Sunday 23 February 2014

ఓ విచారఫలం కథ :: డా. జి వి పూర్ణచందు

ఓ విచారఫలం కథ
డా. జి వి పూర్ణచందు

చింతపండుని విచారఫలం అని ఒక కవి చమత్కరించాడు. మనకి ఈ చింత ఎక్కడిది...? ప్రపంచం అంతా దీన్ని టామరిండ్ అని పిలుస్తారు. టామర్ ఎ హింద్అంటే,భారతదేశపు పుల్ల ఖర్జూరం అని!
ఉత్తర భారత దేశంలో ఇమ్లీ,అమ్లీ పేర్లు ఎక్కువగా ప్రసిధ్ధి. సంస్కృతంలో చించాఫలం లేక తింత్రిణీ అంటారు. వివిధ ద్రావిడ భాషల్లో చింత, చింతం, ఇంతం, సింత, హిత్త, ఇత్త, ఈత లాంటి పేర్లున్నాయని డిఇడిఆర్2529చెప్తోంది. ద్రవిడియన్ ఎటిమాలజీ అనే మరో నిఘంటువు మూల దక్షిణద్రావిడ భాషలో సింత్”, అలాగే మూల తెలుగు భాషలో చింత్తెలుగు వ్యావహారికంలో చింతపదాలు ఏర్పడ్డాయని పేర్కొ౦ది. మూల గోండీ భాషలో సిత్-అ, సిత్త, హిత్త, ఈత లాంటి పదాలు ఏర్పడ్డాయి. దీన్నిబట్టి, ఇంగ్లీషులో టామరిండ్, తెలుగులో చింత ఈ రె౦డు పేర్లకు ఈత” Indian date-palm tree అనే పేరు మూలం అని భావి౦చవచ్చు.
16వ శతాబ్ది తరువాతే అమెరికన్ ఖండానికి చింత చెట్టు తెలిసింది. ఇప్పుడక్కడ అది విస్తారంగా పండుతోంది. మెక్సికోలో దీన్నిపల్పరిండో అంటారు. ఆహార పదార్థాలలోకన్నా ఔషధ తయారీ ప్రరిశ్రమలలో దీని వాడకం ఎక్కువ.
చింతచిగురు, చింతపూలు, చింతపండు ఈ మూడింటికీ నొప్పులనూ, వాపులనూ తగ్గి౦చే గుణం ఉందని ఆయుర్వేద శాస్త్ర౦పేర్కొ౦ది. బెణికిన చోట చింతపండు పట్టు వేయట౦ మనకు తెలుసు. నొప్పి, వాపులను తగ్గి౦చే ఆయింట్‘మె౦ట్‘ల తయారీలో వీటిని ఇప్పుడు విస్తారంగా వాడుతున్నారు. గోంగూర పచ్చడి, పెసర పప్పు, చింతపండు పులుసు...ఇవి తెలుగు వారి ఇష్ట దైవాలు. ఈ మూడింటికీ ఆఫ్రికా ఖండమే మూలం. ఆఫ్రికన్లకూ మనకూ సమానంగా దొరికే ఇలాంటి ఆహార ద్రవ్యాలు వండే తీరులో కూడా వారికీ మనకీ పోలిక ఉంది.చింతచిగురు చవకగా దొరుకుతుంది. చింతపండుకు ప్రత్యామ్నాయం చింతచిగురే! శరీరానికి ఇనుము వంటబట్టేలా చేయటానికీ, రక్తధాతు వృద్ధికీ, కాలేయాన్ని శక్తిమంతం చేయటానికీ చింతచిగురును మించిన ఔషధం లేదు.
చిన్నకుండ లేదా ముంతలో రె౦డు గ్లాసుల నీళ్ళు పోసి, అందులో చింత చిగురు ఎండించి దంచిన పొడిని ఒక చె౦చాడు కలిపి, తుప్పు పట్టని కొత్త ఇనుప మేకు అందులో వేసి నీళ్ళు సగం మరిగేంతవరకూ కాచి, వడగట్టి తాగితే రక్తహీనత, లివర్ వ్యాధులూ, కామెర్లూ త్వరగా తగ్గుతాయి. ఎదిగే పిల్లలకు, యుక్తవయసు ఆడపిల్లలకు, మెనోపాజ్ వచ్చిన స్త్రీలకూ, వృధ్ధులకూ ఇది గొప్ప ఔషధం. మేకును జాగ్రత్త చేసుకొని రోజూ ఈ చింతచిగురు టీతాగవచ్చు. ఫిల్లిప్పైన్స్ లో దీన్ని మలేరియా జ్వరం తగ్గటానికి తాగిస్తారు. ఈజిప్ట్ లో చల్లని వేసవి పానీయంగా తాగుతారు.
పోషక విలువలను లెక్కించి చూస్తే, చింతపండు, చింతకాయలకన్నా చింత చిగురు ఎక్కువ ప్రయోజనకారి. చింతపండులో ప్రొటీన్లు 3.10 గ్రాములుంటే, చింతచిగురులో 5.8 గ్రాములు ఉన్నాయి. అపకారం చేసే తార్తారిక్ యాసిడ్ చింతపండులో ఉన్న౦తగా చింతచిగురులో ఉండదు. గ్లూకోజు, ఫ్రక్టోజు లాంటి పంచదార పదార్థాలు చింతపండులో 30-40%ఉన్నాయి. రకరకాల పళ్ళు షుగర్ వ్యాధిని ఎలా పెంచుతాయో చింతపండుకూడా అలానే పెంచుతుంది.
రక్త౦లొ కొలెస్ట్రాల్ మీద చింతపండు ప్రభావం గురించి 2౦౦5లో కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశీలన చేసి, పరిమితంగా తినే వారిలో 2% కొలెస్ట్రాల్ తగ్గగా, అతిగా తినే వారిలో 8% పెరిగిందని కనుగొన్నారు. అంటే, చింతపండు ఒక ఔషధం లాంటిదనీ, దాన్ని పరిమితంగా తీసుకోవాలనీ అర్ధం. అల్సర్లు, కీళ్ళవాతం, ఎలెర్జీ వ్యాధుల్లో కూడా చింతపండు అపకారమే చేస్తుంది. వామన కాయలుఅంటే, లేత చింతకాయలు పైత్యం చేస్తాయి. వాత, కఫ వ్యాధుల్ని ఉబ్బసాన్నీ పెంచుతాయి.అన్నమయ్య ఒక కీర్తనలో చింతకాయ కజ్జ౦అనే పదం ప్రయోగించాడు. తీపిబూందీని పూసకజ్జెంఅంటారు. ఈ కజ్జెం చింతపండుతో చేస్తే తినడానికి పనికిరాదు కదా... అలా వాడకానికి పనికిరానిదాన్ని చింతకాయకజ్జెం అన్నాడు అన్నమయ్య.
చింతపువ్వ౦త, చింతాకంత అంటూ చిన్నవాటిని పోలుస్తుంటాం. చింతాకు ముడుగు తరి”, “చింతెలుగుఅనే పదాలకు చీకటి పడబోయేముందు సన్నని సందె వెలుగు అని అర్ధం.
చింతకాయల్ని దంచి ఊరగాయ పెట్టేప్పుడు, గింజలు ఏరేస్తారు. వాటిని నీళ్ళలో వేసి మరిగిస్తే, చిక్కని పుల్లని చింతంబలి”, “చింతగంజిలేదా చింతసరితయారవుతుంది. తగినంత ఉప్పూ కారం తాలింపు పెట్టుకొని తాగితే రుచికరం, జీర్ణశక్తిని పెంచుతుంది. పండిన చింతకాయ పెంకుని చింతగుల్లఅంటారు.
చింతపండుని అంటుకొన్న ఈనెల్ని చింతనరాలులేక చింత ఉట్టిఅంటారు. చింతపండు లోపల గింజల్ని చింతపిక్కలంటారు. సీలింగ్ ఫ్యాను తగిలించటానికి పైన శ్లాబుకు గానీ దూలానికి గానీ తగిలించే కొక్కేన్ని చింతకాయ అంటారు. చింతకుండిఅంటే ఇనప ఊచ. ఆగ్రహ౦ ప్రదర్శి౦చాడు అనటానికి కళ్ళలో చింతనిప్పులు కురిపించాడంటాం.
చింత కర్రని పొయ్యిలో పెడితే ఎర్రని నిప్పులు వస్తాయి. చాలా సేపు ఆ వేడి నిలబడి ఉంటుంది. ఆబూడిదను నీళ్ళలో కలిపి వడకట్టి ఆ నీటిని ఒకరాత్రంతా నిలవ బెడతారు. తెల్లవారేసరికి అడుగున తెల్లటి ముద్ద పేరుకుంటుంది. దాన్ని చించాక్షారంఅని పిలుస్తారు. ఇది పేగుపూతను, జీర్ణకోశ వ్యాధుల్నీ తగ్గి౦చట౦లో గొప్పఔషధంగా పనిచేస్తుంది.ఇప్పటి పిల్లలకు చింతబరికెఅంటే తెలియదు. ఒకప్పుడు స్కూలు మాష్టర్ల దగ్గర చింతకొమ్మే బెత్త౦! అదే పాఠాలు చెప్పేది. కాబట్టి, నాణ్యమైన చదువులు వచ్చేవి.చింతచెట్టుమీద బ్రహ్మరాక్షసి ఉంటుందనే నమ్మకం మనకే కాదు, ఆఫ్రికన్లకూ ఉన్నదట! అతిగా తింటే చింతపండే పెద్ద బ్రహ్మరాక్షసి.



పచ్చళ్ళ ముచ్చట్లు:: డా. జి వి పూర్ణచందు

పచ్చళ్ళ ముచ్చట్లు
డా. జి వి పూర్ణచందు

కూటికి లేని తనాన్ని చెప్పటానికి పచ్చడి మెతుకులే గతి అంటారు గానీ, నిజంగా పచ్చడి లేకపోతే కడుపు నిండినట్టు అనిపించదు. నిండదు కూడా!
పచ్చడి, మన ప్రాచీన వంటకాలలో ఒకటి. రొట్టేలతో తినటానికైనా, అన్నంలో తినటానికయినా పచ్చడి అనుకూలంగా ఉంటుంది. కూరతో సమానమైన గుణ ధర్మాలన్నీ పచ్చడికీ ఉంటాయి.
ఉత్తర భారతీయులు రోటి పచ్చడిని చట్నీ అనీ, ఊరగాయని అచార్ అనీ అంటారు, ‘అచి’, ‘అచ్చర”, ‘అచ్చడ్పదాలు పచ్చడి మన అనే పదానికి దగ్గరగా ఉన్నాయి. ఊరగాయల్ని కూడా ఊరగాయ పచ్చడి అనే పిలుస్తాం మనం.
ప్రాచీన అమెరికన్ రెడ్డిండియన్ భాషల్లో ఆక్సి, అహి, అచి పదాలు పచ్చడిని సూచించేవి ఉన్నాయి. అచి, అచ్చడ్, పచ్చడి, ఒకే మూలంలోంచి పుట్టిన పదాలు. అది మూలద్రావిడ పదం అయి ఉంటుంది. మిరప కాయల రాక తర్వాత తెలుగు పచ్చళ్ళ స్వరూపస్వభావాలు మారిపోయాయి. అనేక రకాల పచ్చళ్ళు తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు.తొక్కు: గోంగూర తొక్కు, చింతకాయ తొక్కు, ఉసిరికాయ తొక్కు, ఇవన్నీ నిలవ ఉండేలా తయారు చేసిన పచ్చళ్ళు. ఉప్పు కలిపి ఊరబెడతారు.నంజు: నంజు, నంజుడు, నంజు పచ్చడి. పెరుగు అన్నంలో గోంగూర పచ్చడి నంజుడుకు గొప్ప ఉదాహరణ.ఉపదంశం: సంస్కృతంలో పచ్చడిని ఉపదంశం అంటారు. పప్పుదినుసుల్ని గాని, కూరగాయల్ని గానీ మెత్తగా రుబ్బి, తయారుచేసే వ్యంజన విశేషం అని నిఘంటువు అర్థం దీనికి!ఊర్పిండి: రుబ్బిన పప్పుధాన్య౦ పిండిని ఊరుపిండి. అట్లు, వడలు చేసుకోవటానికీ వడియాలు పెట్టుకోవ టానికి రుబ్బిన మినప పిండిని ఊరుపిండి అంటారు. అందులో అల్లం, పచ్చిమిర్చి కూడా కలిపి రుబ్బితే ఊర్బిండి పచ్చడిఅవుతుంది. అన్నంలో తింటారు దీన్ని.ఊరు పచ్చడి: దీన్ని రోటి పచ్చడి అంటున్నాం. పప్పుదినుసులు, కూరగాయ ముక్కలు వేయించి, మిరపకాయలు కలిపి రుబ్బిన పచ్చడి ఊరుపచ్చడి.బజ్జీ పచ్చడి: శ్రీనాథుడు బజ్జులు అనే వంటకం గురించి ప్రస్తావించాడు. ఏదైనా కూరగాయని నిప్పులమీద కాల్చి, రోట్లో వేసి రుబ్బి, పప్పుదినుసులతో తాలింపు పెట్టిన పచ్చడినే శ్రీనాథుడు బజ్జుఅన్నాడు. అంటే,బజ్జీ పచ్చడి!
ఊరగాయ పచ్చడి: కూరగాయని ముక్కలుగా తరిగి, ఉప్పు కలిపి ఉంచడాన్ని ఊరబెట్టడం అంటారు. నిమ్మ, టొమోటో లాంటి పళ్ళతో ఊరుపండునీ, మామిడి, చింతకాయలాంటి కాయలతో ఊరగాయనీ పెడుతున్నాం. కంద, పెండలంలాంటి దుంపలతో, గోంగూరలాంటి ఆకుకూరలతో కూడా ఊరగాయలు పెడుతున్నాం. మాంసంతో కూడా ఊరగాయ పెడతారు, దాన్ని ఊరుమాంసం అనాలి.ఊరుపిండి పచ్చడి: నువ్వులు, వేరుశెనగ గింజలు, ఆవాలు, కొబ్బరి ఇలాంటి వాటిలోని నూనెని తీసేసిన తర్వాత మిగిలే పిండిని తెలికి పిండి అంటారు. దాన్ని నీళ్ళలో గాని, మజ్జిగలో గాని నాలుగైదు రోజులు నానబెడితే పులుస్తుంది. దానికి అల్లం, పచ్చిమిర్చి వగైరా చేర్చి మెత్తగా రుబ్బి, తాలింపు పెట్టిన పచ్చడిని కూడా ఊరుపిండి పచ్చడిఅంటారు.పచ్చడిని తినట౦ ఒక గొప్ప. దాన్ని తయారు చేసుకోవట౦లోనే ఆ గొప్పంతా ఉంది. మనవాళ్ళలో చింతపండు మీద వ్యామోహ౦ పెరిగి ఇటీవలి కాలంలో ప్రతిదానిలోనూ చింతపండు రసం పోయట౦ మొదలు పెట్టారు. అందువలన అదనంగా ఉప్పు, కారం కలప వలసి వస్తుంది.
పచ్చడి అనేది కడుపులో మంటని తెచ్చిపెట్టేదిగా మారిపోవటానికి అందులో అతి మషాలాలు, చింతపండు కలపటమే కారణం! వాస్తవానికి చింతపండుని కేవలం నాలుగురోజులపాటు నిలవ ఉంచుకొనే ఉద్దేశ్య౦తోనే పచ్చడిలో వేసి నూరతారు. కానీ, ఏ రోజుకారోజు సరిపడేదిగా పచ్చడి చేసుకుంటే చింత పండు అవసరం ఉండదు కదా! చింతపండు వేయనందువలన ఆ కూరగాయ అసలు రుచిని పొందగలుగుతా౦. అన్ని పచ్చళ్ళలోనూ ఎత్తుకెత్తు చింతపండు కలిపితే, ఏ పచ్చడయినా ఒకటే రుచిలో ఉంటుంది. ఆ భాగ్యానికి రుచి కోసం ఖరీదయిన కూరగాయలు కొనుక్కోవట౦ దేనికి చెప్పండీ?
 ప్రతి వంటకంలోనూ, అల్లం,వెల్లుల్లి, మషాలాలు లేదా, చింతపండు రసం అతిగా కలిపే వాళ్ళు కూరగాయలలోని అసలు స్వారస్యాన్ని పొందలేని దురదృష్టవంతులే ననక తప్పదు.
రోటిపచ్చళ్ళను కూరగాయలతో మాత్రమే చేసుకుంటున్నాం. మాంసాహారమైతే, దాని నీచువాసన పోవటానికి అందులో వెల్లుల్లి లాంటి ఉగ్రగంథ ద్రవ్యాలను కలిపి వండవలసివస్తుంది. మరి కూరగాయలలో అలాంటి నీచువాసన ఉండదుకదా... వాటికి మషాలాలు కలపాల్సిన అవసరం అయితే లేదు. కలిపితే వాటి అసలు రుచిని మనం మూసేసినట్టే అవుతుంది. పచ్చడిని మషాలాలతోనూ, చింతపండుతోనూ కల్తీ చేయకుండా చెసుకుంటే ఆరోగ్యప్రదమైన రుచిని పొందగలుగుతా౦!

తెలుగు ఇడ్లీలు డా. జి వి పూర్ణచందు

తెలుగు ఇడ్లీలు

డా. జి వి పూర్ణచందు

ఇప్పుడు మనం తింటున్నంఇడ్లీ, ఒకప్పుడు మన పూర్వులు తిన్న ఇడ్డెనఒకటి కాకపోవచ్చు. తెలుగునాట నాలుగు వందల ఏళ్ళుగా ప్రసిద్ధి పొందిన ఆయుర్వేద గ్రంథం యోగరత్నాకరంలో ఆనాటి తెలుగువారి ఆహార పదార్థాల వివరాలు కన్పిస్తాయి. దీని గ్ర౦థకర్త ఆ౦ధ్రుడు కావచ్చునని పండితులు నిర్ధారించారు కూడా! ఇండరీఅనే ఒక వంటకం ఇందులో ఉంది.
మినప్పప్పు(లేదా పెసర పప్పు)ని రుబ్బి అల్లం, జీలకర్ర కలిపి ఆవిరిమీద ఉడికించినవి ఈ ఇండరీలు. వీటినే ఆవిరికుడుములు లేదా వాసెనపోలిపేర్లతో మొన్నమొన్నటి దాకా పిలిచేవారు. అప్పట్లో ఇండరీలని కూడా పిలిచి ఉంటారు. ఉప్పుడురవ్వ కలపకుండానే వీటిని తయారు చేసుకున్నారని గమనించాలి.హ౦సవి౦శతికావ్య౦లో అయ్యలరాజు నారాయణామాత్యుడు “..ఉండ్ర౦బులు మండె(గలు( గుడుములు దోసెలరిసెలు రొట్టెలు నిప్పట్లు...గురించి పేర్కొన్నాడు. ఈ వరుసలో అరిసెలున్నప్పటికీ, తక్కినవన్నీ భక్ష్యాలే! ఈ ఇడ్డెనలను ఉండ్రాళ్ళు, కుడుముల దగ్గర కాకుండా, “...బరిడ గవ్వలు జా(పట్లును ఇడ్డెనలు తేనె తొలలు బొరుగులు...అంటూ కొన్ని రకాల తీపి పదార్థాల వరుసలో పేర్కొన్నాడు.
శ్రీధరమల్లె వెంకటరామకవి కూడా బ్రహ్మోత్తరఖండము కావ్య౦లో పరమాన్నములు దేనె ఫలరస ప్రకరంబు లిడ్డెనల్ పులగంబు లడ్డువములు..అంటూ, ‘ఇడ్డెనలను తీపి పదార్థాలతో పాటే ప్రస్తావి౦చాడు. పక్కనే పులగాన్ని కూడా పేర్కొన్నాడు. పులగం అనేది పెసరపప్పు, కందిపప్పు లేదా మినప్పప్పు కలిపి వండిన అన్నం. పెసర పులగం ప్రసిద్ధి. దీన్ని నెయ్యి, బెల్లం ముక్కతో దేవుడికి నివేదన పెడతారు. ఇందులో ఉప్పు, కారం తాలింపులు ఏవీ ఉండవు. అందుకని, కారపు ద్రవ్య౦ కాదు. మన పూర్వీకులు ఇడ్డెనలను తీపి పదార్ధంగానే తినేవాళ్ళని భావి౦చే౦దుకు దీన్నిబట్టి అవకాశం ఉంది. దీన్ని రసగుల్లా లాగా పంచదార పాకంతో గానీ, తియ్యని పాలతో గానీ, తేనెతో గానీ, తినే వాళ్ళన్నంమాట! ఇదీ తెలుగు ఇడ్లీ!వీటూరి వాసుదేవశాస్త్రి గారు 1938లో వస్తుగుణప్రకాశికవైద్యగ్రంథంలో ఇడ్డెనల గురించి వివరిస్తూ, “కాఫీ హోటళ్ళలో నిది ప్రథానమగు ఫలహారపు వస్తువు. ఇరువది సంవత్సరముల ను౦డి దీనికి కలిగిన ప్రభావము, వ్యాప్తి వర్ణనాతీతము. దీనికై ప్రత్యేకముగ ఇడ్లీపాత్రలు బయలు దేరినవి, నాగరికత గల ప్రతి కుటుంబములోనూ యుదయము నిడ్డెన తయారు చేయుచునే యు౦దురుఅని వ్రాశారు. ఈ మాటల్నిబట్టి 1920కి పూర్వ౦ మనపూర్వులు ఇప్పటిలాగా ఇడ్లీలను తయారు చేసుకొనేవారు కాదని, ఈ పద్ధతిలో తినేవారు కాదని కూడా అర్ధం అవుతోంది.
ఈ కాలంలోనే ఉడిపి కాఫీ హోటళ్ళు ఊరూరా వెలిసాయి. మొత్త౦ దక్షిణ భారత దేశంలోనే ఇడ్లీ ఒక ప్రాథమిక వంటకంగా నిలబడిపోయింది. అట్టు, ఉప్మా, పూరీలు ఇడ్లీకి తోడైనాయి. ప్రొద్దునపూట చలిదికి బదులుగా టిఫిన్ చేయట౦ మొదలైంది. టిఫిన్ తిన్న తరువాత కాఫీ, టీలను సేవి౦చట౦ ఒక నాగరికత అయ్యి౦ది.కన్నడం ఇడ్డళి”, తమిళం ఇడ్డలికాలక్రమంలో ఇడ్డిలి- ఇడ్లీ గా రూపాంతరం పొంది వుండవచ్చు. క్రీ.శ. 920కి చె౦దిన శివకోటి ఆచార్య కన్నడ వడ్డరాధనేగ్ర౦థ౦లో ఇడ్డలిగేపేరు మొదటగా పేర్కొన్నాడని ప్రసిధ్ధ ఆహార చరిత్రవేత్త కె టి అచ్చయ్య రాశారు. ఒక బ్రహ్మచారికి వడ్డి౦చిన 18 రకాల వంటకాలలో ఈ ఇడ్డలిగేఒకటిట! ఆ విధంగా కన్నడం వారు ఇడ్లీల సృష్టికర్తలు కావచ్చునని ఆయన ఆభిప్రాయం.క్రీ.శ 1025లో చాముండరాయ కవి తన కాలంలో ఇడ్లీలను ఎలా తయారు చేసుకొనేవారో చక్కగా వివరించాడు. మినప్పప్పుని మజ్జిగలో నానబెట్టి రుబ్బి ఆవిరిమీద ఉడికించి, వాటిని తాలింపు పెట్టిన పెరుగుపచ్చడి లేదా మజ్జిగ పులుసుతో నంజుకొని తినేవారట. క్రీ.శ. 1130లో మానసోల్లాసఅనే విఙ్ఞాన సర్వస్వ గ్ర౦థ౦ ఆనాటి కన్నడ ప్రజల సా౦ఘిక జీవితానికి అద్ద౦ పట్టి౦ది. ఇందులో ఇడ్డరికల ప్రస్తావన ఉంది. రుబ్బిన మినప్పిండిలో మిరియాలపొడి, జీరా వగైరా సుగంధ ద్రవ్యాలు కలిపి ఇంగువ తాలింపు పెట్టి, దాన్ని ఉండలుగా చేసి ఆవిరిమీద ఉడికించే వారని ఈ గ్ర౦థ౦ పేర్కొ౦టో౦ది. 17వ శతాబ్దికి ముందు తమిళ గ్ర౦థాలలో ఇడ్లీ ప్రస్తావన లేదని అచ్చయ్య పేర్కొన్నారు.
కంచి వరదరాజ స్వామికి కిలోన్నర బరువుగల ఇడ్లీని నైవేద్యం పెట్టే ఆచారం ఉన్నందట! బియ్య౦, మినప్పప్పులను నానబెట్టి రుబ్బి, తగినంత పెరుగు, మిరియాలు, కొత్తిమీర, అల్లం చేర్చి ఇంగువ తాలింపు పెట్టి ఈ ఇడ్లీని తయారు చేస్తారట. సోయాబీన్, వేరు శనగ, చేప మాంసాలను పులియబెట్టి ఇండోనేషియన్లు ఆవిరిమీద ఉడికించే వంటకాన్ని కెడ్లీఅంటారట.ఇలా మొదలైన ఇడ్లీల ప్రస్థానాన్ని ఉప్పుడురవ్వను కలపటం ద్వారా మరో మలుపు తిప్పారు. ఈ పనిచేసింది కన్నండిగులో, తమిళులో తెలియదుగానీ, అనతికాలంలోనే అది అమిత జనాదరణ కలిగిన వంటకం అయ్యింది. ఉత్తరాది వారంటే రొట్టెలు తినేవారనీ, దక్షిణాదివారంటే ఇడ్లీ తినేవారనీ ఒక స్పష్టమైన విభజన ఏర్పడిపోయింది. ఇదంతా ఈ 70 యేళ్ళ కాలంలోనే జరిగింది.
మినప్పప్పు వలన కలిగే ప్రయోజనాలను పులవ బెట్టిన బియ్యపురవ్వ(ఉప్పుడు రవ్వ) దెబ్బతీస్తో౦ది. జీర్ణశక్తిని పాడు చేసి, కడుపులో ఎసిడిటీ పెరగటానికి ఇడ్లీ ఒక కారణం అవుతోంది. అట్టు, పూరీల్లా నూనె పదార్ధం కాదు కదా అని ఇడ్లీ తినమంటారు వైద్యులు. మనం కొబ్బరి-శనగచట్నీ, నెయ్యీకారప్పొడి, సా౦బారు, అల్లం పచ్చడి తిని, వాటి గురించి మాట్లాడకుండా ఇడ్లీయే తిన్నాంఅంటూ వు౦టాం. ఇవి కడుపులో ఆమ్లాల సముద్ర౦ సృష్టిస్తాయి. అల్సర్లు పెరగటానికి ఇడ్లీ ప్రథమ కారణం.
ఇడ్లీ తిని కాఫీ తాగే అలవాటుని వైద్యపరంగా వస్తుగుణప్రకాశికగ్ర౦థ౦ నిరసించింది. ఉప్పుడురవ్వతో చేసిన ఇడ్లీని సా౦బారు, చట్నీలతో తిని, పాలు పోసిన కాఫీ తాగటం వలన, విరుధ్ధ పదార్థాలు సేవించినట్టు అవుతుందనీ, అందువలన అజీర్తి పెరుగుతుందనీ ఈ గ్ర౦థ౦1938లోనే హెచ్చరించింది.ఉప్పుడు రవ్వగానీ, బొ౦బాయి రవ్వ గానీ కలపకుండా ఆవిరికుడుములని మనం పిలిచే తెలుగు ఇడ్లీలే శ్రేయస్కరం అని ఈ చర్చల సారా౦శం. బడికి వెళ్ళే పిల్లలకు, వయోవృద్ధులకు పెట్టదగినవిగా ఉంటాయి. వాతాన్నీ, వేడినీ తగ్గిస్తాయి. బలహీనంగా ఉన్నవారికీ, చిక్కి శల్యమై పోతున్న వారికీ మేలు చేస్తాయి.