపాదించారని మనకు తేలికగానే బోధపడుతుంది.
     ఆ సమావేశ౦ మినిట్సులో ఈ నాలుగు సూత్రాలనూ భద్రిరాజు వారే సూచి౦చినట్లు రికార్డయి ఉంది. ఈ ప్రాచీనతా గుర్తి౦పు అనేది భాషకే గానీ ఆ భాషలో వచ్చిన సాహిత్యానికి కాదు అనే విషయ౦లో భద్రిరాజు వారికి స్పష్టత ఉంది. కనీస౦ 1500 ను0చీ 2000 సంవత్సరాల ప్రాచీనత ఒక భాషకు ఉన్నప్పుడే అది విశిష్ట సంపన్న ప్రాచీన భాష అవుతుందనేది ఆయన గట్టి నమ్మకం. అత్యంత ప్రాచీనమైన లిఖిత చరిత్ర కలిగిన ఒక ఉదాత్తమైన భాషని, తరువాతి తరాలకు అనుసరణీయమైన, అనుకరణ నీయమైన, భాషని క్లాసికల్ భాషగా ఆయన నిర్వచించారు. ప్రమాణార్హతలను కూడా ఈ నిర్వచనాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆయన రూపొందించారు.
     2008 ఫిబ్రవరి, 17,18 తేదీలలో ద్రవిడ విశ్వవిద్యాలయం, మైసూరు భారతీయ భాషా కేంద్ర0, కృష్ణాజిల్లా రచయితల స౦ఘ౦ సంయుక్తంగా విజయవాడలో తెలుగు భాష-ప్రాచీనత పైన నిర్వహించిన జాతీయ సదస్సుని ఆచార్య భద్రిరాజు వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అ౦తర్గత౦గా నిపుణుల కమిటీ సమావేశ౦లో జరిగిన విషయాల్ని సభా ముఖ౦గానే వెల్లడి౦చారు. “ఇవన్నీ అప్లై చేస్తే, ఫలాన భాష క్లాసికల్ లాంగ్వేజి అవుతుందని “వాళ్ళు “చెప్పొద్దన్నారు. మీరు నిర్వచనాలు చెప్పండీ, ప్రమాణాలు చెప్పండీ, ఫలాన భాషకు మాత్రమే ఈ గుర్తింపునివ్వమని మాత్రం చెప్పకండి- అన్నారు. ఎందుకంటే, వాళ్ళు చేయదలచుకొన్నది చేస్తే గదా, రాజకీయం?” అన్నారాయన.
ఈ విషయాలను ఆయన స్వయంగా వెల్లడించకపోతే బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదు. ఈ నాలుగు సూత్రాలను అనేక దేశీయ భాషలను దృష్టిలో పెట్టుకొని ఎంతో ముందు చూపుతో ఆయన ప్రతిపాదించిన సంగతి అప్పట్లో తమిళ పెద్దలకు గమనింపు ఉండి ఉండదు.
2004 సెప్టెంబరు 17న కేంద్ర క్యాబినెట్ ఈ తీర్మానాన్ని ఆమోదించి, తమిళాన్ని మాత్రం క్లాసికల్ భాషగా ప్రకటించింది. 2004 అక్టోబరు 12న గెజిట్ నోటీఫికేషన్ అయ్యింది. అందులో అత్యంత ఆశ్చర్యకరంగా భద్రిరాజువారి ప్రతిపాదనలను తుంగలో తొక్కి, మొదటి ప్రమాణార్హతలో ఉన్న 1500-2000 సంవత్సరాల ప్రాచీనతను 1000 సంవత్సరాలకు కుదించి తమిళ భాషకు క్లాసికల్ హోదాని కట్టబెట్టినట్టు ఉంది. నిపుణుల కమిటీ మినిట్సులో ఈ వెయ్యేళ్ళ ప్రస్తావనే లేదు. భద్రిరాజువారి కళ్ళు కప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వతంత్ర్య నిర్ణయంతీసుకొన్నారన్నమాట. ఈ చర్య భద్రిరాజువారిని ఎంతో బాధించింది.
     “తమిళాన్ని ఇలా గుర్తించారు. అప్పుడింకా సంస్కృతాన్ని గుర్తించలేదు. తర్వాత ఎవరో చెప్పారు. అయ్యా, సంస్కృతాన్ని మీరు ఇప్పటివరకూ చెయ్యలేదు కదా... మరి, తమిళాన్ని చేస్తే, సంస్కృతం సంగతి ఏమవుతుందీ అని! అప్పుడు వీళ్ళు సంస్కృతాన్ని కూడా క్లాసికల్ భాష అన్నారు. ఇంత అయోమయంగా జరిగిందిది. అక్కడ దయానిధి మారన్ గారు ఉండి, ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాస్తుండేవారు. ఇది కేవలం రాజకీయమైంది.” అన్నారాయన.
దయానిధి మారన్ 2005లో జనవరి 27, మార్చి 22న ప్రధానికి  ఉత్తరాలు రాసినట్టు తెలుస్తోంది. Revise the antiquity criteria from over 1000 years early texts/recorded history- to over 2000 years” అనీ, అలాగే declare Sanskrit also as a classical language along with Tamil –దేశంలోని ఇతర భాషలకు క్లాసికల్ హోదా ఇవ్వాలంటే, ఈ వెయ్యేళ్ళ కాలపరిమితిని 2000 సంవత్సరాలకు పెంచాలనీ, తమిళంతో పాటు సంస్కృతానికి కూడా ప్రాచీనాతా హోదా ఇవ్వాలనీ కరుణానిధి గారు కోర్తున్నారనేది ఈ ఉత్తరాలలోసారాంశం.
ప్రపంచం గుర్తించిన సంస్కృత భాషకు తమిళం తరువాత అది కూడా కరుణానిధి గారు దయ తలచి ఇవ్వమన్న తరువాతనే భారత ప్రభుత్వం ఇవ్వగలగటం ఒక విచిత్రం. భాషల మధ్య చిచ్చు రగిల్చే ఈ ధోరణిని భద్రిరాజువారు నిర్ద్వంద్వంగా ఖండించారు. “ఫ్రపంచంలో ఇలా ఏ ప్రభుత్వాన్నీ ఏ భాషనీ ఆధునిక భాషగా కానీ, ప్రాచీనభాషగా కానీ, క్లాసికల్ భాషగా గానీ గుర్తించవలసిందిగా ఎవరూ అడగలేదు. ఈ గుర్తింపు, ప్రభుత్వాలు చేసే పని కాదు. స్కాలర్స్ చేయవలసినది.
ప్రాచీనతే కొలబద్ద అనుకొంటే, తెలుగు భాష నిస్సందేహంగా 3000 ఏళ్ళ క్రితం నాటిదని భద్రిరాజువారు ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. “శాతవాహనుల కాలం నుండే శాసనాలలో తెలుగు మాటలున్నాయి. టెక్స్ట్ అంటే, సాహిత్యమనే కాదు, రికార్డెడ్ హిస్టరీ... వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగు, గోండి కొండ, కూయి, కువి, పెంగో, మంద...ఇవి ఒక శాఖ. తమిళం కన్నడం, మళయాళం ఇదొక శాఖ. ఈ రెండు శాఖలు క్రీ. పూ. పదో శతాబ్దిలో విడివడ్డాయి...ఇప్పుడు మనం ఆధునిక తెలుగు భాషకు ఏ లక్షణాలు ఉన్నాయని అనుకొంటున్నామో ఆ లక్షణాలన్నీ నన్నయకు ముందే తెలుగు భాషకు ఏర్పడ్డాయి.
ఏడో శతాబ్దిలోనే బండీ “ఱ”మామూలు “ర”తో కలిసిపోయింది. ఏఱు ఏటి అవుతుంది. ఊరు ఊరి అవుతుంది కానీ ఊటి కాదు. క్రావడి ఉన్న అంశాలు కొన్ని అప్పటికే తెలుగులో వచ్చేశాయి. తమిళం కన్నడాలలో “మరన్”అని ఉంది. తెలుగులో మ్రాను అయ్యింది. గోది, కుయి, మాంద వీటన్నింటిలో కూడా అట్లా మారిపోయింది. అంటే, మొదటి రెండక్షరాలూ టెలిస్కో పయినాయి. మ్రాను, క్రొత్త, ప్రాత ఇలాంటి శబ్దాలు క్రీస్తుపూర్వం నుండే ఏర్పడ్డాయి. నన్నయ కాలానికే చాలా వరకూ మార్పు వచ్చేసింది.” అని వివరించారు.
     ఏది ఏమయినా ఎంత రాజకీయ చాతుర్యం ప్రదర్శించినా, కరుణానిధి పుణ్యమా అని, తమిళం వెయ్యేళ్ళ ప్రాచీన భాష గానూ, తెలుగు కన్నడాలు 2000 ఏళ్ళ ప్రాచీన భాషలుగానూ గుర్తింపు పొందాయి. నైతిక0గా తమిళులు ఈ విధంగా గొప్ప చారిత్రాత్మక తప్పిదాన్ని చేసుకున్నారు. భాషాభివృద్ధి చేయటానికి క్లాసికల్ భాష అయి ఉండాలనే నియమ౦ పెట్టడాన్ని, అ౦దుకోస౦ భాషా రాజకీయాలు నడపటాన్ని భద్రిరాజువారు, ఇష్టపడటం లేదు. ప్రమాణార్హతల రూపకల్పన విషయంలో భద్రిరాజు వారు ఇలా చెప్పారు: “నేను దీంట్లో చిన్న కిటుకు పెట్టాను,High antiquity of the early texts అనే చోట, ఇలా ఎందుకు పెట్టానంటే, తెలుగు, కన్నడం కూడా దీని కిందకు వస్తాయని! దీని కోసమే పెట్టి తరువాత వాళ్ళకి నేనొక నోట్ రాశాను. భాషా శాస్త్ర ప్రమాణాలను బట్టి, తెలుగులో మొట్టమొదటి సాహిత్య గ్రంథం ఐదు లేక ఆరు శతాబ్దాలలోనే వెలువడి ఉండాలని చెప్పాను. ఈ ప్రమాణాలలో శాస్త్రీయత ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో ముందు ఉండి ఉంటుందని నేను ఈ కమిటీ వాళ్ళకు చెప్పాను. తర్వాత ఇంకొకాయన వచ్చారు. ఒక పెద్దమనిషి-నేను పేరు చెప్పను-ఆయనొచ్చి అది అట్లా కాదండీ, తీసెయ్యాలి, మీరు రాసింది. తీసేసి 2000 సంవత్సరాల సాహిత్యం అని అనాలి-అన్నారు. నేను అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం కూడా ఈ పదాన్ని మార్చలేదు. నేను రాసింది అలానే ఉంది ఈ నాటికి కూడా” అని తదనంతర పరిణామాలను ఆయన వివరించారు. ఇక్కడ ముఖ్య విషయం ఒకటుంది. భద్రిరాజు వారు పంపిన నోట్ చాలాశక్తిమంతంగా పని చేసింది. ఆ నోట్ లో ఆయన ముఖ్య మైన 3 అంశాలను ప్రస్తావించారు.
1.      తెలుగు కన్నడం, మళయాళం మూడు భాషలూ క్లాసికల్ ప్రతిపత్తిని పొందటానికి అర్హమైనవే!
2.      సంస్కృత ప్రభావం ఉన్నది కాబట్టి తెలుగు కన్నడ మళయాళ భాషలకూ ఈ హోదాని ఇవ్వరాదనటం తప్పు. సంస్కృత ప్రభావం తమిళ భాషమీద కూడా గణనీయంగా ఉంది. తొల్కాప్య0 అంతే తొలి కావ్య0. ఇది సంస్కృత పదమే!
3.       I recommend that, besides Sanskrit, Pali, Prakrit and Tamil, the Government of India should recognize the above three languages-Telugu, Kannada and Malayalam-as classical languages. Otherwise they will be hurting the feeling of 3/4th of the speakers of the Dravidian languages.
భద్రిరాజు వారి నోట్ అందిన అనతి కాలంలోనే కేంద్రప్రభుత్వం వేగంగా స్పందించి తెలుగు కన్నడ భాషలకు క్లాసికల్ హోదాని ప్రసాదించింది. దీని వెనక జరిగిన ప్రజాపోరాటాలు, భాషోద్యమ కార్యక్రమాలు, రాజకీయ వత్తిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ, ఒక అంతర్జాతీయ భాషావేత్త గట్టి ప్రతిపాదనతోనే ఈ విజయం సాధ్యమయ్యిందనేది వాస్తవం. తెలుగుజాతి భద్రిరాజు వారిని ఉదయాన్నే తలచుకొని దణ్ణమెట్టుకోవాలి. మన కోసం, భాష కోసం ఆయన చేసిన కృషి అంతటిది.
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారి అంతర్జాతీయ స్థాయి
ప్రాచీన గురుకుల పద్ధతిలో, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ౦లో  స౦స్కృత శాఖాధిపతి ముర్రే బార్ సన్ఎమెనూ దగ్గర భద్రిరాజు వారు భాషా శాస్త్ర౦లో “Telugu verbal bases, a comparative and descriptive study”అనే అంశం పైన పి. హెచ్ డి పూర్తి చేశారు. 1962లో మా0డలిక వృత్తిపద కోశం, వ్యావసాయిక పదాల నిఘంటువులకుసంపాదకత్వం వహించారు. 1967లో “Dravidian Nasals in Brahui” అనే అంశం మీద Comparative Linguisticsభాషా శాస్త్ర విభాగంలో ఆయన వెలువరించిన వ్యాసం సంచలనం అయ్యింది. 1972 లో తిక్కన పదప్రయోగ కోశం, Brahui మాండలిక వృత్తిపదకోశం రెండవ భాగం చేనేత పదప్రయోగాలు వెలువరించారు. 1975-76 సంవత్సరంలోCentre for Advanced study in Behavior Science-Stanford University భద్రిరాజువారిని Resident fellowగా నియమి0చింది. అబ్బూరి వారి సలహా మేరకు భాషా శాస్త్ర పరిశోధన వైపు ఆయన దృష్టి మళ్ళింది.
1949-610ధ్రవిశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసరుగా 1960-61 కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం రీడరుగా, 1961-62 వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడరుగా ఆయన్ కెరీర్ ప్రారంభం అయ్యింది.
1962లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర విభాగం ఆయన తోనే ప్రారంభం అయ్యింది. దాని తొలి అధ్యక్షుడిగా ఎందరో తెలుగుభాషావేత్తలు రూపొందటానికి ఆయన కారకులయ్యారు.
1986లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రెండు మారులు పనిచేశారు.
1993 - 99 హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, 2003లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్య పదవులను నిర్వహించారు. 1967 మిచిగాన్ విశ్వవిద్యాలయం, 1967, 1970 కార్నెల్ విశ్వవిద్యాలయం, 1974లోఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయం, 1982 టోకియో విశ్వవిద్యాలయం, 1983లో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం, 1995లో టెక్సాస్ విశ్వవిద్యాలయాలలో ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.
జెర్మనీలోని లీప్జీగ్ ఇవల్యూషనరీ యాంథ్రపాలజీ సంస్థలో కూడా ఆచార్యులుగా వ్యవహరించారు.
1970లో “లింగ్విష్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా”కూ, 1980లో ద్రవిడియన్ ల్కింగ్విష్టిక్స్ అసోసియేషన్ కూ, ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు.
1975లో హవాయి విశ్వవిద్యాలయం విశిష్ట భారతీయ పరిశోధకుడి పురస్కారం అందించింది.
2004లో సాహిత్య అకాడెమీ ఫెలోగా ఆయన గౌరవం పొందారు.
1990-2002 వరకూ కేంద్ర సాహిత్య అకాడెమీ కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.
1998లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2007లో ద్రావిడ విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి.
2008లో సి పి బ్రౌన్అకాడెమీ తెలుగు భారతి తొలిపురస్కారాన్ని అందించింది.
ఆటా, తానా లాంటి సంస్థలు వీరిని పురస్కారాలతో గౌరవించాయి. 
1928 జూన్ 19 తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు లో జన్మించారు.11.8.2012 న హైదరాబాదు లో కన్నుమూశారు.