Monday 11 April 2016

విషదోషాలకు విరుగుడు :: ఉగాది పచ్చడిలో ఔషధ విలువలు డా. జి వి పూర్ణచందు,

విషదోషాలకు విరుగుడు
ఉగాది పచ్చడిలో ఔషధ విలువలు


డా. జి వి పూర్ణచందు, 9440172642

గాదులు నిండితే ఉగాదులు పండుతాయి. ఉగాదులు అన్ని జాతులకూ అన్ని భాషా జాతీయులకూ ఉన్నాయి. కానీ, తెలుగు ఉగాది వాటికి భిన్నమైంది. ఇది తెలుగు భాషా సంస్కృతుల పండుగ. అంతే కాదు, ఇది ఆరోగ్యాన్ని ప్రబోధించే పండుగ కూడా!
అన్ని పండుగల్లోనూ తీపి, కారం ఇష్టంగా వండుకు తింటాం. ఉగాది నాడు కావాలని వగరు, చేదు తెచ్చుకుని తింటాం. వగరూ చేదు రుచుల ( bitter Tonics) మహత్తుని తెలియజేసే పండుగ ఉగాది.
జీవిత మహాభారతానికి ఆదిపర్వం ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. ఆరోజే ధర్మరాజు పట్టాభిషిక్తు డైనాడని ప్రతీతి. ప్రపంచ యుద్ధం తరువాత పునరుజ్జీవం పొందిన ప్రపంచ శాంతికి సంకేతం ఉగాది!
పాశ్చాత్యులకు జనవరి 1న ఉగాది. ముందురోజు అర్ధరాత్రి నుండే మందు ఏరులై ప్రవహించే పండుగ ఇది. దిశా గమనం, దిశానిర్దేశనం చేసుకోకుండా కేవలం సంబరాలు చేసుకునే పండుగ జనవరి ఒకటి. ఉత్తర భారతీయులకు హోలీ ఉగాది లాంటిది. జీవితం రంగులమయంగా ఉండాలనే ఆకాంక్షతో కులమతాలకు అతీతంగా అనందంగా జరుపుకుంటారు. మహరాష్ట్రీయులు గూఢీ పాడవా పేరుతో ఉగాదినిని ఇంటిముందు ఇంద్రుడి జెండా నిలిపి సగర్వంగా జరుపుకుంటారు. ఒరియా వారు వీధుల్లో మంఛినీటి కుండలు పెట్టి, వారి ఉగాదిని మహా బిషుబ సంక్రాంతి పేరుతో జుపుకుంటారు. అస్సామీయులు తమ ఉగాదిని బిహూ పండుగ అంటారు. పశువుల్ని పూజించి జరుపుకుంటారు. తమిళులు తమ ఉగాది రోజున పుత్తాంటు పేరుతో దీపం వెలిగించి చీకట్లను పారద్రోలాలని ప్రార్ధిస్తారు. మళయాళీలు ‘బిసు’ పండుగని దీపావళి లాగా దీపాలు వెలిగించి జరుపు కుంటారు. ఇలా ప్రతీ జాతీ తమతమ క్యాలెండర్లలో మొదటి రోజుని శుభకామనలతో పవిత్రంగా జరుపుకుంటారు
తెలుగు వారు ఒకింత కొత్త పుంతను తొక్కి ఉగాదిని జరుపుకుంటారు. తక్కిన దసరా, సంక్రాంతి లాంటి పండుగలకు భిన్నంగా తెలుగు భాషా సంస్కృతుల పండుగలా దీన్ని జరుపుకోవటానికి ఒక ముఖ్య కారణం ఉంది. ప్రపంచంలో తెలుగు భాషకు మాత్రమే ఒక భాషా దేవుడున్నాడు. ఆయన పేరు ఆంధ్రమహావిష్ణువు. కృష్ణాజిల్లా దివిసీమ శ్రీకాకుళంలో కొలువై ఉన్నాడు. మాతృభాషను మాతృ దేవతగా ఆరాధించాలనే ప్రబోధాన్ని అందించిన దేవుడాయన. దేశభాషలందు తెలుగు లెస్స అని స్వయంగా తనకు కలలో కనిపించి చెప్పాడని, దాన్ని అధికార భాషగా చేసుకుని పాలించాలనీ, ఆ భాషలోనే తన దివ్య చరిత్రను తెలిపే కావ్యం వ్రాయాలనీ అన్నాడనీ. కృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద కావ్యంలో ముందుమాటగా వ్రాసుకున్నాడు.
అందుకే, తెలుగమ్మకు సారె పెట్టి కట్టుకుని ఉగాది జరుపుకుంటాం మనం.
ఉగాది రోజున మనం జీవన గమనానికి దిశా నిర్దేశం చేసుకుంటాం. లోకం పోకడ ఎలా ఉండబోతోందో పంచాంగ శ్రవణం ద్వారా ఒక అవగాహన కల్పించుకుంటాం. చాలా
మంది అనుకునేట్టు ఇది ఒక మూఢ నమ్మకం కాదు. ప్రపంచం తీరుతెన్నుల్ని అవగతం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం ఇది. వానలు ఎలా కురుస్తాయి... కరువు సూచనలు ఉన్నాయా... ఏ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది,.. వేటి రేట్లు పెరిగే అవకాశం ఉంది,.. రాజకీయ పరిణమాలు ఎలా ఉండబోతున్నాయి,.. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చే సూచనలున్నాయా... గ్రహణాలూ, ముఖ్య సంఘటనలూ ఏవి ఎప్పుడు జరగబోతున్నాయి...లాంటి విషయాల్ని ముందుగా తెలుసుకోవటానికి సామాన్యుడు చేసే ప్రయత్నం ఇది. తెలుగువారు ఉగాది రోజున వాటిని తెలుసుకుని తగ్గట్టుగా ఈ ఏడాది కాలానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకో గలుగుతారు. భాషాసంస్కృతులను గౌరవించటం, దిశా నిర్దేశం చేసుకోవటంతో పాటు, ఆరోగ్య పరి రక్షణ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు.
గత 3,4 దశాబ్దాల కాలంలో, మీదు మిక్కిలి కొత్త మిలీనియం సంవత్సరంలో మన జీవిత విధానంలో పెనుమార్పులు చేరుకున్నాయి. విదేశీ వ్యామోహం కట్టలు తెంచు కుంది, ఆహారపు అలవాట్లన్నీ మన భౌగౌళిక పరిస్థితులకు వ్యతిరేకంగా వేలంవెర్రిగా సాగుతున్నాయి. ఏ ఆహార ద్రవ్యాన్ని కొనాలన్నా కల్తీలతో, విష రసాయనాలతో కూడి నవే దొరుకు తున్నాయి. పట్టించకునే నాథుడు కరువయ్యాడు. ఆహార అలవాట్లలో తీపి పులుపు ఉప్పు రుచుల వాడకం విపరీతమైంది. మజ్జిగ తాగడం మానేశారు. బూడిదగుమ్మడిని దిష్టి బొమ్మగా తప్ప అదొక కూరగాయ అనే సంగతి మరిచి పోయారు. వగరు, చేదు రుచుల్ని తినటం వదిలేశారు. ఈ కొత్త పోకడలకు తోడు అధిక ఉష్ణోగ్రత దగ్గర వేయించే వేపుడు వంటకాలు, నూనె పదార్ధాలను అపరిమితంగా తింటున్నారు. అనాలోచితంగా విషాల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడ్తున్నారు.
ఇది తెలుగువారికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అలవాటే! ఇలా ప్రవర్తించటం మనకు కొత్త కాదనుకుంటాను. 2000 యేళ్ళ క్రితం చరకుడు, సుశ్రుతుడు సమస్త వ్యాధు లకూ గ్రామ్యాహారాలే కారణం అన్నారు. గ్రామ్యాహారా లంటే పైన మనం చెప్పుకున్న నాగరిక ఆహార పదార్ధాలు. వాటిని వదులుకోవాలని చెప్పాడు. చరక సుశ్రుతాదులు చెప్పిన పధతిలో ఆయుర్వేద మార్గంలో భోజనం చేస్తున్నది మనమే! అంతేకాదు, అన్నం సంస్కృత పదం అంటారు గానీ, దేశంలో తమ ప్రధాన ఆహారాన్ని ఏ భాష వారూ అన్నం అనటం లేదు. రోటీలు సాపాటులే అందరికీ! అన్నం తింటున్నది తెలుగువారే! అది గ్రామ్యాహారం కాకుండా ఆరోగ్య దాయక్జంగా ఉండాలనేది ఉగాది ప్రబోధం. మనం స్వీటు షాపుకు వెళ్ళినప్పుడు కొద్దిగా రుచి చూసి కొంటాం. ఉగాది పచ్చడిని మన ఆహారం ఇలా ఆరురుచులతో సమృద్ధిగా ఉండాలని రుచి చూపించి ప్రబోధిసతోంది ఉగాది.
ఆహారంలో సహజంగా ఉండే విషదోషాలకు విరుగుడుగా పనిచేసేందుకు వగరు, చేదు రుచులను తింటూ ఉండాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరురుచుల కలయిక తోనే మన ఆహార పదార్ధాలు తయా రౌతాయి. ఆరురుచూలూ ఉన్న భోజనాన్ని షడ్రసోపేత భోజనం అంటారు. నిజానికి మనం షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నామా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. ఎవరి ఆహారంలో వగరు రుచి చేదు రుచీ ఉందవో వారి శరీరాలు రోగాలకు తలుపులు తెరిచి నిల్చున్నట్టే లెక్క.
ఆరోగ్యదాయకమైన చేదు మనకు కాకర, ఆగాకర, మెంతుల్లాంటి ద్రవ్యాల ద్వారా, వగరు మజ్జిగ, పసుపు,ధనియాలు ఇంకా కొన్ని ఆకు కూరలద్వారా లభిస్తుంది. మనం వీటిని తక్కువగా వాడి, పులుపు ఎక్కువగా వాడుతున్నాం. పులుపు పెరిగే కొద్దీ ఉప్పు, కారం, తీపి కూడా పెరుగుతాయి. వీటితోనే సరిపోతోంది. ఇంక వగరు చేదు తినే ఉత్సాహం మనకు ఉండట్లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేందుకే ఉగాది నాడు వగరుగా ఉండే మామిడి వడపిందెల్ని, చేదుగా ఉండే వేపపూతనీ, తీపి, పులుపు ఉప్పు, కారంతో పాటు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం.
తీపికోసం చెరుకు రసం, బెల్లం, పంచదార, పటికబెల్లం వీటిలో దేన్నైనా కలుపుకో వచ్చు. ఉప్పు తగినంత వేసుకుని కారం కోసం పచ్చి మిరపకాయ ముక్కలు లేదా ఎర్ర కారం కాకుండా మిరియాల పొడినీ వేసుకుని, వడ పిందెలు అంటే బాగా లేత మామిడి పసరు పిందెల ముక్కల్ని, వేపపూవునీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. తెలుగు భాషను పూజించుకుని, పంచాంగానికి దణ్ణం పెట్టి, వేపపూవు ప్రసాదం తినటం ఉగాది నాడు ప్రొద్దున్నే మనం విధిగా జరుపుకునే ఆచారం. ఇందులో కులాల ప్రస్తావన మతం ప్రస్తావన లేదు. అందరి పండగ ఇది. అందరి కోసం, అందరి ఆరోగ్యం కోసం, అందరి సంక్షేమం కోసం జరుపుకుంటున్న పండుగ!
ఉగాది పచ్చడిని ఉగాది రోజున మాత్రమే ఒక చెంచాడు తినటం వలన ఉపయోగం ఏమీ లేదు. దీన్ని సంవత్సరం పొడవునా తినాలనేది దీనిలోని అంతఃసూత్రం. రోజూ కనీసం వేప పూవునైనా కారప్పొడిగా చేసుకుని అన్నంలో మొదటి ముద్దగా తినటం వలన చేదు మనకు చేసి పెట్టే ఉపకారం నెరవేరుతుంది.
వేపపూల కారప్పొడిని ఇలా చేసుకోవచ్చు... ఒక భాగం అల్లం ముద్ద, 2 భాగాలు మిరియాలపొడి, 4భాగాలు జీలకర్ర, పొడి, 8 భాగాలు ఎండిన వేపపూల పొడి , 16 భాగాలు కొమ్ములు దంచిన పసుపు, 32 భాగాలు ధనియాలపొడి వీటిని వేరు వేరుగా దంచి, అన్నీ కలిపిన పొడిని తగినంత ఉప్పు కలిపి భద్రంగా ఒక సీసాలో దాచుకోండి. ఈ వేపపూల కారప్పొడి శరీరంలో విషదోషాలను హరిస్తుంది. ఏడాది పొడవునా తిన వలసిన, తినదగిన ఒక మంచి ఔషధం. దీన్ని ‘వేప వేసవారం’ అంటారు.
ఉగాది మార్గదర్శనం చేసే ఒక ప్రత్యేక పండుగ. మన మనసుల్లో నిర్మలమైన భావనలు పెందించు కోవటమే ఉగాది ప్రత్యేకత. భాష, సంస్కృతి, ఆరోగ్యం ఈ మూడింటి త్రివేణీ బంధమే ఉగాది! 

ఉగాదినాడు విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురితం

No comments:

Post a Comment