Monday 22 December 2014

కా... కా... కవులు :: డా. జి వి పూర్ణచందు

కా... కా... కవులు
డా. జి వి పూర్ణచందు
నింబ వృక్షమునందు నెగడు కాకములట్లు..., పల్లెలయందూర బందులట్లు..., అవివేకులగు నరపతుల చెంత బందలగు పండితులు గొందఱుందురట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు
పూర్వ కవులు తమ కావ్యాలలో ఉపోద్ఘాతాలు వ్రాసేప్పుడు మంచి కవుల్నిపొగుడుతూ(సుకవిస్తుతి), చెడ్డకవుల్ని తిడుతూ(కుకవినింద) వ్రాయటం ఒక ఆచారంగా పాటించేవారు. తాను మంచికవుల కోవలోకి వస్తానని చెప్పుకోవటం కూడా కొందరి ఉద్ధేశం కావచ్చు. అడగందే అమ్మైనా పెట్టనట్టు చెప్పుకోనిదే తెలియదనే భావన కూడా ఉండవచ్చు.
19 శతాబ్దినాటి భరతాభ్యుదయంకావ్యంలో మాడభూషి వేంకటాచార్యకవి చేసిన కుకవినిందపద్యం ఇది. ఆనాటి బ్రిటిష్యుగంలో తెలుగు కవుల పరిస్థితికి, ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో తెలుగు కవుల పరిస్థితికి ఏమీ తేడా లేదని ఈ పద్యం చదివితే అర్థం అవుతుంది.
నింబవృక్షమునందు నెగడు కాకములట్లు: వేపచెట్టు మీద చేరిన కాకుల్లాగా కొందరు కవులు ఉంటారు
పల్లెలందూరబందులట్లు: పల్లెల్లో మురుగ్గుంటల్లో దొర్లే ఊరపందుల్లాగా ఇంకొందరుంటారు
అవివేకులగు నరపతులచెంత బందలగు పండితులు గొందఱుందురు: జమీందార్లు, వ్యాపార్లు, డబ్బున్నఆసాములు, వీళ్ళకి సాహిత్యం గురించి ఏమీ తెలియక పోయినప్పటికీ కాకా ఘనులైన కొందరు వాళ్లని ఆశ్రయించి బతుకుతుంటారు.
అట్టి వారికిని జేయుదును గొన్ని వందనములు: అలాంటి కా...కా... కవులకు వందనం చేస్తున్నాను...అంటాడు కవి.
కవులకూ, కళాకారులకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ కాలంలో అయినా, కాలంలో అయినా ఇలా వేపచెట్టు మీద కాకులూ, బురదలో పొర్లే ఊరపందులూ, కాకారాయుళ్ళతో నిండి ఉండటం, వాళ్ళవలన అవి భ్రష్టు పట్టటం అనాదిగా ఉన్నదే! తెనాలి రామకృష్ణ సినిమాలో రాజదర్శనం కోరిన కవికి ఎవరు ఎలా అడ్డుపడతారో చక్కగా చూపిస్తాడు.  బ్రిటీష్ యుగంలో ఇది మితిమీరింది. జమీందార్లు, భూస్వాములూ, రాజా బిరుదు కోసం తాపత్రయపడే వాళ్ళూ చాలా మంది అపర భోజుడనిపించుకోవాలనే తపనతో కవులకు, కళాకారులకూ ఎంగిలి చెయ్యి విదిల్చి, కన్నీటి తుడుపు సాయం చేసిన వాళ్ళే ఎక్కువ! ఆ రోజుల్లో కూడా కవులలో పూట గడవని వాళ్ళూ, రాజాదరణని ఒక యోగ్యతగా భావించిన వాళ్ళూ ఇద్దరూ ఉండేవాళ్ళు. కానీ, నాలుగు పొగడుబోతు పద్యాలు ఆశువుగా దట్టించి, ఇచ్చింది పుచ్చుకు పోయే వసూలు కవిరాజుల్ని ముఖ్యంగా వేపచెట్టు మీద కాకులతో పోల్చాడు కవి!
స్వాతంత్ర్యం వచ్చాక పరిస్థితి ఘోరంగా మారింది. వేపచెట్లూ, వాటి మీద కాకులూ... బురదలూ, వాటిలో పొర్లే పందులూ... పేర్ల మార్పుతో మరింత అసహ్యంగా కొనసాగాయి. రాజాలూ, జమీందార్లు పోయి కవుల్నీ కళాకారుల్ని పోషించే బాధ్యతని అకాడెమీలూ, సాంస్కృతిక శాఖలు, వ్యాపారం చేసుకునే ఇతర సాహితీ సాంస్కృతిక సంస్థలూ స్వీకరించాక వాటికి విలువ కూడా తగ్గి పోయింది.  
నార్లవారితో వేసిన కమిటీ అకాడెమీల రద్దును సూచించింది. కానీ, తరువాత కాకా బాకాల ప్రాధాన్యత పెరిగిందే గానీ తగ్గలేదు. పైగా వీళ్ళ వలన జరిగే నష్టం పావలా అయితే, అకాడెమీలను రద్దు చేసినందు వలన కలిగిన నష్టం
రూపాయి అయ్యింది. అది ఇప్పుడు పూడ్చ లేనిది కూడా!
చిన్న చిన్న సంస్థలనుండి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సంస్థల వరకూ ఇచ్చే పురస్కారాలు, పుస్తక ప్రచురణ సహకారాలు అర్హులకు చేరటంలో దారుణమైన అన్యాయం జరుగుతోంది. బాపూగారికి పద్మశ్రీ ఇవ్వకపోతే అవమానం పద్మశ్రీలు ఇచ్చే వ్యవస్థకు గానీ, బాపూ గారికి కాదు కదా!
కవిగారు ఇలా అన్నాడు: నిష్కారుణ్య మాత్సర్య భావమె కాకాఘను లుండకున్న నల దేవానాం ప్రియశ్రేణి కెట్లమరుం గీర్తి?నిష్కారుణ్య మాత్సర్య బావాలున్న కాకా ఘనులే ఉండకపోతే దేవానాం ప్రియులకు కీర్తి ఎలా అమరు తుందని ప్రశ్నిస్తాడు.
తంజావూరు నాయకరాజు అచ్యుతప్ప నాయకుడు 16 శతాబ్దిలో తెలుగు యక్షగాన మేళా కోసం కళాకారులకు జీవనభృతిని కల్పిస్తూ మేలట్టూరు అనే ఊరు ఏర్పరిచాడు. అలాగే శాహాజీ అనే తంజావూరు మరాఠారాజు తన రాజ్యం లోని తెలుగు కవులందరి కోసం తిరువశ వల్లూరు లేదా శాహాజీ పురం గ్రామాన్ని ఇచ్చాడు. భాగవతులైన నాట్య కళా కారులకు తానీషా ప్రభువు కూచిపూడి అగ్రహారాన్ని ఇచ్చాడు. అందుకే, వాళ్ళు జనం నాలుకలమీద బతికున్నారు. ఇవ్వని వాణ్ణి తలచుకునేదేం ఉంటుందీ...?
తిరుపతి వెంకటకవులకు బహుమానం ఇద్దామని ఆత్మకూరు జమీందారు అనుకున్నాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక అధికారి(అధిక+అరి)అడ్డుపడి, వాళ్ళు సొల్లు కవిత్వం చెప్తారనీ, పండితులు కాదనీ, ఇలాంటి కానుకలు పండితుల కిస్తే పుణ్యం వస్తుందనీ అన్నాడట. దాంతో జమీందారుగారు తన ప్రయత్నం విరమించుకున్నాడు. అది తెలిసి తిరుపతి కవులు శనిగ్రహంఅనే పేరుతో అధికారి మీద 27 పద్యాల చిన్న పుస్తకం వ్రాశారు. కుంకా! పాపమటంచు నెంచక వృథా కొండెమ్ములన్ రాజుతో బింక మొప్పగ జెప్పి యాతని మదిన్ ద్వేషమ్ము పుట్టించి తీవింకం జేసెడిదేమి లేదు కద? నిన్నేమందుము? పైన మా చంకన్నాకు చండాల! శనిగ్రహంబ...ఇలా ఉంటాయా తిట్లు.

చంకన్నాకు చండాలా అని తిట్టినంత మాత్రాన, పదవిని అడ్డం పెట్టుకునే అలాంటి శనిగ్రహాలకు ఊడేదేం ఉండక పోవచ్చు. కానీ, మహా కవుల తిట్లు తగలవా? ముఖ్యంగా కవులూ, కళాకారుల దగ్గరా, అవేవీ కాని వాళ్ళ దగ్గరా డబ్బులు తీసుకుని పురస్కారాలిచ్చే వాణిజ్య సాంస్కృతిక సంస్థల వాళ్ళకి మాడభూషి వారు తిట్టిన పందులు దొర్లే బురద, కాకులు చేరే వేపచెట్టు తిట్లు తప్పక తగులుతాయి.

No comments:

Post a Comment