Saturday 16 January 2016

భాషాఘోష డా. జి వి పూర్ణచందు

భాషాఘోష


డా. జి వి పూర్ణచందు


హరులు నుండుగాక కరులు నుండును గాక
ఉంద్రు( గాక వేయి యోధ వరులు
మానవాధిపులకు మఱియు విశేషించి
కవియె లే(డో యశము కలుగ(బోదు

యేలూరిపాటి అనంతరామయ్య గారు గతతరం కవిపండితుడు. ఆయన నీలకంఠ దీక్షితులు సంస్కృతంలో వ్రాసిన మూడు శతకాలను నీలకంఠ త్రిశతి పేరుతో పద్యాల్లో అనువాదం చేశారు. ఈ పద్యం సభారంజనం అనే శతకంలోది. రాజుల దగ్గర వేలకొద్దీ గుర్రాలుంటాయి. ఏనుగులుంటాయి. గొప్ప సైనికులుంటారు, ఎందరున్నా కవి లేకపోతే కీర్తి రాదు-అనేది దీని భావం.
కవులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఆదరించేవాళ్ళే కొద్దిగా ఉంటారు. రాజాదరణ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. రాజు ఎంత ఛందాలుడైనా ఆయన్ని ఇంద్రుడంతవాడిగా పొగిడి అగ్రహారాలో మణి మాన్యాలో పుచ్చుకోవటాన్ని రాజాదరణగా భావిస్తుంటారు కొందరు. గుడ్డివాడు ధనవంతుడైతే, కమలపత్రాక్షుడనీ, గడ్డులోభిని కల్పవృక్షం అనీ, పిరికి వాణ్ణి విక్రమాదిత్యు డనీ ఈ ప్రపంచంలో కవులు మాత్రమే కీర్తించగలరంటాడు నీలకంఠ దీక్షితులు. “పాండవులు జూదంలో ఓడి, పరదేశాల పాలైనా, వెట్టి చాకిరీ చేసినా ఐదుగురికి ఒకే పెండ్లాం ఉన్నా వ్యాసుడి వాక్కుల వల్ల అవి కీర్తిమంతాలే అయ్యాయి...అని!
తిమ్మిని బమ్మిగా చూపించ గలిగిన చాక చక్యం కవులకుంటుంది. వాళ్లకే సహజంగా రాజాదరణ ఉంటుంది. అవార్డులు కావాలన్నా, పదవులు కావాలన్నా వందిమాగధం లేనిదే ఏదీ దక్కదు. పొగిడే కవులు పురస్కారా లంకృతులు కాగలరేమో కానీ, వాళ్లకి లోకంలో విలువుంటుందనేది నమ్మలేని విషయం. ఇంతకీ. రాజాదరణ అంటే కవులకు అవార్డులు ఇవ్వటమేనా? ప్రభువులు ఈ మాత్రం చేస్తే చాలా?
తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికీ, తెలుగు సంస్కృతికీ ప్రభుత్వ పరంగా చేయవలసిన ఉపకారాలు కొన్ని ఉండగా, చేస్తున్న అపకారాలను సరిచేసుకో వలసినవి మరికొన్ని ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోగలగటమే రాజాదరణ అంటే!
భారత రాజ్యాంగం దేశీయ భాషల్లో విద్యను నేర్పటానికి దేశప్రజలకు భరోసా ఇచ్చింది. కానీ, తెలుగు నేలమీద ఆ భరోసా అమలు కావటం లేదు. మాతృభాషకు రాజాదరణ లేకపోగా రాజ్యాంగ అతిక్రమణ జరుగుతోంది. దీన్ని సరిచేసుకోవాలి. తెలుగు నేలమీద తెలుగు దిక్కులేని అక్కుపక్షిలా అఘోరిస్తుందగా తమిళ నేలమీద తమిళ భాషానురక్తి శ్రుతి మించి రాగాన పడింది. ఆ రాష్ట్రంలో తమిళం తప్ప ఇంకో భాష చదవటానికి వీల్లేదని తెలుగు స్కూళ్ళని మూయించేశారు. తెలుగు జనాభా సగానికి పైగా ఉన్న తమిళనాడులో తెలుగు అలా అఘోరిస్తోంది. ఇంకో భాష నేర్పరాదనటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆ విషయం కేంద్రానికి తెలీదా? కోర్టులకు తెలీవా? ఎవరూ మాట్లాడరు. దేశంలో భాషా రాజాదరణ అలా అఘోరిస్తోంది.
కేంద్రానికి భాషా విధానం ఉంటే ఇలా జరిగేది కాదు. కానీ రాజకీయ ప్రయోజనాలు అన్నింటికన్నా ముఖ్యమైనవి. ఆనాడు మన్మోహన్ గారు కరుణానిధి గారికి తమిళం క్లాసికల్ హోదాని రాజభరణంగా ఇచ్చేశాడు. ఈనాడు మోదీ గారు తెలుగు హననాన్ని రాణిగారికి భరణంగా ప్రసాదించాడు.
తెలుగు భాషకు విశ్వవిద్యాలయాలు చేయవలసిన కార్యాన్ని చేయటం కూడా రాజాదరణే! తెలుగు కన్నడ భాషా యోధులు పోరాడి ఆ రెండు భాషలకూ క్లాసికల్ హోదా సాధించినప్పుడు, మన విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల వాళ్ళు కొందరు హేళన చేయటం నేను ఎరుగుదును. భాషోద్యమంలో భాగం పంచుకోని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు క్లాసికల్ హోదా వస్తే, సాలుకు 100 కోట్ల రూపాయలు పరిశోధనా ప్రాజెక్టులకోసం వస్తాయనే విషయాన్ని కూడా మరిచారు. ఈ ఐదేళ్ళ కాలంలో సాలుకు 100 కోట్ల చొప్పున వచ్చి, నిరుపయోగంగా వెనక్కి తిరిగి పోతున్నాయి.
2016 జనవరి 3 వరకూ 21 రోజులపాటు కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్ధులకోసం ప్రత్యేక ప్రసంగాలు ఏర్పరచి, ఈ నిధుల వినియోగానికి ఒక ప్రారంభం పలికారు. ఇతర విశ్వవిద్యాలయాలు ఇప్పటి కైనా కళ్ళు తెరవటం మంచిది. NAAC సెమినార్లను ప్రమోషన్లకోసం మార్కుల సెమినార్లుగా మార్చేశారు, రాజాదరణ కోసం పాకులాడటం అంటే ఇదే! భాష, సాహిత్యం, పరిశోధన ఇవేవీ లేకుండానే కాలం చెల్లిపోతోంది కాలానికి!
భాషాభిమానుల ఘోష ఎవరికీ పట్టదు. అందుకని, ఎవరినీ ఏమీ అనలేక ఇంగ్లీషుని తెలుగులో తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు జనం.
17-01-2016 ఆదివారం విశాలాంధ్రలో పద్యాను భవం శీర్షికన ప్రచురితమైన నా రచన