Saturday 13 January 2018

Dr. G. V. Purnachand, B.A.M.S.,: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

Dr. G. V. Purnachand, B.A.M.S.,: ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం

తెగువ యోచన: డా. జి వి పూర్ణచందు

తెగువ యోచన: డా. జి వి పూర్ణచందు
“సీ. వుండ్డుండ్డి యేమేమొ వూరకె చింత్తింత్తు
చింత్తించ్చి నాలోనె చింన్నబోదు
చింన్నబోయి యొకింత్తశేపు తెలివిగ నుంద్దు
తెలివి వ్యాళను మింమ్ము తలపువచ్చు
తలచినంత్తనె వచ్చి నిలచినట్లనె తోచు
తోచిననే దిగ్గున లేచి జూతు
జూచి వేగమె బార జాచి కౌంగిట గృత్తు
గృచ్చి కౌంగిట లేక వెచ్చనూర్తు
వెచ్చనూర్చియు తపియింత్తు వెతల నింత్తు
సఖుల గద్దింత్తు తెగువ యోచన తలంత్తు
నీదు మనసెంత్తు అంత్త నంన్నియు శమింత్తు
భవ్యగుణహారి వేణుగోపాల శౌరీ.”
పద్యం రాయటం వంట చేసినంత సులభం. ఆ మాటకొస్తే, వంట చేయటం అంత సులభమైన విషయమేమీ కాదు. ఫలానా కూర లేదా పప్పు ఎలా వండాలో తెలిసినంత మాత్రాన సరిపోదు. ప్రాక్టీసు మీద సాధించి, ఎప్పటికైనా గొప్ప వంట శాస్త్రవేత్తగా ఎదగటానికి జీవితం అంతా కష్టపడాలి!
పూర్వం రోజుల్లో పెద్దబాల శిక్షతోపాటే పద్యం వ్రాయటం ఎలాగో కూడా నేర్పేసేవాళ్లు. ఆ నేర్చుకున్న వాళ్ల పరిణతి కొద్దీ భాషాలంకారాల చేర్పులతో పద్య రచనావైభవం సిద్ధించేది. భాష బాగా రానంత మాత్రాన పద్యం వ్రాయటాన్ని మానేయ వలసిన అవసరం లేదనటానికి ఈ పద్యం ఒక తార్కాణం.
ఒక మహారాజుగారి వెంకటరాఘవు అనే వేశ్య రాసిన అపూర్వమైన ప్రేమలేఖ ఇది. దీన్ని కూడా చాటుపద్యాల జాబితాలో చేర్చవచ్చు. 'ఆంధ్రపత్రిక ' 1964-65 నాటి సంవత్సరాది ‘స్వర్ణోత్సవ సంచికలో వేమూరి విశ్వనాథశర్మ దీన్ని సేకరించి ప్రకటించారు.
పద్యం అనగానే ఇది మనకు అర్ధం కానిదనీ, మనం చదవాల్సినది కాదనీ చాలామందిలో ఒక అపోహ ఉంది. దీన్ని నేటికాలపు వచనకవితలా వాక్యాన్ని నాలుగు ముక్కలుగా విడగొట్టి నాలుగు లైన్లలో ఇప్పటి చాలామంది కవులు వ్రాస్తున్న వచన కవ్త లాగానే, వెంకట రాఘవు కూడా చక్కని వచనాన్ని పద్యంలా వండేసింది.
ఉండుండి ఏమేమో ఊరకే ఆలోచన్లు వస్తున్నాయట. ఆలోచిస్తూ తనలోనే చిన్నబోతోందట. కాసేపు మూర్ఛ పోవటం కాసేపు తెలివిలో ఉండటం జరుగుతోందట. తెలివిలో ఉన్న సమయంలో ఆయన తలపే వస్తోందట. మనసులో అనుకోగానే ఆయన వచ్చి ఎదురు నిలిచినట్టే అనిపిస్తోందట. అలా అనిపించగానే దిగ్గున లేచి చూస్తోందట. చూడగానే, చేతులు బార జాచి కౌగిట చేర్చుకోవాలని పించినట్టు, అనిపించగానే వెచ్చని కౌగిట్లో బిగించినట్టుఅనిపిస్తోందట. ఆ కౌగిలి వేడికి ఆమె ఒంట్లో తాపం పెరిగి పోయి, ఆ తాపంతో పరిచారికల్ని గద్దిస్తోందిట. రోజురోజుకూ తెగువ యోచనలు తెగ కలుగుతున్నాయట. నువ్వు వస్తేనే అన్నీ శమిస్తాయి...భవ్యగుణహారీ వేణుగోపాల శౌరీ...” అని ప్రేమలేఖ పంపింది రాజు గారికి. రాజుగారు ఐసైపోవటానికి ఇంతకన్నా భాషా పాండిత్యం అక్కర లేదు. భాషాపటిమతో వ్రాసి ఉంటే అది రాజుగారికి అర్థం కాక, బాంబు మిస్‘ఫైర్ అయ్యేది. ఏమైనా, వెంకట రాఘవు “తెగువ యోచన తలంత్తు” అన్నదే...అదే ప్రమాదకరమైనది! రాజు రాకపోతే ఈమె తెగిస్తానన్నదే ఇందులో హెచ్చరిక. అది రాజుకు అర్థం కావాలి!
పద్యంలో ఉంటే అది ఛండశాసనంలా నిఖార్సయిన సత్యం అని ఆ రోజుల్లో ఓ నమ్మకం ఉండేది. కన్యాశుల్కంలో గిరిశం మేష్టారు బుచ్చమ్మని లైన్లోకి తేవటం కోసం “ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగానున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగానున్నది. వేదంలోకూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడేవారు, వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండోపెండ్లి సాటించిన పద్యం చదువు” అంటాడు. వెంకటేశం తనకు ఆ పద్యం రాదని చెప్తాడు. “ఇంత ముఖ్యమయిన పద్యం మరచి పోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసిరాసుకో- "దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజులెల్ల దడదడవచ్చిరీ" అని పద్యంలా పాడి, “చూశావా(వెంకటేశంతో) లోకంలోవుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట.(బుచ్చమ్మవైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీదిమిక్కిలి వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై శంకరాచార్యులవారు పత్రికకూడా యిచ్చియున్నారు”అన్నాడు.
పద్యంలో చెప్పడం, పత్రికలో పడటం అనేవి సర్వ ప్రామాణికాలని ఆయాన్ ఉద్బోధిస్తాడు. నేటి వార్తాపత్రికల్లో దమయంతి రెండో పెళ్లి లాంటి వార్తలే ఎక్కువగా ఉండవచ్చు గాక, పద్యంలో ఉంటే, అది పత్రికలో పడ్డంత నిజం.
వెంకట రాఘవు కథ చివరికి సుఖాంతమే! సందేహం లేదు. గిరీశం కథని మాత్రం గురజాడ అడ్డంగా తిప్పాడు. చరిత్రలో పద్యాన్ని సొమ్ము చేసుకున్న వాళ్లలో మొన్నటి వెంకటరాఘవు అనే వేశ్య, నిన్నటి గిరీశం అనే జారుడు మనిషి... వీళ్లని మించినాళ్లు లేరు. పద్యం చదివినందువలన కోరిన లాభం చేకూరితే అది ఆస్తికం. ఉత్త కంఠశోషే మిగిలితే అది నాస్తికం అని కవుల్లో ఒక వ్యవహారం ఉంది. తెలుగు సాహిత్యం నాస్తికంగానే ఉండిపోతోందంటే వెంకట రాఘవుకు దొరికిన రాజు లాంటివాడు దొరక్కపోవటమే కారణం!
అయినా సరే, ప్రభువులకు అర్జీల్ని ఇలా పద్యాల్లో వ్రాస్తే త్వరగా పనులౌతాయని వెంకట రాఘవుని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తున్నారా? “అంతా కవులము గామా
అంతింతో కంద పద్య మల్లగ లేమా” అనుకుంటూన్నారా? మీ ఇష్టం. “తెగువ యోచన” చేయాలి కదా!

ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆవిర్భావం