Sunday 20 November 2016

నోట్ల రద్దు:: డా. జి వి పూర్ణచందు

నోట్ల రద్దు:: డా. జి వి పూర్ణచందు
అదను దలంచి కూర్చి ప్రజనాదర మొప్ప విభుండు కోరినన్
గదిసి పదార్ధ మిత్తు రటు కానక వేగమె కొట్టి తెండనన్
మొదటికి మోసమౌఁ బొదుగు మూలము గోసిన బాలు వచ్చునే
పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా !
సూర్యుణ్ణి దేవుడిగా భావించి మయూరుడు సూర్య శతకం వ్రాస్తే, సూర్య వరప్రసాదియైన మారవి వెంకయ్య కవి ‘భాస్కరా’ అనే మకుటంతో భాస్కరశతకాన్ని వ్రాశాడు. 1550-1650 కాలంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, ప్రాంతాల్లో నివశించిన ఈ కళింగ కవి అరసవిల్లి సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ భాస్కర శతకం వ్రాశాడు. 
“భాస్కరా ! రాజు ప్రజారంజకుడైతే, ప్రజలు డబ్బు అడిగినా ఉదారంగా ఇచ్చే స్తారు. అట్లా కాకుండా వాళ్లని కొట్టి తెమ్మని పీడిస్తే మొదటికే మోసం వస్తుంది. పశువుల పొదుగు పిదికితే పాలు వస్తాయి. పొదుగు కోస్తే రావు” అంటాడి పద్యంలో కవి. 
ప్రజల అవసరాల కొద్దీ ప్రభువు పాలిస్తుంటే, ఆ ప్రభుత్వ ప్రయోజనాలకోసం ప్రజలు కష్టాలు భరించి సహకరిస్తారు. “నేను అర్థరాత్రి నిర్ణయం తీసుకున్నాను. దీనివలన ప్రజలారా! మీకు కష్టాలు కలుగుతాయి. భరించి సహకరించండి... అని ఏ రాజు గారైనా అంటే ఆయన పాలన ప్రజారంజకం అయినప్పుడు ప్రజలు కొన్నాళ్ళు తప్పకుండా భరిస్తారు. సహకరిస్తారు! 
రైలురేట్లు ఘనంగా పెంచిన ఒక రైల్వే మంత్రిగారు అదేమిటండీ అనడిగిన వాళ్ళని, “మీకు రైల్వేలు బాగు పడాలని లేదా?, దేశం బాగు పడాలని లేదా?” అనడిగితే, ప్రజలు భరించారు. ప్రభుత్వ భాషలో సహకరించారు. ప్రజలు సహక రించడం అంటే ఏమిటీ...? వేసిన పన్నుల్నీ, పెంచిన రేట్లనీ, చేసిన తప్పుల్నీ ఔదల దాల్చటం. కుయ్యో మొర్రో అని మూలక్కుండా బాధే సౌఖ్యమనే భావనలో జీవించటం ....అంతేకదా! 
రేట్లు పెంచినా ప్రజలు రైళ్ళెక్కుతున్నారు కాబట్టి, ప్రజలు ఆమోదించి సహకరించినట్టే! నోట్లు రద్దు చేసినా బ్యాంకు వాళ్ళ ఛీత్కారాలను భరిస్తూ క్యూలో నిలబడి వంటా వార్పు మానుకుంటున్నారు. కాబట్టి, ప్రజల ఆమోదానికి, మోదానికి అది సంకేతంగా ప్రభువులు భావిస్తారు. 
పంచాంగ ముహూర్తం ప్రకారం స్వాతంత్ర్యం అర్ధరాత్రి వచ్చిందే గానీ, నిర్ణయం అర్ధరాత్రి తీసుకున్నది కాదు. నోట్ల రద్దూ అంతే! అది సరికొత్త అద్భుత ప్రయోగం కూడా కాదు. 1973లో జనతాపార్టీ పెద్దనోట్ల రద్దు ప్రయోగం చేసింది. కానీ, దాని ఫలితాల మీద విశ్లేషణ లేదు. అ అనుభవాన్ని పరిగణనలోకి ఈ ప్రభుత్వం తీసుకున్నట్టు, అప్పటికన్నా ఇది ఏ విధంగా మెరుగైనదో తెలీదు. ఇప్పుడు పాతనోట్లు పోయి కొత్త నోట్లు అంతకన్నా పెద్ద డినామినేషన్లో వస్తున్నాయి. ఇవి నల్లబాబుల చేతుల్లో నలక్కుండా నేలమాళిగల్లోకి చేరవన్న హామీ ప్రభుత్వం అధికారికంగా ఇవ్వలేదు. 
1968-నూజివీడు హైస్కూల్లో చదువుకునే రోజుల్లో మహాకవి దుర్గానంద్ గారితో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. వారబ్బాయి అంబికానాథ్ నా సహాధ్యాయి. అంతర్గోళాలు, చిరంతన, భీతాంగన లాంటి రచనలు చేశారాయన. చిరంతన ఖండకృతి వ్రాస్తున్నప్పుడు వారిదగ్గరే ఉన్నాను. నాలో సాహిత్య పిపాస కలగటానికి ఆయన ప్రథమ కారకుడు. 
అద్భుతమైన సిద్ధాంతాలు అనేకం ప్రతిపాదించేవారాయన. అవి కనీసం యాబై యేళ్ళ తరువాత గానీ జనానికి అర్ధం కానివిగా ఉండేవి. 1960ల్లోనే ఆయన ‘డేటెడ్ కరెన్సీ’ ఉండాలని, నల్లధనాన్ని అరికట్టాలంటే అది చాలా అవసరం అనీ వ్రాశారు. ఆయన సూచించిన పద్ధతిలో మూడేళ్ళ వరకే ఈ నోట్లు చెల్లుతాయని, 1920 వరకే చెల్లుబాటు అని ఎక్స్‘పైరీతేదీతో నోట్లను ముద్రించి జనవరి 1 నుండీ అమల్లోకి తెస్తే సామాన్యుడికి ఇబ్బంది కలగని రీతిలో తీవ్రవాదుల దగ్గర దొంగ నోట్ల చెలామణీని అరికట్టగలిగి ఉండేవారు. మూడేళ్ళకు మించి డబ్బుని ఎవరూ నేలమాళిగల్లో నిలవచేసే అవకాశం ఉండదు. 
యూపీ, పంజాబు ఎన్నికలయ్యాక, ఈ నోట్ల రద్దు నిర్ణయం వలన దేశానికి ఆర్ధికంగా ఇంత ఆర్ధిక ప్రయోజనం కలిగిం దని ప్రధాని ప్రెఅకటిస్తే, ప్రజలు కష్టాలు పడినందుకు ఫలితం దక్కింది లెమ్మని సంతోషిస్తారు. భాస్కర శతక కర్త కూడా తనమాట నిజమైందని సంతోషిస్తాడు.
గేదె పాలిచ్చినంత సేపూ అది తన మహిమే నంటాడు. దాని పొదుగు కూడా కోయాలని చూసిన రోజు పాడిగేదె తన ప్రతాపం చూపిస్తుంది. అందాకా భూమాతలా భరిస్తుంది. 
దేశంలో నల్లబాబులెవరో చిన్న పిల్లవాణ్ణడిగినా చెప్తారని ప్రధానే స్వయంగా అన్నారు. ఆ నల్లబాబులు 2017లో కూడా అధిక ధనవంతుల జాబితాలో కొనసాగితే, మన నాయకులంతా ఇదే పద్ధతిలో ధన రాజకీయాలు కొనసాగిస్తే, యథాప్రకారం కొండచిలువ మాదిరి రేట్లు పెరుగుతూ పోతుంటే, నోట్ల రద్దు అనేది కొత్త మిలీనియంలో పెద్ద ప్రహసనమే అవుతుంది.

Thursday 13 October 2016

కుదురు దారి :: డా. జి వి పూర్ణచందు

కుదురు దారి 
డా. జి వి పూర్ణచందు

సరిగా తెనుగు నేర్పు చక్కని యేర్పాటు నాటలేదటంచు కనంగ వలయు,
ఎల్లపల్కులకును తల్లి సంస్కృతమనుకొనుట తప్పని కనుగొనవలయు,
తెనుఁగు పుట్టును గుట్టు తెలిసికో, తెన్‘పల్కులెన్నొ కావలెనని యెఱుఁగ వలయు,
అవి నేర్చుకొనుటకు అనువగు తెరవులు కని, తెల్వి హెచ్చించుకొనగ వలయు,
ప్రాకృతము బాగుగా చదువంగవలయు
మదివిరియఁజేయ ఇంగ్లీషు చదువవలయు
తగిన పొత్తంబులన్ వ్రాసి తనర వలయు
ఇదియె తెనుఁగుతల్లిని కొల్చు కుదురుదారి

మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు కృష్ణాతీరంలో పుట్టి విశాఖ తీరంలో ‘కవిగారు’గా ప్రసిద్ధులైన తెలుగు భాషాభిమాని. భాషోద్యమ ప్రవర్తకుడు. తెలుగు వాళ్ళు ఆంగ్లాన్ని, సంస్కృతాన్ని బాగా చదవాలి. కానీ, వాళ్ళు ఆంగ్లమానస పుత్రులో సంస్కృత మానస పుత్రులో కాకూడదని, తెలుగుని స్వతంత్రభాషగా గుర్తించి, గౌరవించి తెలుగు పుత్రులుగా వెలగాలని చాటిన ఉద్యమ శీలి ఆయన

తెలుగు భాష దేశంలో రెంవ పెద్దభాష. హిందీ తరువాత దేశంలో ఎక్కువమంది ఈ భాషను మాట్లాడుతున్నారు. సంస్కృతం ఇంగ్లీషు ఇంకా ఇతరభాషలను తేలికగా ఇముడ్చుకోగల సౌలభ్యం ఈ భాషకు ఉంది. ఏ భాషా పదాన్నయినా దాని ఉచ్చారణను తెలుగులో వ్రాయగలిగే అనువు తెలుగు భాషకుంది. కాబట్టి, దీన్ని మహాభాషల్లో చేర్చాలని మొట్టమొదటిసారిగా కోరిన వ్యక్తి శ్రీ కవిగారు. వాడుక భాషకు గిడుగు చేసిన సేవ ఎంతటిదో అసలైన తెలుగు భాషకోసం, దాని విరివి(వికాసం) కోసం, దాని ‘కావలి’ కోసం కవిగారు చేసిన కృషి కూడా అంతటిది.

మనం ఆంధ్రులం, తెలుగు వాళ్ళం అనుకుంటున్నాం గానీ మనలో ఆంధ్రత్వం, తెలుగుతనం కొరవడుతోంది. పేర్లలోనూ పలుకులోనూ, సంతకాల్లోనూ, ఆహార పానీయాల్లోనూ తెలుగుతనం పోతోంది. పండుగలు పబ్బాల్లోంచి తెలుగుతనంమాయమై పోయింది. చదువుల్లో తెలుగు ఎప్పుడో పోయింది. పాలనలో తెలుగు అసలు చేరనే లేదు. వీధుల్లో బడ్డీకొట్లలో కూడా ఇంగ్లీషు లోనే ‘తెలుగుతాంబూలాలు’ అమ్ముకుంటూన్నారు. పూటకూళ్ళ అయ్యలు అన్నాన్ని ‘రైసు’ అంటేనే జనం తింటున్నారని చెప్తున్నారు. అమ్మలు ‘మమ్మీ’లయ్యారు. 1930ల లోనే ఈ పరిస్థితి దాపురిస్తోందని వాపోయిన వ్యక్తి ‘కవిగారు’.
రోజువారీగా మనం మాట్లాడే మాటల్లో ఇంగ్లీషు, సంస్కృతాలను వదిలేస్తే మిగిలే తెలుగు తక్కువ. బస్సు రోడ్డున స్పీడు గా పోతోంది అనే 4 మాటల వాక్యంలో బస్సు, రోడ్డు, స్పీడు మూడూ పోతే, పోతోంది ఒక్కటే తెలుగు. అది కూడా ఎప్పుడు పోతుందో తెలీదు. కవిగారు వీలైనంత వరకు సంస్కృతం లేదా ఇంగ్లీషు లేకుండా తెలుగు మాట్లాడటం, వ్రాయటం గురించి విశేష కృషి, ప్రచారం చేశారు.

కవి గారు వ్రాసిన ఈ పద్యం వ్యాఖ్యానం అవసరం లేని తేటతెలుగులో ఉంది. “సరిగా తెనుగు నేర్పే చక్కని యేర్పాటు ఈ రోజుల్లో లేదు. ఎల్ల పలుకులకీ అంటే భాషలకీ తల్లి సంస్కృతమే అనటం తప్పు. తెలుగు పుట్టు గుట్టు తెలుసుకోండి.తెలుగు లో ఉన్న సంస్కృత మాటలు తెన్ పల్కులే (తెలుగు మాటలే) కావచ్చేమో పరిశోధించి కనుక్కోండి. చక్కని తెలుగు మాటల్ని నేర్చుకోవటానికి అనువైన తెరవులు అంటే పద్ధతులు తెలుసుకుని తెలివి పెంచుకోండి. ప్రాకృతాన్ని బాగా చదవండి. ఆ భాషలో అచ్చతెలుగుపదాలు అనేకం కన్పిస్తాయి. మనో వికాసం కోసం ఇంగ్లీషు కూడా నేర్చుకోండి. చక్కటి తెలుగులో మంచి పొత్తాలు (పుస్తకాలు) వ్రాసి గొప్పవాళ్ళు కండి. ఇదే తెలుగుతల్లిని కొలిచే కుదురు దారి” అంటారు `కవిగారు'.

తెలుగు భాష సంస్కృతం లోంచి పుట్టిందనే వాదాన్ని ఆయన ఒప్పలేదు. సంస్కృతం, తెలుగు అక్కచెల్లెళ్ళే గానీ అమ్మాకూతుళ్ళు కారని, తెలుగులో కనిపించే చాలా సంస్కృతం మాటలు తెలుగు పదాలే కావచ్చని, అవి తెలుగులోంచి సంస్కృతంలోకి వెళ్ళినవి కావచ్చని ఆయన గట్టిగా నమ్మారు. తెలుగు భాషని తెలుగు వాళ్ళకీ, తెలుగేతరులక్కూడా చక్కగా నేర్పేవాళ్ళు లేరని అభిప్రాయపడ్డారు. నిజమే! ఒక విదేశీయుడికి తెలుగు ఎలా నేర్పాలో మన పండితుల్లో ఎంతమందికి తెలుసు?

తెలుగు నేర్చుకుంటే తెలివి పెరుగుతుందనీ, ఇంగ్లీషు నేర్చుకుంటే మనో వికాసం కూడా కలుగుతుందనీ 80 యేళ్ళ క్రితం చాటిన మారేపల్లి రామచంద్ర శాస్త్రిగారిని సముచిత రీతిలో గౌరవించుకోవటం మన ధర్మం. భాషాభివృద్ధికి కృషి చేసే వ్యక్తులకు ఆయన పేరుతో ప్రభుత్వం పురస్కారం ప్రకటిస్తే భాషను, భాషోద్యమాన్నీ గౌరవించుకొన్నట్టు అవుతుంది.

Tuesday 11 October 2016

కస్తూరి రంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు అల్లూరి వేంకటాద్రిస్వామి :: డా. జి. వి. పూర్ణచందు

కస్తూరి రంగని తెలుగింట నిలిపిన వాగ్గేయకారుడు
అల్లూరి వేంకటాద్రిస్వామి
డా. జి. వి. పూర్ణచందు

‘అమరము నాంధ్రము కావ్యము’ అంటూ, ఆంధ్ర భాష కూడా దేవభాషేనన్న వాగ్గేయకారుడు శ్రీమాన్ అల్లూరు వేంకటాద్రిస్వామి- తిరువరసుగానూ, శ్రీమత్ పరమహంస తిరువేంగడ రామానుజ జియరుగానూ వైష్ణవ భక్తకోటిలో ప్రసిద్ధుడు. హరికథాగానానికి విశిష్టత తెచ్చినవాడు. భద్రాచల రామదాసు పరంపరకు చెందిన కవి ఆయన.
“యేమయ్యా రామయ్యా” అని పరమాత్ముణ్ణి ప్రాణ స్నేహితుడిలా సంభావించిన వాడాయన. శ్రీరంగం రంగనాథస్వామిని కస్తూరి రంగయ్యగా తెలుగింట నిలిపాడు. ‘కస్తూరిరంగయ్య, కరుణింపవయ్య, సుస్థిరముగ నమ్మితి నయ్య’ అనే హరికీర్తన వీరిదే!
“పరాకు సేయుట, పాడిగాదురా పరమపురుష వరదా” పాట హరిదాసుల నోట వినిపిస్తూనే అంటుంది.
‘బిరాన బ్రోవక నిరాకరించుట బిరుదు నీకు దగురా-వరదా’ అని ప్రశ్నిస్తాడు ప్రభువును.
వేంకటాద్రి స్వామి శిష్యవర్గ ప్రసిద్ధుల్లో శ్రీ కట్టా రామదాసు, ఆయన శిష్యుడు సిద్ధాంతం నంబి, ఆ నంబి గారి శిష్యుడు బుక్కపట్టణం తిరువేంగడదాసు...ఇలా వీరి శిష్యపరంపర తమిళనాట కొనసాగుతోంది. పెరంబూరులో ‘అల్లూరి వెంకటాద్రి స్వామి భక్తజనసభ’ పనిచేస్తోంది. ‘శ్రీమాన్ అల్లూరి వెంకటాద్రి స్వామి దేవాలయ భక్తకోటి సంఘం’ శ్రీరంగంలో ఏటా వెంకటాద్రిస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తోంది.
1955లో గానకళాప్రపూర్ణ శ్రీ వింజమూరి వరదరాజ అయ్యంగార్ పాడిన వీరి కీర్తనలు మద్రాసు, హైదరాబాదు కేంద్రాల నుంచి భక్తి రంజని రేడియో కార్యక్రమంలో ప్రసారం అయ్యేవి. విజయవాడ రేడియో కేంద్రంలో శ్రీరంగం గోపాలరత్నం గారు పాడినపాటల సి డి దొరుకుతోంది.
క్రీస్తు శకం 1807లో అక్షయనామ సంవత్సర ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సోమవారాన ఈనాటి కృష్ణాజిల్లా, ఆనాటి నైజాం రాజ్యంలోని పరిటాల పక్కన అల్లూరి గ్రామ అగ్రహారంలో ఈయన జన్మించారు. శ్రీవత్స గోత్రీకుడు. తండ్రి వేంకయ, తల్లి వేంకమ. ప్రక్కనే ఉన్న జుజ్జూరు గ్రామం లోని నృసింహ దేవాలయంలో ఈయన తపోదీక్షలో ఉండేవాడు. భద్రాచలం నుంచి తిరిగి వస్తూ దారిలో ఆగిన తూము నరసింహ దాసు ఈయనకు తన తంబురా, గజ్జెలు, కరతాళాలు మెచ్చిఇచ్చి ఆశీర్వదించాడు.
ఈ సంఘటన తరువాత వెంకటాద్రి స్వామి పరమ వైష్ణవుడిగా మారిపోయాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళి, అక్కడి నుంచి భక్తజనంతో కలిసి కంచి చేరి అక్కడే స్థిరపడిపోయాడు.
ఆరోజుల్లో వైష్ణవ భక్తుల జీవిత కథలన్నీఇలా కంచికే చేరేవి.
‘శ్రీ వేంకటాద్రిస్వామి హరినామ కీర్తనలు’ పేరుతో 1955లో వావిళ్ళవారి పుస్తకం వెలువడింది. 170కి పైగా కీర్తనలు ఇందులో ఉన్నాయి. అందులో ఆయన జీవిత చరిత్ర కూడా సంక్షిప్తంగా ఉంది. 1972లో ఆర్ వెంకటేశ్వర్ సంకలనం చేసిన ‘శ్రీ వేంకటాద్రిస్వామి కీర్తనలు’ పుస్తకాన్ని కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం 2009లో డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్ ఓపెన్ లైబ్రరిలో (ఓఎల్.5402127M) ఉంచింది. 1930 లలో ఆయన జీవిత చరిత్ర పుస్తకం కూడా తమిళంలో వెలువడింది.
శ్రీ పి సాంబమూర్తి ‘సౌత్ ఇండియన్ మ్యూజిక్’ పరిశోథనాగ్రంథంలో వీరి కొన్ని వివరాలున్నాయి. మద్రాసు మూడువందల సంవత్సరాల జ్ఞాపక సంచికలో ఈయన నివాసం ట్రిప్లికేన్ అని అంది.
ఆచార్య బిరుదురాజు రామరాజు గారు ‘ఆంధ్రయోగులు’ గ్రంథంలో ప్రచురించిన వ్యాసంలో వేంకటాద్రిస్వామికి పాము పడగ పట్టటం, సీతారాములు కలలో కనిపించటం లాంటి కథలున్నాయి, కృష్ణాజిల్లా జుజ్జూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఈయన బాల్యం అంతా గడిచినట్టు కనిపిస్తుంది.
జుజ్జూరులో కొండపైన విగ్రహం స్వయంభువుకాగా, దానికి కొంచెం దిగువున యోగానంద నరసింహస్వామి గుడి అంది. 14-07-1818న పదేళ్ళ వయసులో ఉన్న వేంకటాద్రి స్వామికి తూము నరసింహదాసు తన తంబురా, కరతాళాలు అందించాడు. ఈ తాళాలు, తంబూర... చెన్నై ముత్యాలపేట గజేంద్రవరద మందిరంలో భద్రంగా ఉన్నాయని రామరాజుగారు పేర్కొన్నారు.
29-1-1820 న తన 13 వ ఏట ఎవ్వరికీ చెప్పకుండా భద్రాచలం వెళ్ళిపోయాడు. నాలుగేళ్ళపాటు అక్కడ రామనామ సంకీర్తన చేస్తూ, తూము వారిచ్చిన తంబురా, కరతాళాలకు అదనంగా కాళ్ళకు గజ్జెలు కట్టి ఆడి పాడటం అలవాటు చేసుకొన్నాడు.
“తంబురు తాళము చేత ధరియించి వేడుక మీఱ గంభీరముగా కాళ్ళగజ్జలు ఘలుఘలుఘలుఘల్లని మ్రోయగ, పరమ భక్తులను గూడి వేడుకను భజన చేసి పరవశము జె0దుచు” అంటూ తన హరికథాగాన విధానం గురించి చెప్పుకున్నాడు.
వరదరాజ స్వామి పుష్ప కైంకర్యానికి పూలతోట పెంచటం కోసం తన ఆటని, పాటని ఉపయోగించుకొని డబ్బు సంపాదించటానికి వీధులలో బిచ్చమెత్తడంతో కంచిలో ఆయన జీవితం ప్రారంభమయ్యింది. ఇది 1828 నాటి సంగతి. అప్పటికి ఆయన వయసు 20 ఏళ్ళు!
పది రూపాయలైనా కళ్ళచూడనిదే భోజనం చేయకూడదనే నియమం పెట్టు కొన్నాడు. కంచిలో ఇంటింటికి తిరిగి తాను రచించిన కృతులు పాడుకుంటూ, హరికథలు చెప్పుకుంటూ ప్రాచుర్యాన్ని పొందాడు.
దేశ సంచారం ప్రారంభించి, అనేక వేల రూపాయలు భగవంతుని పేర సేకరించి కాంచీపురంలో దేవీ దేవులకు రెండు పుష్పవనాలు, శ్రీచందనం, శయ్యాగృహంలో చిక్కని పాలు, జున్ను, పరిమళ విడియం మొదలయిన కైంకర్యాలు ఏర్పాటు చేశాడు. గోపురాన్నీ, మంటపాన్నీ, ఇంకా కంచి నగరంలో వైష్ణవ దివ్య క్షేత్రాలన్నింటినీ జీర్ణోద్ధరణ చేయించాడు. మహాబలిపురం లోని గుడిని కూడా బాగుచేయించాడు.
ఆరాధనాది కార్యక్రమాల కోసం, రూ. 5,000 పెట్టి మామండూరిలో ఒక స్థలాన్ని కొని దేవాలయానికి సమర్పించాడు. కంచి వరదరాజ స్వామి కోసం రత్నాలు పొదిగిన వైరముడిని చేయించి, గరుడోత్సవ సమయంలో అలంకరించే ఏర్పాటు చేశాడు. అమ్మవారికి స్వామివారికీ నవరత్న కిరీటాలు చేయించాడు.
శ్రీరంగం రంగనాథ స్వామి పాండియకుండె అనే దివ్యకిరీటాన్ని తనకు చేయించమని కలలో చెప్పగా, నిద్ర లేస్తూనే ఆ పని మీద బయలుదేరి, బంగారాన్ని, రత్నాలనూ సేకరించటంలో పడ్డాడు. మరకతం ఒక్కటీ దొరకక చింతాక్రాంతుడై ఉంటే మళ్ళీ స్వామి కలలో కనిపించి, బంగ్లాదేశంలో మాధవదాసు అనే ఆయన ఇంట మరకతం తన కోసమే అందనటంతో మాధవదాసుని కలుసుకొని మరకతం తెచ్చి కిరీటం పూర్తి చేయించాడు. రంగనాథుడికి రెండు కిరీటాలు, ఒక మకరకంఠి కూడా చేయించాడు. తిరుప్పళాతురై ఊరుని కొని, దానిని స్వామివారికి నిత్య నైవేద్యాలకోసం సమర్పించాడు.
ఆముక్తమాల్యద కావ్యంలొ ప్రసిద్ధమైన శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవికి అలంకరించే కిరీటం అమ్మవారి కోరిక మీద వీరు చేయించినదేనట! మాన్య మిత్రులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి, అల్లూరి వారు చేయించిన అమ్మవారి వైరముడి కిరీటం చూపించమని అడిగితే పురోహితులు అమ్మవారికి అలంకరించినది అదేనని చెప్పారు.
మదురై దగ్గర ‘తిరుమాలిరుంశోలై’ అనే గ్రామంలో సుందరరాజ స్వామిగుడి విమానాన్ని ఆ స్వామి కోరికమీద నిర్మింప చేసినట్టు ఈయన జీవితగాథ చెప్తోంది.
బహుశా ఒక సంస్థానాధీశుని యావదాస్తీ చాలనంత పెద్ద మొత్తాన్ని వైష్ణవ దేవాలయాల కోసం ఖర్చుచేశాడు. వీరి శిష్యుడు అన్నలూరి నారాయణదాసు ‘రత్నఖచిత మకుటాది విభూషణ రంగనాథ కై0కర్య ధురీణ’ అని గురువుని కీర్తించాడు. ఒక అతిసామాన్యుడు తన నిజాయితీతో ఎంతటి ఘనకార్యాన్నయినా సాధించ గలడని నిరూపించగలిగాడు వేంకటాద్రిస్వామి. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఆయన వ్యవహరించ గలగటం వలనే ఈ విజయాలు సాధ్యం అయినాయి.
ఆచార్య బిరుదురాజు వారు వేంకటాద్రిస్వామి గురించి ఒక మహిమను చెప్పారు. ఒక రోజు కేవలం 5 రూపాయలే వచ్చిందని భోజనం చెయకుండా అండిపోతే, అప్పస్వామిరాజు అనే ఆంతరంగికుడు గొడుగు పట్టగా ఇద్దరూ కలిసి వీధుల్లో హరినామ సంకీర్తన చేస్తూ తిరిగి ఇంకొక ఐదు రూపాయలు సంపాదించాక స్వామిని ఇంటి దగ్గర దిగవిడిచి అప్పస్వామిరాజు వెళ్ళిపోయాడట. ఆ సాయంకాలం అప్పస్వామి రాజు గారింట్లో భజన కోసం వెంకటాద్రి స్వామి వేడితే అప్పటికి నాలుగైదు రోజులుగా రాజుగారు మంచాన ఉన్నాడని తెలిసింది. మరి ఆ వేంకటాద్రి స్వామికి గొడుగు పట్టిందెవరు... ?ఊరంతా చూసిన దృశ్యం కదా అది?
ఆయన సంపాదించిన ధనం అంతా ఇలా యాచనద్వారానే అయినా ‘ధనమదాంధుల ద్వారము దూరక కడు ధన్యుడనై నే నుండెదను’ అనటంలోని లోతయిన భావాన్ని అర్థం చేసుకో గలగాలి.
“జాలిజెంది జనుల-బేలనైయాచించి, చాల నలసి సొలసితి-నీవేగతి” అని చెప్పుకుంటాడు.
“కాసు చేయని ఖలులకెల్ల, దోసిలొగ్గి వేసారితి” నంటాడు.
“కుచ్చిత మనుజుల కొలువు గొలువబోను/అచ్యుతుని దాస్యసుఖమనుభవించెదను” అని ప్రకటించుకున్నాడు.
తన జీవిత చరమాంకంలో ప్రియశిష్యుడు అన్నలూరి నారాయణదాసుకు తన తంబూర, గజ్జెలు, కరతాళాలు బహూకరించి తన కృషిని కొనసాగించవలసిందిగా కొరాడట . శ్రీ రంగనారాయణ జియ్యర్ గారి సన్నిథిలో సన్యసించి, తిరువేంగడ రామానుజ జియ్యరుగా మారారు. 1877లో సిద్ధిపొందారు. కొళ్ళడం గట్టున శ్రీ ‘అళవందార్ పడుత్తురై’ అనే సన్నిథి స్థలంలో వారి తిరుప్పల్లి (సమాధి) జరిగింది.
శ్రీ అల్లూరి వెంకటాద్రిస్వామి కీర్తనలు పేరుతో ఆయన శిష్యపరంపరకు చెందిన శ్రీ పుష్పాలరామదాసు ఒక పుస్తకాన్ని ప్రచురించాడు. ఇందులో వావిళ్ళవారి ప్రతిలో లేని కీర్తనలు, కొన్ని కందపద్యాలు కూడా ఉన్నాయి. అందులో వేంకటాద్రిస్వామి రేఖా చిత్రం కూడా అంది. శ్రీమదాంధ్ర భక్త విజయము అనే గ్రంథంలో వేంకటాద్రిస్వామి జీవిత చరిత్ర కొంత ఉంది. వావిళ్ళ ప్రతికి అదనంగా ఆయన ప్రదర్శించిన కొన్ని మహిమలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఆయనే పంపించారు. ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
ఒంగోలు దగ్గర నూనెవారి పాలెంలో గుడికి రథం చేయించటం కోసం ఇనుప ఊచలు, కర్ర దుంగలను ఖరీదు చేసి, మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషనుకు స్వయంగా ఆయనే తెచ్చారట. కానీ, సమయం లేదని దుంగలు ఎక్కించుకోకుండానే రైలు బయలు దేరితే, వేంకటాద్రిస్వామి ఎలా వెళ్ళగలవన్నట్టు చూశారని, రైలు అకారణంగా ఆగిపోయి, దుంగలన్నీ ఎక్కించుకౌన్నాకే కదిలిందనీ, కానీ, ఆలశ్యం కాకుండా, సరిగ్గా సమయానికే గమ్యస్థానానికి చేరిందని ఒక కథ ఇందులో అంది..
‘ఇంచుకైన దయరాద-యిభరాజవరద’,
‘సజల జలదగాత్రా-సరసిజ నేత్రా-నిజమని నీపదభజన జేసెదు వరద’,
‘ఇంత పంత మేల నాతో నిందిరా రమణా’,
‘నామస్మరణ సేయుడీ జనులార-హరినామ స్మరణ’ ఇలాంటి వీరి కీర్తనలు చదువుకోవటానిక్కూడా మనోహరంగా ఉన్నాయి.
‘దుద్దుపెట్టి నీవు దూరాన యుండక –పద్దులీడేర్చు నీపాల బడితినిక’ ‘ముద్దుపదములందు మువ్వలు గదలగ’ లాంటి చరణాలు ఆయన సాహితీ వైదుష్యాన్ని తెలియచేస్తాయి.
‘ధనమదాంధుల చేరువ జేరక కడు ధన్యుడ నయ్యేదెన్నటికో....” లాంటి పలుకులు చదువుతున్నప్పుడు దేవాలయాల అభివృద్ధికి ధన సేకరణ కొసం ఆయన ఎన్ని అవమానాలు భరించి ఉంటాడో ననిపిస్తుంది.
‘ఇంచుకైన యాది లేదా?’అనే ప్రయోగాన్ని 150 ఏళ్ళక్రితం తమిళ దేశంలోనే జీవితం అంతా గడిపిన వ్యక్తి చేయటం విశేషమే!
“నె0జిలిపడనేల, నిరతము శ్రీపతి మంజులమగు దివ్య మంత్రరాజముగల్గ” అనే అనుపల్లవిలో ‘నె0జిలి’ అంటే ఆందోళన. నీల జీమూతవర్ణ0 అనేది రంగుల్లొ తేడాలను గుర్తి0చటానికి ఉపయోగపడే ప్రయోగం.
‘గట్టి మనసు’ ‘మోడిచేయటం’, ‘వలరాజుకాక’ లాంటి చక్కనితెలుగు పదప్రయోగాలు ఈయన కీర్తనల్లో కనిపిస్తాయి.
“చందురుగేరుమోమందముతో నీ మందహాసము గనుగొ0దు రారా” “దండిపాతకముల నెల్ల మెండుగాను జేసినట్టి దుండగీడనైన నా నెండ యెవరు లెరు తండ్రి”
“నీకే మరులుకుంటిరా నిగమగోచరా”
“ఘోర భవాంబుధి గొబ్బున దాటెడు నెరుపు గని మనవే ఓ మనసా!” “రంగుగ దాసుల రక్షించెడు శ్రీ రంగని మఱచిన దొంగ జనములు”
“దుద్దుబెట్టి నీవు దూరాన యుండక పద్దులీడేర్చు నీ పాల బడితినిక”
“కుదురుగ గూర్చుండి-గోవింద యనగనే”
“ఒప్పులకుప్ప రారా, నే జెసిన తప్పులెన్నకు ధీరా”
“పా0చాలి పరులచే బాధల బడగానె అంచితముగ నీ వక్షయమనలెద?”
“అంతరంగ భక్తమానసంతరంగమందు నేకాంతుడై యున్నవాడు-రంతులేలపోరే మీరు” ఇలాంటి జాను తెనుగు పదాలు చదువుతుంటే మనసు పులకరిస్తుంది.
“అవ్వచద్దిరొట్టె యానబాలు వెన్న, యారగింతువు రంగ మెలుకో” అనే చరణంలో. ఆనబాలు అంటే, నీళ్ళు ఇగిరేంత చిక్కగా కాచిన పాలు అని అర్థం. అవ్వ, చద్ది, రొట్టే అనేవి మూడు వేర్వేరు వంటకాలు. అవ్వ అంటే అవ్వం అనే ప్రసాదం. చద్ది అంటే చలిది అన్నం. తాలింపు పెట్టకుండా చల్ల కలిపిన అన్నం. రొట్టె అంటే పెద్ద పరిమాణంలో వేసిన దిబ్బరొట్టే లాంటి ప్రసాదం. ఈ మూడింటినీ కలిపి అవ్వచద్దిరొట్టెగా ఆయన వ్యవహరించి ఉండవచ్చు.
భావకవులకు పదలాలిత్యం నేర్పిన కవి అల్లూరి వేంకటాద్రిస్వామి. ఆయనను కేవల మహా భక్తుడిగానే చూడటం వలన ఆయన సంగీత సాహిత్య జీవితాలు మరుగున పడిపోయాయి.
ఆయన 1877 వరకూ జీవించే ఉన్నారు. అంతకు రెండుమూడేళ్ళ వరకూ సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు. ఆయన్ని తెలుగు సాహితీ వేత్తలు అంత త్వరగా ఎలా మరిచిపోయారో ఆశ్చర్యమే!
సంగీతవేత్తలు సరేసరి. అకాశవాణి, వావిళ్ళ వారు పూనుకొనక పోయి అంటే, అల్లూరి వారి కీర్తనలు, అన్నమయ్య కీర్తనల్లాగే అనేక శతాబ్దాలు మూలపడి ఉండేవి. అంతటి వాగ్గేయకారుని మరిచిపోగలగటం విశ్వాంతరాళంలో ఒక్క తెలుగువారికే సాధ్యమని మరోసారి ఋజువయ్యింది.

Wednesday 5 October 2016

రాత్రి డ్యూటీలు జాగ్రత్తలు

5-10-2016 ఆంధ్రభూమి దినపత్రిక బుధవారం సంజీవని పేజీలో నా శీర్షిక "మీకు మీరే డాక్టర్"లో ఈ వారం:



Monday 3 October 2016

పరిశోధనల్లో అగస్త్యుడి తమ్ముళ్ళు: డా. జి వి పూర్ణచందు

పరిశోధనల్లో అగస్త్యుడి తమ్ముళ్ళు

 డా. జి వి పూర్ణచందు

కంటికి నిద్ర వచ్చునె? సుఖం బగునె రతికేళి? జిహ్వకున్
వంటక మించునే? యితరవైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
గంటకుఁ డైనశాత్రవుఁ డొకండు దనంతటి వాడు గల్గినన్
వింధ్యపర్వతానికి తనకన్నా ఎత్తైన వాడు ఎవడూ లేడని గర్వం. నారదు డొచ్చి, “హిమాలయాలు నీకన్నా ఎత్తైనవిఅన్నాడు. తనకన్నా ఎత్తైన వాడు ఒకడున్నాడనేసరికి వింధ్యుడికి హిమవంతుడంటే విపరీతమైన ద్వేషం కలిగింది. మద మాత్సర్యాలకు లోనయ్యాడు. ఆ సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన పద్యం ఇది. కాశీఖండం కావ్యంలోది ఈ సన్నివేశం.
కంటకంలాంటి శత్రువు ఒకడున్నాడని తెలిశాక ఎవరికైనా కంటికి నిద్ర వస్తుందా? రతికేళి సుఖంగా అనిపిస్తుందా? తిండి సహిస్తుందా? వైభవాలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయా?” అంటాడు వింధ్యుడు. కోపంతో విపరీతంగా పెరగటం మొదలు పెట్టాడు. ఎవరెష్టుని మించి ఆకాశం హద్దులు దాటి సూర్యగమనానికి అడ్డుగా పెరిగాడు. దాంతో జనం అగస్త్యుడితో మొరపెట్టు కున్నారు. అగస్త్యుడు వింధ్య దగ్గరకు వచ్చాడు. వింధ్యుడు వంగి తన శిరసు వంచి అగస్త్యుడి కాళ్లకు మొక్కాడు. నేను దక్షిణాపథానికి వెడ్తున్నాను, తిరిగి వచ్చేవరకూ ఇలాగే వంగి ఉండుఅని ఆదేశించి వెళ్ళి పోయాడు అగస్త్యుడు.అలా వెళ్ళిన వాడు దక్షిణాదిలోనే స్థిరపడిపోయాడు. వింధ్యుడు అలాగే వంగి ఉండిపోయాడు. ఇదీ వింధ్యను వంచిన అగస్త్యుడి కథ.
దక్షిణాపథాన వింధ్య దాటగానే ఆంధ్ర నగరాలు వస్తాయి. ఆంధ్రలో అగస్త్యుడు వైదికధర్మాలు ఎక్కువగా ప్రచారం చేశాడు. తెలుగు వారితో అగస్త్యుడి అనుబంధానికి చాలా సాక్ష్యాలున్నాయి. అగస్త్యుడి పేరుతోనే తెలుగు తల్లులు బిడ్డలకు పాలిచ్చి, కాళ్ళూ చేతులూ తారంగం ఆడించి, పొట్టమీద రాస్తూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణంఅంటారు.
వాతాపిని మేకలా మార్చి అగస్త్యుడికి వండి పెట్టాడు ఇల్వలుడు. సంజీవని మంత్రంతో ఆవాతాపిని బతికించటానికి ముందే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేస్తాడు. వాతాపి జీర్ణం అయిపోయాడు. అందుకే తెలుగుతల్లులు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం/గుర్రము తిన్న గుగ్గిళ్ళు జీర్ణమై/ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణమై/భీముడు తిన్న పిండివంటలు జీర్ణమై/ అర్జునుడు తిన్న అప్పాలు జీర్ణమై/అబ్బాయి తిన్న పాలు ఉగ్గు జీర్ణమై/కుంది లాగా కూర్చొని/నంది లాగా లేచి/తాంబేలు లాగా తాళి/ చల్లగా ఉండాలి/శ్రీరామ రక్ష/నూరేళ్ళాయుస్సుఅని పాడుతుంది తెలుగుతల్లి.
వనవాస కాలంలో సీతారామలక్ష్మణులు అగస్త్యుడి ఆశ్రమాన్ని సందర్శించారు. ఇక్కడికి దగ్గరిలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడేగోదావరి ప్రవహిస్తూంది. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోఅని రాముడికి సూచించింది అగస్త్యుడే! సీతను భద్రంగా కాపాడుకో”, అని ముందస్తు హెచ్చరిక చేసిందీ ఆయనే! అగస్త్యుడు సప్త మహర్షుల్లో ఒకడుగా ప్రసిద్ధుడు. సముద్రాన్ని అపోశనం పట్టాడని ఆయన గురించి చెప్తారు. అగ(నగ) అంటే పర్వతం, అస్తి అంటే తోసేయటం, పర్వతాల్ని తోసేయ గలవాడని అర్ధం. మొత్తంమీద మహాశక్తిమంతుడు అగస్త్యుడు. వేదాలలో కొన్ని ఋక్కులు కూడా వ్రాశాడు.
అగస్త్యుడు తిరుపతి దగ్గర కళ్యాణి, భీమ, సువర్ణముఖి నదులు కలిసే చోట నిత్య పూజలకు శివలింగాన్ని ప్రతిష్ఠించి నివాసం ఉండేవాడనీ, ఆకాశరాజ పుత్రిక పద్మావతిని పెళ్ళాడిన శ్రీనివాసుడు వచ్చి ఆయన ఆశ్రమంలోకొన్నాళ్ళు న్నారనీ ఐతిహ్యం. అగస్తీశ్వర క్షేత్రంగా ఇది ప్రసిద్ధి.
తెలుగు నేలమీద అగస్త్యుడి కార్యక్రమాలు వైదిక సంస్కృతిని పరిచయం చేయటానికి ఉద్ధేశించినవిగా కనిపిస్తాయి. ఇక్కడి నుండి తమిళనాడుకు చేరిన అగస్త్యుడు తన వైదిక ప్రచారానికి స్థానిక భాషను కూడా ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. తమ భాషకు వ్యాకరణ కర్తగా తమిళులు అగస్త్యుణ్ణి గౌరవిస్తారు. సిద్ధ వైద్య సాంప్రదాయంలో అగస్త్యుణ్ణి సాంప్రదాయ ప్రవర్తకుడిగా చెప్పుకుంటారు. మొత్తం మీద అగస్త్యుడి కార్యక్రమాలు తెలుగు, తమిళ, మళయాళ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకరించి జరిగాయి.
అగస్త్యుణ్ణి తమిళులు స్వంతం చేసుకున్నారు. స్వంతం చేసుకోగలగటం గొప్ప. కానీ, అది అతిశయోక్తులకు, అభుత కల్పనలకు దారి తీయకూడదు. తమిళ ప్రాచీన భాషాకేంద్రంలో కేవలం సంగమ సాహిత్యం మీద అనేక పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. ఒక ప్రియుడు తన ప్రియురాలికి కట్టుకునేందుకు ఆకులు ఇచ్చిన కథను బట్టి, సంగమ సాహిత్యం ఆకులు కట్టుకుని తిరిగే ఆదిమ కాలం నుండీ ఉన్నదని ఆయన చెప్తుంటే ఆశ్చర్యం వేసింది.
జైన బౌద్ధ సాహిత్యాలలో ఆంధ్రుల గురించి ఉన్న ఆధారాలను కూడా మనం పట్టించుకోవట్లేదు. లేని ఆధారాల మీద అక్కడ కోట్ల రూపాయల పరిశోధనలు సాగుతున్నాయి.

అగస్త్యభ్రాతఅంటే అగస్త్యుడి తమ్ముడు అని ఒక జాతీయం ఉంది. అగస్త్యుడు కలశం లోంచి పుట్టాడు. ఆయనకు అన్నదమ్ములెవ్వరూ లేరు. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పటాన్ని అగస్త్యభ్రాతఅంటారు. అగస్త్యుడి తమ్ముళ్లపైన పరిశోధనలు సాగితే వింధ్య పర్వతం తిరిగి లేచి నిల్చునే ప్రమాదం ఉంది.

Friday 30 September 2016

ఆపరేషన్ రావణ: డా. జి వి పూర్ణచందు

ఆపరేషన్ రావణ:
డా. జి వి పూర్ణచందు
అలసట డస్సి నా కడకు నావహనమాడగ రాకు మెప్డు, మి
క్కుటముగ నింతవాడ ననుకొంచును యుద్ధము చేయబోకు, దోః
పటుతరశక్తి యస్త్రముల పట్టును ధారణచేసి రమ్ము, నెం
తటి రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్
రామరావణ యుద్ధం ముగింపు దశకు వస్తోంది. రోజుకో టెర్రరిష్టు బృందాన్ని రాముడి మీదకు పంపి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న రావణుడు యుద్ధరంగంలో అలిసిపోయాడు. రావణుడి దగ్గర దివ్యాస్త్రాలున్నాయి. అవి రామదండులో కొంతభాగం సేనను నాశనం చేయగల శక్తిమంతమైనవి. కానీ, రాముడి దగ్గరున్న దివ్యాస్త్రాలు రావణుడితో సహా మొత్తం లంకా రాజ్యాన్నే నాశనం చేయగలవని విభీషణాదులు హితబోధ చేశారు. అయినా రావణుడు టెర్రరిజాన్ని పోషించే విధానాన్ని వదల్లేదు.
ఇప్పుడు పరిస్థితి పరాకాష్ఠకు చేరింది. యుద్ధం నిరాఘాటంగా సాగుతోంది. అక్కడ రావణుడి తలుతెగి పడ్తుంటే తిరిగి కొత్త తలలు పుట్టుకొస్తు న్నాయి. ఇక్కడ రాముడి దగ్గర సంజీవని ఉంది. చచ్చిన వానర సైన్యం తిరిగి బతికొస్తున్నారు. ఎవరికీ గాయాల బాధ లేదు. గాయం తగలగానే మాయమైపోతోంది. రావణుడిది వంటరి పోరాటం. శుద్ధ భారతీయ వ్యతిరేకత అతని విధానాలకు మూలం. రాముడిది సమూహ శక్తి. తీవ్రవాద వ్యతిరేకత అతని విధానం.
విభీషణుడు ఐక్యరాజ్య సమితి లాగా టెర్రరిజం మంచిది కాదని, అది లంకకే చివరికి చేటు తెస్తుందని చెవినిల్లు కట్టుకు పోరాడు. టెర్రరిజాన్ని ఆరంభించనే కూడదు. ఒకసారి అందులోకి దిగితే బయటకు రాలేరు, ‘ఈత నేర్చినవాడు ఏటిలోనే పోతా’ డనే సామెత మాఫియాలకు, డాన్లకు, టెర్రరిష్టు మూకను ప్రేరేపించే దేశాధి నేతలకు బాగా వర్తిస్తుంది. పాకిస్తాన్ పాలకులెవరికీ సహజ మరణం లేదందుకే! రావణుడి తత్త్వానికి వీళ్ళు ప్రతీకలు కాబట్టే!
యుద్ధం సాగుతున్న దశలో ఆ సాయంత్రం ఘడియల్లో రావణుడి చేతిలో ఆయుధాలన్నీ అయిపోయాయి. తెగిన అవయవాలను అతికించుకునే పనిలో పడ్డాడు. రాముడి బాణాలను తిప్పికొట్టే అవకాశం లేకుండా పోయింది. తన సైన్యాన్ని, రాజ్యాన్ని కాకుండా తనను రక్షించుకునే పనిలో పడటం ఏ దేశాధినేతకైనా ఇబ్బందే! యుద్ధంలో ఎల్లకాలం గెలుపు మన వైపే ఉంటుందని హుంకరిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.
రావణుడు నిస్సహాయంగా నిలబడి పోయాడు. అలసట అతని ముఖంలో కొట్టొస్తోంది. ఆ సమయంలో రావణాసురుణ్ణి అంతం చేయటం రాముడికి చాలా తేలిక. కానీ, ఆయన అలా చేయలేదు. “తెచ్చుకున్న ఆయుధాలన్నీ అయిపోయాయా...? బాగా అలిసి పోయినట్టున్నావు...నేడు పోయి రేపు రా” అన్నాడు. ఈ సందర్భంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన పద్యం ఇది.
“రావణా! అలిసి పోయాక కూడా నా ముందు నిలబడే సాహసం ఇంకెప్పుడూ చెయ్యకు. ఆయుధాలన్ని అయిపోయి దిక్కు తోచకపోయినా నేనింతవాణ్ణి అంతవాణ్ణి అని అహంకరించాలనుకోకు. ఇంటికి పోయి కాసేపు పడుకో...నీ చేతులకు కాస్త శక్తి వస్తుంది. అప్పుడు మళ్ళీ రా! వచ్చేప్పుడు నీ దివ్యాస్త్రాల మంత్రాలన్నీ ఒకసారి చదువుకురా! ఒక్క దెబ్బకు దిమ్మతిరిగి మంత్రం మర్చిపోతావు. అవతలి వాడి శక్తిని అంచనా వేయటం చేతకాని వాడివి...నువ్వేం వీరుడివి...? ఇవ్వాళ్టికి పోయి రేపు రా!” అన్నాడు.
ఇది యుద్ధ నీతి. రాముడు దాన్ని పాటించాడు. భారతదేశంతో నాలుగుసార్లు యుద్ధంచేసిన పాకిస్తాన్ ప్రతి యుద్ధం లోనూ ఓడిపోయింది. అయినా, దానికి దివ్యాస్త్రాలతో పాటు జవసత్వాలను సమకూరుస్తున్న దేశాలు దాన్ని టెర్రరిజ స్థావరంగా మార్చేశాయి. టెర్రరిజం తాకిడికి గాయపడిన దేశాలు కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం పాకిస్థాన్‘కి సాయపడ్తున్నాయి. తమ మీద కాకుండా తమ శత్రువు మీద ప్రయోగిస్తే టెర్రరిజం మంచిదేననే భావన ప్రపంచ దేశాధినేతల్లో బలంగా ఉంది. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం.
“రిపుశక్తి యెప్పుడునుఁ దక్కువ సేయగ రాదెరుంగకన్” అనే పాఠాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ నేర్చుకోదని అనేక సార్లు ఋజువయ్యింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరులో నిన్న జరిగిన భారత ప్రతీకార దాడి- చూసి రమ్మంటే హనుమంతుడు కాల్చి రావటం లాంటిది. మచ్చుకి ఒకటిగా జరిగిన సంఘటన మాత్రమే! అసలు యుద్ధం ముందుముందుంది. పాకిస్తాన్ అలిసిపోయి నిస్సహాయంగా నిలిచే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ‘ఆపరేషన్ రావణ’ ఆఖరి టెర్రరిష్టు అంతమయ్యే దాకా ఆగకూడదు.

Monday 26 September 2016

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం :: డా. జి వి పూర్ణచందు

కొవ్వులో కేలరీలు.. ఊబకాయం (మీకు మీరే డాక్టర్)
Published Tuesday, 13 September 2016 Andhrabhoomi daily
ఆహారం ద్వారా శరీరానికి కేలరీలు అందుతాయి. ఆ కేలరీలను ఖర్చుపెట్టడం ద్వారా శరీరం శక్తిని పొంది తన పనులు తాను సమకూర్చుకుంటుంది. వచ్చిన కేలరీల ఆదాయంలోంచి చేసిన కేలరీల ఖర్చుని తీసేయగా మిగిలిన కేలరీల సంపద లెక్కల్లో చూపని నల్లడబ్బు లాంటిది. దాన్ని దాచుకోవటానికి రహస్య స్థావరాలు కావాలి. శరీరంలో బాగా వదులుగా ఉండే కొవ్వు కణాలలో ఈ అదనపు కేలరీలను శరీరం దాచిపెడుతుంది. వదులుగా ఉండే కొవ్వు కణాలలో కేలరీలు దాగడంతో ఆ కొవ్వు కణాలు వాటి పరిమాణాన్ని మించి ఉబ్బుతాయి. అందువలన వదులుగా ఉండే కొవ్వు పొరలు శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ లావుగా తయారౌతాయి. ఊబకాయం ఏర్పడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రవర్తకుల్లో ఒకరైన చరకుడు ‘బహ్వబద్ధా మేదాః’ అంటూ ఒక సూత్రంలో ఈ కేలరీల కథనంతా వివరించాడు. బద్ధం అంటే బాగా బిగుతుగా ఉండటం. అబద్ధం అంటే వదులుగా ఉండటం. ‘బహు అబద్ధం’ అంటే, బాగా లూజుగా వుండే కొవ్వు (లూజు ఎడిపోసె టిష్యూ)లో చేరి స్థూలకాయాన్ని తెస్తున్నాయని చెప్పాడు.
చర్మం అడుగున వుండే కొవ్వు పొరల్ని ఎడిపోజ్ పొరలంటారు. ఇవి అదనపు కేలరీలను దాచుకోవడానికి నేలమాళిగల్లాంటివి. శరీరంలో పొట్ట, పిరుదులు, డొక్కలు, రొమ్ములు, పిర్రలు ఈ ప్రాంతాల్లో ఉండే ఎడిపోజ్ పొరలు బహు అబద్ధంగా అంటే బాగా లూజ్‌గా ఉండి, అక్కడ ఆ కేలరీలు ఎక్కువగా చేరేందుకు అవకాశాలుంటాయి. కేలరీల ఖర్చు తగ్గి, ఆహారం ద్వారా కేలరీల ఆదాయం పెరుగుతూన్న కొద్దీ అదనపు కేలరీలన్నీ ఈ పొట్ట, పిరుదుల్లో చేరి, అవి ఉబ్బి ఊబకాయం ఏర్పడుతుంది.
కేలరీలన్నింటినీ లాకరులో పెట్టినట్లు ఈ కొవ్వులో దాచటంవలన, శరీర వినియోగానికి చాలా పరిమితంగా కేలరీలు అందుతాయి. దాంతో అదనపు కేలరీల కోసం మెదడులోని నాడీ కేంద్రాలు ఆకలిని ప్రేరేపిస్తాయి. తిండి ధ్యాస విపరీతంగా పెరిగిపోతుంది. వెర్రి ఆకలి పుడుతుంది. ఎంత తిన్నా ఈ నీరసం తగ్గటం లేదనిపిస్తుంది. అటు ఊబ శరీరమూ, ఇటు ఆకలీ రెండూ ఒకదాన్నొకటి పెంచుకుంటూ పోతాయి. మెటబాలిజం అంటే, శరీర నిర్మాణ క్రియలు దానివలన నిలిచిపోతాయి.
ఇలా కొవ్వులో కేలరీలు బందీ కావటానికి జీవరసాయన కారణాలు, జెనెటిక్ కారణాలు చాలా ఉన్నాయి. శరీర శ్రమ, భోజనం చెయ్యగానే నిద్ర, మానసిక ఆందోళనలు, ఇన్సులిన్ ఉత్పత్తి సక్రమంగా జరగకపోవటం వాటికి తోడౌతాయి. షుగరు రోగులకు ఇన్సులిన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు బరువు పెరగటాన్ని, ఇన్సులిన్ తగినంత లేనప్పుడు బరువు తగ్గటాన్నీ మనం గమనించవచ్చు. ఇన్సులిన్ ఇస్తున్నకొద్దీ కేలరీలు ఖర్చయిపోయి ఆకలి డిమాండ్ ఏర్పడుతుంది.
తినకుండా పూర్తి పస్తు ఉంటే కొవ్వులో దాగున్న కేలరీలు బయటకొస్తాయనేది పూర్తి వాస్తవం కాదని ఇటీవలి పరిశోధనలు చెప్తున్నాయి. ఉపవాసాలు స్థూలకాయానికి విరుగుడు కాదు.
శరీరానికి ఎంత శ్రమ ఉన్నదో అంతకు తగిన కేలరీలను మాత్రమే తీసుకోగలగటం ఊబకాయానికి నివారణా సూత్రం. ఆకల్ని బట్టి కాకుండా శరీర శ్రమను బట్టి ఆహారాన్ని తీసుకోవటానికి పథక రచన చేసుకోవాలి. శరీర పరిశ్రమ లేకుండానూ, కొవ్వు పదార్థాలను ఆపకుండాను, కేవలం డైటింగ్ చేస్తే ఊబకాయం తగ్గకపోకా పెరిగిపోతుంది.
టిఫిన్లకు అల్పాహారం అనే పేరు పెట్టడంవలనే కొన్ని అపోహలు కలుగుతున్నాయి. గట్టిగా పోలిస్తే, మన టిఫిన్లు అన్నం కన్నా ఎక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. మినప్పప్పు, ఉప్పుడు రవ్వ కలిపి వేసిన ఇడ్లీలలో గానీ, మినప్పప్పు బియ్యం కలిపి రుబ్బి వేసిన అట్లలో గానీ ఉండే కేలరీలకన్నా, ఉదయాన్నో రాత్రిపూటో కొద్దిగా తినే పెరుగున్నం లేదా చల్లన్నంలో తక్కువ కేలరీలే ఉంటాయి. టిఫిన్లలో అదనంగా శనగచట్నీ, అల్లప్పచ్చడి, నెయ్యి, కారప్పొడి, సాంబారు కూడా ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా చల్లన్నం కన్నా చాలా ఎక్కువ కేలరీలను శరీరానికి అందిస్తాయి. అన్నం మానేసి ఇడ్లీ అట్టు, పూరీ ఉప్మా, బజ్జి, పునుగులు తింటూ చాలా లైట్‌ఫుడ్ తింటున్నామనుకోవడం ఒక అపోహ. ఇవి కాకపోతే బట్టర్‌నానూ, రుమాల్ రోటీ లాంటి వాటిని రకరకాల కర్రీలతో తింటూ అవి కూడా లైట్ ఫుడ్ అనే అనుకుంటుంటారు చాలామంది.
జంకుఫుడ్స్ అనేవి పిజ్జాలు, బర్గర్లు చైనా నూడుల్స్- ఇవి మాత్రమే అనుకోవద్దు. ఇంట్లో మనం తినే టిఫిన్లన్నీ జంకు ఫుడ్స్ కేటగిరీల్లోకే వస్తాయి. ఏవి ఎటువంటి పోషకాలూ ఇవ్వకుండా, కేవలం అమితమైన కేలరీలను శరీరానికి అందిస్తాయో అవన్నీ జంకు ఫుడ్సే అవుతాయి. తింటున్నది ఫుడ్డో.. జంకుఫుడ్డో ఎవరికివారే నిర్ణయించుకోవాలి. అదనపు కొవ్వు నిచ్చే ఆహారాలపట్ల అప్రమత్తతగా ఉండే స్థూలకాయం సమస్య తగ్గటానికి సావకాశం వుంటుంది.
కేలరీలు దాక్కునేందుకు శరీరంలో కొవ్వు లేకుండా చేస్తేనే ఊబకాయం తగ్గుతుంది. కొవ్వును పెంచుకుంటూ, కేవలం వరి అన్నాన్ని మానేయటంవలన ఒరిగేదేమీ ఉండదు. అదే నిజమైతే గోధుమ రొట్టెల్ని మాత్రమే తినే ఉత్తరాదివారిలో స్థూలకాయం ఉండకూడదు కదా! దక్షిణాది వారిలో వారికన్నా ఔత్తరాహికుల్లోనే స్థూలకాయులు ఎక్కువగా ఉన్నారు కూడా! వరి, గోధుమల్లాంటి ధాన్యాలకన్నా వాటితోపాటు తినే నూనె పదార్థాలు ఎక్కువ హానికారకం అని అర్థం చేసుకోవాలి.
కొవ్వులో దాగున్నాక ఆ కేలరీలను తగ్గించటం కష్టం అవుతుంది కాబట్టి, కేలరీల సంఖ్యను కొవ్వు కణాల సంఖ్యను, సమానంగా తగ్గించే విధంగా ఆహార ప్రణాళిక రచించుకోవటం అవసరం. నూనెలో వేసి వేయించిన కూరలు, ఊరగాయలు, అత్యంత స్పైసీ కూరలు, నూనె వరద కట్టే వంటకాలూ ఊబకాయ ప్రదాతలని గుర్తించాలి.
సిగరెట్ల పెట్టెమీద పుర్రె బొమ్మ వేసి డేంజర్ అపాయం అని వ్రాసినట్టు, స్థూలకాయానికి కారణం అవుతున్న ఆహార పదార్థాల ప్యాకింగ్ మీద కూడా ఇది కొవ్వుని పెంచుతుంది అనే హెచ్చరిక వ్రాయటం అవసరం. హెచ్చరిక అనేది అవగాహన కలిగించే ఒక ప్రయత్నం. తెలియక తప్పులు అనేకం చేస్తుంటాం. తెలిశాక కూడా తప్పులు చేస్తే బాధ్యత ఎవరికి వారిదే కదా!
డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com

Friday 9 September 2016

‘కట్టు’ గుట్టు :: డా. జి వి పూర్ణచందు

‘కట్టు’ గుట్టు :: డా. జి వి పూర్ణచందు
“నిను రప్పింపకమున్న వేడ్కపడి పూనెన్ శారఙ్గ కౌమోదకీ
వనమాలాంబుజ జక్ర భూమికలుఁ గైవారంబు జేయించె నే
లిన నాగారులచేత యాదవుల నోలిం గొల్చి కూర్చుండఁగాఁ
బనిచెన్ గేశవుఁడైంద్రజాలికు గతిం బ్రాతయ్యె నీకంతటన్”
పెళ్ళి చూపుల్లో ఆడపిల్లలు అరువు నగల్ని, మగ పిల్లలు అరువు కళ్లజోళ్ళనీ, వాచీల్నీ పెట్టుకోవటం సర్వ సాధారణం. మన దర్పాన్ని ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఇలాంటి అరువు అలంకారాలు, కృత్రిమ వేషధారణలు అవసరమౌతాయి. సముద్రుడు చర్మాంబర ధారి శివుడికి గరళాన్ని, పట్టు పీతాంబరధారి విష్ణువుకు కూతురినీ ఇచ్చాడు. అన్ని సందర్భాల్లోనూ గాంధీగారిలా బిళ్లగోచీ పెట్టుకుంటే పనులు కాగలవనే ధీమా ఏమీ లేదు.
పరాయి వాళ్ళూ, శత్రువులూ వచ్చినప్పుడు పూర్వం రాజులు కూడా ఇలానే తెచ్చిపెట్టుకున్న అలంకారాలతో కొలువు దీరి కూర్చునే వాళ్ళట. నాచన సోమన ఉత్తర హరివంశంలో అలాంటి కృత్రిమ అలంకారాలు ఎలా ఉంటాయో చక్కని వివరణ ఇచ్చాడీ పద్యంలో. ఆయన్ని చూస్తూనే అవతలివాడు డంగై పోవాలని అలా చేస్తారట.
హంస, డిభకులనే రాక్షసులకీ కృష్ణుడికీ మధ్య యుద్ధాలు సాగుతున్నై. ఒకసందర్భంలో జనార్దనుడనే పెద్దమనిషిని కృష్ణుడి దగ్గరకి రాయబారం పంపారు. జనార్దనుడు కృష్ణుణ్ణి కలిసొచ్చి, ఆయన వైభవాన్నీ, ఆయన మాటల్నీ పూసగుచ్చినట్టు వర్ణించి చెప్తాడు. జనార్దనుడి మాటలకు పెద్దగా నవ్వారు హంస, డిభక సోదరులు.
“వరాలు ఉన్నాయి...అవి కాపాడతాయి అనుకుంటున్నారేమో... మీ ఇద్దరినీ వదలను. వదల కూడదు. మీకు వరా లిచ్చిన ఆ శివుడే దిగొచ్చినా లోకమంతా తెలిసే లాగా పారద్రోలి మీ ఇద్దర్నీ చంపేస్తా! యుద్ధం ఎక్కడ కావాలి? మధురలోనా? ప్రయాగలోనా? పుష్కర స్థలంలోనా? ఎక్కడంటే అక్కడే! ద్వంద్వ యుద్ధమా? ఆయుధాల్తోనా? ఏ ఆయుధంతో మిమ్మల్ని చంపాలో... మీరే నిర్ణయించుకోండి... వస్తున్నా! చూసుకొందాం! వస్తున్నా” ఇలా కృష్ణుడితో అనిపిస్తాడీ సందర్భంలో కవి నాచన సోమన. క్రీ.శ. 14వ శతాబ్దిలో సోమన పేల్చిన గొప్ప పంచ్ డైలాగ్ ఇది!
రాయబారిగా వెళ్ళిన జనార్దనుడు కృష్ణుణ్ణి చూసి నిజంగానే అదిరిపోయాడు. అతను తిరిగొచ్చి చేసిన కృష్ణస్తుతి విని నవ్వి, హంస డిభకులు హేళనగా ఇలా అన్నారు: “ఓరి పిచ్చివాడా! కృష్ణుడు భగవంతుడూ కాదు గిగవంతుడూ కాదు, ఆ శారంగ(విల్లు), కౌమోదకీ (గద)వనమాల(వైజయంతి అనే పూలమాల) చేత్తో పట్టుకున్న కలువపువ్వు(అంబుజం), సుదర్శన చక్రం, ఇవన్నీ నిజం అనుకుంటూన్నావా...ఎబ్బే ఉత్తుత్తివే! సభలో వీటిని అలంకరించుకుని కూర్చుంటాడు. నీ బోటి వాళ్ళు హడలి చావటానికి ఇలా లేని హంగూ ఆర్భాటాలు ప్రదర్శించాడు. నిన్ను ఫలానా రోజు రమ్మన్నాడు. నువ్వొచ్చే సమయానికి వేగంగా అలంకరించుకుని వచ్చి కూర్చున్నాడు. వందిమాగధుల్ని నిలబెట్టి పొగడ్తలతో హోరెత్తించాడు. నిన్ను అదరగొట్టాడు. అదంతా నిజమేనని, కృష్ణుడు భగవంతుడనీ నువ్వు భ్రమలో పడ్డావు. ఇలా చేయటం కృష్ణుడి కొక సరదా”అని!
ఇక్కడ “నా ‘గారు’ల చేత” అని ఒక పదాన్ని ప్రయోగించాడు సోమన. పైకి చూస్తే నాగ+అరి=గరుత్మంతుడు అని అర్ధం వస్తుంది. కానీ, నా ‘గారు’లు అంటూ, ‘గారు’ అనే తెలుగు పదాన్ని వ్యంగ్యంగా తాబేదారనే అర్ధంలో ప్రయోగించాడు. బ్యూరోక్రాట్లను ఇంగ్లీషులో “బాబు”లని పిలవటం లాంటిదే ఇది. “తన చంకల్లో మనుషుల్ని, చెంచాగాళ్లనీ పేరుపేరునా పిలిచి కూర్చోబెట్టాడు ...అవునా? ఇది కనికట్టు విద్య. కృష్ణుడు ఇందులో దిట్ట. లేనివన్నీ ఉన్నట్టు భ్రమింప చేస్తాడు. పెద్ద మాయావి. ఆ మాయలో పడి అందులో కిటుకు తెలుసుకోలేక పోయావు....” అని హేళన చేశారా రాక్షస సోదరులు.
కయ్యానికైనా వియ్యానికైనా అలంకారమే ప్రాణం. కృత్రిమ అలంకారాలు పెద్ద ప్రయోజనాల్నే తెస్తాయి. పంచె కట్టి, లాల్చీ వేసుకుంటే దేశభక్తుడైపోతాడు. కాషాయం కట్టి, నామాలు పెట్టుకుంటే మహాభక్తుడై పోతాడు. సూటూబూటూ వేసుకొంటే ఎక్కడలేని అరిష్టోక్రసీ కొట్టొస్తుంది. గాంధీ టోపీకి ఇప్పటికీ కొన్ని చోట్ల పనులు సమకూర్చే శక్తి ఉంది. కాళోజీ ‘నాగొడవ’ లో అంటాడు... “పెట్టుకున్న టోపీలు కాదు, పెట్టిన టోపీలు చూడా”లని! ఏది సహజాలంకారమో, ఏది కృత్రిమాలంకారమో తేల్చుకో గలిగే విచక్షణ మనకుండాలి. లోకఙ్ఞానం అంటే అది!

Sunday 4 September 2016

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం :: డా. జి వి పూర్ణచందు

వినాయక వ్రతంలో ప్రపంచ శాంతిసందేశం
డా. జి వి పూర్ణచందు
తెలుగు వారిలో గణపతి ఆరాధన ఎక్కువ. ప్రపంచ శాంతిని కోరే భారతీయుల ఏకైక పండుగ వినాయక చవితి.
శివుడు, విష్ణువు ప్రధాన దేవతలైనప్పటికీ, దుర్గ, లలిత, వినాయకుడు, ఆంజనేయుడు మొదలైన పరివార దేవతలకూ తెలుగు వాళ్ళు నిత్య దీప ధూప నైవేద్యాలు అందిస్తూనే ఉంటారు. పూజామందిరంలో ముక్కోటి దేవతల బొమ్మలకూ ఒకేసారి పూజచేస్తారు. కాబట్టి, తెలుగువారిలో ఫలానా దేవుడికి భక్తు లెక్కువ అని తేల్చటం కష్టం.
తమిళుల విషయాని కొస్తే అక్కడ ఏకదేవతారాధన ఎక్కువ 50% మంది సుబ్రహ్మణ్య స్వామి (మురుగ)ని నిత్యం కొలుస్తారు. 15% మంది వినాయకుణ్ణి కొలుస్తారని ఒక సర్వే చెప్తోంది. ఈ తేడా స్పష్టమైనదే!
వివిధ జాతులు, భాషలు, సంస్కృతులూ కలగలసిన సంలీన సంస్కృతి తెలుగు వారిది. తమ పూర్వదేవతలందరిని సమానంగా కొలుచుకునే అలవాటు తెలుగువారికి సంక్రమించటానికి కారణం ఇదే!
“గణానాంత్వా గణపతిగ్౦ హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా నశ్శృణ్యన్నూతిభి స్సీదసాదనం” ఋగ్వేదం రెండవ మండలంలో (23.01) కనిపించే గణపతి స్తుతి ఇది. ఈ ఋక్కు క్రీ. పూ. 2,500-1800 నాటిదిగా మాక్స్‘ముల్లర్ భావిస్తే, క్రీ.పూ. 6,000 నాటిదని తిలక్ మహాశయుడు భావించాడు. ఇతరులు క్రీ. పూ ౩,౦౦౦ నాటిది కావచ్చునన్నారు.
గణాలకు పతి, మేథావుల్లో కెల్లా మేథావి, బాగా వినేందుకు ఉన్నతమైన చెవులు కలవాడు (మొరాలకించేవాడు), వికాసం కలిగించిన తొలి పరిపాలకుడు, మరింత వికాసం పొందేలా చేయగలవాడు, నూతన ఆలోచనలకు వేదికైన వాడూ అయిన ఓ గణపతి... హవామహే= మా హవిస్సులు గైకొను” అంటూ వేడికోలు ఇందులో కనిపిస్తోంది. గణపతి జలాధిదేవత! అందుకనే గణేశ ఉత్సవాలను నిమజ్జనంతో ముగిస్తారు.
నారాయణోపనిషత్తు (క్రీ, శ. 550)వినాయకుని ఉద్ధేశించి “తత్పురుషాయ విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దన్తి ప్రచోదయాత్” అనే మంత్రం చెప్పింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతిని చెప్పటానికి ఉపయోగించే ‘వక్ర’ శబ్దాన్నీ గజాననుడి వక్రతుండానికి అన్వయించారు పండితులు. వక్ర అంటే moving backwards అని! జపాన్‘లో దొరికిన ఒక గణేశ విగ్రహంలో వెనకవైపున కూడా ముఖం ఉంటుంది. వెనక నుంచి కూడా చూడగల రక్షకుడిగా ఈ ద్విముఖగణపతి కనిపిస్తాడు. బహుశా తర్వాతి కాలంలో పంచముఖాల గణపతిని కూడా రూపొందించుకుని ఉంటారు
గణాలంటే దేవగణాలు.
గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో స్తుతించే గణాల నాయకుడని అర్థం. ఈ విశేషణాలన్నీ ఋగ్వేద కాలంలో ఇంద్రుడిని ఉద్దేశించినవి! బహుశా ఇంద్రుడే గణపతిగా ఆరోజుల్లో ప్రసిద్ధుడు కావచ్చు. గణపతిని రుద్రుడి రూపంగా యజుర్వేదం భావించింది. నమకం చమకంలో “దేవగణాలకు పతివైన నీకు నమస్కారం” అని రుద్రుణ్ణి స్తుతించటం కనిపిస్తుంది. ఋగ్వేద కాలంలో ఇంద్రుడూ, తరువాతి యుగంలో రుద్రుడూ గణపతులుగా వ్యవహరించి ఉంటారు. “బోధాయన ధర్మ శాస్త్రం” లో విఘ్న, వినాయక, వీర, స్థూల, వరద, హస్తిముఖ, వక్రతుండి, ఏకదంత, లంబోదర, మొదలైన పేర్లతో వేర్వేరు దేవతలు కనిపిస్తారు. బహుశా తరువాతి కాలంలో వీళ్ళందరినీ సంలీనం చేసి, ఒక మహాగణపతిని ప్రతిష్టించుకుని ఉండాలి.
హేరంబ, గణనాయక, గణేశ, ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, డుంఠి (పద్మపురాణం), పిళ్ళారి, చింతామణి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర, అంబాసుత, సిద్ధి వినాయక (సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప,ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన లక్షణాలతో గణేశుడు వివిధ కాలాలలో కనిపిస్తాడు. స్కంద (మురుగ, సుబ్రహ్మణ్యస్వామి) కన్నా పూర్వుడు అనడం చారిత్రకంగా ముఖ్యమైన విషయం. 6వ శతాబ్ది నుండీ ఆర్యసంస్కృతి విస్తరణలో భాగంగా జరిగిన పరిణామ క్రమం ఇది కావచ్చునని ప్రఖ్యాత చరిత్రవేత్త డి. చటోపాధ్యాయ అన్నారు. గుప్తులు ఇందుకు ముఖ్య కారకులు కావచ్చు. కాణే మహాశయుడు “the well known characteristics of Ganesa and his worship had become fixed before the fifth or sixth century of the Christian era…” అని వ్రాసారు. అనేకవిధాల పరిణామాలు చెందిన గణేశరూపం, గణేశ ఆరాధనా విధానం పదిహేను వందల యేళ్ళ క్రితం ఒక రూపానికి వచ్చాయని కాణే ప్రభృతులు తేల్చి చెప్పారు.
మనుస్మృతిలో, “విప్రానాం దైవతం శమ్భుః క్షత్రియాణాం తు మాధవాః అనే సూత్రం ప్రకారం, బ్రాహ్మణులు సాంబుని, క్షత్రియులు విష్ణువుని, వైశ్యులు బ్రహ్మని, శూద్రులు గణనాయకుణ్ణి దేవతలుగా కొలవటం గురించి ఉంది. అంటే, ఋగ్వేద కాలంలో దేవగణాధిపతి అయిన గణపతి మనువు కాలానికి శూద్రుల దేవుడిగా మారిపోయాడు. ఈ మార్పుకు దారితీసిన సామాజిక పరిణామాల అధ్యయనం జరగాలి.
ఒకప్పుడు పంచాయతన పూజ ఉండేది. ‘ఆదిత్యం, అంబికం, విష్ణు, గణనాథం మహేశ్వరం’ - అంటూ సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు ఈ ఐదు దేవతల అర్చననీ పంచాయతన పూజ అన్నారు. శంకరాచార్యుడు (క్రీ. శ. 9వ శతాబ్ది) ఈ ఐదుగురు దేవతలకూ కుమారస్వామిని అదనంగా చేర్చి ‘షణ్మత స్థాపనాచార్యుడు’గా ప్రసిద్ధుడయ్యాడు. జంతుబలి మాన్పించే లక్ష్యంతో శంకరాచార్యులు షణ్మతాన్ని తెచ్చి, ఈ ఉగ్రదేవతలను శాంతి దూతలుగా మార్చారు, గ్రామదేవతగా ఉన్న బెజవాడ దుర్గమ్మ విగ్రహం దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతిష్టించి అమ్మవారిని శాంతమూర్తిగా చేసిన కథ ప్రసిద్ధమే!
జంతుబలి స్థానే కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటం, రక్తమాంసాల స్థానంలో మోదకాలు-తీపి వంటకాలు నైవేద్యం పెట్టటం, షడ్రసోపేతమైన భోజనాన్ని మహానివేదన పెట్టటం, కల్లు సారాయికి బదులుగా పాయసాలు, పానకాలు తాగటం లాంటి పద్దతులు అమలుకు తెచ్చాడు. అందువలన ఆరాధనా విధానం అహింసాత్మకం అయ్యింది. శాంతికోసం ఆరాధన అనేది ఒక అలవాటయ్యింది. ఆ విధంగా విఘ్నాలు కలిగించే ఉగ్రదేవుడు గణపతి శాంతి పొంది, విఘ్నాలు నివారించే దేవుడయ్యాడు. విజయాన్ని, మేథా సంపత్తినీ, ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ ఇచ్చే శక్తిగా మార్పు పొందాడు.
“ప్రేతన్భూతగణాన్శ్చన్యేయజన్తే తామస జనాః” అంటే భూతప్రేతాది తామస జనులకు నాయకుడిగా ఒకప్పుడు వినాయకుణ్ణి కొలిచిన సందర్భాలు ఉన్నాయి. బహుశా దిష్టిబొమ్మగా వినాయకుడి కీర్తిముఖాలను గుమ్మాలమీద తగిలించటానికి ఇదొక కారణం కావచ్చు.
లింగపురాణం శివుడి అంశతో గణపతి పుట్టినట్టు చెప్తుంది. మత్స్యపురాణంలో పార్వతి నలుగుబొమ్మ కథ కనిపిస్తుంది. ఇంకో కథ కూడా ఉంది. పార్వతి నలుగు పెట్టుకుని ఆ మాలిన్యాన్ని నీటిలో కలిపిందనీ, ఆ నీటిని తాగిన మాలిని అనే రాక్షసి వెంటనే గర్భం దాల్చి గణపతిని ప్రసవించిందనీ, పార్వతి ఆ బిడ్డను తీసుకువచ్చి పెంచిందనీ ఈ కథ చెప్తుంది.
మోదః అంటే ఆనందం. తిన్నవారిని ఆనందింప చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. తీపి ఉండ్రాళ్ళే కాదు, లడ్డూలవంటి స్వీట్లన్నీ మోదకాలే! వినాయకుడికి వాటిని పెట్టి ఆయనను మంచి చేసుకోవాలనే భావన కూడా చాలామందిలో ఉంది. వినాయకుడంటే బుద్ధి దేవర, వినాయకుణ్ణి పంటల దేవుడుగా కూడా మొక్కుతారు. ఆయనకు మొక్కలయ్య అనే పేరు కూడా ఉంది. పెద్ద చెవులు ఆయనకొక ప్రత్యేకత కలిగించాయి. జనంగోడుని, మొత్తుకోళ్ళని చక్కగా ఆలకించే వాడని చేటంత చెవులు ఆయనకి. మట్టితో వినాయక ప్రతిమను చేసి, పసుపు పట్టిస్తారు. కాబట్టి పచ్చని రంగులో కనిపిస్తూ,లోకాన పచ్చదనాన్ని నింపేవాడుగా ఆయన ప్రసిద్ధుడు. ధాన్యరాశిని ఆసనంగా చేసుకున్నవాడు. అంతేకాదు, నిరాఘాటంగా వ్రాయగల వ్రాయసకాడు కూడా! వ్యాసభగవానుడు ధారగా భారతకథను ఒక కావ్యంగా చెప్తుంటే గంటం ఆగకుండా వ్రాసిన వాడు. వినాయకుణ్ణి పర్యావరణ పరిరక్షకుడిగా కొలుచుకుంటారు. లోకాని కొక శాంతి సందేశం వినాయకుడు. ప్రపంచం కోసం, ప్రకృతికోసం, పర్యావరణం కోసం, సర్వజన హితం కోసం మనం జీవించాలనే సందేశం వినాయకుడి కథలో కనిపిస్తోంది. ఆయన పుట్టినరోజున మనం నేటి పర్యావరణం గురించి, రేపటి మన మనుగడ గురించి ఆలోచించుకునే అవకాశం కలిగించుకోవాలి!

Thursday 25 August 2016

మాజీనది-జీవనిధి ::డా. జి వి పూర్ణచందు

మాజీనది-జీవనిధి

డా. జి వి పూర్ణచందు


నది కృష్ణ...
ఇరుగట్టుల మడతమంచం మీద
చీకటి దుప్పటి కప్పుకుని
అనంత శయనంలా!
దుప్పటి కంతల్లోంచి
చుక్కలు
తళతళ లాడుతూ...
నది ఒడ్డున తాడిచెట్టు
అనంత శయనుడి
నాభిలో పుట్టిన కమలంలా...
పైన పద్మాసనంలో చంద్రుడు
తెలుగులీనుతో
కమలపు రేకుల్లో కర్ణికలా...
నదినిండా మొక్కలే
మొక్కులు తీర్చుకునే
పరివార దేవతల్లా...
జెముళ్ళు, కలబందలు
కలలు బందు చేసే
ఎడారి మొక్కల సందోహం...
నదిమీద సాలీడుగూళ్ళ అల్లిక
ఏ కవి అల్లగలడు
అంత సీసమాలిక
చంద్రుడి వెలుగురాగాలు
నదిలో కనిపించిన రోజులు
అప్పుడు! అప్పుడప్పుడు!!
గట్టును గట్టిగా తగలకున్నా
నీళ్ళ జాడలుండేవి అప్పుడు...
మల్లెల్లూ పండేవి అప్పుడప్పుడు...
చీకటి దుప్పట్లో దూరాక
నీళ్ళైతే ఏమిటీ...
ఇసుక దిబ్బలైతే ఏమిటీ...
నది మిధ్య
నీళ్ళు గతం
బీళ్ళు ఎండకు అంకితం
నదికి నీలం రంగు పులిమి
నీళ్ళని భ్రమిస్తున్నాం
కాళ్ళని తడిపిస్తున్నాం...
నదికే తెలుసు
మమతలు లేని
మనుషుల మనసు
నీళ్ళున్న రోజున
దానిది సత్త్వగుణం
అది అప్పుడప్పుడూ...
వరదలెత్తిన రోజున
దానిది రజోగుణం
అది ఎప్పుడో ఒకప్పుడు...
నీళ్ళెండిన రోజున
దానిది తమో గుణం
అది ఇప్పుడు! ఎప్పుడూ...!
ఎగువన వరదలొస్తే
దిగువున తృష్ణ తీర్తుంది
ఇది కృష్ణ వాక్కు
తగువున గెలిచి తెచ్చినా
దిగువకు నీళ్ళు
వలచి వచ్చునా?
ఇది మాజీనది కృష్ణ వాక్కు
ఇది ఎగువ నాజీలు
అప్ హరించిన కృష్ణ హక్కు
నదిని బంధించే వృత్రాసురుడు
యుగానికొక్కడు ప్రతిసారీ
ఎగువకు నీటిని మళ్ళిస్తూ మితిమీరి!
పదండి ముందుకని తోసుకుని...
నీళ్ళు పాటెత్తుకుంటే,
నీళ్ళు పోటెత్తుతుంటే...
చలనాన్ని ఆనకట్టలా ఆపేది?
చైతన్యాన్ని
మాయకట్టులా మాపేది...?
నది ఆగనిది!
నది దాగనిది!
నది జీవనిధి!

Wednesday 13 July 2016


ఆంధ్రభూమి దినపత్రిక బుధవారం సంజీవని పేజీలో నా శీర్షిక 13-07-2016



Tuesday 5 July 2016

6-07-2016 ఆంధ్రభూమి దినపత్రిక సంజీవని పేజీలో నాశీర్షిక మీకు మీరే డాక్టర్


Friday 24 June 2016

భాషా సాంస్కృతిక విధానం:: డా. జి వి పూర్ణచందు

భాషా సాంస్కృతిక విధానం

 డా. జి వి పూర్ణచందు

ఱేడు పరాపరోక్తుల నెఱింగి విచారణ సేయడేని, మా
రేడును ఱేఁడే. తన్ననుసరించిన శ్రీఫల మిచ్చుచుండు; నే
రేడును ఱేఁడే, యయ్యది భరించు ద్విజ ప్రకరమునెల్లఁ; బూ
రేడును ఱేఁడే, యయ్యది చరించెడి సత్పథమందుఁ బొందుగన్
(తిరుపతి వేంకట కవుల ‘గీరతం’ నుండి)

ప్రభుత్వానికి భాషా సాంస్కృతిక విధానం ఒకటి ఉండాలి. కృష్ణదేవ రాయలు ఒక చారిత్రక వ్యక్తిగా నిలిచి పోయి, వందలాది అనుకూల కథలు అతని చుట్టు అల్లుకోవటానికి ప్రధాన కారణం ఆయన కవులకు, కళాకారులకు, కళలకు, దేశభాషలకు ప్రోత్సాహం ఇవ్వటమే! ఈ సూక్మాం న్ని ఈ కాలపు ఱేడులు(ప్రభువులు) గుర్తించలేక పోవటం వలన మాజీ ముఖ్యమంత్రు లెందరో జనం స్మృతి పథంలోంచి క్రమేణా కనుమరుగై పోతున్నారు.
“కళల్ని నువ్వు బతికించు. కళ నిన్ను బతికిస్తుంది” అనే సూక్తి ప్రతి ముఖ్యమంత్రికీ వర్తిస్తుంది.కళ బతకాలి. కళాకారుడూ బతకాలి. బతికేందుకు దారులు వేయటమే సాంస్కృతిక విధానం. తెలుగు భాషాభివృద్ధి, పరిశోధనలు, సాహిత్యం, పుస్తక ప్రచురణ, గ్రంథాలయాలకు ప్రాణం పోయటం, తెలుగువారి సాంప్రదాయక కళలను విద్యార్ధు లందరికీ నేర్పించటం, మద్రాస్ అడయారులోని కళాక్షేత్రం, కేరళ త్రిస్సూరులోని ‘కళామండలం’ స్థాయిల్లో ఒక గొప్ప కళా విద్యా సంస్థను నెలకొల్పటం, లలిత కళలు శిల్పకళల పరిరక్షణ, అకాడెమీలను పునరుద్ధరించే వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం, శాస్త్ర సాంకేతిక సాహిత్యాన్ని ప్రచారంలోకి తేవటం, భాషాభివృద్ధికి, ఒక ‘సాధికార సంస్థ’ నెలకొల్పటం, కవులు కళాకారుల్లో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింప చేయటం ఇవన్నీ జరగాలి. జరిపే సంకల్పం ఉండాలి. వాటి నిర్వహణ అర్హులు, సమర్ధుల చేతుల్లో ఉంచాలి. ఈ చివరిదే చాలా ముఖ్యమైన అంశం.
రాష్ట్రాభివృద్ధికి ఇరవై యేళ్ళ విజన్ డాక్యుమెంటు తయారు చేసుకున్న ప్రభుత్వం సాంస్కృతిక విధానానికి కూడా తయారు చేయకపోవటం కళాపోషణ లేకపోవటంతో సమానమే! “తెలుగదేల యన్న దేశంబు తెలుగు” అని కమ్మగా పాడతారు గాని, ఆ తెలుగు అతీగతీ పట్టించుకోరు. “నో పార్కింగ్ ఫర్ త్రీ వీలర్స్” అని రిక్షావాళ్ల కోసం కూడా ఇంగ్లీషులోనే బోర్డు పెట్టే అధికారుల్ని ఉద్యోగంలోంచి తీసేయకుండా పోషించే ప్రభుత్వం కళాపోషణ చేయగలదా?
భాషోద్యమం బలంగా తన వాణిని వినిపించిన ప్రతిసారీ ఇంటర్మీడియట్ వరకూ తప్పనిసరిగా తెలుగు నేర్పించాలనే జీవోని ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాంటి జీవోలు ఇచ్చాయి. కానీ, విచిత్రంగా ఆ జీవోలు అమలు కావు. అమలు చేయాలని ఇంకో జీవో ఇచ్చినా అదీ అమలు కాదు. రాష్ట్రంలో పరిస్థితి ఇది.
కవి గానీ, కళాకారుడు గానీ కన్నడంలోనో మళయాళంలోనో లేకపోతే అరవంలోనో పుట్టాలి. తెలుగులో పుట్టకూడదు. పుడితే జీవిత కాల అఙ్ఞాతవాసమే శిక్ష. అంతర్జాతీయ స్థాయి రచన తెలుగులో వ్రాస్తే, ఇలాంటివి పోవని ప్రచురణకర్త వేయడు. రచయితే స్వంతంగా వేసుకున్నా పుస్తక విక్రేతలు తమ షాపుల్లో పెట్టి అమ్మరు. అమ్మినా పాఠకులు, గ్రంథాలయాలు కొనరు. ఇలాంటి స్థితిలో వ్రాసినదానికి వెలుగు చూసే (out-let) అవకాశం లేకపోవటాన గొప్పగొప్ప సాహితీ వేత్తలు రాయని భాస్కరు లౌతున్నారు. తెలుగులో ఙ్ఞానపీఠాలు తక్కువని ఎద్దేవా చేస్తారు గానీ తేగల సత్తా ఉన్నవారికి ప్రోత్సాహం ఏదీ?
పైన పేర్కొన్న పద్యం సాంస్కృతిక విధానంకల ప్రభువు(ఱేఁడు) గురించి చెప్పిందే! పరాపరోక్తులు తెలిసి, యుక్తాయుక్తా లెరిగి కవులకు, కళాకారులకు, కళలకు మేలు చేసే వాడు కాకపోతే, అలాంటి ఱేఁడు పాలనలో మారేడు కూడా తానే ఱేఁడు నన్నట్టు వ్యవహరిస్తుంది. తనచుట్టూ భజంత్రీలను చేర్చుకుని వాళ్లచేతుల్లో శ్రీఫలాలు పెడుతుంది. శ్రీ ఫలం అంటే విబూది పండు కూడా! చివరికి బూడిద విదిలిస్తుందన్నమాట! నేరేడు చెట్టు కూడా ఱేఁడుగా చెలామణి అయి, గాలిపక్షులకు ఆశ్రయం ఇస్తుంది. పూరేడు (పుప్పొడి) కూడా తానూ ఱేఁడే నంటూ గాల్లో తిరుగుతుంది. “అసలు ఱేఁడు” తిన్నగా లేకపోతే ఇలాంటి నకిలీ ఱేఁడులు ముత్యాలముగ్గు కాంట్రాక్టరు లాగా ‘కళాపోసన’ చేస్తుంటారు.
తిరుపతి వేంకట కవులకీ, వేంకట రామకృష్ణ కవులకీ వివాదం వచ్చినప్పుడు, ఆ వివాదాన్ని తేల్చగల ప్రభువు గట్టివాడై ఉండాలంటూ తిరుపతి వేంకట కవులు చెప్పిన పద్యం ఇది.

Thursday 23 June 2016

కొండమీది కొక్కిరాళ్ళు::డా. జి వి పూర్ణచందు.

కొండమీది కొక్కిరాళ్ళు::డా. జి వి పూర్ణచందు.

పండితులైనవారు దిగువం దగనుండగ నల్పు డొక్క డు
ద్దండత బీఠమెక్కిన బుధ ప్రకరంబుల కేమి యొగ్గగున్?
గొండొక కోతి చెట్టు కొనకొమ్మల నుండగ గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురుంబము లుండవె చేరి భాస్కరా!
బాపూగారి ఒక సినిమాలో పంచాయితీ ప్రెసిడెంటైన ఓ భూస్వామి తన పాలేళ్ళను టీచర్లుగా చూపించి, లేని స్కూలుి ఉన్నట్టు నడిపిస్తుంటాడు. స్కూళ్ళ ఇన్స్పెక్టరు వచ్చినప్పుడు ఓ పాలేరాయన "నాను నాలుగో కలాస్సు పంతుల్నండీ"అంటాడు. ఇనస్పెక్టర్ గారు అతగాణ్ణి "విశ్వక్సేనుడు" అని పలకమంటాడు. అతగాడు నోరెళ్లబెడతాడు
స్వతంత్రం వచ్చాక తెలుగు నేలని మొదట భూస్వాములే పాలించారు. ఆతరువాత సారా కాంత్రాక్టర్క్ల చేతుల్లోకి పాలన వెళ్ళింది. క్రమేణా రైసుమిల్లర్లు అధికారాన్ని హస్తగతం చేసుకుని కొన్నాళ్ళు రాజ్యం ఏలారు. మధ్యలో మాఫియాలు, కాంట్రాక్టర్లు, ఇండష్ట్రియలిష్టులు, విద్యారంగ ప్రముఖులు రాజకీయరంగ ప్త్రవేశం చేసినప్పటికీ స్వీయ ప్రయోజనాలు తప్ప పాలనా వ్యవస్థ బాగోగుల జోలికి వెళ్లలేదు. ఈ తతంగం వలన రాజనీతిఙ్ఞులు క్రమేణా కనుమరుగై పోయారు.
అధికారం చేజిక్కించుకొనే వరకూ ప్రజలకోసమే నిరంతరంగా జీవించిన పార్టీలు ఎన్నికైన మర్నాటి నుండీ స్వంత ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం ప్రారంభించే రోజులివి. “ఇంతకాలం ప్రతి పక్షంలో ఉన్నాం... మా కార్యకర్తల్ని సంతృప్తి పరచొద్దా...?” అని బహిరంగంగానే అంటూన్న కాలం ఇది.
లేని విశ్వవిద్యాలయాల పేరుతో కొందరు డాక్టరేట్లు పంచేస్తుంటే చాలామంది ‘లా’ ఒక్కింతయు లేని వాళ్ళు డబ్బులు కట్టి డాక్టరేటు పుచ్చేసుకుని సన్మాన సభలు పెట్టుకుంటుంటే మా బోంట్లు కూడా చచ్చినట్టు వెళ్ళి అభినందాల్సిన పరిస్థితి నడుస్తోందిప్పుడు. నిన్నటి దాకా మనతో భుజం మీద చెయ్యి వేసి తిరిగిన వ్యక్తి తెల్లవారేసరికి డాక్టర్ అయిపోతున్నాడు. ఇప్పుడు అలాంటి డాక్టరేట్లు పెట్టుకోవటానికి ఎవరూ సిగ్గు పడట్లేదు. చక్కగా సిగ్గులేకుండా పుచ్చేసుకుంటున్నారు. ప్రజలే ఇలా ఉంటే ప్రభుత్వం చేసే వాళ్ళు ఇంకెలా వుండాలి?
గుళ్ళో కొబరికాయలు అమ్మే ఆయన వెళ్ళి, "అయ్యా! మీ కార్యకర్తని" అంటే చాలు, ఆ గుడి ట్రస్టీగానో, చైర్మన్ గానో నామినేటై పోతాడు. గుడిపాలకులుగా ఫలానా రకం వాళ్ళుండాలనే రూలెక్కడా లేదు. కాబట్టి, ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడని అంశాలు. రాను రానూ ఇవి ఇతర రంగాలకూ విస్తరించాయి. ‘మన వాళ్ళలో పదవులు ఇవ్వాల్సిన వాళ్ళెందరు? -ఉన్న పదవులు ఎన్నీ అనే అంచనా లిష్టు తయారు చేస్తారు. పూర్వం రోజుల్లో ఈ రెండు లిష్టుల్నీ క్రాస్ మాచింగ్ చేసే వారు. అంటే ఎవరికి ఏది ఇవ్వచ్చో జతపరచి చూసే వాళ్ళు. ఇప్పుడలాంటిదేమీ లేదు.
ఎన్నో నియమాలూ, ప్రమాణాలూ వ్రాసి ఉన్న వైస్ ఛాన్సర్ల లాంటి పోష్టులకే ‘మనాళ్ళు’ అనేది “స్వీయప్రమాణం” అవుతుంటే, ఇంక మామూలు పదవుల గురించి మాట్లాడేదేముంది...? న్యాయమూర్తుల నియామక విషయంలోనూ ఈ ‘మనోళ్ళు’ సిద్ధాంతం నడుస్తోందని, కొలీజియం అభాసు పాలౌతోందని అత్యున్నత న్యాయస్థానమే గగ్గోలు పెట్టే స్థితి నడుస్తోంది.
ఒక పార్టీ అని కాదు, ఒక ప్రభుత్వం అని కాదు, ఒక రాష్ట్రం ఒక సందర్భం అనీ కాదు, ఢిల్లీ నుండి జిల్లా దాకా అంతా ‘మనోళ్ళ’ని ‘వేనోళ్ళ’తో తిననిచ్చే ప్రక్రియ నడిచి పోతోంది. ప్రభుత్వ పదవులు కార్యకర్తల కోసమే ననేది తిరుగులేని సత్యం. వీటిలో కొన్ని ధనాదాయాన్ని సమకూర్చేవి కాగా, కొన్ని పలుకు బడి పెరగటానికి, మరికొన్ని విజిటింగ్ కార్డుల మీద వేసుకోవటానికి పనికొస్తాయి. వీళ్ళంతా వారి వారి స్థాయిల్లో సామాజిక పీఠాధిపతులు. అంటే ఎవరి పీట వాళ్ళు వేసుకుని కూర్చుని ఎవరికి వారే వడ్డించేసుకునే బాపతు. ప్రభుత్వం అనేది ఒక బఫే భోజన శాల. అంతా స్వయం సేవే! ఎవరికి వారే స్వయంగా వడ్డించుకుని తినే వ్యవస్థ!
వీళ్ళు పెట్టుబడీ దారీ మాఫియా ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కాదు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థలో కూడా ఉన్నారు. మృఛ్ఛకటికం నాటకంలో రాజశ్యాలకుడు (రాజుగారి బామ్మర్ది) లాంటి వాళ్ళు ప్రతీ యుగంలోనూ ఉంటారు.
అలాంటి వాడి గురించి పై పద్యం గొప్పగా వ్యాఖ్యానిస్తుంది. ఇలాంటి వాడు ఓ సాహిత్య సభకో, సంఘానికో అధ్యక్షుడిగా కూర్చున్నాడనుకోండి, మహాకవి పండితులు కింద కూర్చోవాల్సి వచ్చిందని ఏమీ చింతించ కండి!. గండ భేరుండ మదేభ సింహ నికురుంబములు చెట్టు కింద కూర్చుంటే, ఒక కోతి చెట్టు చిటారుకొమ్మ మీద కూర్చుని ఉంటుంది. అంత మాత్రాన కింద కూర్చున్న కవి పండితులకు లోటు జరిగిందేమీ లేదని ఊరడిస్తాడు. ఈ పద్యం ఇంత అచ్చు గుద్దినంతగా నేటి కాలానికి అమరి ఉండటం విశేషం. దీనికి ఇంతకన్నా అర్ధ వివరణలు అక్కర లేదు
భాస్కర శతకం వ్రాసిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 మధ్యకాలంలో వాడు. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యం పొందింది.
కవి ఏ కాలానికి చెందిన వాడైనా రేపటి యుగానిక్కూడా వర్తించే విధానంలో సార్వకాలీనంగా వ్రాసిన వాడు చరితార్ధుడు. అందుకే 500 యేళ్ళ తరువాత కూడా ఈ వెంకయ్య కవిత గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుంది.
my feature in andhrabhoomi daily sanjeevani page every wednesday

Tuesday 14 June 2016

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...

Dr. G. V. Purnachand, B.A.M.S.,: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస స...: కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం 2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చ...

కృష్ణాపుష్కరాలు-2016 “కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం: డా. జి వి పూర్ణచందు

కృష్ణాపుష్కరాలు-2016
“కృష్ణాతీరం” పరిశోధనా వ్యాస సంపుటి- రచనలకు ఆహ్వానం


2016 ఆగష్టు 11 నుండీ కృష్ణాపుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు చిరస్మరణీయంగా జరగనున్నాయి.
ఈ పుష్కరాల సందర్భంగా ‘కృష్ణాతీరం’ పేరుతో ఒక ఉద్గ్రంథాన్ని ప్రచురించేందుకు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది.
మన భాషా సంస్కృతులు, మన వైఙ్ఞానిక ప్రగతి, మన సామాజిక రాజకీయ పరిణామాల వైనం ఈ నాటి యువతకు, ఈ నాటి యువ పరిశోధకులకు అందించటం లక్ష్యంగా ఈ గ్రంథ ప్రచురణ జరుగుతోంది. పుష్కరాలు పుష్కలం కావడంతో పాటు ఆ ఙ్ఞాపకాలు పది కాలాలపాటు పదిలం అయ్యేలా ఈ ఉద్గ్రంథం రూపొందుతోంది.
సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. డి విజయభాస్కర్ ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని గ్రంథ ప్రచురణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు, కర్నూలు, మెహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన వివిధ అంశాలపై అపురూప పరిశోధనా వ్యాసాలు ఈ గ్రంథంలో ఉంటాయి. ఆదిమ కాలం నుండీ, నేటి వరకూ కృష్ణాతీరంలో సాగిన జనచైతన్యానికి ఈ ఉద్గ్రంథం అద్దం పట్టేలా ఉండాలని మా ఆకాంక్ష.
కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలైన ఈ జిల్లాలలో చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలు, భాషా సాహిత్యాల ప్రగతి, సాంస్కృతిక రంగ విశేషాలు, విద్య, వైద్య, వైఙ్ఞానిక, సాంకేతిక అంశాలు, వర్తక వాణిజ్యాలు, నీటి పారుదల, వ్యవసాయం, సామాజిక రాజకీయ పరిణామాలకు సంబంధించిన పరిశోధనా వ్యాసాలను ఈ
గ్రంథంలో ప్రచురణార్ధం పంపవలసిందిగా పరిశోధక రచయితలను సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆహ్వానిస్తున్నారు.
వ్యాసాలను ఈ నెల 30వ తేదీ లోగా హైదరాబాదు రవీద్ర భారతి కళాభవన్, సైఫాబాద్ లోని రాష్ట్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ కార్యాలయానికి (e.mail: apdirectorculture@gmail.com లేదా purnachandgv@gmail.com) పంపవలసిందిగా కోరుతున్నారు.
అచ్చులో A4 సైజు లో 6-7 పేజీలకు మించకుండా తెలుగులో వ్యాసాలు ఉండాలి. ప్రచురణ తుది నిర్ణయం సంపాదక మండలిదే!
మరిన్ని వివరాలకు 9440172642 లో సంపాదకుని సంప్రదించ వచ్చు.
డా. జి వి పూర్ణచందు
సంపాదకుడు,
కృష్ణాతీరం పరిశోధనా వ్యాస సంపుటి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ప్రచురణ

Tuesday 7 June 2016

మగ ఏడుపులు డా. జి వి పూర్ణచందు


మగ ఏడుపులు
డా. జి వి పూర్ణచందు
ఱెక్కలు రావు పిల్లలకుఱేపట నుండియు మేతగానమిం
బొక్కుచు గూటిలో నెగసి పోవగ నేరవుమున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కినిక్కి న
ల్దిక్కులు జూచుచున్న వతి  దీనతనెట్లు భరింతు నక్కటా!
(శ్రీ మదాంధ్ర మహా భాగవతము- 7/63)

భార్యలు ఊరెడితే భర్తలు ఎంజాయి చేస్తారని చాలా మంది కథలుకార్టూన్లు సృష్టిస్తారు గానీపిల్లల్ని ఇంట్లో వదిలి వెడితే అప్పుడు తెలుస్తుంది అయ్యగార్ల సంగతి. ఈ దేశంలో భర్త లేకపోయినా స్త్రీ జీవించగలదు. కానీ భార్య లేకపోతే భర్తకు ఒక్క పూట కూడా గడవదు. భర్త పోతే తోడుమనిషి పోయాడని ఏడుస్తుంది భార్య. భార్య పోతే ఇల్లెలా నడుస్తుందని ఏడుస్తాడు భర్త. వంటెవరు చేస్తారు?ఇల్లెవరు ఊడుస్తారుఅంట్లెవరు కడుగుతారుబట్టలెవరు ఉతుకుతారుపిల్లల్నెవరు సాకుతారు?అందుకని భార్య లేదని మగాళ్ళు ఏడుస్తారు. భార్య ఉన్నంత సేపూ వేధించుకు తినటం‘నుయ్యో గొయ్యో చూసుకుంటా’నని ఆమె ఏడవటం‘చస్తే చావుఈడ్చి పారేస్తా’... అని అతను అరవటం...ఇవి చాలా ఇళ్ళలో నిత్య కృత్యాలే! కానీఒక్క రోజు భార్య ఇంట్లో లేకపోతే తలకిందులై పోతాడు మగాడు.

ఇదేదో మహిళా ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న ఈ నాటి సామాజిక పరిస్థితి కాదు. పోతనగారి నాటికే ఈ ధోరణి ఉంది. ఆయన తన భాగవతంలో ఇలాంటి కథే ఒకటి చెప్పాడు: ఉశీవర రాజ్యాన్ని పాలించే సుయుఙ్ఞుడనే రాజు యుద్ధంలో మరణించాడు. శవం చుట్టూ చేరి భార్యలుబంధువులూ ఏడుస్తున్నారు. అది చూసి సాక్షాత్తూ యముడు ఓ బ్రాహ్మణ బాలుడి రూపంలో అక్కడికి వచ్చాడు. ఆ ఏడ్చే వాళ్ళందరినీ ఊరడించేందుకోసం వాళ్లకు ఈశ్వర తత్వాన్ని బోధిస్తాడు. ఆ క్రమంలో ఈ ‘కథ చెప్పాడు...

అడవిలో ఓ చెట్టు మీద అడవి పిచ్చుకల జంట సుఖంగా ఉన్నాయి. ఆ సమయంలో ఓ వేటగాడొచ్చి “భార్యపిచ్చుక”ని పట్టి రెక్కలు విరిచి సంచీలో వేసుకున్నాడు. అప్పుడు “భర్తపిచ్చుక” ఏడుస్తూ ఇలా అంది: “అయ్యయ్యో! మన పిల్లలకు ఇంకా రెక్కలు కూడా రాలేదు. అవి ఎగర లేవు. తెల్లవారిం దగ్గర్నుంచీ అవి ఆకలో మొర్రో అంటూ గోలచేస్తాయి, నువ్వెప్పుడొచ్చి అన్నం పెడతావా... అని నీకోసం నిక్కినిక్కి చూస్తాయి. వాటి ఏడుపు వినటానికే భరించ లేనంతగా ఉంటుంది. ఇంకనుండి చచ్చినట్టు వాటికి ఆహారం నేనే తెచ్చి పెట్టవలసి వస్తుంది కదా!” అని భర్త పిచ్చుక ఏడ్చినట్టు వ్రాశాడు పోతన గారు.  “మగఏడుపులు” ఎలా ఉంటాయో ఈ పద్యం మనకు వివరిస్తోంది

బతికున్నంత కాలం భర్తలు అన్యాయం చేసినా, తన భర్త చనిపోయి తనకు అన్యాయం చేశాడనే అంటుంది భార్య. అనుకుంటుంది కూడా! కానీ, భర్తలు మాత్రం అలా అనుకోరు. అదే తేడా!
ఉశీవర దేశ రాజు పోయాడని అతని రాణులు ఏడ్చినప్పుడు యముడు వచ్చి,  భార్య పోతే ఏడ్చినఈ భర్త కథ చెప్పినట్టు పోతనగారు వ్రాశాడు. ఇందులో విచిత్రం ఏమీ లేదు. లోకం తీరు చెప్పాడు యముడు. అదే ఈశ్వర తత్త్వం అంటే! లోకాన్ని నడిపించేది ఈశ్వరు డైనప్పుడు లోకం తీరు ఈశ్వర తీరే అవుతుంది కదా! దాన్నే చెప్తున్నాడు ఈ పద్యంలో పోతన.

అందరు మగాళ్ళు ఇలానూ, అందరు ఆడాళ్ళు అలానూ ఏడవాలనే రూలేమీ లేదు. ఏడవటానికి కారణాలు వేరుగా  ఉంటాయనేది మాత్రం నిజం. సామాజిక వ్యవస్థ తీరే అంత! మనుషులందరూ పరస్పరం ఆధారపడి బతికితేనే అది సమాజం అనిపించుకుంటుంది. కానీ, భార్యా భర్తల విషయానికి వచ్చే సరికి మాత్రం భార్యని తాను పోషిస్తున్నానని, అందుకు కృతఙ్ఞతగా భార్య ఆజన్మాంతం అణిగి ఉండాలనీ భర్తల్లో ఓ బలమైన భావం సర్వత్రా కనిపిస్తుంది. భార్య సంపాదన మీద ఆధారపడి బతికే వాడిక్కూడా ఇలాంటి ఆలోచనే ఉంటుంది...తన వలనే కదా ఆమె సుఖంగా వుందని! అసలు రహస్యం ఆమె పోయినప్పుడే తెలుస్తుంది... అందుకే మగజాతి అలా ఏడుస్తుంది!