Friday 4 September 2015

“నాంచారమ్మ కథ” డా. జి వి పూర్ణచందు

“నాంచారమ్మ కథ”
డా. జి వి పూర్ణచందు
“అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్”

          శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని తమిళులు పిలుస్తారు. ‘చూడికొడుత్త నా(చ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే `నాంచారు’ అంటారు తెలుగువాళ్ళు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్ (రక్షకురాలు), కోదై (పూలమాల), అనే పేర్లుకూడా ఉన్నాయి. కోదై అనేది తమిళభాషలో ప్రాచీన రూపం ‘గోద’ అనేది దాని ఆధునిక రూపంగా పండితులు చెప్తారు.  కృష్ణదేవరాయలు ఈ గోదాదేవి జీవిత చరిత్రని ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు.

పండుని కొరికి తియ్యగా ఉన్నదాన్నే శబరి రాముడికి సమర్పించినట్టు , నాంచారు కూడా తాను ధరించి బాగున్నదని సంతృప్తి చెందాకనే పూలమాలను స్వామికి సమర్పించేది. జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టు, విష్ణుచిత్తుడికి తన పూలతోటలో, తులసి మొక్కల దగ్గర ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగా, రాముని భార్యగా సీత పూజనీయం ఐతే, విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగా, భూదేవి అవతారంగా నాంచారు పూజ లందుకుంది. ఇది అతి సామాన్యుడిక్కూడా తట్టే పోలిక.

కానీ, కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలోఒక్కబాలంకనుగొనెఅని మాత్రమే ఆముక్తమాల్యద కావ్యంలో వ్రాశాడు. ‘అయోనిజ’ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని అదే ఆశ్వాసంలో “ఒకనాడామ్రాంకురౌఘం” అనే పద్యంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టు నర్మగర్భంగా సూచించాడు.

దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఆముక్తమాల్యద కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి.

కానీ, సీత పొలంలో దొరికినట్టే, గోదాదేవి పూదోటలో దొరికినట్టు రాయల తరువాతి కవులు పోల్చే ప్రయత్నం చేశారు. పైన పేర్కొన్న పద్యం 17వ శతాబ్దికి చెందిన నందవర భాష్కర శేషాచలామాత్యుడు గారి “నా(చ్చారు పరిణయం” కావ్యంలోది అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీత భూమిలో దొరికి నట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడీ పద్యంలో నందవరకవి. తాళ్ళపాక తిరువేంగళ నాథుడు కూడా ‘పరమయోగి విలాసం’లో ఇదే అర్థంలో వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమేదేవుడు!

          నా(చ్చారుపరిణయంకావ్యాన్ని‘రాజుపాళయం’లో తెలుగుని కాపాడాలనే ఏకైక నినాదంతో ఆవిర్భవించిన తెలుగువిద్యాలయం పక్షాన 1987లో ప్రచురించారు. యక్షగాన సాంప్రదాయంలో వెలువడిన గొప్ప కావ్యం ఇది.

రాజుపాళ్యం తెలుగు విద్యాలయ వ్యవస్థాపకులు కీ. శే. ముదునూరి జగన్నాథ రాజు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయుడు. ఆయన బహుభాషా ప్రవీణ. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేక రచనలు చేసిన వ్యక్తి. తమిళనాడులో  నివసిస్తున్న తెలుగు వాళ్ళు తమ మనుగడను కాపాడుకుంటూ, తమ భాషను కాపాడుకుంటూ పడుతున్న శ్రమని జగన్నాథ రాజు గారి రచనల్లో మనం గమనించవచ్చు. 

2013 డిసెంబరులో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి రాజుపాళ్యం పరిసరాల్లో తెలుగు వారి స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంలో కీ.శే. ముదునూరి జగన్నాథ రాజుగారి ఇంటిని సందర్శించాము. ఆయన కుమార్తె, అల్లుడు రాధాకృష్ణరాజుగారు అంకితభావంతో జగన్నాథరాజు గారి స్మృతుల్ని పదిలపరచిన తీరు ఆశ్చర్యం కలిగించింది. 

రెండస్థులమేడలో జగన్నాథ రాజుగారి గ్రంథాలను వాళ్ళిద్దరూ పెద్ద తెలుగు గ్రంథాలయంగా నడుపుతున్నారు. పెద్దల ఆశయాలను కొనసాగించే సంతతి అపురూపం అయిన ఈ రోజుల్లో జగన్నాథ రాజుగారిని వాళ్ళు చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు.


No comments:

Post a Comment