Wednesday 26 November 2014

విదేశాలలో మినీకవిత - కొత్త పుంతలు :: డా. జి వి పూర్ణచందు

విదేశాలలో మినీకవిత - కొత్త పుంతలు :: డా. జి వి పూర్ణచందు
కవి హృదయాన్ని అందమైన భాషలో అవిష్కరించటమే కవిత్వం. కాళిదాసాదుల కాలం ను౦చీ కారా మాష్టారి దాకా పడిన పాద ముద్రలే తెలుగు సాహిత్యానికి అమ్మానాన్న!
ఒక నాటి తీరిక నేటి సమాజానికి లేదు. జీవితం అంటే ఆనాటి దృక్పథం వేరు. నేటి జీవనం వేరు.
పాశ్చాత్య సమాజంలో పవిత్రతా వాదులు సృజనాత్మక సాహిత్యం, సంగీతం ఇవన్నీ ఇహలోక భావనను పెంచేవనే భావనతో, సృజనాత్మక రచనా రీతిని పాపకార్యం అనేవాళ్ళు. ఋషి కాని వాడు కావ్యం వ్రాయలేడని, కవితా రచన మోక్ష హేతువులలో ఒకటనీ భావించుకొన్న సంస్కృతి లోంచి తెలుగు కవిత పుట్టింది. ప్రాచ్య, పాశ్చాత్య కవితా రీతుల మధ్య మౌలికమైన తేడా ఇక్కడే ఉంది. కవిత్వానికి పునాదులు జాతి తాత్విక చింతన ఆలంబనగా ఏర్పడతాయి.
క్రీ. . తొలి శతబ్దాల నాటి శాతవాహన ప్రభువు హాలుడు సంకలనం చేసిన గాథా సప్తశతి రోజుల్లోనే తెలుగు నేలమీద స్వేఛ్చాకవిత రాజ్యం ఏలింది. నన్నయ తరువాతి కాలం నాటి పాల్కురికి సోమనాథుడు దేశి కవిత అవసరాన్ని నొక్కి చెప్పాడు. అల్పాక్షరముల ననల్పార్థ రచన కల్పించుటయు కాదె కవి వివేకంబు...?”అని వెయ్యేళ్ళ క్రితమే ప్రశ్ని౦చిన వాడాయన. నిడివి ఎక్కువైతే కవిత్వం పలచ బడుతుంది, దట్ట౦గా అల్లుకొన్న భావం సాగి, చీరిక లౌతుందని తెలుగు కవిత్వానికి సంబంధించి నంతవరకూ తొలిసారిగా గుర్తించినవాడు పాల్కురికి.
ఒక సామాజిక ఉద్యమం ఏర్పడినప్పుడు వాటి ప్రభావం సాహిత్యాది కళల మీద తప్పకుండా ప్రసరిస్తుంది. సాధారణంగా కవులు త్వరగా ప్రతిస్ప౦దిస్తారు. అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రభావం అమెరికన్ కవిత్వ తత్వాన్నే మార్చేసింది. ఫ్రె౦చి విప్లవం ప్రపంచ సాహిత్య తీరుతెన్నుల్ని కొత్త లోకాలకు మళ్ళించింది. భారత స్వాతంత్ర్య సమరం దేశభక్తిని, భావప్రకటనా స్వేఛ్ఛను కవిత్వంలో ప్రతిబింబించే౦దుకు దోహదపడింది.
ఇంక తెలుగులోకి వస్తే, ఆధునిక యుగంలో నిజాన్ని నగ్నంగా ఆవిష్కరించే ధోరణిని దిగంబర కవిత ప్రవేశ పెట్టింది. దాని ప్రభావం విప్లవ కవిత ఆవిష్కరణకు ఎంతగానో కారణం అయ్యింది. అభ్యుదయ, విప్లవ కవితా ధోరణులు రెండూ రెండు ధృవాలై  కవితా రీతులను శాసించిన కాలంలో, కవిత్వం తిరుగుబాటు ధోరణులకు పరిమితం అయ్యింది. దైనందిన జీవిత సమస్యలు, మానవ సంబంధాలు ప్రధానం అయ్యాయి. సుదీర్ఘమైన సిద్ధా౦త చర్చలు తప్ప కవితాత్మకత కరువైనప్పుడు  సంక్షిప్తత, దేశీయత అనే వెయ్యేళ్ళ నాటి పాల్కురికి సో్మనాథుని ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటం ఒక తప్పనిసరి అవుతుంది. నేపథ్యంలోనే 1978లో తెలుగులో మినీకవితాఉద్యమం ప్రారంభం అయ్యింది.
కొత్త రూపంలో, కొత్త భావాలతో, కొత్త అంశాలతో మినీకవిత ఆనాటి తెలుగు యువతను ఎంతగానో ఆకట్టుకొంది. ఇప్పుడు లబ్దప్రతిష్టులైన కవులు ఎందరో మినీ కవితా ఉద్యమం నేపథ్యంలోంచి వచ్చిన వారు ఉన్నారు. మినీకవిత లంటే సంక్షిప్త శబ్ద చిత్రాలు, మినీ కవితలంటే మెరుపులు, మినీకవితలంటే ప్రభంజనాలు అన్నట్టుగా ఆనాటి ఉద్యమం నడిచింది.
లయాన్విత కవిత్వీకరణకు, సూటిదనానికి లఘురూపాలు అనువుగా ఉంటాయని ఆంగ్లకవులు కూడా భావించారు. వాళ్ళ భాష, వాళ్ళ సామాజిక జీవన పరిస్థితులు కూడా అందుకు దోహదపడేవిగా ఉండటణ్ వలన మినీ కవితలు ఆంగ్లంలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి.  ఒక కవితలో చెప్పిన భావాల కన్నా, చెప్పకుండా దాచి, పాఠకుని ఆలోచనలకు పదును పెట్టే ధ్వనిగర్భిత కవిత్వం చిన్న రూపంలో ఒదిగినట్టు పెద్దకవితలో కనిపించదని కూడా అనేకమంది విమర్శకులు భావించారు. ఆకాశమంత ఉందికదా అని/వాన చినుకు/సముద్రాన్ని ఆశ్రయిస్తే/దాని బతుకూ ఉప్పన అయిపోయిందిఅనే ఆసు రాజే౦ద్ర మినీ కవిత ఇందుకు చక్కని ఉదాహరణ. అనువుకాని వారితో స్నేహ౦ అనర్థ దాయకం అంటాడు కవి.
ఇంగ్లీషులో ఉంటే అది అంతర్జాతీయ కవిత అనే భ్రమలోంచి బయటకు వస్తే, తెలుగు కవితలు ఇప్పుడు వస్తున్న ఇంగ్లీషు కవితలకు మాత్రం తీసిపోవనీ, మన కవులు అంతర్జాతీయ కవులకన్నా తక్కువేమీ కారని బోధపడ్తుంది.
మినీ కవిత ప్రారంభం అయిన కాలంలోనే, హైకూఅనే జపానీ లఘురూపం ప్రేరణతో ఇస్మాయిల్ ప్రభృతులు ఒక కొత్త తెలుగు ప్రక్రియకు ప్రారంభం పలకగా, నానీలు, రెక్కలు, దాదీలు, తాతీలు, చిట్టీలు, పొట్టీలు ఇలా ఎన్నో ప్రయోగాలు తెలుగులో వచ్చాయి.
ప్రయోగాలు చేయటం కవికి సహజ లక్షణం. ఎవరూ చెప్పని కొత్త విషయాన్ని కొత్తగా చెప్పాలనే తపనే కవికి రాణి౦పు నిస్తుంది. కొత్త దనం బుర్రకు తట్టాలంటే, ప్రపంచ పోకడల్ని గమనిస్తూ ఉండాలి. ఒకప్పటి కన్నా ఇప్పుడు ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అరచేతిలో ప్రపంచాన్ని అందుకోగలిగే అవకాశం ఏర్పడింది. తమ రచనలను నెట్లో ఉంచాలని కవులు బాగా ప్రయత్నిస్తున్నారు. ఫేసుబుక్, ట్విట్టర్, బ్లాగుల్లాంటి అవకాశాలెన్నో సామాన్యుడి స్థాయికి వచ్చేశాయి. ఎంత ఎక్కువగా చదివితే అంత రాణి౦పు వచ్చే అవకాశం రోజున ఉంది. అందుకే, తెలుగు లోకి తెచ్చుకొని మనకు తగ్గ రీతిలో మలచుకొనే౦దుకు అవకాశం ఉన్న కొన్ని ఆంగ్ల లఘురూపాల పరిచయం వ్యాసం లక్ష్యం.
ఒకప్పుడు ఆంగ్ల౦లో సానెట్స్ ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. 14-15 పాదాల కవిత ఇది. సానెట్ పేరు చెప్పగానే, ఎమెర్సన్ రాసిన ఫేబుల్గుర్తుకొస్తుంది.
 “కొండకీ ఒక ఉడుతకూ
తగువయ్యింది
కొండ ఉడుతతో అందికదా...అనే అర్థంతో మొదలయ్యే కవితలో ఆఖరున ఉడత అంటుంది:
మహారణ్యాన్ని నేను వీపున మోయలేను,
చిన్న పప్పుగింజని నువ్వు కొరకలేవుఅని! ఎవరి గొప్ప వారిది, ఎవరి బలహీనత వారిది- ఏనుగు ను౦డి దోమ దాకా దేన్నీ లోకువగా చూడనవసరం లేదని సానెట్ చెప్తు౦ది. దీన్ని పీడిత తాడిత వర్గాల అభ్యున్నతికి అన్వయించి ఎంత వ్యాఖ్యాన్నయినా చేయవచ్చు.
ఇటాలియన్ సానెట్, పెట్రార్చియన్ సానెట్ లాంటి ప్రక్రియల్లో ఆంగ్ల కవితలు ఇప్పుడు బాగా వస్తున్నాయిస్పెన్సర్, హోరేస్ పేర్లతో కొన్ని కొత్త కవితా రూపాలు కూడా వెలిశాయి. జపానీ హైకూల ప్రబావం తెలుగుకవుల మీద బాగా ఉందిహైకూలే కాదు, కొత్త లఘు కవితా రూపాలు మరికొన్ని జపాన్లో ఇప్పుడు వ్యాప్తిలో ఉన్నాయి.
సె౦డ్ర్యూ కవిత: సమాజమూ,మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని  సె౦డ్ర్యూ Senryu కవిత రూపొందింది. ఇది 3 పాదాల కవిత. హాస్యం, వ్యంగ్యం ఇందులో ప్రధానంగా ఉంటాయి.
తల దువ్వుకుంటున్నాను
అద్దంలో కనిపించే ముఖం...
అది మా అమ్మది
కవితలో యతులూ, ప్రాసలూ,గణాలు, పాదాలు పదాల నియమాలేవీ లేవు. తక్కువ మాటలు ఎక్కువ భావం దీని లక్ష్యంగా కనిపిస్తుందిఇలాంటిదే ఇంకో సె౦డ్ర్యూకవితను పరిశీలించండి:
రాత్రి ఆకాశం
పిల్లవాడు   
చుక్కల ఓడల్ని చిత్రిస్తున్నాడు
ఇది చంద్రుణ్ణి భావుకతకు సంకేతంగా చూపిస్తున్న కవిత. చంద్రుణ్ణి మనం మనః కారకుడిగా భావిస్తాం. జపాన్ వారికి  అది కొత్త కావచ్చు. అందుకే, కవితను చాలా మంది విమర్శకులు గొప్పగా ఉదహరించారు.
టా౦కా కవిత: జపాన్ వారి మరో లఘు కవితా ప్రక్రియ టా౦కా కవిత. దుమ్ములో సూరీడుఅనే టా౦కా(Tanka) కవితను చూడ౦డి:
       సూర్య కిరణాలు ప్రవహిస్తున్నాయి
మొగ్గ తొడుక్కు౦టున్న కొమ్మల గు౦డా
వసంతం అడవిలోకి వచ్చింది   
            దుమ్ముకణాలు తేలుతూ
            నేలను చేరుతున్నాయి
సూర్యుడు లేకపోతే పత్రహరితం లేదు, ప్రకృతి లేదు. సూర్యుడు ఒక జవం, జీవం, ఒక చైతన్య౦. లోకానికి వసంతాన్ని తెచ్చేది సూరీడే! సూరీడుని  అభ్యుదయ చైతన్యానికి ప్రతీకగా చిత్రిస్తున్న టా౦కా కవితలో మొదటి మూడు పాదాలు విషయాన్ని ప్రతిపాదిస్తే చివరి రెండు పాదాలు దానికొక గమ్యాన్ని చూపిస్తున్నాయి.
సింక్వాయిన్ కవిత: సింక్వాయిన్ (Cinquain) కవిత ఒక ఆంగ్ల లఘు కవితా రూపం. ఇది 5 పాదాల ప్రక్రియ. మొదటి పాదం కవితా శీర్షిక అవుతుంది. తరువాత రెండు పదాల పాదం, మూడుపదాల పాదం, నాలుగుపదాల పాదం వరుసగా ఉంటాయి.
డైనోసార్లు
ఒకప్పుడు ఉన్నాయి
ఎన్నో ఏళ్ళప్పుడు, కానీ
కేవలం మట్టీ ఇంకొన్ని కలలు
మిగిలున్నాయి
ఇది సింక్వాయిన్ కవితకు ఒక ఉదాహరణ. దీన్ని ట్రయా౦గిల్ కవిత అని కూడా అంటారు. ప్రతీ పాదాన్నీ మధ్యకు తెచ్చి పేరిస్తే పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అందుకని పిరమిడ్ కవిత అని కూడా పిలుస్తారు. ఇందులో ప్రతి పాదానికీ ఒకప్రత్యేకత ఉంటుంది. మొదటి పాదం శీర్షిక, రెండో పాదం విషయ విశ్లేషణ, మూడో పాదం దాని పూర్వాపరాలు, నాలుగో పాదం దాని భావావేశం ఉంటాయి. 5 పాదంలో ఒకే పదం ఉంటుంది. అది శీర్షిక కొనసాగింపుగా ఉంటుంది. ఒకటీ ఐదవ పాదాలను కలిపి, “డైనోసార్లు మిగిలున్నాయిఅని అర్థం సాథి౦చటం కవి లక్ష్యం. రాతి యుగాలనాటి చాందస భావజాలంలోంచి బయట పడాలనే సందేశం ఇందులో కనిపిస్తుంది.
లఘువచన (Blank verse) కవిత
ఛ౦దోబందోబస్తులను తె౦చుకొని పుట్టిన వచనకవితలో ఒక చిన్నరూపాన్ని  Blank verse అంటారు. A poem written in unrhymed iambic pentameter and is often unobtrusive అని దీనికి నిర్వచనం. అంత్య ప్రాశలు యతి ప్రాసల నియమం లేకుండానే లయబద్దంగా మాట్లాడే తీరులో కవిత ఉంటుంది. లయాన్విత కవితాత్మక వచనాన్ని బ్లాంక్ వెర్స్ అని నిర్వచించవచ్చు.
కుర్రాడేం చేస్తున్నాడిప్పుడు, బంతి పారేసుకున్నాడే వాడు?
ఏ౦టి ఏ౦టి వాడు చెయ్యాలనుకుంటో౦ది? నేను చూశాను... దాన్ని
గొప్పగా గెంతుకుంటూ, నడివీధిలో, తర్వాత
గొప్పగా అక్కడ నీళ్ళలో!
John Berryman రాసిన The Ball Poem అనే కవితకు ఇది తెలుగు అనువాదంఇందులో పైకి కనిపించే భావం ఏమీ లేదు. పైగా చాలా సాధారణమైన విషయం. బంతాట ఆడుకుంటున్న కుర్రాడు విసిరిన బంతి, వీధిలో ఎగురుకుంటూ వెళ్ళి నీళ్ళలో పడింది. దీని ద్వారా రచయిత చెప్పదలచుకొన్నది ఏమయినా ఉన్నదా? బాల భారతంలో ద్రోణుడు బావిలోంచి బాణాలతో బంతిని తీసి ఇచ్చిన కథ లాంటిదీ ఇందులో కనిపించదు. కానీ, భూగోళ౦తో ఆడుకోవటం ఒక పిల్ల చేష్ట. చివరికి అది ఎవరికీ దక్కకుండా పోతుంది...అనే హెచ్చరిక ఇందులో దాగి ఉంది. ఇంకొకరికి మరో అర్థం ఏదయినా ఇలానే స్ఫురించవచ్చు కూడా. తెల్ల కాయితాన్ని ఇచ్చి ఎవరి ఊహను వారు చిత్రించుకోవాలని కాబోలు కవితను  Blank verse అన్నారు.
 Epigram కవిత:
టెలీగ్రాంలలో వాడే భాష, లేదా ఎస్సెమ్మెస్సులు ఇచ్చేందుకు వాడే భాషని ఉపయోగించి తయారు చేసిన హాస్య స్ఫోరక కవిత ఇది. ఎపిఅనేది శాసనాలకు సంబంధించిన పదం. అది దీనికి పేరుగా స్థిరపడి, ఎపిగ్రామ్ కవిత అయ్యింది.
ఎపిగ్రామ్
పొట్టి ఆకారం
సంక్షిప్తత శరీరం
వ్యంగ్యం ప్రాకారం
ఎపిగ్రామ్ కవితకు నిర్వచనాన్ని ఇలా ఎపిగ్రామ్ పద్ధతిలోనే రాయవచ్చు. దీని రూపం చాలా విలక్షణంగా ఉంటుంది. ఒక ఎపిగ్రామ్ కవితను పరిశీలించండి:
చక్కెర
దొరికితే లక్కేరా
కానీ, మద్యం  
దొరకటం తథ్యం
ఇందులోని లోతైన భావాన్ని మాటలతో వివరించే ప్రయత్నం చేస్తే, స్వారస్యం చచ్చి పోతుంది. దాన్ని దానిగానే అర్థం చేసుకోగలగాలి. మన దేశంలోనూ, రాష్ట్ర౦లోనూ ఉన్న నిత్యావసరాలకన్నా మద్యం తేలికగా దొరుకుతోన్న పరిస్థితికి అద్దం పడుతున్నదీ అంతర్జాతీయ కవిత.
ఒప్పుకుంటున్నా తమరి రూలు
ప్రతీ కవీ ఒక ఫూలు
నిలువెత్తు నిదర్శనం మీరే
ఫూల్స౦దరూ కవులు కారే!”    
అనేది ఎపిగ్రామ్ రచనకు ఇంకో ఉదాహరణ. పొడిమాటలుగా కనిపించినా ఇందులో లయ ఉంది, ప్రాస నియమా లున్నాయి. అతి తక్కువ మాటలతో గొప్ప ఆలోచనాత్మకతను కలిగించటం దీని లక్ష్యం. అల్పాక్షరాలతో అనల్పార్ధ రచనకు ఇది మంచి ఉదాహరణ.
Epitaph కవిత
విషాదాన్నీ, మరణాన్నీ చిత్రిస్తూ, సంతాప సూచకంగా చెప్పే కవితను ఎపిటాఫ్ కవిత అంటారు. తక్కువ పాదాలలో కవితాత్మకంగా ఉంటుంది. సమాధుల మీద చెక్కే౦దుకు ఉపయోగకరంగా ఉంటుంది. పుటక నీది/చావు నీది/బతుకంతా దేశానిదిఅంటూ జేపీ మీద కాళోజీ వ్రాసిన ప్రసిద్ధ కవిత ఎపిటాఫ్ కవితకు చక్కని ఉదాహరణ!
అబ్బో! ఆయన గొప్ప వైద్యుడు
ఇంకా గొప్ప స్నేహశీలి
అద్భుతమైన మేథావి  
చిట్టచివరి రోజున తప్ప!ఇలా ఉంటుంది ఎపిటాఫ్ కవితా రూపం. విదేశీ కవితలో వ్యంగ్యాన్ని పులిహోరలో జీడిపప్పులా జోడిస్తున్నారు. మన కవులు విషయాన్ని గమనించాలి. వ్యంగ్యం పాఠకుల సంఖ్యను పెంచుతుంది.
తెర్జా రీమా కవిత:     
తెర్జా రీమా (Terza Rima) మరో జపానీ లఘుకవితా రూపం.
New life begins to spring to life in spring
Green shoots appear in the April showers     
Birds migrate back home and rest tired wings       
ఒకటీ మూడూ పాదాలకు అంత్య ప్రాసని గమనించవచ్చు. ప్రతీ పాదంలోనూ 8-1 పదాల వరకూ ఉంటాయి.
ABC కవిత
ఒక భావావేశాన్ని, ఒక చిత్రాన్ని, ఒక అనుభూతిని కళ్ళకు కడుతూ, ఐదు లైన్లలో ఉండే కవితా ప్రక్రియ ఏబీసీ కవితఐదు పాదాలలో చక్కని భావావేశం, చిక్కని శబ్ద చిత్రం, అంతులేని అనుభూతిని కలిగించటం దీని పరమావధి. ఇందులో ప్రతీ పాదంలోనూ మొదటి పదాలు అకారాది క్రమంలో ఉంటాయి. అందుకని బీ సీ కవిత అనే పేరు వచ్చింది. 5 పాదం మకుటంగా ఉంటుంది. మచ్చుకొక ఆంగ్ల కవితను పరిశీలిద్దా౦.
A lthough things are not perfect
B ecause of trial or pain
C ontinue in thanks giving
D o not begin to blame
E ven when the times are hard
F ierce winds are bound to blow
ఇలాంటిదే మరొక కవితా ప్రక్రియ ఎక్రోష్టిక్ కవిత:
Acrostic కవిత
మొదటి అక్షరాలన్నీ కలిపితే వచ్చే పదం ఒక భావోద్దీప్తిని కలిగించేదిగా ఉన్నప్పుడు దాన్ని Acrostic కవిత అంటారు. ఉదాహరణ పరిశీలించండి.
C reamy or
H ot, it makes my mouth scream
O n and on
C hocolate, chocolate
O h, yum
L uscious chocolate, I can't believe I
A te it all. It
T ickles my throat         
E ach time I eat it, mmm oh I love chocolate.
మొదటి అక్షరాలన్నీ కలిపి కవితకు శీర్షిక అవుతుంది. అలాగే అవే పదాలు చివరి అక్షరాలుగా వచ్చేలాగా కూడా పేరిస్తే బహుళ(మల్టిపుల్)జీవితాన్ని గురించి, లోకం పోకడల గురించి, సమాజం గురించి విశ్లేషణాత్మకమైన మినీకవితలను ఇచ్చే పద్ధతిని తెలుగులోకూడా తీసుకు రాగలిగితే అందరూ చదివే అవకాశం ఉంటుంది. కవి అనే వాడు తన భావాన్ని ప్రచారం చేసేందుకు అందివచ్చే ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అది పెళ్ళి కావచ్చు, చావైనా కావచ్చు, లేదా మరే సందర్భం అయినా కావచ్చు, భావాన్ని తేలిక భాషలో క్లుప్తంగా, అందంగా అమరేలా చెప్పటం లఘు కవితా రూపాలు ఆశిస్తున్న ప్రయోజనం.
దేశీయతను సాధించ గలిగితే, తెలుగు కవిత సంపన్నమే అవుతుంది. తెలుగులో చిన్న కవితలదే రాజ్యం. విదేశాలలోనూ చిన్న రూపాలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. అల్పాక్షరాలు, అనల్పార్థాలే ప్రపంచ కవితను పాలిస్తాయి. లోకం పోకడ తెలుసుకోవటం వలన మరింత శక్తివంతంగా తెలుగు కవితను తీర్చి దిద్దిన వాళ్ల౦ అవుతాం. అందుకు వ్యాసం సహకరిస్తుందని ఆశ.



No comments:

Post a Comment