Sunday 20 September 2020

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు :: డా. జి వి పూర్ణచందు

 

కన్యాశుల్కం నాటకంలో ఆనాటి దేశ రాజకీయాలు

డా. జి వి పూర్ణచందు

దేవుడికి వందనం అనే స్థితి నుంచి, దేశానికి వందనం అనే స్థాయికి భారతీయులను మళ్లించిన వాడు బంకించంద్ర చటర్జీ. దేశమంటే మట్టికాదనీ, మనుషులనీ అంటూ, తన దేశభక్తి గీతం ద్వారా స్వదేశీ బావనను రగిలించి తెలుగు జాతికి దిశానిర్దేశం చేసిన వాడు గురజాడ.

1905లో మొత్తం దేశాన్ని కదిలించి వేసిన వందేమాతరం ఉద్యమం లోంచే స్వదేశీ ఉద్యమం పుట్టింది. “జల్దుకొని కళలెల్ల నేర్చుకు/దేశి సరుకులు నించవోయి” అనే వాక్యాలు గురజాడ స్వదేశీ ఉద్యమానికి తార్కాణాలు.

“నాది ప్రజల ఉద్యమందానిని ఎవరిని సంతోష పెట్టడానికైనా వొదులుకోలేను” అని తన డైరీలో 1911మార్చి, 27న గురజాడ రాసుకొన్న మాటలు ఆయనను నవయుగ నిర్మాతగా భాసిల్లచేశాయి. 

“విద్యలనెరయ నించిన యాంగిలేయులు”(1912) అనీ, “కన్నుకానని వస్తుతత్త్వము కాంచనేర్పరు లింగిరీజులు; కల్ల నొల్లరు; వారి విద్యల కరచి సత్యము నెరసితిన్” అనీ ఆంగ్లేయులను మెచ్చినప్పటికీ, ఆంగ్లేయ సంస్కృతి పట్ల గురజాడ విముఖతే ప్రదర్శించారు.

“పాశ్చాత్య నాగరికత కొన్ని అంధవిశ్వాసాలను పోగొట్టుతున్న మాట యదార్థమే అయినప్పటికీ, అది ప్రబోధించే స్వాతంత్ర్యము సాంఘిక ప్రగతి శూన్యమైనది. ఇది సంపూర్ణ స్వాతంత్ర్యము కాదు, నామమాత్రమైనది.” ( గురజాడ డైరీ-1901, పుట215/సం: అవసరాల);

“శతాబ్దాల  తరబడి రాజకీయ బానిసత్వం వలన మరుగు పడి ఉన్న ఉదాత్త జాతీయ మనః ప్రవృత్తిని విద్యావంతులైన హిందువులకు బహిర్గతం చేసి, వారిలో వారి ప్రభావానికి లోనౌతున్న వ్యక్తులలో అట్టి వృత్తినే కలిగించటానికే ఇది దోహద పడును.(గోమఠం శ్రీనివాసాచార్యులు గారి హరిశ్చంద్ర నాటకం ఇంగ్లీషు అనువాదానికి గురజాడ పీఠిక)

స్వదేశీ ఉద్యమం గురించి చెప్పిన ఈ వాక్యాలు  గురజాడ వారి నిబద్ధతను చాటుతాయి.

గురజాడ స్వహస్తంతో వ్రాసిన “దేశభక్తి” గీతం చిత్తుప్రతిలో “నిన్నవచ్చా రింగిలీషులు/మొన్నవచ్చిరి ముసల్మను; లటు/ మొన్న వచ్చిన వాడ వీవని/ మరచి, వేరులు బెట్టుకోకోయి” అనే చరణం ఉంది. దీన్ని కొందరు గురజాడ ప్రదర్శించిన ఆంగ్లేయానుకూలతగా భావిస్తారు.  నిజానికి ఇది అన్ని కులాల, మతాల వారికీ దేశమే దేవత అనే భావన బలపడుతున్నదశలో అందుకు ప్రతిబంధకంగా నిలిచే వారికి చేసిన హెచ్చరిక.  హిందూ శబ్దాన్ని దేశీయులనే అర్ధంలో గాక, మతస్థులనే అర్ధంలో ప్రయోగించి, ఈ దేశంలో అన్యమతస్థులకు తావులేదని వాదించే వాళ్ళకి ఇది అంటించిన చురక.

గురజాడకు కాంగ్రెస్ రాజకీయాలతో సంబంధాలు బాగానే నడిచాయి. తన డైరీలో 1887 అక్టోబరు,27న విజయనగరం కాంగ్రెస్ సభలో తాను పాల్గొన్నట్టు రాసుకున్నారు. కానీ, కాంగ్రెస్ లోని మితవాద ధోరణులపట్ల ఆయన తన విసుగుదలని కన్యాశుల్కంలో ఎన్నో పాత్రల ద్వారా ప్రదర్శిస్తారు.

“తమ్ముడూ! గిరీశంగారు గొప్పవారష్రా?” అని బుచ్చమ్మ అడిగితే, వెంకటేశం “గొప్పవారంటే  అలా యిలాగా అనుకున్నావా యేవిటీ? సురేంద్రనాథ్ బెనర్జీ అంత గొప్పవారు” అంటాడు. “అతగాడెవరు?” అనడిగితే, వాడికి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కుని, “అందరికంటే మరీ గొప్పవాడు” అనేస్తాడు. దేశాన్ని గిరీశంగారు “యెలా మరమ్మత్తు చేస్తున్నార్రా? ’ అనడుగుతుంది. దానికి వెంకటేశం చెప్పిన సమాధానం ఇది: “నావంటి కుర్రాళ్లకు చదువు చెప్పడం, (నెమ్మళంగా) చుట్టనేర్పడం, గట్టిగా నాచ్చి కొశ్చన్ అనగా సానివాళ్ల నందరినీ  దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం ఒహటి. ఇప్పుడు తెలిసిందా...?” అని సమాధానం చెప్తాడు వెంకటేశం. ‘నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరీ చెలాయించడం’ అని ఈనాటకంలో ఒక బొడ్డూడని కుర్రాడే అన్నప్పటికీ, అది గిరీశం అభిప్రాయంగానే కన్పిస్తుంది. అందుకే మరో సీనులో, గిరీశమే అంటాడు: “ఒక సంవత్సరం గానీ నాకు దేవుడు దివాన్గిరీ యిస్తే, బీమునిపట్టణానికి పాల సముద్రం, విశాఖపట్టణానికి మంచినీళ్ళ సముద్రం , కళింగపట్టణానికి చెరకు సముద్రం తెస్తాను” అని. ఇక్కడ దివాన్గిరీ అంటే కాంగ్రెస్ పదవి. “పొలిటికల్ మహాస్త్రం అంటే, “ఒకడు చెప్పిందల్లా బాగుందండవే! సమ్మోహనాస్త్రం అంటే అదే కదా...!”, “ఒపీనియన్లు అప్పుడప్పుడు చేంజి చేస్తూంటే గానీ పొలిటీషియన్ కానేరడు” లాంటి సంభాషణల్లో కనిపించే ఆనాటి పొలిటీషియన్ నేషనల్ కాంగ్రెస్ వాడే! దేశంలో రాజకీయ సంస్థ ఆనాడు అదొక్కటే కాబట్టి!

“మొన్న బంగాళీవాడు (బహుశా బిపిన్ చంద్రపాల్ కావచ్చు)ఈ ఊర్లో లెక్చరిచ్చినప్పుడు ఒక్కడికైనా నోరు పెగిలిందీ...?”

“పెళ్ళి ఆపడానికి బ్రహ్మ శక్యం కాదు. డిమాస్థనీసు, సురేంద్రనాథ్ బానర్జీ వచ్చి చెప్పినా మీ తండ్రి వినడు”

“మొన్న మనం వచ్చిన బండి వాడికి నాషనల్ కాంగ్రెసు విషయమై రెండు ఘంటలు లెక్చరు ఇచ్చేసరికి ఆ గాడిద కొడుకు, వాళ్ల ఊరు హెడ్ కానిస్టేబిల్ని కాంగ్రెసు వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజెస్ లో లెక్చర్లు యంత మాత్రం కార్యం లేదు...”

(దేవుణ్ణి ఉద్దేశించి) యిలాంటి చిక్కులు పెట్టావంటే, హెవెన్ లో చిన్న నేషనల్ కాంగ్రెస్ లేవదీస్తాను”

“అన్ని మతాలూ పరిశీలించి వాటి యస్సెన్స్ నిగ్గుతీసి ఒక కొత్తమతాన్ని ఏర్పాటు చేశాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను” లాంటివెన్నో ఆనాటి రాజకీయపక్షుల మీద వ్యంగ్యాలు కన్యాశుల్కంలో కనిపిస్తాయి.

 “దేశాభిమానం నాకు కద్దని/వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్/పూని యేదైనాను ఒక మేల్/కూర్చి జనులకు చూపవోయ్” దేశభక్తి గీతంలోని ఈ చరణంలో వొట్టి గొప్పలు చెప్పుకోవద్దంటూ పెట్టిన వాత ఎవరిని ఉద్దేశించో తెలియాలి.

నేషనల్ కాంగ్రేసుకు ఆ తొలినాళ్లలోనే అంతగా వాతలు పెట్టటానికి బలమైన కారణాలే ఉన్నాయి. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్ర విభజనకు నిరసనగా బెంగాలీలు విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం ప్రారంభించారు. ఆ సమయంలో వందేమాతరం గీతం బెంగాలంతా ప్రతిధ్వనించింది. అది వందేమాతరం ఉద్యమంగా ప్రసిద్ధి పొంది దేశం అంతా వ్యాపించింది.

1906 కలకత్తా కాంగ్రెస్ ‘స్వరాజ్యం, స్వదేశీ, జాతీయ విద్య’ ఈ మూడు అంశాలు లక్ష్యాలుగా కొన్ని తీర్మానాలను ఆమోదించింది. బ్రిటీష్ అనుకూలత ద్వారా దేశానికి మంచి సాధించుకోవాలనే ధోరణిలో నేషనల్ కాంగ్రెసును నడుపుకొస్తున్న సర్ ఫిరోజ్ షా మెహతా, సురేంద్రనాథ్ బెనర్జీ, గోఖలే, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు “బోయ్ కాట్” లాంటి పదజాలం పట్ల వ్యతిరేకత కనపరచారు. లాలాలజపతి రాయ్, లోకమాన్య తిలక్, బిపిన్ చంద్రపాలు ప్రభృతుల నాయకత్వంలో కొందరు అతివాదులు ఈ మార్గాన్ని వ్యతిరేకించి, బ్రిటిష్ వారి పైన పోరాటానికి సిద్ధపడ్దారు.ఈ ముగ్గురినీ లాల్ బాల్ పాల్ త్రయంగా పేర్కొంటారు. వీళ్లని అతివాదులనీ, చేంజర్స్ అనీ పిలవ సాగారు.

ఆ మరుసటి సంవత్సరం 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలొ అతివాదులకూ, మితవాదులకూ తీవ్రమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. మితవాదులు రాస్ విహారీ ఘోష్ ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూచించగా, అతివాదుల పక్షాన లాలాలజపతి రాయ్ ని పోటీకి నిలబెడుతున్నట్టు వేదిక మీదనుంచి తిలక్ ప్రతిపాదించాడు. ఆయన అలా ప్రసంగిస్తూ ఉండగా జనం లోంచి ఒక బూటు వచ్చి వేదికపైన ఉన్న ఫిరోజ్ షా మెహతా చెంపకు తగిలి, పక్కనేఉన్న సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడింది.

 బూటుని మెహతా, బెనర్జీల వర్గం వాళ్ళు తిలక్ మీదకు విసిరితే అది గురి తప్పి సురేంద్రనాథ్ బెనర్జీ మీద పడిందో...లేక తిలక్ వర్గీయులే మెహతా బెనర్జీల మీదకు విసిరారో ఎవరికీ తెలియదు. బూటు వచ్చి తగిలింది. నువ్వంటే నువ్వని కారణాన్ని ఎదుటివారిమీదకు నెట్టుకుంటూ సభలో గందరగోళం సృష్టించారంతా!

దీనికి,తాను ప్రత్యక్ష సాక్షినంటూ, టంగుటూరి ప్రకాశంగారు “నా జీవిత యాత్ర” గ్రంథంలో కొన్ని విషయాలు ఉటంకించారు. ఈ సంఘటనకు ఒక నేపథ్యాన్ని ఆయన ఇలా విశ్లేషించారు:

 “నాగాపురం నుంచి వచ్చిన ప్రతినిధులు లాఠీ కర్రలతో ‘తిలక్ మహరాజుకీ జై’ అనుకొంటూ వేదిక మీదకు ఉరికారు. తరువాత గలాటా పెరిగి ఉభయ పక్షాలవాళ్ళూ కుర్చీలూ, బెంచీలు కూడా చేత బట్టి విజృంభించారు. అనేకమందికి గాయాలు తగిలి రక్తం స్రవించింది” అదీ సంఘటన. సరిగ్గా నేటి పరిస్థితికి నాటి పరిస్థితి నకలుగానే ఉంది.

“ఆ కాలంలో కాంగ్రెస్ కి ఫిరోజిషా మెహతా నియంతవంటి వాడే! కాంగ్రెస్ సంఘాలు అనిగానీ, ప్రతినిధుల్ని ఎన్నుకోవడం గానీ, ప్రతినిధులు ప్రెసిడెంటును ఎన్నుకోవటం గాని ఏమీ లేవు. మెహతా ఎవరి మీద కటాక్ష వీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రేస్ అధ్యక్షులు. తీవ్ర వాదులైన తిలక్ లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురయిన ముఖ్యులు” అనేది ప్రకాశంగారి అభిప్రాయం.

ఇలాంటి పరిస్థితుల్లో, ఆనాడు కాంగ్రెస్ పెద్దలను మంచి చేసుకుని విజిటింగ్ కార్డు పదవి అయినా పొందగలిగితే, ప్రభుత్వాదరణ దొరికేదని దీన్ని బట్టి తెలుస్తోంది. గురజాడ లాంటి ఆలోచనా పరుడు ఈ సంస్కృతిని ఆమోదించ గలడా? అందుకే, దేశభక్తి గురించి ఒట్టి గొప్పలు చెప్పుకోవద్దని మితవాద కాంగ్రెసుకే చురక వేశాడు.

1907 లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర రాష్ట్ర పర్యటన సమయంలో విశాఖపట్టణంలో ఆయనకు అంతగా ఆదరణ రాలేదు. కాకినాడలో ఒకమోస్తరుగా విజయవంతం అయ్యింది. తరువాత రాజమండ్రిలో జరిగిన సభ అద్భుతాలను ఆవిష్కరించింది. తెలుగువారిలో స్వాతంత్ర్య దీప్తిని నింపిన ఒక గొప్ప సభగా చరిత్రలో నిలిచిపోయింది. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదిస్తూ, “భరత ఖండంబు పాడియావు” అనే పద్యాన్ని చిలకమర్తివారు ఈ సభలొనే ఆశువుగా చెప్పారు.

ఆ తరువాత బిపిన్ చంద్రపాల్ బెజవాడ, మచిలీపట్టణాల్లో కూడా ప్రసంగించారు. తెలుగునాట స్వాతంత్ర్య కాంక్ష కలవారందరినీ ఏకం చేసి, తన నాయకత్వం లోకి తెచ్చుకున్నారు. వందేమాతరం ఉద్యమం తరువాత దేశంలో అతివాదులు తెలుగునేలమీద సాధించిన తొలి విజయం ఇది. అతివాదానికి గురజాడ అనుకూలమా...ప్రతికూలమా అనేది సున్నితమైన విషయం.

1897 నుంచీ 1912 వరకూ సంస్థాన వారసత్వ దావా విషయంలో అప్పారావు గారు తలమునకలుగా ఉన్న సమయం అది. ఆ కారణంగా ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధాలు పెట్టుకో లేకపోయినప్పటికీ, కన్యాశుల్కం నాటకంలో  జాతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా ప్రస్తావిస్తూ మితవాదుల ఆలోచనా ధోరణుల్ని ఎండగట్టారు.

హవల్దార్ పాత్ర- సారా కొట్టు సీను: కుంపిణీ నమ్మక్ తిన్నతరువాత ప్రాణం ఉన్నంత కాలం కుంపిణీ బావుటాకి కొలువు చెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధం వొస్తే పించను ఫిరకా యావత్తూ బుజాన్ని తుపాకి వెయ్యమా?”

        “రుస్సావోడి వోడ నీట్లో ములిగి నడస్తాది గదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు? అని మునసబు రెట్టించి అడుగుతాడు. దానికి హవల్దారు, “మొన్నగాక మొన్న యింగిరీజ్ రుషియా దేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలాడా లేదా? అప్పుడేవైందో, యిప్పుడూ అదే అవుతుంది. మా రాణి చల్లగా ఉండాలి...!”

“సీమరాణి ఆ కాళీమాయి అవుతారం కాదా?” అనడిగితే, “కాళీ గీళీ జాంతానై-ఆ రాముడి అవుతారం”

నేషనల్ కాంగ్రెస్ మితవాదుల సగటు ఆలోచనాధోరణిని ఈ సంభాషణలు తేటతెల్లం చేస్తున్నాయి. మనుషులు చేసిన దేవుళ్ళారా...! మీ పేరేమిటి? కథలో కనిపించే శైవ వైష్ణవ భేదాలు కూడా ఈ సంభాషణలో అదనంగా ధ్వనిస్తాయి.

          కన్యాశుల్కం నాటకంలో సార్వజనీనత, సార్వకాలీనతలు కొట్టొచ్చినట్టు కనిపించటానికి గురజాడ ప్రదర్శించిన ఈ రాజకీయ చైతన్యమే కారణం. బ్రిటిష్ వారితో మంచిగా వ్యవహరిస్తూ, ఎదురు తిరక్కుండా నమ్రతగా ఉంటూ, దేశానికి స్వాతంత్ర్యాన్ని బ్రతిమాలో బామాలో తెచ్చుకోవాలనే మితవాదుల ఆలోచనని ఏ మాత్రం అంగీకరించ లేదనటానికి ఈ నాటకంలో ఇలాంటి సంభాషణలు అనేకం సాక్ష్యం.