Tuesday 27 January 2015

ప్రేమబలాన్ని కోరే పద్యం :: డా. జి. వి. పూర్ణచందు

ప్రేమబలాన్ని కోరే పద్యం
డా. జి. వి. పూర్ణచందు
తెమ్ము బంగారు కుండ జలమ్ము లనుచు(
దెమ్ము లతకూన మంచి సుమమ్ము లనుచు(
దెమ్ము బాగైన కొమ్మ ఫలమ్ములనుచు
మించుబోడిని నేరుపు మించ( బలుకు
సినిమా రంగంలో పంచ్ డైలాగులు, డబుల్ మీనింగ్ డైలాగులూ రాసేందుకు స్పెషలిస్టు రచయిత లుంటారు. సంభాషణలన్నీ ఎవరో రాసుకు పోతే, చివర్లో పంచ్డైలాగుల రచయిత వచ్చి కొసమెరపులు రాసిస్తాడు. మీ ఊరొస్తా, మీ వీధికొస్తా, మీ ఇంటికొస్తాఅంటూ హీరో చేత చెప్పిస్తే దాన్నేపంచ్అంటారు. హీరో మాటల్ని విలన్తో అంటే రౌద్రంగా ఉంటాయి. అందమైన ఆడపిల్లతో అంటే మృదువుగా ఉంటాయి.
క్రీ.. 1600నాటి చేమకూర వేంకట కవి ఇలాంటి పంచ్లు వ్రాయటంలో సిద్ధహస్తుడు! తంజావూరు రఘునాథనాయకుడి కొలువులో ఉండేవాడు. అన్నీ పంచ్పద్యాలతో ఆయన విజయవిలాసం అనే ఒక గొప్ప చమత్కార కావ్యం వ్రాశాడు. ప్రతి పద్యాన్ని గొప్పగా విశ్లేషించి తీరాల్సి నంతబాగైన రచనఅది! తాపీ ధర్మారావుగారు హృదయోల్లాస వ్యాఖ్యలో పని విజయవంతంగా చేశారు.
పైన చెప్పిన తెమ్ము బంగారుకుండపద్యంలో అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులే ఉంటాయి. డబుల్ మీనింగ్ అని మనం వాడుకలో ప్రయోగించే పదానికి రెండర్థాలు, ద్వ్యర్థి లాంటి పదాలు పూర్తి సమానార్థకాలు కావు. డబుల్ మీనింగ్ సంభాషణలు అమ్మాయిలనుట్రాప్లో పడేసేందుకు ఉపయోగ పడతాయన్నమాట! అర్జునుడు సుభద్రని ముగ్గులోకి లాగేందుకు ప్రయత్నంలోనే ఉన్నాడు. అన్నలిద్దరూ చెప్పారు కదాఅని, కపట మునికి సపర్యలు చేయటానికి వచ్చింది సుభద్రఆవిడకు పని చెప్పటం ఇందులో సన్నివేశం. పద్యంలో అన్నీ తేలికపదాలే కాబట్టి ప్రతిపదార్థాలు వ్రాయ నవసరం లేదు.
బంగారు కుండలో నీళ్ళు పట్టుకురా! లేతతీగ కున్నమంచిపువ్వులు పట్టుకురా! బాగైనకొమ్మకు కాచిన పళ్ళు పట్టుకురా!” అని, వింటున్నవాళ్ళకి ఇలానే వినిపించే విధంగా, అందంలో అందరినీ మించిన ఆమెతో నేర్పు మించేలా చమత్కారంగా మాట్లాడట. ఏవిటా చమత్కారం? “బంగారు కుండా! నీళ్ళు పట్టుకురా! లేత తీగలా స్లిమ్ముగా ఉన్నదానా! మంచి పూలు పట్రా! బాగైన కొమ్మా(అందమైన అమ్మాయీ)… పళ్ళు పట్టుకురా!” అని ఆమెకి మాత్రమే అర్థం అయ్యేలాగా మాట్లాడట!
బంగారుకుండ, లతకూన, బాగైన కొమ్మ అని, సుభద్రని ఉద్ధేశించి అనటం ఒక్కటే ఇక్కడ చమత్కారం కాదు. బంగారు పాత్రలో నీళ్ళే ఎందుకు అడిగాడు? విరహం మీద ఉన్నాను చల్లార్చు- అని సూచనప్రాయంగా చెప్పటానికే! పూలూ, పళ్ళు కూడా విరహశ్యామకాలే! కాకపోతే బంగారు కుండల్ని కుదురైన స్తనాలతోనూ, పూలను మేను మార్దవంతోనూ, పళ్లను ప్రేమలోని తియ్యదనంతోనూ పోల్చినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిని వశం చేసుకోవటానికి ఇలా వాత్స్యాయ నీయాలన్నీ ఉపయోగించాలి కదా! అసలే కపట సన్యాసి కాబట్టి అతని మాటలన్నీ కపటంగా ఉండేలా వ్రాయకపోతే పాత్రౌచిత్యం దెబ్బతింటుంది. అందుకని, డబుల్ మీనింగ్ సంభాషణ తప్పనిసరి!
నిజానికి ఇవ్వాళ్టి మన కొత్త తరం కుర్రాళ్ళు ఇలాంటి సంభాషణల్ని ఇంతకన్నా చమత్కారంగా చెప్పగల సమర్థులే! కాకపోతే పద్యంలోని అంతరాత్మ చెప్పే విషయం ఇక్కడ ముఖ్యం.
ప్రేమ పెళ్ళిళ్ళు కానీండి, పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు కానీండి, మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిపోతున్న రోజులివి. ఏడాది తిరక్కమునుపే విడాకులకు పోతున్న కేసులు రోజురోజుకీ ఎక్కువౌతున్నాయి. దంపతుల మధ్య ఉత్త ఆకర్షణ తప్ప గాఢమైన ప్రేమ కుదరక పోవటమే ఇందుకు కారణం. ప్రేమ బలంగా ఉండాలి, దేవదాసు ప్రేమలా అస్థిరంగానూ, బలహీనంగానూ, పిరికిగానూ ఉండకూడదు
రతి కార్యానికి ముందు బలమైన ఉత్తేజం కలగటానికి ఉపరతిఎలా ఉపయోగ పడుతుందో, బలమైన ప్రేమను పొందటానికి ఉపప్రేమవాచకాలు అలా ఉపయోగ పడతాయి. ఇదొకఉపయోగం! ప్రేమ బలంగా ఉండాలంటే ఉపప్రేమతప్పనిసరి. సినిమాల్లో చూపించినట్టు  ‘సిటీబస్సు ప్రేమ’ (బస్సులో చూడంగానే ప్రేమించేయటం, స్విజ్జర్లాండు మంచుకొండల్లో డ్యూయెట్టు పాడుకోవటం) లాంటి ప్రేమలు పెళ్ళిదాకా వెళ్ళేవి తక్కువ. వెళ్ళినా ప్రథమ వైవాహిక వార్షికోత్సవం జరుపుకున్నవి కూడా తక్కువే! బలమైన ప్రేమను పొంది, శాశ్వతమైన దాంపత్య బంధాన్ని పెంచుకోవాలన్నమాటపెద్దలు చేసిన పెళ్ళిళ్లక్కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.  

సుభద్రలో ప్రేమభద్రం కావటం కోసం తాపత్రయ పడ్డాడు అర్జునుడు. పద్యం ప్రేమబలాన్ని కోరుకుంటోంది.