Thursday 26 June 2014

అజీర్తిని జయించే ఆహారం :: డా. జి వి పూర్ణచందు

అజీర్తిని జయించే ఆహారం
డా. జి వి పూర్ణచందు
అజీర్తి కారణంగా వచ్చే కడుపునొప్పి తగ్గటానికి ఒకటీ లేదా రెండు వెల్లుల్లి గర్భాల్ని నమలకుండా మింగేయండి. ఫలితం కనిపిస్తుంది.
అజీర్తి నివారణకు ఒక ఫార్ములాని చెప్తాను. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక సీసాలో భద్రపరచుకుని ఎప్పుడు అజీర్తి  అనిపించినా తీసుకుంటూ ఉండటం మంచిది. కరక్కాయలు బాగా ఎండినవి మనకు బజార్లో దొరుకుతాయి. ఈ కాయని పగలగొడెతే లోపల గింజ ఉంటుంది. ఆ గింజను తీసేసి, కరక్కాయ బెరడు మాత్రమే మనకు కావాలి. వంద గ్రాముల కరక్కాయల్లో గింజతీసేస్తే షుమారు యాబై గ్రాముల బెరడు మిగుల్తుందిఈ బెరడుకు సమానంగా పిప్పళ్ళను, సౌవర్చలవణాన్ని తీసుకుని (ఇది దొరక్కపోతే సైంధవ లవణం)మూడింటినీ మెత్తగా దంచిన పొడి అరచెంచా మోతాదులో మ్తీసుకుని గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగితే అజీర్తి బాధలు తగ్గతయ. మంచ జీర్ణశక్తి కలుగతుంది. దీన్ని అజీర్ణహర చూర్ణం అని పిలుస్తారు.
ఇలాంటిదే ఇంకో ఫార్ములా కూడా ఉంది. సైంధవలవణం కరక్కాయ బెరడు, పిప్పళ్ళు, వాము, శొంఠి ఈ ఐదూ పచారీ షాపుల్లో దొరికేవే! వీటన్నింటినీ మెత్తగా దంచి ఒక సీసాలో భద్రపరచుకోండి. కడుపులో బాగో లేదనిపించినప్పుడు, అజీర్తికర మైనవి తిన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడూ ఈ పొడిని అరచెంచా మోతాదులో గ్లాసు మజ్జిగలో కలిపి తాగండి. పొట్ట బాగౌతుంది.
అజీర్తి వలన వచ్చే కడుపులో నొప్పి తగ్గటానికి, ఒక చెంచా నేతిలో చిటికెడు ఉప్పు వేసి కాయండి. బోజనం చేసిన తరువాత కడుపులో నొప్పి వస్తున్నవారికి ఈ ఉప్పు వేసిన నేతిని మొదటి ముద్దగా కలిపి పెడితే నొప్పి తగ్గుతుంది.
అజీర్తి, జీర్ణకోశానికి సంబంధించిన ఏ వ్యాధి ఉన్నా సరే, వసకొమ్ముని దంచిన పొడి చిటికెడు తీసుకుని చిక్కని బ్లాక్ టీ లాగా కాచుకుని తాగితేమేలు చేస్తుంది. కఫం తగ్గుతుంది. జ్వర తీవ్రత తగ్గుతుంది. విషదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. మొలలున్న వారికి ఉపశాంతినిస్తుంది. కడుపులో నులిపురుగులు పోగొడుతుంది. మలబద్ధకాన్ని హరిస్తుంది. ఉబ్బసంలో వచ్చే దగ్గు, ఆయాసాలను తగ్గిస్తుంది. అతిగా తాగితే వికారం కలిగిస్తుంది. స్వల్ప ప్రమాణంలో తీసుకోవాలి.
అజీర్తిని జయించే వాటిలో బిరియానీ ఆకు గొప్పది. ఆకుపత్రి అంటారు దీన్ని. బిరియానీలోనో పలావులోనో కలుపు తుంటారు. మషాలా ద్రవ్యాలలో ఇది నిరపాయకరమైంది. ఆరోగ్యాన్నిచ్చేది. ఈ ఆకులు కూడా కలిపి మషాలా ద్రవ్యాలను తయారు చేసుకుంటే, అజీర్తిని జయించినట్టే!మలబద్ధతని సరి చేస్తుంది. కడుపులో నొప్పిని హరిస్తుంది. పైత్యాన్ని పోగొడుతుంది. బాలింతలకు తల్లిపాలు పెరిగేలా చేస్తుంది. కడుపులో వాతం, గ్యాసూ, ఉబ్బరం, దుర్గంధతో కూడిన అపాన వాయువులు, దుర్గంధంతో కూడిన విరేచనం ఆగుతాయి. నోటి దుర్వాసన పోతుంది. అల్లం వెల్లుల్లి తగ్గించి, ఆకుపత్రినీ, దాల్చిన చెక్కనూ వాడుకుంటూ ఉంటే మంచిది. బియ్యపు నూకను దోరగా వేయించి చిక్కగా కాచిన జావలో తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసుకుని తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

జీర్ణశక్తి మందంగా ఉన్నవాళ్ళు దంపుడు బియ్యాన్నో లేక పట్టు తక్కువ బియ్యాన్నో తినటం వలన జీర్ణాశయవ్యవస్థ మరింత దెబ్బతింటుంది. గోధుమలూ రాగులూ, సజ్జల్లాంటివి పూర్తి ధాన్యంగా వండుకుంటాం. వీటిని మిల్లాడించి పై పొరల్లోంచి చిట్టూ, తవుడూ వగైరా తీసేయటం ఉండదు. కాబట్టి, దంపుడు బియ్యం తినటం కన్నా జొన్నలూ, రాగులూ సజ్జలూ  వగైరా తృణ ధాన్యానికి ప్రాధాన్యత నివ్వటం మంచిది. జీర్ణాశయం బలగా లేదనుకున్నప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను వండుకుని తింటే పేగులు చెడకుండా ఉంటాయి.
బార్లీ జావ, సగ్గుబియ్యం జావ, పేలాలు, మరమరాలు(బొరుగులు) ఇలాంటివి జీర్ణశక్తిని కాపాడతాయి. అజీర్తిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటితో కడుపు నింపుకోవటం మంచిది. షుగరు వ్యాధి ఉన్న వారికి జొన్న పేలాలు, జొన్న అటుకులు చాలా మేలు చస్తాయి.
పెసర పప్పులో నీళ్ళు ఎక్కువ పోసి కాచిన కట్టులో మిరప కారానికి బదులుగా మిరియాల పొడిని కలుపుకుని అన్నంలో తింటే అజీర్తి తగ్గుతుంది.
లేత ముల్లంగి దుంపల జ్యూసు రోజూ ఉదయం పూట తాగుతూ ఉంటే పేగులకు ప్రశాంతత నిచ్చి జీర్ణశక్తిని పెంచుతుంది.
అజీర్తిని తగ్గించే ఒక ఆహార పదార్ధం అష్టగుణమండం: ఇంగువ, సైంధవలవణం, ధనియాలు, బిరియానీ ఆకు ముక్కలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు... వీటన్నింటినీ సమభాగం తీసుకుని మెత్తగా దంచిన పొడిని ఒక సీసాలో భద్రపరచుకోండి. బియ్యంలో సగం చాయపెసర పప్పు తీసుకుని నీరు ఎక్కువగా కలిపి జావలాగా కాయండి. ఒక మనిషికి సరిపడిన జావలో  ఈ పొడిని ఒకచెంచా లేదా ఒకటిన్నర చెంచా మోతాదులో కలిపి మరికాసేపు కాచి దింపండి. దీన్నే అష్టగుణమండం అంటారు. ఇది అజీర్తిని తగ్గించే గొప్ప ఔషధం. రోజూ తాగినా మంచిదే!
అజీర్తిని పోగొట్టటానికి సూక్ష్మంలో మోక్షంగా పనిచేసే ఇంకో ఉపాయం ఉంది. కొత్తిమీర రసాన్ని ఒక చిన్న గ్లాసులో తీసుకొని అందులో ఉప్పు, మిరియాలపొడి తగినంత కలిపి, రోజూ ప్రొద్దున పూట తాగుతూ ఉంటే అజీర్తి పటాపంచ లౌతుంది. పైత్యం, కడుపులో యాసిడ్, పేగుపత వ్యాధుల్లో మంచిది. కొత్తిమీర మిరియాలపొడి మిశ్రమాన్ని మెత్తగా నూరి తగినంత ఉప్పు కలిపి భద్రపరచుకోండి. అన్నంలో మొదటి ముద్దగా దీన్ని తింటే అజీర్తి కలగదు.
అజీర్తిని పోగొట్టి జీర్ణశక్తిని పెంచటంలో ఉప్పుని మించిన ఔషధం లేదు. అయితే ఉప్పుని పరిమితంగా ఒక ఔషధంలాగే వాడుకోవాలి. ఎందుకంటే ఉప్పు తగ్గినందు వల్ల ఏర్పడే జబ్బుల్లాగే ఉప్పు పెరిగి నందువలన ఏర్పడే జబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి!  ఉప్పుని ముట్టుకో కూడదన్నట్టు చెప్పటమూ తప్పే! అదే పనిగా తినటమూ తప్పే!
అన్నం తినబుద్ధి కాకపోతున్నప్పుడు బిరియానీ ఆకుని మెత్తగా దంచి మిరియాల పొడి ఉప్పు తగినంత కలిపి  కారప్పొడి చేసుకుని తింటే అన్నహితవు కలుగుతుంది. అన్నహితవు కలగటానికి ప్రతిరోజూ అల్లాన్ని తగినంత ఉప్పు వేసి దంచి అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే భోజనంలో ఉండే దోషాలన్నీ పోతాయి. అన్నం తినాలనే కోరిక కలుగుతుంది. అల్లం ఉప్పు కలిపి మెత్తగా నూరి  అన్నంలో ఒక చెంచా మోతాదులో కలుపుకుని నెయ్యి వేసుకుని మొదటి ముద్దగా తింటే అజీర్తి తగ్గుతుంది. అన్నహితవు కలుగుతుంది. భోజనం చేసిన తరువాత భుక్తాయాసం కలగకుండా ఉంటుంది.సిరిక్జాయ తొక్కుడు పచ్చడి(నల్లపచ్చడిఅల్లం మిశ్రమం కలిపి నెయ్యి వేసుకుని ఒకటీ లేక రెండు ముద్దలు అయ్యేట్లుగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. అజీర్తి లేని వాళ్ళు కూడా ఇది తింటూ ఉంటే జీర్ణ శక్తి పదిలంగా ఉంటుంది.
ఆవపిండి చిటికెడంత కలిపిన వంటకాలను తరచూ తింటూ ఉంటే అజీర్తి కలగకుండా ఉంటుంది
ఆహార సమయంలో నీటిని మధ్యమధ్య తాగుతూ ఉంటే అజీర్తి తగ్గి, జీర్ణశక్తి పదిలంగా ఉంటూంది. అతిగా నీరు తాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.
ఎండిన కిస్మిస్ పళ్ళూ పంచదార, తేనె ఈ మూడింటినీ సమానంగా తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచామోతాదులో రెండు పూటలా రోజూ తీసుకుంటే  కడుపులో బాధలు తగ్గి జీర్ణకోశ వ్యవస్థ ఎంతో పదిలంగా ఉంటుంది.
పిప్పళ్లను దోరగా వేయించి మెత్తగా దంచండి పిప్పళ్ళు మీకు పచారీ కొట్లలో దొరుకుతాయి. లేదా మూలికలమ్మే వారి దగ్గర దొరుకుతాయి. తేలికగా దొరికేవే! ఈ పిప్పలీ చూర్ణానికి ఆరురెట్లు పంచదార కలిపి పాకం పట్టి కుంకుడు కాయంత ఉండలు చేసుకొని సీసాలో భద్రపరచుకోండి. జీర్ణ వ్యవస్థ బలంగా లేనివారు దీన్ని ఉదయం రాత్రి ఒక్కక్క మాత్ర చొప్పున తీసుకుంటూ ఉంటే కడుపులో వాతం తగ్గి జీర్ణాశయం బలపడుతుంది. శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది.
పెరట్లో బొప్పాయి చెట్టు ఉన్నవారు చేసుకోగలిగిన ఫార్ములా ఇది: బొప్పాయి చెట్టుకు గాటు పెడితే పాలు వస్తాయి. కొద్దిసేపు కష్టపడితే ఒక చెంచా లేదా రెండు చెంచాల పాలు సేకరించవచ్చు. ఈ బొప్పాయి పాలుంచిన గ్లాసుని వేడి ఇసుకమీద గానీ, సన్న సెగ మీద గానీ ఉంచితే, ఆ వేడికి బొప్పాయి పాలు గడ్డకట్టి పొడిగా అవుతాయి. ఈ పొడిని చిటికెడంత తీసుకుని గ్లాసు పాలలో గానీ, మజ్జిగలో గానీ కలుపుకుని తాగితే ఆకలి పరిగెత్తు కొస్తుంది. ‘పెపైన్ అనే ఎంజైమును ప్రకృతి సిద్ధంగా పొందేందుకు ఇది మంచి ఉపాయం.
 పైత్యం, అజీర్తి ఎక్కువగా ఉన్నప్పుడుపెరుగన్నంలో దానిమ్మ గింజలు కలుపుకుని తింటే ఉపశమనంగా ఉంటుంది.
లేత అరటికాయల కూరని మిరియాలపొడితో గానీ, కాల్చి పెరుగుపచ్చడిగా గానీ చేసుకుని తింటే జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది.



శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ఘనస్వాగతం




కృష్ణాజిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ డప్యూటీ స్పీకరుగా ఎన్నికైన తరువాత ది. 26-06-2014 ఉదయం 10 గంటలకు
తొలిసారిగా బెజవాడ వచ్చిన సందర్భంగా కృష్ణాజిల్లా రచయితల సంఘం సభ్యులు వారికి ఘనంగా స్వాగతం పలికారు

ఆహారోపనిషత్తు ఆంధ్రభూమి వారపత్రికలో కొత్తగా ప్రారంభం అయిన నా శీర్షిక

ఆహారోపనిషత్తు
ఆంధ్రభూమి వారపత్రికలో కొత్తగా ప్రారంభం అయిన నా శీర్షిక

ఆంధ్రభూమి వారపత్రిక జన్మదిన సంచిక (జూలై 3వ తేదీ) నుండీ ఆహారోపనిషత్తు పేరుతో నేను నిర్వహిస్తున్న ప్రశ్నలూ-సమాధానాల శీర్షిక ప్రారంభం అయ్యింది. ఇప్పుడు మార్కెట్లో ఉంది. చూడగలరు.
        పక్కన కూచోబెట్టుకుని, చక్కగా బోధపరిచే వాటిని ఉపనిషత్తు లంటారు. ఇది ఆహారోపనిషత్తు. ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం గురించి మీరు మీ సందేహాలను ఈ బ్లాగు / ఫేస్బుక్ ద్వారాగాని, purnachandgv@gmail.com -మెయిల్ ద్వారాగానీ, 9440172642 సెల్ నెంబరుకు యస్సెమ్మెస్ చేయటం ద్వారాగానీ, లేదా ఇదే నెంబరుకు ఫోనుద్వారా గానీ, డా. జి వి పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేద ఆసుపత్రి, బకింగ్హామ్ పేట పోష్టాఫీసు ఎదురు, గవర్నర్ పేట, విజయవాడ-520 002 చిరునామాకు ఉత్తరం ద్వారా గానీ, నాతో సంప్రదించవచ్చు. సులువుగా అర్థం అయ్యే భాషలో విడమరచి చెప్పటం జరుగుతుంది. మీ ప్రశ్నలకు నా సమాధానాలు ఆంధ్రభూమిలో కూడా అచ్చవుతాయి.
        ఆహారం విషయంలో మనం కనబరుస్తున్న అశ్రద్ధ రేపటి తరానికి చాలా అపకారం చేసేదిగా ఉంది. ఈ విషయమై గత నాలుగేళ్ళుగా అనేక కోణాలలోంచి విశ్లేషిస్తూ, దాదాపు 200 వ్యాసాలవరకూ వ్రాశాను. అవన్నీ నా బ్లాగులోనూ, ఫేసుబుక్లోనూ ఉన్నాయి. వాటిని పరిశీలించ గలరు. ఆరోగ్యాన్నిచ్చే ఆహారం కోసం మనం ఉద్యమించవలసిన సమయం ఇది. పాఠక మిత్రులు స్పందించ వలసిందిగా కోరుతున్నాను.
డా. జి వి పూర్ణచందు

ఆయుర్వేద వైద్యులు, సాహితీ వేత్త, ఆహార శాస్త్ర పరిశోధకుడు