Tuesday 20 October 2015

అధికార మదం :: డా. జి వి పూర్ణచందు

అధికార మదం

డా. జి వి పూర్ణచందు


“అభ్రమండలి మోచునందాక నూరక/పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక/పరచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూభువనంబునందాక నూరక యెగసినట్లౌ మేను జగధీశ
యహిలోకతల మంటు నందాక నూరక/పడినయట్లౌ మేను ప్రభువతంస
యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్దులేడును జెడగ్రోలు నంత తృషయు
నచల చాలన చణమైన యదట గలిగె
నసురభావంబు నను జెందు నవసరమున”
ఆల్కాహాల్ సేవించిన వాడిలో కలిగే లక్షణాన్ని ‘మదం’ అంటారు. మదం వలన చెలరేగి ప్రవర్తించటాన్ని ‘మదాత్యయం’ అంటారు. అప్పటిదాకా `ఏవండీ’ అన్నవాడు కాస్తా, రెండు చుక్కలు పడగానే ‘ఏరా’లోకి దిగిపోతాడు. “మదం ఎక్కిందా?’’ అని పెద్దలు కేకలేస్తున్నారంటే, అది తెనాలి రామకృష్ణుడు “కల్లు జవి గొన్నావా? లం…” అని తిట్టిన తిట్టు లాంటి దన్నమాట.
మద్యం చవిగొన్నాక, మదం ఎక్కగానే కొన్ని లక్షణాలు పేట్రేగుతాయి. తనను తాను ఆకాశం దాకా పెరిగిపోయి దాన్ని ఆక్రమించాననుకుంటాడు. భూమికి ఆ అంచునుంచీ ఈ అంచుదాకా అదంతా తనదే ననుకుంటాడు. కింద పాతాళం కూడా తన ఆధీనం లోనే నంటాడు. అన్ని లోకాల్నీ కబళించేయాలన్నంత ఆకలి, సప్త సముద్రాలనూ తాగేయాలన్నంత దాహమూ కలిగి, ఇంకా ఇంకా మదిర సేవిస్తుంటాడు.
ఇలా లోకాల్ని కబళించే తియ్యటి కలలు కనటాన్ని పామర భాషలో కిక్కు అనీ, పండిత భాషలో ‘మదం’ అనీ అంటారు. తను తలుచుకుంటే ఈ కొండని ఒక్క తన్ను తన్ని సినిమాలో లాగా అవతలికి విసిరి కొట్ట గలననుకునే వింత తత్వమే మదం. వీళ్ళని ఏ మురుక్కాలువలోనో పడి ఉన్నాడని తెచ్చి తెలిసినవాళ్ళు అప్పచెప్తుంటారు. మదం తెచ్చి పెట్టే ప్రమోదమూ, ప్రమాదమూ ఇలా ఉంటాయి.
ఇలాంటి ‘మదం’ మందు కొట్టటం వలన మాత్రమే కలగాలని లేదు, అధికారమదం అంతకన్నా ఎక్కువ కిక్కు ఇస్తుంది. పదవిలోకి వచ్చీరావటమే, అధికారమదం తలకెక్కిపోతుంది. ‘ఐ. వీ. ఇంజెక్షను’లా వెంటనే మత్తెక్కటాన్ని ‘యోగవాహి గుణం’ అంటారు. అంతటి యోగవాహి గుణాన్ని తెచ్చిపెట్టే శక్తి లౌకిక వ్యవహారంలో ఒక్క ‘అధికార పదవి’కి మాత్రమే ఉంది. పదవి రాగానే పైన ఆకాశం దాకా, కింద పాతాళం దాకా, చుట్టూ ఆకొన నుండి ఈ కొన దాకా మొత్తం తన కబ్జా లోనే ఉండా లంటాడు. లోకాలన్నింటినీ కబళించేసి, సప్త సముద్రాల్ని తాగేస్తానంటాడు. లోకానికి హాని చెయ్య గలగా లంటే మనిషి లోపలికి ఓ రాక్షసుడు ప్రవేశించాలి. ఆ రాక్షసుడు అతన్ని ఆక్రమించి నప్పుడు అతనిలో కలిగే ఇలాంటి లక్షణాల్నే మదం అంటారు.
పైన చెప్పిన పద్యం అల్లసాని పెద్దనగారి ‘మనుచరిత్ర’ లోది. తనకు వైద్యం నేర్పటానికి బ్రహ్మదత్తుడనే ముని ఒప్పుకో లేదని, ఇందీవరాక్షుడు ఆయన వైద్య పాఠాలు రహస్యంగా విని వైద్యం నేర్చేసుకుని, తిరిగి ఆ ముని దగ్గరకే వెళ్ళి వెక్కిరిస్తాడు. ఒళ్ళు మదం ఎక్కటం అంటే ఇదే! దాంతో ముని ఇందీవరాక్షుణ్ణి రాక్షసుడివి అయిపొమ్మని శపించాడు. ఆ క్షణంలో అతన్ని ఒక రాక్షసుడెవరో ఆవహించినట్టు తాను భూమ్యాకాశ పాతాళాల దాకా పెరిగిపోయిన భావన పొందినట్టు, లోకాల్ని కబళిస్తు న్నట్టు, సముద్రాల్ని తాగేస్తున్నట్టు అన్పించిందని, ఈ పద్యంలో ఇందీవరాక్షుడు స్వారోచిషుడికి చెప్పటం కనిపిస్తుంది.
ప్రతి మనిషిలోనూ ఒక సైతాన్ ఉంటాడు. మనసులోని సత్వగుణం ఈ సైతాన్ని అణచి ఉంచాలని చూస్తుంది. సత్వం గెలిస్తే మనిషి మానవుడు అవుతాడు. సైతాన్ గెలిస్తే మనిషి పొలిటీషియనో, మాఫియానో అవుతాడని నేటి జనవాక్యం. ఇది ఎవరో పుణ్యాత్ముడు వచ్చి ఇచ్చే శాపం వలన మాత్రమే జరగాల్సిన అవసరం లేదు. మనిషి మనసులో సాత్వికాంశ పలచ బడ్తున్న కొద్దీ సైతాను తనకు తానుగా విజృంభిస్తుంటాడు. “నాది దుందుడుకు స్వభావం. కోపం వస్తే అలాగే ప్రవర్తిస్తాను. అందుకే నా మీద వందలాది కేసులున్నాయి. కొట్టానంటే అందులో తప్పేముందీ…నా స్వభావమే అంత” అని ఒక నేత బహిరంగంగా పత్రికల్లో అన్నాడంటే, పాపాలకు శాపాలు కారణం కాదనీ, అవి భస్మాసుర వరాలేననీ అర్ధం అవుతుంది.
వెనకటికి ఒక బామ్మగారు “నీ ఇంట కోడి కాల్చా” అని శపిస్తే, శుభం అన్నాడట పక్కింటాయన రొట్టలేస్తూ! ఈ రోజుల్లో బ్రహ్మదత్తుడి లాంటి పుణ్యాత్ముడు వచ్చి దుర్మార్గం చేసిన వాణ్ణి ‘బ్రహ్మ రాక్షసుడివైపో’ అని శపిస్తే, వెంటనే సదరు దుర్మార్గుల వారు ముని గారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటా నంటాడు. కలకాలం తననిలా రాక్షసుడిలానే ఉండనివ్వాలని కోరుకుంటాడు.
‘Drive the Devi out-నీలో సైతాన్ తరిమేయ్’ అనేది పాత సిద్ధాంతం. “Keep the Devil in-నీలో సైతాన్ని దాచేయ్-దోచేయ్” అనేది నేటి మేటి సిద్ధాంతం.