Thursday 16 September 2021

గానుగపిండి: డా|| జి వి పూర్ణచందు

 గానుగపిండి: డా|| జి వి పూర్ణచందు

ఆంధ్రజ్యోతి ఆదివార్ం సంచికలో తినరా మైమరచి శీర్షిక 22-8-21న ప్రచురితం

“రంగావొఝుల తిమ్మక్క: యేమో ప్రోలుభట్ల యల్లమ్మ నగరింటి పెండ్లి నాడయినా వొక వక్కబ్రద్ద వేసుకుని

నమలరా దషవో...?

ప్రోలుభట్ల యల్లమ్మ: అవునషే రంగావొఝుల తిమ్మక్క, నాకు వక్క బ్రద్దా వొకటి కొదవా చాలుచాలు. నిన్న మా వారు సుక్కరారం సంతలో పిండికూర కంచున్ను గానుగబిండి దెచ్చిరి. పెండ్లిపందిట్లో నోరుమెదలించవలె నంచున్ను యింత

దెచ్చుక తింఛునా నింతే!”

1633 నుండి 74 దాకా తంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయరాఘవనాయకుని ఆస్థాన కవయిత్రి, ఆయన భోగపత్ని రంగాజమ్మ వ్రాసిన “మన్నారుదాసవిలాస నాటకము” అనే యక్షగాన కృతిలోది ఈ సంభాషణ. అచ్యుత విజయరాఘవాధిపు పెండ్లికి ముచ్చట లాట్లాడుచు వచ్చిన ముత్తైదువలు సువ్విపాటలు పాడుతూ కొట్నములు(పసుపు వగైరా) దంచుతూ ‘‘జాత్యనుగుణముగా మాటలాడిరట యెటు వలె” నంటూ ఈ సంభాషణ నడిపించింది రంగాజమ్మ.

ఇందులో ప్రోలుభట్ల యల్లమ్మని రంగావఝుల తిమ్మక్క యద్దేవా చేస్తోంది. “ఏవమ్మా! రాజుగారి పెళ్లికి వచ్చినప్పుడైనా వక్కపలుకులు వేసుకుని నమలొచ్చుగదా...” అని! దానికి యల్లమ్మ “అవునట నాబతుక్కి వక్క బ్రద్దా వొకటి కొదవా...? చాలుచాలు! నిన్న మావారు సుక్కరారం(శుక్రవారం) సంతలో పిండికూర కోసం గానుగబిండి తెచ్చారు. పెండ్లిపందిట్లో ఏదో ఒకటి నముల్తూ కనిపించాలి కాబట్టి , దాన్ని ఇంత తెచ్చుకుని నముల్తున్నాను” అంది వ్యంగ్యంగా! 400 యేళ్ల నాటి ఈ యక్షగానంలో మరోచోట కూడా ‘గానుగపిండి’ గురించి ఉంది. ఒక గొల్ల చేరువకాడు “వొరెవొరె కూడు దిని వస్తి వంట్టరా, కూరాకేమిరా?” అని ప్రశ్నిస్తాడు. ‘అన్నం తిని వచ్చావా? ఏం కూర తిన్నావు?’ అని! దానికి “వొరె కూరాకె! అల్ల బాంపనవాండు సొరకాయ, గానుగ బిండ్డిన్ని యిచ్చెరా” అంటాడా ఆగంతకుడు. 

నువ్వుపప్పుని గానుగాడించి నూనె పిండగా మిగిలిన చెక్కని ‘గానుగపిండి’ తెలికిపిండి, తెలగపిండి చెక్క(defatted sesame cake) అంటారు. దీన్ని పశువుల దాణాలో కలుపుతారు. కూరగా కూడా తింటారు. కృష్ణదేవరాయ యుగానంతరం తెలుగు, తమిళ సముద్ర తీరాల ద్వారా అమెరికా నుండి స్పెయిన్ వర్తకులు వేరుశనగను తెచ్చి పరిచయం చేశారు. అయినా ఈ కధా కాలానికి ఇంకా వేరుశనగ చెక్క జనం వాడకం లోకి వచ్చిందో లేదో తెలీదు. గానుగపిండి అంటే తెల్లనువ్వులచెక్క అనేదే ప్రసిద్ధి. వేరు శనగచెక్క, నల్లనువ్వులచెక్క, కొబ్బరిచెక్క కూడా కూరల్లోకి రుచిగానే ఉంటాయి. ఒక్క ఆముదం చెక్క తప్ప తక్కిన గానుగపిండ్లన్నీ తినదగినవే! నల్లేరు కాడల లోపలి గుజ్జునీ, గానుగపిండినీ రుబ్బి పెట్టిన వడియాలను ‘చాదువడియా’ లంటారు. వాణిజ్య సంస్కృతిలో వీటిని ఛాందస ద్రవ్యాలుగా భావిస్తున్నాం మనం. కానీ ఆహార పరిశ్రమల్లో ఈ గానుగపిండి వాడకం బాగా ఉంది. దీన్ని గోధుమపిండితో కలిపి బిస్కట్ల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు.

  నువ్వుల్లో ఉండే నూనెపదార్థం మాత్రమే గానుగలో వేరౌతోంది. తక్కిన ప్రొటీన్లు(1.6గ్రా), కాల్షియం (87.75 మి.గ్రా), ఇనుము(1.31 మి.గ్రా), మెగ్నీషియం (31.59 మి.గ్రా.), ఫాస్ఫరస్(56.61మి.గ్రా.) పొటాషియం(42.12 మి.గ్రా.) వగైరా పోషకాలు ఎక్కువగా ఈ పిండిలోనే ఉండిపోతాయి. రంగాజమ్మ ఈ యక్షగానంలో వ్రాసినట్టు సొరకాయకూర లేదా నీరు కలిగిన కాయగూరలతో ఇగురు కూరలు వండుకునేప్పుడు దీన్ని కలిపి వండితే పొడిపొడిగా, రుచిగా, బలకరంగా ఉంటుంది. కందిపప్పుని ఉడికించి అందులో ఈ పిండిని, వెల్లుల్లి రెబ్బల్నీ కలిపి తాలింపు పెట్టి, భాండీలో వేగించి పొడికూర చేస్తారు. ఇది వాతవ్యాధులున్నవారికి ఔషధమే! బాలింతలకు పాలుపెరిగేందుకు దీన్ని తప్పనిసరిగా పెడతారు. కొవ్వు ఉండదు కాబట్టి, స్థూలకాయం ఉన్నవారికి మేలుచేస్తుంది. ఈ గానుగపిండిలో ఉప్పు, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి కలిపి నూరిన సున్నిపొడిని వేడన్నంలో తింటే రుచిగా వుంటుంది. బలకరమైన ఆహారాన్ని ఔషధంగా తీసుకోవటంలోని గొప్పదనం బలహీన ఆహారం తిని ఔషధాలు మింగటంలో ఉండదు కదా!  

No comments:

Post a Comment