Tuesday 21 October 2014

అరచేతిలో వైకుంఠాన్ని చూపిన పద్యం :: డా. జి వి పూర్ణచందు



అరచేతిలో వైకుంఠాన్ని చూపిన పద్యం
డా. జి వి పూర్ణచందు

ఇంతింతై, వటుడింతయై, మఱియు దానింతై, నభో వీధిపై
నంతై, తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రునికంతయై, ధృవునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుం డగుచు, బ్రహ్మాండాంత సంవర్థియై
కన్యాశుల్కం నాటకంలో శిష్యుడు తన గురువైన గిరీశం తక్కువవాడు కాదని చెప్పటం కోసం ఆయన సురేంద్రనాథ బెనర్జీ అంతటివాడని చెప్తాడు. అది విన్న ఆ శిష్యుడి అక్కగారు అమాయకంగా అతగాడెవర్రా?అనడుగుతుంది. దానికి ఏం చెప్పాలో తెలియక, వాడు బుర్రగోక్కుని, అందరికన్నా గొప్పవాడు లెమ్మని సర్ది చెప్పేస్తాడు.
ఈ పద్యంకూడా అలాంటి ప్రయత్నమే చేస్తుంది.  బలి చక్రవర్తిని వామనుడు తను వేయగలిగిన మూడడుగుల భూమి దారాదత్తం పొందుతాడు, అక్కణ్ణించీ శరీరాన్ని పెంచటం మొదలెడతాడు. మొదట ఇంతయ్యాడు. ఇంతింతయ్యాడు. మళ్ళా తానింతయ్యాడు. ఆకాశం అంత అయ్యాడు. అ తరువాత దాని పైనంత అయ్యాడు. అక్కణ్ణించి తోయద మండలాగ్రానికి అంటే, మేఘమండలానికి అల్లంత దూరం అంత అయ్యాడు, మరింత పెరిగి, ప్రభామండలం అంటే, కాంతి లోకాల పైనంత అయ్యాడు. చంద్రుడి దాకా పెరిగాడు. దాటి ధృవమండలం పైనంత అయ్యాడు. ఇంకా పెరిగి మహర్లోకం పైదాకా పెరిగాడు ఇలా సత్య పదోన్నతుడయ్యాడు. అంటే సత్యలోకం దాకా పెరిగాడన్నమాట.
ఆ విధంగా బ్రహ్మాండం అంత పెరిగి, ఒక కాలు భూమ్మీదా రెండో కాలుని ఆ సత్యలోకం పైదాకా లేపాడు. అక్కడ, ఆ పాదాన్ని బ్రహ్మదేవుడు కడిగాడు. బ్రహ్మ కడిగిన పాదం అనే అన్నమయ్య పాట ఈ కథ ఆధారంగానే వచ్చింది. ఇంక మూడో అడుగు ఎక్కడ వెయ్యాలని అడిగి బల చక్రవర్తి నెత్తిన వేసి, అతన్ని పాతాళానికి తొక్కేశాడన్నది మనకు తెలిసిన కథే!
పెరిగీ పెరిగీ అంతరిక్షంలోకి భ్రహ్మాండ లోకాల దాకా పెరిగాడనీ, మధ్యలో మేఘమండలం, చంద్రమండలం వగైరా అన్నీంటినీ దాటుకుంటూ బ్రహ్మాండం అంతా పెరిగాడంటాడు పోతనామాత్యుడు. ఈ మొత్తం కలిపి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం...? ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణానికి ఎంత కాలం పడుతుంది...? ఇ.లాంటి ప్రశ్నలు  కాలమూ-దూరమూపద్దతిలో లెక్కలు కట్టి చెప్పవలసి ఉంటుంది. ఒక గ్రహం నుండి బయలు దేరిన కాంతికిరణం ఒక సంవత్సరం పాటు అంతరిక్షంలో ప్రయాణిస్తే ఎంతదూరం వెడుతుందో దాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఆకాశంలో మనం చూసే ఒక నక్షత్రం భూమికి ఎన్ని కాంతిసంవత్సరాల దూరాన ఉన్నదో, ఆ నక్షత్రం అన్ని సంవత్సరాల నాటిదన్నమాట. ఉదాహరణకు ఆర్ద్రా నక్షత్రం మనకు 250 కాంతి సంవత్సరాల దూరాన ఉన్నదనుకుంటే, ఆ నక్షత్రం నుండీ బయల్దేరిన కాంతికిరణం భూమ్మీదకొచ్చి మనకు కనిపించేసరికి ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ పోయి మోడీ ప్రభుత్వం వచ్చేసిందన్నమాట.  ఇప్పుడు వామనుడు ఎన్ని కాంతి సంవత్సరాల ఎత్తున పెరిగాడు...? సామాన్య మానవుడికి ఈ గణాంకాల వివరాలు బుర్రకెక్కవు. గిరీశంగారి శిష్యుడిలా చాలా ఎత్తుకి పెరిగాడని మాత్రమే చెప్పవలసి ఉంటుంది.
చాలా అనే మాట అనేక కాంతి సంవత్సరాల దూరాన ఉందన్న విషయం సామాన్యుడు గ్రహించటానికి, ఇంతింత పెరిగాడని చెప్పటం ఈ పద్యంలో ఒక గమ్మత్తు. ఇలా చెప్పటాన్నే అరిచేతిలో వైకుంఠం చూపించటం అంటారు. ఈ మాటని ఇప్పుడు మనం లేనిపోని ఆశలు కల్పించటం అనే అర్థంలో వాడుతున్నాం గానీ, అసలు భావార్థం అది కాదు. అరచేతిలో వేలుపెట్టి చూపిస్తూ, ఇది మేఘమండలం, ఇది కాంతిమండలం, ఆ తర్వాత అదిగో అదే వైకుంఠం... ఇలా చెప్పటమే అరచేతిలో వైకుంఠం చూపించటం!

No comments:

Post a Comment