Thursday 1 October 2015

భారతీయ సభామర్యాదలు - డా. జి వి పూర్ణచందు,

భారతీయ సభామర్యాదలు-

భారతీయ సభామర్యాదలు-Ethics & Parlimentary Procedure in Ancient Indian Democracy అనే నా పుస్తకం ఆవిష్కరణ రేపు జరుగుతోంది. దాని ముఖ చిత్రం ఇది.

చట్ట సభలలో గానీ, వివిధ సంస్థలలో గానీ అంతర్జాతీయంగా ఇప్పుడు పాటిస్తున్న నియమాలలో తొలిసారిగా బుద్ధుడు ప్రతిపాదించి కఠినంగా అమలు చేసిన మౌలిక అంశాలు యథాతథంగా కనిపిస్తాయి. వివిధ బౌద్ధ గ్రంథాలలో వాటి వివరాలు ఉన్నాయి. అయితే, అనువాదాలు అందుబాటులో లేకపోవటం వలన మనకు చాలా సమాచారం దొరకటం లేదు. అందులో ఆనాటి తెలుగు వారి పాత్ర కూడా ఉంది. టిబెట్, చైనా గ్రంథాల్లో మన ప్రస్తావనలు కూడా ఉన్నాయి. వాటి విశ్లేషణ జరగాలి.

అందుబాటులో ఉన్నంతవరకూ ఋగ్వేదం, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, బౌద్ధ జాతక గ్రంథాలు, ఇతర బౌద్ధ గ్రంథాల ఆధారంగా కొంత సమాచారం సేకరించి సభాగౌరవానికి సంబంధించి, మన వాళ్ళు సభలను నడిపిన తీరుగురించీ ఈ పుస్తకంలో విశ్లేషణ చేశాను

అక్టోోబరు 2న గాంధీ జయంతినాడు విజయవాడలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరుగనున్న ఆంధ్రప్రదేశ్ శాసన సభ నైతికవిలువల సంఘం సమావేశంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతోంది. సభాపతి డా. కోడెల శివప్రసాదరావు ఆవిష్కరిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టరుగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.

సభా గౌరవం ఉన్నప్పుడు చట్టసభ్యుల్లో నైతిక విలువలు పెంపొందుతాయని బుద్ధుడు చెప్పిన మార్గోపదేశాన్ని సంబంధీకులకు అందించటం, ప్రజలను జాగృతం చేయటం ఈ పుస్తకం లక్ష్యం.

రోబర్ట్స్ రూల్ ఆఫ్ ఆర్డర్ పుస్తకం బుద్ధుడి సభానీతికి ఒక కొనసాగింపుగా కనిపిస్తుంది. కానీ పార్లమెంటరీ ప్రొసీజర్ విషయంలో ఏ ఒక్కరూ బుద్ధుని పేరు తలచుకోకపోవటం ఆశ్చర్యం.

కోరం అనేది తప్పనిసరి అంటూ మొదటిసారి కోరం (సభ్హుల కనీస హాజరు సంఖ్య) విధానాన్ని ప్రవేశపెట్టినవాడు బుద్ధుడు..కోరం లేకుండా సభలు జరిపినందుకు బుద్ధుడు కొన్ని బౌద్ధసంఘాల గుర్తింపు (చార్టర్) రద్దు చేసిన చరిత్ర ఉంది. కోరం విషయంలో రోబర్ట్స్ రూల్ ఆఫ్ ఆర్డర్ కొన్ని మినహాయింపులిచ్చింది. కానీ బుద్ధుడు ససేమిరా అంటూ కఠినంగా కోరం ఉండాలని నిర్దేశించాడు.

కనీసం భారత దేశంలో అయినా కోరం (quorum) ని బుద్ధనీతి అని వ్యవహరించటం ధర్మం. ఆయన చెప్పిన వాటిని అనుసరిస్తూ, ఆయన పేరు లేకుండా రోబర్ట్స్ రూల్ ఆఫ్ ఆర్డర్ లాంటి పుస్తకాలు కాపీ రైట్లను ఎలా పొందగలవో ఆశ్చర్యం.

ఈ పుస్తకంలో అలాంటి ప్రశ్నలు వేయగలిగే సమాచారం చాలా అందించే ప్రయత్నం చేశాను.

శ్రీ మధులత పబ్లికేషన్స్, సంజీవయ్య కాలనీ, విజయవాడ-2 (9440172936) వారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

No comments:

Post a Comment