Wednesday 26 February 2014

అన్నం ఎందులో తినాలి? :: డా. జి వి.పూర్ణచందు

అన్నం ఎందులో తినాలి?
డా. జి వి.పూర్ణచందు


మన సమాజం వ్యావసాయిక సమాజంగా పుట్టి ఆర్థిక సమాజంగా ఎదిగింది. ఎదగటం అంటే అభివృద్ధితో కూడిన ఎదుగుదలేనా అనేది ప్రశ్న. అమ్మనాన్నలని కాళ్ళకు దండం పెట్టి కుర్చోబెట్టి, వాళ్ల మంచీ చెడుల్ని కడదాకా చూడటం వ్యావసాయిక సంస్కృతి. అలా కాకుండా వాళ్ల మానాన వాళ్ళను వదిలేసి, లేదా వృద్ధాశ్రమంలో చేర్పించి మన వృత్తి ఉద్యోగాలు మనం చూసుకోవటం అర్థిక సమాజం. దీన్ని ఎదుగుదల అనుకొనేవారు అనుకోవచ్చు. మనం చేయగలిగిందేమీ లేదు. ఆహారం విషయంలో కూడా ఇలాంటి ఎదుగుదలలన్నీ చాలా సందర్భంలో మనం చూస్తున్నాం. వ్యావసాయిక సమాజంలో అయితే, కూరలో నూనె వేసి వండేవారు. ఆర్థిక సమాజంలో నూనెలో కూర వేసి వండుతున్నారు. అదీ తేడా! నాడబ్బు- నాఇష్టంఅనేది ఆర్థిక సమాజ ధోరణి. ఇవన్నీ ఎదుగుదలలే ననుకోవచ్చు. భోజనం ఎందులో తినాలి అనే ప్రశ్నకు సమాధానాన్ని ఈ కోణంలో౦చి పరిశీలిద్దాం
ఒకప్పుడు, అంటే మరీ ఇక్ష్వాకుల కాలం నాటి సంగతి కాదు, మొన్న మొన్నటి దాకా భోజనం చేయటానికి కుటుంబంలో అందరూ కలిసి కూచుని, వండిన వన్నీ విస్తట్లో వడ్డించే వరకూ ఆగి, ఒకసారి భగవన్నామ స్మరణ చేసుకొని. సంతోషంగా భోజనం చేసే వారు. ఇప్పుడా పరిస్థితి మారింది. డైనింగ్ టేబులూ, టీవీ ఒకే గదిలో ఉంటాయి. టీవీలో హత్యల వార్తలు చూస్తూ టేబుల్ భోజనం చేయటానికి అలవాటు పడ్డాం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడా పరిస్థితి కూడా మారింది. సోఫాలో కూర్చుని, పళ్ళెం ఒళ్ళో పెట్టుకొని ఒక్కక్క మెతుకే తింటూ ఇంకో చేత్తో రిమోటు నొక్కుకొ౦టూ, భోజన కార్యక్రమానికి రె౦డో ప్రాథాన్యత నిస్తున్నాం. దాదాపు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న తతంగం ఇదే! చాలా ఇళ్లలో డైనింగ్ టేబుల్ కూడా అలంకార ప్రాయం అయి, ఒక మూలకు తోసేశారు. వాడని వంట సామాన్లు వగైరా దాని మీద చేరి పోతున్నాయి. ఆర్థిక సమాజం తెచ్చిన మార్పు ఇది. భోజనం పట్ల మునుపటి శ్రద్ధ, గౌరవం, భక్తి లేకుండా పోయాయనేది ఇక్కడ మనం బాధపడవలసిన అంశం.
ఒకప్పుడు బంగారం పళ్ళెంలో తినటం తాహతుకు గుర్తు. మామూలు స్టీలు పళ్ళాలలో తినటం మధ్యతరగతి వారికే చెల్లి౦ది. దిగువ తరగతుల్లో కొ౦చె౦ స్థితిమంతులు అప్పట్లో కొత్తగా వచ్చిన జెర్మన్ సిల్వర్ అనే సత్తు పళ్ళాలలో తినేవారు. మిగిలిన హీనులూ, దీనులూ అనబడేవారంతా మట్టి  లేదా రాతి పాత్రలలో తినేవారు.
సింధూ నాగరికతా కాలంలో కంచు పళ్ళెంలో తినటం పుణ్యప్రదంగా ఉండేది. ఎందుకంటే ఆ నాగరికతా కాలంలో అక్కడ కొత్తగా రాగిని కనుగొన్నారు. సింధునాగరికత త్రవ్వకాలలో ఇప్పుడు మనం తింటున్న కంచం లాంటిదే గుండ్రని కంచు కంచందొరికి౦ది. కా౦శ్య౦ అంటే కంచు. కంచుతో చేసింది కాబట్టి కంచం అయ్యి౦ది. కంచరి అంటే కంచుతో పని చేసే లోహకారుడని! ఏ లోహంతో చేసినా దాన్ని కంచం అనే అంటున్నాం ఇప్పుడు.
సింధునాగరికతలో కంచు వాడకంలో ఉన్న సమయంలో, తెలుగు నేల మీద ఇనుమును కూడ కరిగించ గలిగారు. అందుకని, కంచు కంచాలతో పాటు స్టీలు పాత్రల వాడకం అనాది కాలంగా మనకి ఉంది. కానీ, యాగాలు, క్రతువులు వగైరా జరుపుకోవటానికి రాగి చె౦బులూ, రాగి అరివేణము, ఉత్తరిణి(చె౦చా) ఇతర రాగి పాత్రలే వాడతారు. లేదా కంచు పాత్రలు వాడతారు. స్టీలు వాడరు ఎందుకంటే వేదకాలం వారికి స్టీలు తెలియదు కాబట్టి!
యోగరత్నాకరం అనే వైద్యగ్రంథం తెలుగు వారి ఆచార వ్యవహారాలకు పెద్ద దిక్కుగా చెప్పదగిన గొప్ప వైద్య గ్రంథం. ఇందులో ఏ లోహంతో చేసిన పళ్ళెంలో తింటే ఎలాంటి సుగుణాలు కలుగుతాయో వివరంగా చెప్పింది.
బంగారు పళ్ళెం: సంతోష దాయకంగా ఉంటుంది. అనారోగ్యాలున్నప్పుడు ఆహారాన్ని బంగారు పళ్ళెంలో కలిపి పెడితే దోష హరంగా ఉంటుంది.
వెండి పళ్ళెంలో భోజనం కూడా ఇలాంటి గుణాలే కలిగి ఉంటుంది గానీ, బంగారం కన్నా తక్కువ స్థాయిలో ఉంటుంది. వెండి పళ్ళాలలో తింటే కంటికి మంచిది. శరీరంలో వేడి తగ్గుతు౦ది. కానీ కఫవాత దోషాలను ప్రకోపి౦ప చేస్తు౦ది.
కంచు పళ్ళెంలో భోజనం బుద్ధి ప్రదంగా ఉంటుంది. ఇందులో తింటే ఆహారం రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తు౦ది. రక్తప్రసార వ్యాధులతో బాధపడేవారికి, బీపీ, గుండెజబ్బులు ఉన్నవారికి బంగారం పళ్ళెం తరువాత చెప్పుకోదగినది ఈ కంచు పళ్ళెమే!
ఇత్తడి పళ్ళెంలో భోజనం పరమ అనారోగ్య కరం. వాత దోషాలను పె౦చుతు౦ది. బాగా వేడిచేస్తు౦ది. కాబట్టి, ఇందులో తినకుండా ఉంటేనే మంచిది.
స్టీలు పళ్ళెంలో భోజనం సిద్ధికారకమ్అన్నాడు ఈ వైద్యగ్రంథంలో. కాయ సిద్ధి అంటే శరీరానికి అన్నివిధాలా శక్తి, బలమూ కలగటమేనని అర్థ౦ చేసుకోవాలి. పైగా రక్త క్షీణత లాంటి వ్యాధుల్లో మంచే చేస్తు౦ది గానీ చెడు చేయదని దీని భావం.
రాతి పాత్రలు, మట్టి మూకుళ్ళలో భోజనం మన దారిద్ర్యానికి గుర్తుగా ఈ గ్రంథం భావి౦చి౦ది. అంతేగానీ, అందువలన ప్రమాదాలేమీ చెప్పలేదు. మట్టి కుండలో అన్నం వండుకొనేవారు. మూకుళ్లలో ఆహారపదార్ధాలు ఉంచుకొనేవారు. దాలిగుంటలో కుండను ఉంచి కాచిన పాలు గాని తోడుపెట్టిన పెరుగుగానీ  చాలా రుచికరంగా ఉంటాయి. తిన్న అదృష్టవంతులకు తెలుస్తు౦ది దాని మాధుర్య౦. ఫ్రిజ్జుల్లో పెట్తుకొని తినే స్టీలుగిన్నె పెరుగుకే౦ తెల్సు కుండపెరుగు రుచి!ఆలాగే, రాతి పాత్రలలో(రాచ్చిప్ప అనేవారు) పులుసు, పప్పుచారు కాచుకొనేవారు. ఎక్కువ సేపు వేడిని నిలబెడతాయి. కానీ వేడెక్కటానికి ఎక్కువ సమయం తీసుకొ౦టాయి. కట్టెపుల్లల మీద వంటలు చేసుకొనే రోజుల్లో ఈ రాతిపాత్రలు చెల్లాయి. ఇప్పుడు సంవత్సానికి ఆరు సిలి౦డర్లే ఇస్తామని చెప్తున్న ప్రభుత్వ జనరంజక పాలనలో ఇలాంటివి సానుకూలపడే అంశాలు కాదు.
చెక్కపళ్ళాల్లో భోజనానికి ఈ వైద్య గ్రంథం ఓటు వేయ లేదు.
అరిటాకులో గానీ, బాదం ఆకులో గానీ భోజనం శ్రేష్టదాయకంగా చెప్పింది. విషదోషాలు పాపాలను హరిస్తు౦దని కూడా చెప్పింది. ఇప్పుడు అడ్డాకు విస్తట్లో లోపలి వైపు తగరం కాయితం అంటి౦చి ఉన్నవీ, లేకపోతే ధర్మోకూల్ బె౦డు పళ్ళేలు వాడుతున్నారు. వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఏ నాడయినా ప్రభుత్వ౦ ఆలోచి౦చిన దాఖలా లేదు. ఇలాంటివి మార్కేట్టుకి తీసుకు రాబోయే ము౦దు, ప్రజారోగ్య శాఖ వాటిని క్షుణ్ణ౦గా పరిశీలి౦చి, అవి జనారోగ్యానికి చెరుపు నిచ్చేవి కావని చెప్పాలి. ఘనత వహి౦చిన మన ప్రభుత్వ శాఖలు చెప్పే ఉంటాయని ఆశిద్దాం. కానీ, వైద్యపరంగా భరోసా ఇవ్వగలిగే స్థితి లేదు.
ఇవికాక ఇప్పుడు పి౦గాణీ, సిరామిక్ గాజు పళ్ళాలు విస్తృతంగా వస్తున్నాయి. స్ఫటిక పళ్ళెంలో భోజనం తింటే పవిత్ర౦, చలవ నిస్తాయని చెప్పింది. ఇవే గుణాలను గాజు వగైరా పళ్ళాలకు కూడా అన్వయి౦చు కోవచ్చు.
రాగి పళ్ళెంలో భోజనం కాకుండా రాగిగ్లాసులో నీరు తాగితే మంచిదనీ, శరీరాన్ని మృదువు పరుస్తు౦దనీ ఈ వైద్యగ్రంథం పేర్కొ౦ది. మృదువు పరచటం అంటే యా౦టీ ఆక్సిడే౦ట్గా అంటే విషదోష నివారకంగా ఉంటుందన్నమాట, ఇందులో పోయగానే నీరు రుచి మారిపోయి కమ్మగా ఉంటుంది.
ఈ వివరాలన్నీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాయి. భోజనం చేయటానికి బంగారు పళ్ళాలే అక్కరలేదు. వెండి పళ్ళానికన్నా, స్టీలు పళ్ళానికన్నా, కంచుకంచాలు మేలయినవి. పెళ్ళిళ్లలో పెళ్లికొడుకు వెండికంచమూ, వెండి చె౦బూ అడుగుతాడు. తెలివైన వాడయితే, కంచు కంచం, రాగి చె౦బు అడగాలి. కానీ, మనం ప్రస్తుతం ఆర్థిక సమాజంలో ఉన్నాం కాబట్టి, డబ్బుకున్న విలువ ఆరోగ్యానికి లేదు కాబట్టి, ఈ అంశాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకొ౦టే అంత మంచిది.


No comments:

Post a Comment