Monday 7 December 2020

Dr. GV Poorna Chandu Talks | Over Significance of Teaching in Mother Ton...

Wednesday 2 December 2020

 

ఆంధ్రత్వం,  ఆంధ్రభాషలు తపఃఫలాలని భావించిన తెలుగు ప్రముఖుడు శ్రీ అప్పయ్య దీక్షితుల వారి జీవిత చరిత్రను వారి 500వ జయంతి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర ప్రచురణల సంస్థ ప్రచురించింది.ఈ కరోనా కట్టడి సమయంలో నేను వ్రాసిన 4 గ్రంథాల్లో  ఇది ఒకటి. హరిచరణ స్మరణ పరాయణ శ్రీనారాయణ తీర్థులవారి జీవిత చరిత్రను,  భోజనం భాగ్యం ఆహార వైద్య గ్రంథాన్ని,  నవకరోనా - నిజాలు వైద్య గ్రంథాన్ని కూడా శ్రీ రాఘవేంద్ర సంస్థ వారు ప్రచురిస్తున్నారు.  డిసెంబరు 25, 26, 27 తేదీలలో జూమ్ ద్వారా మాడభూషి  సాహిత్య కళా పరిషత్ ఆధ్వర్యంలో  జరగనున్న "డా. జి వి పూర్ణచందు జీవితం  సాహిత్యం  వ్యక్తిత్వం" సదస్సులో ఆవిష్కృత మవుతున్నాయి.  విశాలాంధ్ర ఆదివారం సంచికలో నేను వ్రాసిన పద్యానుభవం వ్యాసాలను ఎమెస్కో సంస్థ వారు పద్యరాగాలు పేరుతొ ప్రచురిస్తున్నారు.  ఈ పుస్తకం కూడా ఆ సదస్సులో ఆవిష్కరణ అవుతుంది.  దీర్ఘకాలంగా అచ్చువేయకుండా నేను అలసత్వం వహించిన ముక్కాలు 2వ భాగం 6భాషల్లో  అనువాదం తో  పుస్తకంగా ఈ సభలోనే విడుదల చేస్తున్నాను.  పెద్దల ఆశీస్సులు ప్రార్థిస్తున్నాను. హరహర మహాదేవ పాఠకులకు అందుబాటులో ఉంది.  దాన్ని శ్రీరాఘవేంద్రరావుగారు నెంబర్ +919849181712ద్వారా పొందవచ్చు.


Sunday 20 September 2020

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు :: డా. జి వి పూర్ణచందు

 

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు

డా. జి వి పూర్ణచందు

దేవుడికి వందనం అనే స్థితి నుంచి, దేశానికి వందనం అనే స్థాయికి భారతీయులను మళ్లించిన వాడు బంకించంద్ర చటర్జీ. దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ అంటూ, తన దేశభక్తి గీతం ద్వారా స్వదేశీ బావనను రగిలించి తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన వాడు గురజాడ.

1905లో మొత్తం దేశాన్ని కదిలించి వేసిన వందేమాతరం ఉద్యమం లోంచే స్వదేశీ ఉద్యమం పుట్టింది. “జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరుకులు నించవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు.

“నాది ప్రజల ఉద్యమందానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి. 

“విద్యలనెరయ నించిన యాంగిలేయులు”(1912) అనీ, “కన్నుకానని వస్తుతత్త్వము కాంచనేర్పరు లింగిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నెరసితిన్” అనీ ఆంగ్లేయులను మెచ్చినప్పటికీ, ఆంగ్లేయ సంస్కృతి పట్ల గురజాడ విముఖతే ప్రదర్శించారు.

“పాశ్చాత్య నాగరికత కొన్ని అంధవిశ్వాసాలను పోగొట్టుతున్న మాట యదార్థమే అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యము కాదు, నామమాత్రమైనది.” ( గురజాడ డైరీ-1901, పుట215/సం: అవసరాల);

“శతాబ్దాల  తరబడి రాజకీయ బానిసత్వం వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ మనః ప్రవృత్తిని విద్యావంతులైన హిందువులకు బహిర్గతం చేసి, వారిలో వారి ప్రభావానికి లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగించటానికే ఇది దోహద పడును.(గోమఠం శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చంద్ర నాటకం ఇంగ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక)

స్వదేశీ ఉద్యమం గురించి చెప్పిన ఈ వాక్యాలు  గురజాడ వారి నిబద్ధతను చాటుతాయి.

గురజాడ స్వహస్తంతో వ్రాసిన “దేశభక్తి” గీతం చిత్తుప్రతిలో “నిన్నవచ్చా రింగిలీషులు/మొన్నవచ్చిరి ముసల్మను; లటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి, వేరులు బెట్టుకోకోయి” అనే చరణం ఉంది. దీన్ని కొందరు గురజాడ ప్రదర్శించిన ఆంగ్లేయానుకూలతగా భావిస్తారు.  నిజానికి ఇది అన్ని కులాల, మతాల వారికీ దేశమే దేవత అనే భావన బలపడుతున్నదశలో అందుకు ప్రతిబంధకంగా నిలిచే వారికి చేసిన హెచ్చరిక.  హిందూ శబ్దాన్ని దేశీయులనే అర్ధంలో గాక, మతస్థులనే అర్ధంలో ప్రయోగించి, ఈ దేశంలో అన్యమతస్థులకు తావులేదని వాదించే వాళ్ళకి ఇది అంటించిన చురక.

గురజాడకు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధాలు బాగానే నడిచాయి. తన డైరీలో 1887 అక్టోబరు,27న విజయనగరం కాంగ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు. కానీ, కాంగ్రెస్ లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్కంలో ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.

“తమ్ముడూ! గిరీశంగారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వెంకటేశం “గొప్పవారంటే  అలా యిలాగా అనుకున్నావా యేవిటీ? సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు” అంటాడు. “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుని, “అందరికంటే మరీ గొప్పవాడు” అనేస్తాడు. దేశాన్ని గిరీశంగారు “యెలా మరమ్మత్తు చేస్తున్నార్రా? ’ అనడుగుతుంది. దానికి వెంకటేశం చెప్పిన సమాధానం ఇది: “నావంటి కుర్రాళ్లకు చదువు చెప్పడం, (నెమ్మళంగా) చుట్టనేర్పడం, గట్టిగా నాచ్చి కొశ్చన్ అనగా సానివాళ్ల నందరినీ  దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం ఒహటి. ఇప్పుడు తెలిసిందా...?” అని సమాధానం చెప్తాడు వెంకటేశం. ‘నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం’ అని ఈనాటకంలో ఒక బొడ్డూడని కుర్రాడే అన్నప్పటికీ, అది గిరీశం అభిప్రాయంగానే కన్పిస్తుంది. అందుకే మరో సీనులో, గిరీశమే అంటాడు: “ఒక సంవత్సరం గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే, బీమునిపట్టణానికి పాల సముద్రం, విశాఖపట్టణానికి మంచినీళ్ళ సముద్రం , కళింగపట్టణానికి చెరకు సముద్రం తెస్తాను” అని. ఇక్కడ దివాన్గిరీ అంటే కాంగ్రెస్ పదవి. “పొలిటికల్ మహాస్త్రం అంటే, “ఒకడు చెప్పిందల్లా బాగుందండవే! సమ్మోహనాస్త్రం అంటే అదే కదా...!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చేంజి చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడు” లాంటి సంభాషణల్లో కనిపించే ఆనాటి పొలిటీషియన్ నేషనల్ కాంగ్రెస్ వాడే! దేశంలో రాజకీయ సంస్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!

“మొన్న బంగాళీవాడు (బహుశా బిపిన్ చంద్రపాల్ కావచ్చు)ఈ ఊర్లో లెక్చరిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ...?”

“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాథ్ బానర్జీ వచ్చి చెప్పినా మీ తండ్రి వినడు”

“మొన్న మనం వచ్చిన బండి వాడికి నాషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెసు వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్ లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు...”

(దేవుణ్ణి ఉద్దేశించి) యిలాంటి చిక్కులు పెట్టావంటే, హెవెన్ లో చిన్న నేషనల్ కాంగ్రెస్ లేవదీస్తాను”

“అన్ని మతాలూ పరిశీలించి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను” లాంటివెన్నో ఆనాటి రాజకీయపక్షుల మీద వ్యంగ్యాలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి.

 “దేశాభిమానం నాకు కద్దని/వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్/పూని యేదైనాను ఒక మేల్/కూర్చి జనులకు చూపవోయ్” దేశభక్తి గీతంలోని ఈ చరణంలో వొట్టి గొప్పలు చెప్పుకోవద్దంటూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశించో తెలియాలి.

నేషనల్ కాంగ్రేసుకు ఆ తొలినాళ్లలోనే అంతగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బెంగాలీలు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో వందేమాతరం గీతం బెంగాలంతా ప్రతిధ్వనించింది. అది వందేమాతరం ఉద్యమంగా ప్రసిద్ధి పొంది దేశం అంతా వ్యాపించింది.

1906 కలకత్తా కాంగ్రెస్ ‘స్వరాజ్యం, స్వదేశీ, జాతీయ విద్య’ ఈ మూడు అంశాలు లక్ష్యాలుగా కొన్ని తీర్మానాలను ఆమోదించింది. బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మంచి సాధించుకోవాలనే ధోరణిలో నేషనల్ కాంగ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు “బోయ్ కాట్” లాంటి పదజాలం పట్ల వ్యతిరేకత కనపరచారు. లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాలు ప్రభృతుల నాయకత్వంలో కొందరు అతివాదులు ఈ మార్గాన్ని వ్యతిరేకించి, బ్రిటిష్ వారి పైన పోరాటానికి సిద్ధపడ్దారు.ఈ ముగ్గురినీ లాల్ బాల్ పాల్ త్రయంగా పేర్కొంటారు. వీళ్లని అతివాదులనీ, చేంజర్స్ అనీ పిలవ సాగారు.

ఆ మరుసటి సంవత్సరం 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలొ అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు రాస్ విహారీ ఘోష్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచించగా, అతివాదుల పక్షాన లాలాలజపతి రాయ్ ని పోటీకి నిలబెడుతున్నట్టు వేదిక మీదనుంచి తిలక్ ప్రతిపాదించాడు. ఆయన అలా ప్రసంగిస్తూ ఉండగా జనం లోంచి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా చెంపకు తగిలి, పక్కనేఉన్న సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడింది.

 బూటుని మెహతా, బెనర్జీల వర్గం వాళ్ళు తిలక్ మీదకు విసిరితే అది గురి తప్పి సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడిందో...లేక తిలక్ వర్గీయులే మెహతా బెనర్జీల మీదకు విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలింది. నువ్వంటే నువ్వని కారణాన్ని ఎదుటివారిమీదకు నెట్టుకుంటూ సభలో గందరగోళం సృష్టించారంతా!

దీనికి,తాను ప్రత్యక్ష సాక్షినంటూ, టంగుటూరి ప్రకాశంగారు “నా జీవిత యాత్ర” గ్రంథంలో కొన్ని విషయాలు ఉటంకించారు. ఈ సంఘటనకు ఒక నేపథ్యాన్ని ఆయన ఇలా విశ్లేషించారు:

 “నాగాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో ‘తిలక్ మహరాజుకీ జై’ అనుకొంటూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేత బట్టి విజృంభించారు. అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది” అదీ సంఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉంది.

“ఆ కాలంలో కాంగ్రెస్ కి ఫిరోజిషా మెహతా నియంతవంటి వాడే! కాంగ్రెస్ సంఘాలు అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడం గానీ, ప్రతినిధులు ప్రెసిడెంటును ఎన్నుకోవటం గాని ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రేస్ అధ్యక్షులు. తీవ్ర వాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు” అనేది ప్రకాశంగారి అభిప్రాయం.

ఇలాంటి పరిస్థితుల్లో, ఆనాడు కాంగ్రెస్ పెద్దలను మంచి చేసుకుని విజిటింగ్ కార్డు పదవి అయినా పొందగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గురజాడ లాంటి ఆలోచనా పరుడు ఈ సంస్కృతిని ఆమోదించ గలడా? అందుకే, దేశభక్తి గురించి ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కాంగ్రెసుకే చురక వేశాడు.

1907 లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సమయంలో విశాఖపట్టణంలో ఆయనకు అంతగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒకమోస్తరుగా విజయవంతం అయ్యింది. తరువాత రాజమండ్రిలో జరిగిన సభ అద్భుతాలను ఆవిష్కరించింది. తెలుగువారిలో స్వాతంత్ర్య దీప్తిని నింపిన ఒక గొప్ప సభగా చరిత్రలో నిలిచిపోయింది. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తూ, “భరత ఖండంబు పాడియావు” అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలొనే ఆశువుగా చెప్పారు.

ఆ తరువాత బిపిన్ చంద్రపాల్ బెజవాడ, మచిలీపట్టణాల్లో కూడా ప్రసంగించారు. తెలుగునాట స్వాతంత్ర్య కాంక్ష కలవారందరినీ ఏకం చేసి, తన నాయకత్వం లోకి తెచ్చుకున్నారు. వందేమాతరం ఉద్యమం తరువాత దేశంలో అతివాదులు తెలుగునేలమీద సాధించిన తొలి విజయం ఇది. అతివాదానికి గురజాడ అనుకూలమా...ప్రతికూలమా అనేది సున్నితమైన విషయం.

1897 నుంచీ 1912 వరకూ సంస్థాన వారసత్వ దావా విషయంలో అప్పారావు గారు తలమునకలుగా ఉన్న సమయం అది. ఆ కారణంగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు పెట్టుకో లేకపోయినప్పటికీ, కన్యాశుల్కం నాటకంలో  జాతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావిస్తూ మితవాదుల ఆలోచనా ధోరణుల్ని ఎండగట్టారు.

హవల్దార్ పాత్ర- సారా కొట్టు సీను: కుంపిణీ నమ్మక్ తిన్నతరువాత ప్రాణం ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకి వెయ్యమా?”

        “రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? అని మునసబు రెట్టించి అడుగుతాడు. దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యింగిరీజ్ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవైందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణి చల్లగా ఉండాలి...!”

“సీమరాణి ఆ కాళీమాయి అవుతారం కాదా?” అనడిగితే, “కాళీ గీళీ జాంతానై-ఆ రాముడి అవుతారం”

నేషనల్ కాంగ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణిని ఈ సంభాషణలు తేటతెల్లం చేస్తున్నాయి. మనుషులు చేసిన దేవుళ్ళారా...! మీ పేరేమిటి? కథలో కనిపించే శైవ వైష్ణవ భేదాలు కూడా ఈ సంభాషణలో అదనంగా ధ్వనిస్తాయి.

          కన్యాశుల్కం నాటకంలో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు కనిపించటానికి గురజాడ ప్రదర్శించిన ఈ రాజకీయ చైతన్యమే కారణం. బ్రిటిష్ వారితో మంచిగా వ్యవహరిస్తూ, ఎదురు తిరక్కుండా నమ్రతగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యాన్ని బ్రతిమాలో బామాలో తెచ్చుకోవాలనే మితవాదుల ఆలోచనని ఏ మాత్రం అంగీకరించ లేదనటానికి ఈ నాటకంలో ఇలాంటి సంభాషణలు అనేకం సాక్ష్యం.

Sunday 6 September 2020

సౌందర్యశాస్త్ర గ్రంథం ‘హరమేఖలా’

 

సౌందర్యశాస్త్ర గ్రంథం ‘హరమేఖలా’

తిరుమల రామచంద్రగారి అనువాద ప్రతిభ

డా||జి. వి. పూర్ణచందు,B.A.M.S.,

అందంగా ఆకర్షణీయంగా ఉండాలనే తపన. మనిషికే ఉంటుంది. జంతువులకు ఉండదు. మనిషికీ జంతువుకూ మౌలికమైన తేడాలలో ఇది ముఖ్యమైంది. ఏ కుక్కా, ఏ కోతీ, ఏ గేదే, ఏ ఆవూ, తాను అందంగా అలంకరించుకుని తిరగాలనుకోవు.

సౌందర్య పిపాస మనిషి ప్రాథమిక లక్షణం. ఈరోజున సౌందర్య శాస్త్రం (cosmetology) అనేది పెద్ద శాస్త్రంగా రూపొందింది. సౌందర్య సాధనాలను తెలుసుకొని వాటిని నైపుణ్యతతో వాడుకోవటం నేర్పేది సౌందర్య శాస్త్రం. modification of beauty అనేది దీని లక్ష్యం. కానీ, ఈ శాస్త్రానికి మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. మూలాలు మాత్రమే కాదు, ఆధునిక కాస్మటాలజీలో లేని అనేక విశేషాంశాలు కూడా మన శాస్త్రాలలో ఉన్నాయి.

వేదాలతో మొదలుపెట్టి, మన ప్రతీ సాహిత్య గ్రంథాలన్నీ ‘సౌందర్యపరివర్తనం’ గురించి అంతో ఇంతో ప్రస్తావించాయి. ఆయుర్వేద శాస్త్రం ఈ విద్యకొక ప్రతిష్టను కల్పించింది. అంజనాలు, గంథాలు, లేపనాలు, కల్కాలు, కషాయాలెన్నో ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తాయి.

కస్తూరి తిలకం, కౌస్తుభ హారాలు, ముత్యాల ముక్కుపుడకలతో, కంగనాలతో, హరిచందన చర్చితాలతో దేవతల్ని అలంకరించి, ఆరాధిస్తూ, తమ సౌందర్యపిపాసను భారతీయులు చాటుకున్నారు. నీలాంజన సమాభాసం అని శని దేవతని, గుడాకేశి అని శివుణ్ణి ఇలా సౌందర్యపరమైన ఉపమానాలతో కొలుచుకున్నారు.

ఆధునిక సౌందర్యశాస్త్రం  అందంగా కనిపింపచేయటానికి మాత్రమే ప్రాధాన్యత నిస్తాయి. hairstyling, skin care, cosmetics, manicures/pedicures, రోమాలను తొలగించేందుకు  waxing, threading vagairaa విధానాలే ప్రధానంగా కనిపిస్తాయి. కానీ పెదాలు ఎర్రగా కనిపిస్తే చాలదు, నోటి దుర్వాసన లేకుండా ఉండాలి. శరీరం పసిడి రంగులో మిసమిసలాడితే సరిపోదు, చెమట దుర్గంధం లేకుండా ఉండాలి. శారీరక, మానసిక స్వాస్థ్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని మన సౌందర్య శాస్త్రాలు రూపొందాయి.

వేద యుగంలో చ్యవనుడు తన యవ్వనాన్ని తిరిగిపొంది సుకన్యనను పెళ్ళాడిన కథ ఉంది. యవ్వనాన్ని తిరిగి ఇచ్చిన ఆ ఔషధాన్ని చ్యవనుడి పేరుతో చ్యవనప్రాశ అంటారు. దీనిని రసాయన చికిత్స అంటారు. ఇది సౌందర్య శాస్త్రంలో భాగమే!  వేదయుగాలలో మధువిద్య అనేది ఒకటి ఉండేది. రసాయన చికిత్సలు ఈ విద్యలోంచే అభివృద్ధి చెందాయని చెప్తారు.

ప్లాష్టిక్ సర్జరీ చేసిన తొలి వైద్యుడు సుశ్రుతుడు. రైనోప్లాష్టీ అంటే తెగిన ముక్కును సరిచేసే చికిత్స చేశాడాయన. ఆలేపం, పరిషేకం, ఉత్సాదనం, పాండుకర్మ, రోమ సంజననం లాంటి చికిత్సావిధానాలను ఆయుర్వేద శాస్త్రం అందించింది. సంహితా యుగాల తరువాత కౌటిలీయ అర్థశాస్త్రం, వాత్స్యాయన కామశాస్త్రం, అనంగ రంగ, కొక్కోకం లాంటి గ్రంథాల్లో సౌందర్య శాస్త్రాపరమైన అంశాలు ఎన్నో కనిపిస్తాయి.

మహాభారతంలో ద్రౌపది ‘సైరంధ్రి’ పేరుతో అఙ్ఞాతవాసంలో లేడీ బ్యూటీషియన్ పాత్ర పోషించింది.

మైలసంతలో బహిరంగంగా స్త్రీలు ‘సుసరభిత్తి’ అనే ఒక ఔషధాన్ని అమ్మినట్టు వల్లభరాయుడి క్రీడాభిరామంలో ఉంది. సుసర అనే పువ్వు ‘ఆస్ట్రేలియన్ పుష్పం’గా ప్రసిద్ధి, రెడ్డి రాజుల కాలంలో అవచితిప్పయ్యశెట్టిగారు తెచ్చిన విదేశీ ద్రవ్యాలలో అది కూడా ఉన్నదేమో తెలీదు. అమితమైన చల్లదనాన్నిస్తుంది. దాని నిర్యాసాన్ని స్త్రీల మర్మావయవం పైన లేపనం చేస్తే యోనిదోషాలు పోతాయని దాన్ని వాడేవారు. ఇలా తెలుగువారి సౌందర్య, శృంగార ప్రయోజనాలకు ఉపయోగపడే అంశాలను సాహిత్యాధారాలు అనేకం మనకు అందిస్తున్నాయి.  

సౌందర్యశాస్త్ర పరమైన అంశాలన్నింటినీ ఒక చోట గుదిగుచ్చి పాఠ్యగంథంగా వెలువరించిన గ్రంథం హరమేఖల. శివుడి మాల అని దీని భావం. క్రీశ. 9వ శతాబ్దిలో  ప్రాకృత భాషలో ఈ గ్రంథరచన జరిగింది. ధరణీవరాహ రాజ్యం తనదని, మాధవుడు తన తండ్రి అనీ ఈ గ్రంథంలో మాహుకుడు చెప్పుకున్నాడు. హరమేఖల అనే పేరుని బట్టి రచయిత మాహుకుడు శివయోగి అని అర్థం అవుతోంది. ఇందులో ప్రాకృత శ్లోకాలను ‘ఛాయ’ లంటారు. వీటికి సంస్కృతంలో టీకలు దొరుకుతున్నాయి.

మొదట దీని ప్రతిని కొట్టాయంలోని నారాయణభట్టతిరి సంపాదించారు. 1938లో ట్రావెంకోర్ మహరాజా సహకారంతో కె. సాంబశివ శాస్త్రిగారు పరిష్కరించగా ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ వారు 4వ అధ్యాయం వరకూ మొదటి భాగంగానూ, 5వ అధ్యాయాన్ని రెండవ భాగంగానూ ప్రచురించారు.

వేటూరి శంకర శాస్త్రిగారు, వేటూరి ప్రభాకరశాస్త్రిగారికి సోదరుడౌతారు. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు, చరిత్రకారుడు కూడా! ముక్త్యాల రాజావారి ఆస్థాన వైద్యుడాయన.  వైద్యకళ మాసపత్రిక నడుపుతుండేవారు. ఆయన ఈ గ్రంథాన్ని సంపాదించి తెలుగులోకి అనువదించే విషయమై శ్రీ తిరుమల రామచంద్రగారితో సంప్రదించారు. ప్రాకృత శ్లోకాలకు, సంస్కృత టీకకు కొన్ని చోట్ల పొంతన కుదరటం లేదని ప్రాకృతం సంస్కృతం సమానంగా తెలిసిన రామచంద్ర గారి సహాయం అర్థించారాయన. ఆ ఇద్దరూ కలిసి చేసిన అనువాదమే తెలుగు ‘హరమేఖల’.

ధర్మార్థ కామమోక్షాల ఙ్ఞానం కలిగిన వారిని విదగ్ధులు అంటారు. అలాంటి వారికోసమే ఈ విదగ్ధానురాగ కృతిని ప్రయోగమాలగా వెలువరిస్తున్నట్టు మాహుకుడు పేర్కొన్నాడు. పుత్తలిక పేరుతో చేతబడుల మంత్రాలు, వశీకరణ, విఘటన, తాంత్రిక యోగాలు కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. కొన్ని నేటి కాలమానపరిస్థితులకు అసాధ్యమైన యోగాలు, అంశాలు కూడా ఉండటంతో వాటిని పరిహరించి, సాధ్యమైనంత అందుబాటులో ఉన్న యోగాలను మాత్రమే ఈ గ్రంథంలో చేర్చటం జరిగింది. మొదటి అధ్యాయం అంతా వేశ్యలకు సంబంధించిన విషయాలు కావటంతో దాన్ని వదిలేసి, రెండవ అధ్యాయం నుండే తెలుగు హరమేఖలను మొదలు పెట్టారు. గ్రంథాంతంలో కొన్ని ద్రవ్యాల అకారాది పట్టికని ‘హరమేఖల నిఘంటువు’ పేరుతో అనుబంధంగా ఇచ్చారు.

ఈ గ్రంథంలో ఇప్పటి తరంవారు గృహవైద్యంగా చేసుకోదగిన కొన్ని యోగాలకు తిరుమల రామచంద్రగారు శ్రమించి చేసిన అనువాదాలను కొంత  పరిచయం చేస్తాను.

బాగా పండిన మారేడు గుజ్జును తలకు పట్టించి బెల్లంపాకంతో తలంటితే అట్టలు కట్టిన కేశాలు మెత్తబడి చిక్కు విడతాయి.

మామిడి టేంకలోని జీడిని త్రిఫలా చూర్ణాన్ని, తామరకొలను దగ్గరి నల్ల బురదని, మెత్తగా ఉండే ఇనుపరజనుని కలిపి గుంటకలగరాకు రసంతో నూరి, సమానంగా బియ్యపు గంజిని కలిపి తలకు పట్టిస్తే నెరిసిన వెంట్రుకలు తుమ్మెద గుంపులా నల్లబడతాయి.

జాజికాయ, జాపత్రి దాల్చినచెక్క, మరువం ఈ నాల్గింటిని మెత్తగా దంచి, కుంకుడు గింజంత మాత్రలు కట్టి ఆరబెడితే గట్టి పడతాయి. ఒక్కమాత్రని బుగ్గనపెట్టుకుని చప్పరిస్తుంటే నోటి దుర్వాసన పోతుంది.

ఏలకులు, అగరు అనే సుగంథ ద్రవ్యం, గంధం,బిరియానీ ఆకు, కలువ పూరేకులు వీటిని దంచిన పొడిని పావుచెంఛా మోతాదులో గ్లాసునీళ్లలో కలిపి కొంతసేపు నాననిచ్చి తాగితే శరీరంలోంచి పరిమళం బయటకు వస్తుంది. 

సున్నం ఎక్కువై తాంబూలం వలన నోరు పొక్కితే నువ్వుల నూనె గానీ, చల్లని గంజిగానీ  నోట్లో పోసుకుని పుక్కిలిస్తే పొక్కడం, నోటిపూత తగ్గుతాయి.

రేగు గింజల్ని మెత్తగా దంచి బెల్లం, తేనె, వెన్న కలిపి ముఖానికి లేపనం చేస్తే మంగు లేదా శోభి మచ్చలు పోతాయి.

నేలతాటిగడ్డల చూర్ణాన్ని గేదె వెన్నతో కలిపి ఒక పాత్రలో ఉంచి, ధాన్యపు రాశిలో వారం రోజులపాటు మాగనిచ్చి, దాన్ని చెవులకు పట్టిస్తే చెవి తమ్మలు పెరుగుతాయి. స్తనాలకు పట్టిస్తే స్తన పరిమాణం పెరుగుతుంది.

దానిమ్మకాయల బెరడుని నీళ్లలో వేసి బాగా నూరి వడగట్టి, ఆ నీటికి సమానంగా తెల్లావాల నూనె కలిపి నీరంతా ఇగిరిపోయే దాకా మరిగించి తయారు చేసిన తైలాన్ని చెవులు, స్తనాలు, పురుషాంగాలమీద  మర్దిస్తే అవి గట్టిపడి జారిపోకుండా ఉంటాయి.

జిల్లేడాకుల్ని సైంధవలవణంతో నూరి పుటం పెట్టి చేసిన భస్మాన్ని నీళ్లలో కలిపి తాగితే అసాధ్యమైన లివర్ జబ్బులు తగ్గుతాయి.  

అరిటాకుల్ని నూరి పుటపాకం పద్ధతిలో భస్మం చేసి ఒక చెంచాపొడిని నీళ్లలో కలిపి తాగితే లివర్ స్ప్లీన్ వ్యాధులు తగ్గుతాయి.

పసుపుకొమ్ములు మెత్తగా దంచిన పొడిని తేనెతో తీసుకుని ఉసిరికాయల రసంతో రోజూ తాగితే షుగరు వ్యాధి, ఇతర మూత్ర వ్యాధులు తగ్గుతాయి.

అరచెంచా పిప్పళ్ల పొడిని నెయ్యి, తేనె చేర్చి, గ్లాసుపాలలో కలిపి తాగితే కరోనాలంటి విషజ్వరాలను ఎదుర్కొనేశక్తి శరీరానికి వస్తుంది. “పిప్పలీ చూర్ణం ఘృత మధు మిశ్రితం,క్వథిత దుగ్ధ సంయుక్తమ్ పీతమ్ విషమజ్వర కాస  హృద్రోగాన్ వినాశయతి” అంటూ మాహుకుడు చెప్పిన ఈ చిన్న ఔషధం నిజమైన ఇమ్యూనిటీ బూష్టర్‘గా ఈ కరోనా సమయంలో పనిచేస్తుంది.

పిప్పళ్ళపొడికి సమానంగా త్రిఫలా చూర్ణం కలిపిన పొడిని ఒక చెంచా మోతాదులో తీసుకుని తేనె కలిపి తిని ఆతరువాత భోజనం చేస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది, కఫం దరి చేరదు. కరోనా వ్యాధి నివారణకు ఇది కూడా మంచి ఉపాయం.

బార్లీ గింజల్ని నువ్వుల నూనెలో నల్లగా మాడేలా మూడుసార్లు వేయించి దంచిన మసిని వెన్నపూస కలిపి లేపనం చేస్తే కాలిన పుండ్లు, గాయాలు అసాధ్య వ్రణాలు త్వరగా తగ్గుతాయి.

పసుపు కొమ్ముల్ని చింతాకుని కలిపి నూరి, ఒక చెంచామోతాదులో కాసిని నీళ్లలో కలిపి తాగితే ఆటలమ్మ వ్యాధి, పొంగు లాంటి వైరస్ వ్యాధులు తగ్గుతాయి.

ఒక భాగం నల్లనువ్వులు, రెండుభాగాలు బావంచాలను (psoraline seeds) కలిపి మెత్తగా దంచి తేనెతో కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని 1-2 మాత్రలు రోజూ ఉద్యాన్నే తీసుకుంటూ ఉంటే బొల్లి వ్యాధి త్వరగా తగ్గుతుంది.

 బావంచాలను చిక్కటి పాలలో వేసి తోడు పెట్టి, ఆ పెరుగుని బాగా చిలికి తీసిన వెన్నని తేనె కలిపి తింటే బొల్లి తగ్గుతుంది. 1-2 చెంచాల మోతాదులో తీసుకోవచ్చు.

ఈ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఎక్కువగా సౌందర్య సాధనాల విషయలు కనిపిస్తాయి. కచ్చూరాలు, జటామాంసి, దాల్చిన చెక్క, ప్రియాంగువు వీటిని మెత్తగా దంచిన పొడిని నీళ్ళలో వేసి కాస్తే ఆ నీరు పన్నీరులా సుగంధభరితంగా ఉంటుంది. దానితో స్నానం చేస్తే శరీర పరిమళం పెరుగుతుంది. ఈ పొడికి సమానంగా పెసర పిండి లేదా శనగపిండి కలిపి నలుగు పెట్టుకుని ఈ స్నానం చేస్తే మంచిది.

ఈ విధంగా వందలాది యోగాలను మాహుకుడు 1100 సంవత్సరాల క్రితం మానవాళి వినియోగార్థం హరమేఖలా గ్రంథంలో అందించాడు. చరక సుశ్రుత, వాగ్భాటాలకు 10 వశతాబ్ది తరువాత వ్యాఖ్యానాలు వ్రాసిన రచయితలు మాహుకుణ్ణి చాల సందర్భాలలో ఉటంకించారు.

ఈ గ్రంథాన్ని తెలుగు చేయటంలో సంస్కృతానువాదాల లోపాలను మూల ప్రాకృత ఛాయలతో సరి చూసుకుంటూ వ్రాయటానికి రామచంద్రగారు చాలా శ్రమపడవలసి వచ్చింది. సంస్కృత పండితులైనంత మాత్రాన ఆయుర్వేద సంస్కృత శ్లోకాలు అంత తేలికగా పట్టుబడవు. అందుకు ఆయుర్వేదానుభవం కావాలి. వేటూరి శంకరశాస్త్రిగారు ఆ లోపం లేకుండా సహకరించటంతో ప్రామాణికమైన అనువాద గ్రంథంగా హరమేఖల రూపొందింది.

 

 

 

Saturday 1 August 2020

తెలుగు వంటలు, కరోనాకళ్లాలు

https://teluguvelugu.eenadu.net/magazine/flipbook/2020_8#teluguvelugu/page51   ఈ లింకు మీద నొక్కితే ఈ రోజే విడుదలయినతెలుగువెలుగు ఆగష్టు సంచిక  వస్తుంది. 51,52, 53 పేజీలలో "తెలుగు వంటలు-కరోనా కళ్లాలు" వ్యాసం-కరోనా సమయంలో ఇంట్లోనే గడిపే పిల్లలకు పెద్దలకు తినదగిన కొన్ని ఆరోగ్యకర భక్ష్యాలు ప్రాచీన సాహిత్య గ్రంథాల్లోంచి వివరించాను. చదవగలరు

Monday 27 July 2020

వరి కూడు డా. జి వి పూర్ణచందు

వరి కూడు:: డా. జి వి పూర్ణచందు

వరి కూడు
డా. జి వి పూర్ణచందు
ఫుల్ల సరోజ నేత్ర అల పూతన చన్నుల చేదు ద్రావి నా / దల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెదవేమొ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్నకూటితో / మెల్లగ నొక్క ముద్ద దిగ మ్రింగుమ నీ పస కాననయ్యెడిన్
ఇది శ్రీనాథుడి చాటు పద్యం. దాదాపు ఏడు వందల యేళ్ళ నాటి వాడు శ్రీనాథుడు. అప్పటికే తెల్లన్నం(తెల్లగా పాలిష్ పట్టిన వరిబియ్యంతో వండిన అన్నం) మీద వ్యామోహం జనాల్లో బాగా వచ్చేసింది. శ్రీనాథుడు నెల్లూరు, కృష్ణా మండలాల్లో ఎక్కువగా జీవించిన వాడు కాబట్టి, చివరి రోజుల్లో కృష్ణ ఒడ్డున బొడ్డుపల్లిలో గొడ్డేరి మోసపోయినప్పటికీ వ్యవసాయం కారణంగా ప్రాణాలు అర్పించుకున్న తొలి తెలుగు రైతు కాబట్టి, తెల్లన్నానికి బాగా అలవాటు పడి, జొన్నన్నాన్ని ఈసడించాడు.
అదేం పాపమో, ఇతర ధాన్యాలు ప్రధాన ఆహారంగా తీసుకునే వాళ్ళు తెల్లన్నం తినాలంటే పెద్ద ఇబ్బంది పడరు. కానీ, వరిబియ్యం తినే వాళ్ళు మాత్రం మరో ధాన్యం తినాలంటే ప్రాణం మీద కొస్తుంది.
నాలుగు రోజులు ఉత్తర భారతదేశానికి వెళ్ళినవాడు ఇంటికి వెళ్ళి వరి అన్నం, ఆవకాయ కోసం మొహవాచిపోతాడు. శ్రీనాథుడి పరిస్థితి కూడా అదే! ఆయన పలనాడు వెళ్ళి జొన్నకూడుని, కర్ణాటక వెళ్ళి రాగి సంకటినీ తినటానికి నానా తంటాలు పడ్డాడు. తన అవస్థని అనేక చాటు పద్యాల్లో చెప్పుకున్నాడు కూడా! ఈ పద్యం వాటిల్లో ఒకటి!
బహుశా శ్రీనాథుడు ఉత్తరాదికి వెళ్ళీ ఉంటే, చపాతీలూ, పుల్కాలూ బాగానే తిని ఉంటాడనుకుంటాను. ఆయన తన కావ్యాలలో అనేక వంటకాలను పేర్కొన్నాడు. వాటిల్లో, ‘అంగారపోలిక’ అనే వంటకం ఉంది. ‘పోలి’ అంటే ఉండలా చేసిందని! పోలిని పలుచగా వత్తి, నిప్పుల మీద కాలిస్తే అది ‘పోలిక’ (పుల్కా). దీన్నిబట్టి, తెలుగువారికి గత 700 యేళ్ళ నుండీ పుల్కాలు బాగా తెలుసనీ, అవి ఉత్తరాది నుండో, అరబ్బు దేశాల నుండో దిగుమతి అయినవి కావనీ, తెలుగువారి ప్రాచీన వంటకం అనీ అర్ధం అవుతోంది. .
వరి బాగా పండే ప్రాంతాల్లో ఉండే వారికి తెల్లన్నం రాజబోజనం అనీ, జొన్నన్నాన్ని జొన్న కూడు అనీ పిలవటం ఒక అలవాటు. గొప్పవాడు కనిపిస్తే భోజనం చేశావా అనీ, సామాన్యుడు కనిపిస్తే కూడు తిన్నావా అనీ అడుగుతుంటారు. ఇది తరతరాలుగా వచ్చిన అలవాటే గానీ, కూడు అనేది నీచమైన పదం ఏమీ కాదు. కూడు కుడిచేది కుడిచెయ్యి కదా! మనం ‘కుడిచెయ్యే’ అంటున్నాం. శ్రీనాథుడికి జొన్నన్నాన్ని తినటం ఎంత ఇబ్బంది అయ్యిందో ‘జొన్నకూడు’ అనటంలోనే ధ్వనిస్తుంది.
“బాగా వికసించిన తామర పూవుల వంటి కన్నులూ, అందమైన రూపమూ ఉన్న ఓ కృష్ణుడా! చిన్ననాట పూతన రొమ్ముపాలలో చేదుని తాగేసాననీ, పెద్ద దావాగ్నిని మింగేశాననీ విర్రవీగుతున్నావేమో, తింత్రిణీ పల్లవాలు అంటే లేత చింత చిగురు కలిపి వండిన బచ్చలాకు పులుసుకూరని ఈ జొన్నకూట్లో కలుపుకుని ఒక్క ముద్ద దిగమింగు, నీ పస ఏమిటో తెలుస్తుంది…”అంటూ దేవుణ్ణి నిలేస్తాడు శ్రీనాథుడు.
ఆ రోజుల్లో తెల్లన్నం రాజభోజనం. జొన్నకూడు సామాన్యులు తినేది.
రోజులు మారిపోయాయి. మనుషుల్లో మానసిక శ్రమ పెరిగి, శారీరక శ్రమ తగ్గి పోయింది. షుగరువ్యాధీ, స్థూలకాయం, బీపీ వ్యాధులు ఎక్కువయ్యాయి. ఇవి కష్ట జీవులకూ రావచ్చు. అది వేరే సంగతి. కానీ, మౌలికంగా పనీ పాటా లేని వాళ్ళకి మాత్రం ఎక్కువగా వస్తుంటాయి. అంటే, కూటికి ఉన్నవాళ్ళకు వచ్చే వ్యాధులన్నమాట! కూడు ఎక్కువై వచ్చే వ్యాధులని కూడా చెప్పవచ్చు. వీటి బారినుండి బయట పడాలంటే, జొన్నకూడే రాజభోజనం!
ఇప్పుడే గనక శ్రీనాథుడే ఉంటే షుగరో బీపీయో తప్పకుండా తెచ్చుకునే వాడే! ఎలుగెత్తి ఆ గోపాల కృష్ణుణ్ణి పిలిచి,”ఓ కృష్ణా! చిన్ననాడు పూతన రొమ్ముపాలలో చేదు మింగాననీ, దవాగ్ని అమాంతం మింగేశాననీ విర్రవీగకు! చేతనైతే, చేవ వుంటే ఈ తెల్లన్నంలో తీపిని తిని బతికి బట్టకట్టు చూద్దాం! నీ పస ఏపాటిదో తెలుస్తుందీ…” అని మొత్తుకుని ఉండేవాడు.
ఇక్కడో గమ్మత్తయిన విషయం ఉంది. బోయ ఎవడో వేసిన బాణం ములుకు గుచ్చుకుని కాలు సెప్టిక్ అయి కృష్ణుడు అవతారం చాలించాడట! ఈ రోజుల్లో షుగరు వ్యాధికి ఎన్నో పరిక్షలొచ్చాయి. అప్పట్లో కృష్ణుదు మధుమేహాన్ని బహుశా పసిగట్ట లేకపోయి ఉండొచ్చు. పసిగడితే జొన్నకూడు తిని ప్రాణాలు నిలుపుకునే వాడు కదా!
ఉత్తర భారత దేశం వారికి గోధుమలూ, దక్షిణాది వారికి బియ్యం మాత్రమే తెలుసని మనం అనుకుంటాం. కానీ, ఉత్తరాదివారు వరినే ముందు పండించారు. ఆ సమయంలో మన తెలుగునేలమీద గోదుమలు పండించారు. ఉమ అంటే ధాన్యం. గోద్ అంటే ఒక విధమైన ఎరుపు రంగు. గోదుమలు అని ‘దు’కి వత్తు లేకుండా పలికితే అది తెలుగు పదం. ‘గోధుమ’ అని వత్తుతో సంస్కృతంలో పలుకుతారు.
ఇప్పుడంటే శనగపిండిది పెత్తనం అయ్యింది గాని. అరవై డెబ్బై ఏళ్ళ క్రితం వరకూ పిండి వంటలంటే గోదుమ పిండితోనే చేసేవారు. ఒంటి పొరమీద వత్తితే పుల్కా, రెండు పొరల మీద దౌపాతి, మూడు పొరల మీద త్రీపాతి, నాలుగు పొరల మీద చపాతీ అంటారని ఒక పండితుడు విశ్లేషించాడు. సత్యనారాయణస్వామి ప్రసాదం గోధుమ రవ్వతో చేయటంలో పరాయితనం ఏమీ లేదు. అప్పట్లో జొన్నలతో చక్కిలాలు, సజ్జలతో సజ్జప్పాలు చేసుకునే వాళ్ళు. శనగపిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ వాడకం దాదాపు లేదనే చెప్పాలి.
కాబట్టి, వరి కూడు కన్నా జొన్నన్నమే మిన్న! తల్లీ తెలుగు రాజ్యలక్ష్మీ! నేను శ్రీనాథుణ్ణీ, తెల్లన్నం, సన్నన్నం వద్దు. జొన్నన్నం పెట్టి కాపాడు…” అని శ్రీనాథుడే అడగాల్సిన పరిస్థితి... ఈనాటిది.

సంక్రాంతి భోజనంబు.. అలనాటి వంటకంబు

Dr. G V Purnachand
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.


దమయంతీ స్వయంవరం వైభవోపేతంగా జరుగుతోంది. తరలి వచ్చిన రాజాధిరాజులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. గొప్పింటి ఆ విందుకు విచ్చేసిన అతిథులకు వడ్డించిన ఆనాటి ఆహార పదార్థాలను శ్రీనాథుడు ఒక పట్టికగా (మెనూకార్డ్) అందించాడు. వాటిలో సేవిక ఒకటి. సేవియ అనే వంటకం గురించి కూడా పూర్వకవి ప్రస్తావనలున్నాయి. ‘గోధూమ సేవికాగుచ్ఛంబు లల్లార్చి ఖండ శర్కరలతో గలపి కలపి’ అంటూ ‘సేవిక’ అనే తీపి వంటకాన్నీ, ‘దోసియలు, సేవియలు నంగర పొలియలు’ (కాశీ 6/125) అంటూ సేవియలనూ అలాగే, ‘దోసెల్, వడలు సేవెపాసెలు తోడ...’ (్భమ 1-61) అంటూ సివెపాసెములనూ శ్రీనాథుడు పేర్కొన్నాడు. హంసవింశతి కావ్యంలో సారెసత్తులు, సేవలు, జిరిమిళ్లు సరడాలు బరిడగవ్వలు వగైరా వంటకాల్లో సేవలు అనే వంటకం కనిపిస్తుంది. సేవికలు, సెవెలు, సేవలు సెవెపాసెలు ఇవన్నీ ఒక వంటకానికి నామాంతరాలా అనేది పరిశీలిద్దాం.
సేవిక
సేవిక అనేది సంస్కృత పదం. సేవియ, సేవె అనేవి దీనికి తెలుగు పేర్లు. భావప్రకాశ అనే ఆయుర్వేద వైద్య గ్రంథంలో రెండు రకాల సేవికల తయారీ విధానాలను పేర్కొన్నారు. మొదటిది సేమ్యా పాయసం. ‘సమితాం వర్తికాం కృత్వా..’ అంటూ పిండిని బాగా మర్దించి సన్నని వత్తులుగా (దారపు పోగులుగా) చేసి ఎండించి, వాటిని పాలలో వేసి నెయ్యి పంచదార చేర్చి కాచిన పాయసాన్ని ‘సేవికా’ అని ఈ గ్రంథంలో పేర్కొన్నారు. ఆకలి తీరుస్తుంది. సంతృప్తినిస్తుంది. ఆరోగ్యానికి మంచిది. బలకరం. విరేచనాన్ని బంధిస్తుంది. కష్టంగా అరుగుతుంది. తేలికగా తీసుకోవాల్సిన పదార్థం అని సేమ్యాపాయసం గుణాలను వివరించారు. రెండోది ఫేణీ లేదా పేణీతో చేసిన పాయసం. ‘సేవికామోదకాలు’ అనేవి మరొక రకం తీపి వంటకం. సన్నని దారాలుగా చేసిన సేమ్యాని చిన్నవిగా నలిపి, నేతితో వేయించి పంచదార పాకం పట్టి లడ్డూ ఉండలు కడితే వాటిని సేవికా మోదకాలన్నారు. ‘గోధూమ సేవికాగుచ్ఛంబు లల్లార్చి ఖండ శర్కరలతో గలపి కలపి..’ అని శ్రీనాథుడు వర్ణించినది వీటినేనన్న మాట. గోధుమ పిండిని సన్నని నూలుపోగులాగా చక్రాల గిద్దెలలో ఉంచి చిన్న పువ్వు ఆకారంలో వత్తి, నేతితో వేయించి పంచదార వగైరా చల్లి సేవికలను తయారుచేసుకోవచ్చు.
అరిసెలు
‘అలివేణి నీ చేతి యతిరస రుచి రసజ్ఞానందమాయె నేమనగ వచ్చు’ అని కవి ప్రయోగం. అతి రసం అనేది అరిసె అనే తెలుగు మాటకు సంస్కృత రూపం. ‘అరి’ అంటే ద్రావిడ భాషల్లో ‘వరి’ అని అర్థం. తెలుగులో వరి, లాటిన్‌లో ఊరిసి, తమిళంలో అరిసి అనే అర్థంలో కనిపించే పదాలు. ‘అరి’తో చేసే వంటకం కాబట్టి ఇది అరిసె అయ్యింది.
సంక్రాంతి తమిళులకు పొంగలి పండుగ అయితే, తెలుగు వారికి ఇది అరిసెల పండుగ! అరవ వారిలా మనమూ ‘హేపీ పొంగల్’ అనటానికి బదులు ‘విష్యూ ఎ హేపీ అరిసె’ అనవచ్చు. అరిసెల పండుగ కదా సంక్రాంతి.
అరిసెలు వండకుండానూ, తినకుండానూ మనకు సంక్రాంతి వెళ్లదు. మన గ్రామాల్లో అరిసెల్ని ఆడవాళ్లందరూ ఒక ఇంట్లో కూర్చుని సామూహికంగా వండుకొంటారు. పెళ్లిళ్లకు, పేరంటాలకూ అరిసె శుభసూచకం!
పాపాయి నిలబడి అడుగులేస్తోందంటే సంబరంగా పేరంటం చేసి, అరిసెలు పంచుతారు. అరిసెల మీదే నడిపిస్తారు. ఇంగ్లీషు వాడికి ‘కేక్’వాక్, ‘క్యాట్’వాక్‌లున్నాయి. తెలుగు వారికి అరిసె నడక ఉంది. బుడిబుడి నడకని అరిసె నడక అనటంలో తెలుగుదనం ప్రతిబింబిస్తుంది.
భక్ష్యాలలో రారాజు అరిసె. అరిసెల్ని ఇష్టపడని వారు అరుదు. రుచికరం, బలకరం, మనసుకు ఉల్లాసకరం కూడా! ‘గౌడికా గురవో భక్ష్యా వాతఘ్నాః కఫ శుక్రలాః’ అంటే బెల్లంతో చేసిన భక్ష్యాలు కష్టంగా అరుగుతాయి. కానీ, వీర్యవర్థకంగా ఉంటాయి. వాతాన్ని తగ్గిస్తాయి. కఫాన్ని పెంచుతాయి.
అరిసె తింటే ఆరు నెలల రోగాలు బయటపడతాయని భయపడేవాళ్లే ఎక్కువ. జీర్ణశక్తి తక్కువగా ఉన్నప్పుడు కష్టంగా అరిగేది ఏది తిన్నా ఆరేళ్ల క్రితం వ్యాధులను కూడా గుర్తుకు తెస్తుంది. అరిసె అందుకు మినహాయింపు కాదు. వీటిని చక్కగా సుష్టుగా తినాలంటే తిని తట్టుకోగలిగేలా పర్వతాలు పలహారం చేయగలంత బలమైన జీర్ణశక్తి ఉండాలి. పొట్టలో బాగాలేనప్పుడు అరిసెలు తినకుండా ఉంటే మంచిది. తింటే కడుపునొప్పి కలిగిస్తుంది. వేడి చేస్తాయి. కఫాన్ని పెంచుతాయి. ఆయాసం, ఉబ్బసం, దగ్గు లాంటివి పెరుగుతాయి. ఏనాడో మరచిపోయిన కీళ్లనొప్పులు తిరిగి మొదలెడతాయి.
యోగరత్నాకరం వైద్య గ్రంథం ‘ఘేవరి’ వంటకాన్ని ప్రస్తావించింది. పంచదారలో కొద్దిగా పాలు పోసి పాకం పట్టి అందులో బియ్యప్పిండి కలిపి అరిసెలు వండితే దాన్ని ‘ఘేవరి’ అంటారట. అరిసెల్ని ఇలా ఘేవరి పద్ధతిలో వండుకోవటమే మేలని యోగరత్నాకరం వైద్య గ్రంథంలో ఉంది. నేతిలో వేయించిన భక్ష్యాలు పైత్య, వాతాల్ని హరిస్తాయి. నూనెలో వేయించినవి కంటిచూపుని చెడగొడతాయి. వేడి చేస్తాయి. రక్తదోషాలు పుట్టిస్తాయని ఈ వైద్యగ్రంథం చెప్తోంది.
అరిసెలు తిన్నాక ఏ ఇబ్బందీ కలగకుండా ఉండాలంటే ఒక చిన్న ఉపాయం ఉంది. ధనియాలు, జీలకర్ర, వాము, శొంఠి ఈ నాల్గింటినీ సమభాగాలుగా తీసుకొని దంచి ఒక చెంచా పొడిని కొద్దిగా ఉప్పు కలుపుకొని గ్లాసు మజ్జిగలో తాగండి. అరిసెల్ని భయపడకుండా ఆస్వాదించవచ్చు. వాటిని తిన్న తరువాత ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా అరుగుతాయి.
వాముని నీళ్లలో వేసి కాచిన వామువాటర్‌ని అరిసెలు తిన్నాక తాగితే అరిసెల వలన కలిగే దోషాలకు విరుగుడుగా ఉంటుంది. మజ్జిగలో కొద్దిగా వాంపొడి, తగినంత ఉప్పు కలిపి తాగితే అరిసెలు తిన్న దోషం ఆగుతుంది. ధనియాలు, ఏదైనా స్వీటు తిన్నప్పుడు గోరువెచ్చని నీటిని తాగాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.
అంగార పొలియలు - బొబ్బట్లు
పోలి అంటే ముద్ద చేసిన పిండి. ప్రాకృతంలో దీన్ని ‘పోలి అ’ అంటారు. సంస్కృతంలో పోలిక అయ్యింది. పోలికను గుండ్రంగా వత్తి, కాల్చిన వంటకమే పుల్కా! బసవపురాణంలో ‘పోలె’ అనే వంటకం ప్రస్తావన ఉంది. ఉడికించిన శనగపప్పుని బెల్లంతో నూరిన ముద్దని, గోధుమ పిండి ముద్దనీ కలిపి వత్తి కాల్చితే దాన్ని అంగార పోలిక అంటారు. ఇదే బొబ్బట్టు లేదా ఒబ్బట్టు అనే వంటకం. నెయ్యి వేసి కాలిస్తే, ఎక్కువ రుచికరంగా ఉంటుంది.
పులిహోర
‘పులిహోర’ అనేది తెలుగువారి అతి ప్రాచీన ఆహార పదార్థం. తెలుగువారి తొలినాటి వంటకాల్లో ఒకటి. అత్యంత పవిత్రమైన ఆహార పదార్థం. వారసత్వ సంపదల్లో పులిహోర కూడా ఒకటి. తెలుగింటి పచ్చదనం అంతా పులిహోరలోనే ఉంది. పులిహోర వండారంటే ఆ ఇంట పండుగ చేసుకుంటున్నారని అర్థం.
పులి అంటే పుల్లగా ఉండేదని! పుళి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పలుకుతారు. పులుపు కలిసిన దానిని పులి అంటారు. ఓదనం అంటే అన్నం. పులివోదనం అనేది జన వ్యవహారంలో పులిహోర అయ్యింది. ఇది కమ్మనైన తెలుగు మాటే! దీన్ని సంస్కృతంలోంచి గాని, తమిళంలోంచి గానీ మనం అరువు తెచ్చుకోలేదు. ‘పులియోగర’ ‘పులియోదరై’ ‘పులిసాదమ్’ ఇలా తమిళులు పిలుస్తారు. కన్నడం వారు పులియోగరే లేక పుళియోగరే అంటారు. కన్నడంలో ‘ఓగర’ ‘హులి అన్నం’ అని పిలుస్తారు. ‘పులివోర’ ‘పులిహోర’ ‘పులిహూర’ ‘పులియోర’ ‘గుజ్జునోగిరం’ ‘పులుసన్నం’ ఇలా వివిధ తెలుగు ప్రాంతాల్లో దీన్ని పిలుస్తారు.
ఇది చిత్రాన్నం లేదా కలవటకం. సద్ది అని కూడా తీరాంధ్ర ప్రాంతాల్లో పిలుస్తారని చెప్తారు. రాత్రి పడుకునేటప్పుడు పులిహోరలో పెరుగు కలిపి ఉంచి, తెల్లారాక పులిసద్ది తింటారు. పులిహోరని కూడా ఉగాది పచ్చడిలాగే ఆరు రుచుల సమ్మేళనంగా తయారుచేసుకొంటారు. తీపి కోసం కొద్దిగా బెల్లం, పులుపు కోసం చింతపండు, మామిడికాయ, నిమ్మరసం లాంటి పుల్లని ద్రవ్యాలు; ఉప్పు, కారం కోసం మిరియాలపొడి, వగరు కోసం పసుపు, ఆవపిండి; చేదు కోసం మెంతిపిండి వీటిని తగుపాళ్లలో కలిపి వండితే, దానికి ఆరు రుచులూ కలుగుతాయి. ఈ ఆరు రుచుల కూడికే పులిహోర వైభవానికి కారణం. పుల్లని పదార్థాలకు బెల్లం, పటికబెల్లం, ఆవపిండి, మెంతిపిండి విరుగుడుగా పని చేస్తాయి. ఆ విధంగా ఇది ఆరోగ్యకరమైన వంటకం. పులుపు ఎక్కువగా ఉంటే పులిహోర శరీర దోషాల్ని పెంచుతుంది. చింతపండు పరిమితంగానూ బెల్లం, ఇంగువ, పసుపు, మిరియాలు, కొత్తిమీర, కరివేప ఆకులూ, ఆవపిండి, మెంతిపిండీ... ఇవన్నీ తగుపాళ్లలోనూ వుంటే ఆ పులిహోర దోషాలను కలిగించకుండా ఉంటుంది. పులిహార ఆరు రుచుల అద్భుత ఆహార పదార్థం. షడ్రసోపేతమైన భోజన పదార్థం ఇదొక్కటే! పులుపు పరిమితంగా ఉంటే ఉప్పూ కారాలు కూడా పరిమితంగా ఉంటాయి.
బత్తాసులు లేదా చిలకలు
బత్తాసు లేదా బత్తాసా అనేది ఇప్పుడు మనం చిలకలు పేరుతో చేసుకుంటున్న వంటకమే! మహేంద్ర చతుర్వేది హిందీ నిఘంటువులో బతాసా లేక బత్తాసాని పదానికి ఘ ఒళౄజ ఒఔ్దళూజష్ఘ షూజఒఔ ఘశజూ ఒఔ్యశక ఒఖఘూష్ఘరీళ అని అర్థాన్నిఛ్చారు. దీపారాధన ప్రమిదంత చిన్న ఇత్తడి పళ్లెం తీసుకొని పొడవైన కాడను టాకా వేయిస్తే, దాన్ని డోరా అంటారు. ఈ డోరా గినె్నని పొయ్యి పైన ఉంచి వేడి చేసి అందులో ముదురుపాకం పట్టిన పంచదారను పోసి సన్నసెగన పుల్లతో కలుపుతూ ఉంటే, డోరా గినె్నలో పాకం గట్టి పడి గుండ్రటి బిళ్లలాగా తయారవుతుంది. దాన్ని వేరే ఒక తడిబట్ట మీద ఉంచి ఆరనిస్తారు. చిలక, హంస, కోడి, గొల్లభామ లాంటి ఆకారాలు వచ్చేలాగా చెక్క అచ్చులు దొరుకుతాయి. వాటిలో పంచదార పాకం పోసి గట్టి పడేవరకూ ఉంచితే అవే చిలకలనే వంటకం. బత్తాసులు లేదా చిలకలు విష రసాయనాలు కలిసిన చాక్‌లేట్లకన్నా ఎన్నో రెట్లు ఆరోగ్యదాయకమైన తీపి వంటకం.
మనోహరాలు
ఒకప్పుడు బియ్యప్పిండితో చేసిన లడ్డూ ప్రసాదానే్న తిరుమలకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా అందించేవారట. కర్ణాటక మెల్కోటే దేవాలయంలోనూ, మధుర మీనాక్షి దేవాలయంలోనూ బియ్యప్పిండి, మినప్పిండి, పెసర పిండి కలిపి, లావు కారప్పూస వండి దాన్ని చిన్న ముక్కలుగా విరిచి బెల్లం పాకంలో వేసి, ఉండ కట్టి నైవేద్యం పెడతారు. మనోహరాలనే తీపి వంటకం ఇది. ఈ మనోహరాల గురించి 350 ఏళ్ల నాటి హంసవింశతి కావ్యంలో కూడా ఉంది. అంటే, తెలుగు నేల మీద మనోహరాల పేరుతో మిఠాయి విరివిగా దొరికేదన్న మాట!
పాలకాయలు
బియ్యప్పిండిలో తగినంత పంచదార పొడి, మెత్తని ఉప్పు, కొద్దిగా వాము పొడి కలిపి వెన్నపూస, వేడినీటితో ముద్దగా చేస్తారు. ఈ ముద్దని లోపల ఖాళీగా ఉండేలా గొట్టాలు చుడతారు. ఆ గొట్టాల్ని దోరగా నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి. పాలను బాగా ఉడికించి తీసిన కోవా (పాలగుజ్జు)ని ఈ గొట్టం లోపలికి ఎక్కించి, పిండితో గొట్టాన్ని మూసి తిరిగి నూనెలో వేయిస్తారు. ఇవి పాలకాయలంటే! వీటికి దుగ్ధకూపికా అనే సంస్కృతం పేరు కూడా ఉంది. స్వీట్లంటే బెంగాలీ స్వీట్లేననే అభిప్రాయంలోంచి బయటకొస్తే మనవైన కమ్మదనాలు ఇలా చాలా కనిపిస్తాయి.
కజ్జికాయలు - గరిజలు
ఆంధ్ర ప్రాంతంలో కరిజ - కర్జి - కజ్జి కాయలు అనీ, తెలంగాణ ప్రాంతంలో గరిజలనీ పిలిచే గొప్ప తీపి వంటకం జిల్లేడుకాయ ఆకారంలో ఉంటుంది. కజ్జ, కజ్జము, కజ్జికాయ, కజ్జాయం, ఖర్జ, కసర, సంయావ అనే పేర్లు కూడా ఉన్నాయి.
బెల్లం, ఏలకులు, కొబ్బరికోరు, లవంగాలు, మిరియాలు, కొబ్బరికోరు, పచ్చకర్పూరం, బాదంపప్పు, జీడిపప్పు, తెల్ల నువ్వులు, వేరుశనగపప్పు, గసగసాల పొడి వీటిలో ఎవరి రుచి కొద్దీ వారు కావలసిన ద్రవ్యాలను తగుపాళ్లలో తీసుకుని దంచిన పొడిని ఒక గినె్నలో ఉంచుకోవాలి. నెయ్యి కలిపి బాగా మర్దించిన గోధుమ పిండితో పలుచని అప్పడం వత్తి, దానిమీద ఈ పొడిని కొద్దిగా ఉంచి, అప్పడాన్ని మధ్యకు మడిచి, అంచులు కలిసేదాకా నొక్కుతారు. ఇది జిల్లేడు కాయ ఆకారంలో ఉంటుంది. ఈ కాయని నూనె లేదా నేతిలో వేయిస్తారు.
లోపల తీపి పదార్థాన్ని ఖచితం అంటే చక్కగా పొదుగుతారు. కాబట్టి ఖచిత కాయలు కజ్జికాయలుగా తెలుగులో ప్రసిద్ధి చెందాయని కొందరు పరిశోధకులంటారు. తెలుగు వంటకానికి సంస్కృతం పేరు ఎందుకుంటుంది? ద్రవిడియన్ ఎటిమలాజికల్ నిఘంటువు (1093) ప్రకారం ద్రావిడ భాషల్లో కజ్జ అంటే గొప్పదని! గొప్ప వంటకం అనే అర్థంలో కజ్జం, కజ్జిగాయ, గరిజకాయల్ని మనవాళ్లు వండుకుని తృప్తిగా తిన్నారు.
పాలతారికలు.. బియ్యపు పిండిని చిక్కగా కలిపి చక్రాల గిద్దలో వేసి కాగుతున్న పాయసంలో లావుగా చక్రాలు వత్తుతారు. ఏలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్మిస్సులు ఈ పాలతారికలకు అదనపు శోభనిస్తాయి. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రసిద్ధ వంటకం ఇది. అమిత బలకరం, తృప్తినిస్తాయి. ఆప్యాయతను కలిగిస్తాయి.
ఉక్కెర
ఉక్కెర అనగానే, ‘చక్కెర - ఉక్కెర పెడతాను, నీ కాలికి గజ్జెలు కడతాను’ అని పాతకాలం పాట గుర్తొస్తుంది. ఇప్పుడీ వంటకం దాదాపుగా అదృశ్యమై పోయింది. కాగుతున్న తియ్యని పాలలో మెత్తని బియ్యపు పిండి కొద్దికొద్దిగా వేస్తూ చిక్కబడేవరకూ కలుపుతూ నెయ్యి వేసి వండిన హల్వా లాంటి వంటకం ఉక్కెర. యాలకుల పొడి, పచ్చకర్పూరం వగైరా సుగంధ ద్రవ్యాలు, నేతి ఘుమఘుమలతో నోరూరించే ఈ చక్కెర - ఉక్కెరను ఆస్వాదించాల్సిందే! బలకరం, పుష్టినిస్తుంది. కొత్త అల్లుళ్లకు ప్రత్యేక లాభాలు కల్గిస్తుంది. రంగులు, ఎస్సెన్సు వేసి తయారుచేసిన బజారు హల్వాలకన్నా ఈ తెలుగు ‘ఉక్కెర’ చక్కనైనది కదా.
సంక్రాంతి అంటే కొత్తదనానికి ఎదురుచూడటం. ఆహార పదార్థాలను ఈ పండుగ రోజున స్మరించుకుందాం. ఆస్వాదిద్దాం.
- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com

Friday 29 May 2020

#APTODAYDIGITALTV-కందుకూరి పై.. నిందలు.. వందల వందలు.. విభిన్న కోణాల వి...

#APTODAYDIGITALTV-కందుకూరి పై.. నిందలు.. వందల వందలు.. విభిన్న కోణాల వి...

Saturday 9 May 2020

అమ్మకడుపులో నేర్చిందే అమ్మభాష:: డా. జి వి పూర్ణచందు


అమ్మకడుపులో నేర్చిందే అమ్మభాష:: డాజి వి పూర్ణచందు
పుట్టిన కొన్ని గంటల లోపే చంటి బిడ్డ అమ్మభాషకూ, పరభాషకూ ధ్వనిలో తేడా గుర్తించగలడని శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. ధ్వనుల పరిఙ్ఞానం గంటల బిడ్డకు ఎక్కడిది? అమ్మకడుపులో ఉన్నప్పుడేఅమ్మధ్వనిని గ్రహించ గలగటమే ఇందుకు కారణం అని తాజా పరిశోధనలు చెప్తున్నాయి.  తనను లాలించే వ్యక్తుల్ని కూడా కొత్తగా పుట్టిన పిల్లలు గుర్తించగలరు.
నెలరోజుల వయసు శిశువుల మెదడులో జరుగుతున్న పరిణామాల్ని న్యూరోఇమేజింగ్ పద్ధతిలో చేసిన అధ్యయనంలో బిడ్డ తనను సాకుతున్న తల్లి లేదా దాది స్పర్శను గుర్తించగలుగుతున్నట్టు నిర్థారించారు. తల్లి స్పర్శ తగిలినప్పుడు మెదడులో రక్తప్రసారం పెరగటాన్ని కూడా గుర్తించారు.   
పుట్టటానికి ఇంకా నాలుగైదు నెలల ముందునుండే, అమ్మ కడుపులోనే బిడ్డలు తొలుతగా నేర్చుకునేది  అమ్మభాషనే! పుట్టగానే బిడ్డ గుర్తించ గలిగేది కూడా అమ్మగొంతునీ, అమ్మమాటనే! పదాలు, వాటి అర్థాలు తెలియక పోవచ్చు. కానీ, బిడ్డ ఏడుపులో అనేక భావాలూ, అర్ధాలూ మాతృభాషలోనే ఉంటాయి.
అమ్మ కడుపులో ఉన్న కాలంలోనే శబ్దాలతో పాటు, రుచులూ, వాసనల్ని కూడా బిడ్ద ఆస్వాదించ గలుగుతాడు. పుట్టిన తరువాత ఆస్వాదన కొనసాగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. ఏడవనెలలోనే బిడ్డ నాలుకమీద రుచిని తెలియచేసే కేంద్రాలు (Taste buds) ఏర్పడతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తిన్న భోజన పదార్ధాల సుగంథాన్ని కూడా బిడ్డ గ్రహిస్తాడని, దాన్ని బాగా ఙ్ఞాపకం పెట్టుకుంటాడని కూడా చెప్తున్నారు. పుట్టిన తరువాత బిడ్డకు ఏవేవి తినిపిస్తామో వాటిని రుచికరంగానూ, ఇష్టంగానూ  గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి తినడం వలన బిడ్డకు వాటిపైన ఇష్టత పెరుగుతుందని కూడా గుర్తించారు.
అమ్మకడుపులో 7వనెల శిశువుగా ఉన్నప్పుడే నాడీవ్యవస్థ, జ్ఞానేంద్రియ వ్యవస్థ యంత్రాంగం ప్రారంభం అవుతుంది. చివరి 3-4 నెలల కాలంలో శరీర వ్యవస్థలన్నీ పరిణతి పొందుతున్న కొద్దీ గర్భస్థ శిశువు అమ్మ మాట్లాడే ధ్వనిని ఆకళింపు చేసుకోవటం ప్రారంభిస్తాడు. అది ధ్వని ఆకళింపు మాత్రమే! కడుపులో ఉండగానే అఆఇఈ లు వచ్చేస్తాయని దీని అర్ధం కాదు. మాతృభాష ఆకళింపు మాత్రమే జరుగుతుంది.
వాషింగ్టన్ విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ & బ్రైన్ సైన్సెస్ కు చెందిన Patricia Kuhl అనే పరిశోధకుడు చెప్పిన విషయాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. చివరి 10 వారాల కాలంలో గర్భస్థ శిశువు అమ్మభాష లోని అచ్చుల్ని ఎక్కువగా గ్రహించ గల్గుతాడని ప్రకటించాడు.
భాషకు అచ్చులు మూలం. పసిపిల్లల భాషంతా అచ్చులు ప్రధానంగా నడుస్తాయి. పుట్టి, ఎదిగే కొద్దీ అచ్చులతో హల్లుల్ని  ముడిపెట్టడం నేరుస్తాడు. 30 గంటల వయసున్న పసిబిడ్డలు వాళ్ల అమ్మ భాషలోని అచ్చుల్ని ఎలా ఆకళింపు చేసుకుంటున్నారో కంప్యూటర్ల సాయంతో విశ్లేషించి నిర్ధారణకొచ్చారు శాస్త్రవేత్తలు.
ఇది గర్భస్థ శిశువులకు తల్లి మాటలు యదాతథంగా అర్ధం అవుతాయని కాదు. భాషా పదాల ధ్వని స్వరూపాన్ని (speech sounds) అమ్మకడుపులోనే ఆకళింపు చేసుకునే ఒక ప్రయత్నం. చక్కగా తెలుగులో మాట్లాడే గర్భవతి గర్భాన పెరిగే బిడ్డకు తెలుగు మాటల ధ్వని బాగా అవగతం అవుతుంది.
గర్భంలో ఉన్న కాలంలోనూ, జన్మించాక ఎదుగుతున్న కాలంలోనూ మాతృభాష  ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ‘సైకో లింగ్విస్టిక్స్అనే శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధనాంశం ఇది. పదాలను పలకటం లోని ఉచ్చ, మధ్య, మంద్ర స్థాయిల ఆకళింపు భాషను గ్రహించటంలో మొదటి అంకంగా శాస్త్రం చెప్తుంది. 2009 నవంబర్ 5 కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో సైకో లింగ్విస్టిక్స్అ౦శ౦మీద తొలి పరిశోధన వెలువడింది.
జెర్మనీ లోని ఉర్జ్బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే శాస్త్రవేత్త Human fetuses are able to memorize sounds from the external world by the last trimester of pregnancy with a particular sensitivity to melody contour in both music and language అని పేర్కొన్నారు.
బిడ్డ పుట్టడానికి చివరి 3-4 నెలలు భాషకు సంబంధించి కీలకమైన సమయం. బైట ధ్వనుల్ని కూడా బిడ్డ గ్రహించే ప్రయత్నం చేస్తాడప్పుడు.తల్లిభాషా పదాలలోని లయ కొంత ఆకళింపు కొస్తుంది. ప్రసవించాక వీలైనంత త్వరగా తల్లులు బిడ్డతో మాట్లాడటం మొదలు పెడితే, బిడ్డ సౌకర్యవంతంగా భావిస్తాడు. perceptual preference అంటారు దీన్ని. పలకరించతానికొచ్చిన బంధుమిత్రులు ఆ బిడ్దని హల్లో హౌ డు యూ డు అంటూ పలకరిస్తే బిడ్డ అయోమయానికి లోనై ఏడుస్తాడు.
గర్భంలో ఉండగా తాను నేర్చిన స్వల్పమాత్రపు భాషలోనే బిడ్డ మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తన ధ్వనులతో మాట్లాడతాడు. బిడ్డ ఏడిస్తే ఒక్కో కారణానికి ఆ ఏడుపు ఒక్కో తీరున ఉండటం గమనిస్తూనే ఉంటాం కదా! బిడ్డ పుట్టి, ఎదుగుతున్న క్రమంలో మనం ధ్వనుల్ని నేర్పిస్తాం. భాషించటం నేర్పిస్తాం. కానీ, ఇంకా పుట్టకుండానే, అమ్మ కడుపులోనే నేర్చుకోవటాలన్నీ స్వయంగా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ. దీన్ని “pre-adaptation for learning language (పుట్టకమునుపే భాష నేర్చుకునే యత్నం)” అ౦టారు.
మాతృభాష ప్రభావంతో బిడ్డ మనసు రూపొందుతోంది, మాతృభాషలోనే అది పరిణతి పొందుతోంది. మాతృభాషకు అతీతంగా బిడ్డను పె౦చాలంటే అది బిడ్డలో మనో దౌర్బల్యానికి కారనం అవుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తారు పిల్లలు. ప్రాథమిక విద్యలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతుందని పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన శ్రీమతి కథ్లీన్ వెర్క్ స్పష్టంగా పేర్కొన్నారు. తెలుగు బిడ్దకి తెలుగు రాకుండా ఇంగ్లీషు నేర్పితే ఆ ఇంగ్లీషుని అర్థం చేసుకునే యంత్రాంగం విపలమై బిడ్డ తక్కువ తెలివితేతలతో మనో దౌర్బల్యుడౌతాడు.
పరిశోధనల నిరూపణ కోసం శ్రీమతి కథ్లీన్ వెర్క్ అప్పుడే పుట్టిన 60 మంది శిశువుల తొలిరోదన ధ్వని తరంగాలను రికార్డ్ చేశారు. సద్యోజాత శిశువుల తొలి రోదనం (first cry) మీద జరిగిన తొలి పరిశోధన ఇది. అరవై మంది పిల్లల్లో 30 మంది ఫ్రెంచి తల్లులకు, 30 మంది జెర్మన్ తల్లులకూ పుట్టినవాళ్ళు.  బిడ్డలు పుట్టిన మొదటి ఐదు రోజులపాటు బిడ్డల రోదన ధ్వనుల్ని విశ్లేషించి, ఫ్రెంచి తల్లులకు పుట్టిన బిడ్డల ఏడుపు తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయిలోకి ఆరోహణ క్రమంలోనూ, జెర్మనీ తల్లులకు పుట్టిన బిడ్డల ఏడుపు హెచ్చు స్థాయి నుండీ కిందకు అవరోహణ క్రమంలోనూ ఉన్నట్టుగా గమనించారు.
సాధారణంగా ఎక్కువ జెర్మన్ పదాలు పై స్థాయి నుంచి కింది స్థాయికి వస్తాయని, ఎక్కువ ఫ్రెంచి పదాలు కిందిస్థాయి నుంచి పై స్థాయికి వెడతాయనీ విశ్లేషకుల భావన. ఉదాహరణకు, ఫ్రెంచి భాషలో తండ్రిని “papaa” అని ఆరోహణంలో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణంలో పలుకుతారట.  పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ముందు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువ స్థాయిలో ఉన్నదా అని పరిశీలించారు. ఆకలి, అసౌకర్య౦, నొప్పి, వంటరి తనం ఇలాంటి కారణాలతో పసికూనలు చేసే రోదనలను వర్గీకరించుకుని విశ్లేషించారు. జెర్మన్ బిడ్డల ఏడుపు హెచ్చుస్థాయి నుంచి తగ్గుస్థాయికి అవరోహణ క్రమంలో ఉండగా, ఫ్రెంచి బిడ్డల రోదనం దిగువస్థాయి నుంచి పై స్థాయికి ఆరోహణ క్రమంలో ఉన్నట్టు తేలింది.“వా...వ్హ్అని ఏడ్చే బిడ్డకీహ్వ...వా...” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉండటాన్ని విధ౦గా గమని౦చారు.
ఫ్రెంచి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రెంచి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారు. చంటి బిడ్డ ఏడుపులోనూ భాష ఉంటుంది. మాతృభాషలో మనో భావాలను వెల్లడించే ప్రయత్నం (ability to actively produce language) అనేది పుట్టిన క్షణంనుంచే బిడ్డ మొదలు పెడతాడని అర్థం అవుతోంది. దాన్ని వెల్లడి చేయటానికి బిడ్ద చేసే ప్రయత్నమే ఏడుపు.
తల్లిభాషలో ఉండే యాసను, ధ్వని విధానాన్నీఅంటే యాసని(rhythm and intonation) గర్భంలోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారన్నమాట. తమిళం, తెలుగు, సంస్కృతం మొదలైన భాషలలో లయపరంగా తేడాలు ఉన్నట్టే, జెర్మనీ, ఫ్రెంచి భాషల లయల లోనూ  తేడాలను గమనించారు. 
ఫ్రెంచి భాషా పదాల్లో అధిక బాగం ఇలా అరోహణక్రమంలోనూ, జెర్మన్ భాషాపదాల్లో అవరోహణ క్రమం లోనూ ఉంటాయని, వారి బిడ్డల మొదటి ఏడుపు కూడా అందుకు అనుగుణంగానే ఉందని పరిశోధనలో తేలింది. వివిధ ధ్వనులే భాషలో వర్ణాలుగా ఏర్పడుతున్నాయి. వివిధ వర్ణాలు కలిసి భాషాపదాలు అవుతున్నాయి. తల్లిగర్భంలో ఉన్నప్పుడు ధ్వనుల్ని ఆకళింపు  చేసుకుంటే, పుట్టాక బిడ్డ ఆ ధ్వనుల్ని కూడబలుక్కోవటం మొదలెడతాడు.  
నిఃశ్వాసోఛ్చ్వాస సంక్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస సంక్షోభ స్వప్న సంభవాన్అని సుశ్రుతుడి సిద్ధాంతం ఇదే చెప్తోంది.
తల్లి గర్భంలో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనో భావాలు ప్రభావం చూపుతాయి. అలాగే,  బిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరించటం వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగు తాయని సిద్ధా౦తం చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడటం మొదలౌ తాయి.  కాబట్టి, 4 నెల గర్భవతినిదౌహృదినిఅ౦టారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రె౦డు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగటంలో మాతృభాష ముఖ్య పాత్ర నిర్వహిస్తోంది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతధ౦గా వినిపి౦చవు. నీటిలో చేపలు వాటి శరీరా౦గాలనుంచి, ఎముకలనుంచీ మెదడుకు చేరిన ధ్వని తరంగాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటిలో౦చి తల్లి భాషను స్వీకరించటం ప్రారంభిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడించారు. గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదళ్ళు ధ్వని తరంగాలను స్వీకరించ గలుగుతాయని కూడా ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  
నోరులేని జంతువులు కూడా తమ మనోభావాలను ధ్వనుల ద్వారా, సైగల ద్వారా వ్యక్త పరుస్తాయి. భాష రానిదే భావ వ్యక్తీకరణ ఏర్పడదనే వాదన సరికాదు. భావ వ్యక్తీకరణను బిడ్డ, అమ్మ కడుపులోనే సాధన చేస్తున్నాడు. అందుకు అమ్మభాష దోహదపడుతోంది. పుట్టాక కూడా అమ్మభాషలోనే బిడ్డ పెరగాలి. ప్రాధమిక విద్యలో నేర్చే అంశాలను అమ్మభాషలో ఆకళింపు చేసుకోవటానికి, తద్వారా ఎక్కువ సమాచారాన్ని గ్రహించటానికి బిడ్డకు వీలు కుదురుతుంది.

ఆచార్య ఉమామహేశ్వరరావు గారపాటి 16 మే 2017 ప్రతిలిపిలో
వ్యాసంపై ఇలా వ్యాఖ్యానించారు
అమ్మభాషను అనుకరించేందుకు చేసే ప్రయత్నమే బిడ్డ తొలి ఏడుపు అనీ, దీన్ని పుట్టిన తర్వాత భాష నేర్చేందుకు వేసే తొలి అడుగులుగా గుర్తించడం, విద్యామాధ్యమంగా ప్రాథమిక స్థాయిలో మాతృభాషను నిషేధిస్తే భాషాపరమైన అవ్యవస్థ ఏర్పడుతుందని భాషా శాస్త్రజ్ఞులు గుర్తించటం మన పాలకులకూ ఆంగ్లభాషా మాధ్యమ ప్రణాళికలను తయారు చేస్తున్న వారికీ కనువిప్పు కావాలి. విషయాన్ని రచయిత చక్కగా వ్యాసంలో పొందుపరిచారు. వ్యాసాన్ని అందరం చదవాలి పదిమందితో చదివించాలి.