Saturday 8 August 2015

మొక్కలయ్య మొక్కుల కథ :: డా.జి వి పూర్ణచందు

మొక్కలయ్య మొక్కుల కథ
The Story of Lord Vinayaka

డా.జి వి పూర్ణచందు


బుద్ధి దేవర, పంటల దేవుడు, మొక్కలయ్య, చేటల్లాంటి చెవులుగలిగి జనంగోడు చక్కగా ఆలకిం చేవాడు, పసుపు రంగులో కనిపిస్తూ పచ్చదనాన్ని లోకాన నింపేవాడు, ధాన్యరాశిని ఆసనంగా చేసు కున్న వాడు, నిరాఘాటంగా రాయగల రాయస కాడు, పర్యావరణ పరిరక్షకుడూ అయిన గణపతి లోకానికొక శాంతి సందేశంగా నిలిచాడు. ఆయన పుట్టినరోజున మనం నేటి పర్యావరణం గురించి, రేపటి మన మనుగడ గురించి ఆలోచించుకునే అవకాశం కలిగించుకోవాలి!

చైనా బౌద్ధులు 'లాఫింగ్‌ బుద్ధ' రూపాన్ని, భారతీ యులు వినాయకుణ్ణీ బుద్ధికి అధిదేవతలుగా రూపొందించుకున్నారు. వాస్తు పేరుతో, ఈ బుద్ధ, వినాయకుల బొమ్మల్ని దిష్టి బొమ్మలుగా పెట్టుకునీ బుద్ధిహీనతను ప్రదర్శిస్తున్నాం. వినాయకుణ్ణి నవ్వు లాటకు తీసుకోవటం. పనికిరాని కార్టూన్లు గీయ టం, తొక్కలో వినాయకుడు లాంటి విసుర్లు వేయ టం, ప్రత్యేక హాస్య సంచికలు ప్రచురించటం ఇవి ఆయన్ని తక్కువ చేయటమే అవుతుంది. మూషి కాలు పంటల దొంగలు. గణపతి వాటిని అణచి ఉంచటానికి సాక్షాత్తూ పాముతో నడుం బిగిం చాడు. పంటని కాపాడాడు. అలా ఆయన 'పర్యావ రణ పతి' అయ్యాడు. ఈ గణపతి కథ ఈ నాటిది కాదు, బుగ్వేద కాలం నుండీ మొదలౌతుంది.

''గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతా నశ్శృణ్యన్నూతిభి స్సీదసాదనం''

బుగ్వేదం రెండవ మండలంలో (23.01) కని పించే గణపతి స్తుతి ఇది. ఇతరులకన్నా ఉన్నతులుగానూ, భిన్నంగానూ తమ గణవ్యవస్థ తమను నిలిపిందని భావించిన ఆర్యప్రజలు తమ గణపతులందరికీ ప్రతి అయిన మహాగణపతికి హవిస్సులు అర్పించుకున్నారు. గణానాంత్వా గణపతిగ్‌ం= గణాలకు పతి, కవిం కవీనాం= మేథావుల్లో కెల్లా మేథావి, ఉపమశ్శ్రవస్తమం= బాగా వినేందుకు ఉన్నతమైన చెవులు కలవాడు (మొరాలకించేవాడు), జ్యేష్ఠరాజం బ్రహ్మణాం = వికాసం కలిగించిన తొలి పరిపాలకుడు, బ్రహ్మణస్పతాన := మరింత వికాసం పొందేలా చేయగలవాడు, శృణ్యన్నూతిభి స్సీదసాదనం= మొర వినగానే నూతన ఆలోచనలకు వేదికైనవాడు ...హవామమే= మా హవిస్సులు గైకొనమంటూ వేడికోలు ఇందులో కనిపిస్తోంది.
సాయణభాష్యంలో గణానం అంటే దేవాది గణాలనీ, గణేశ అంటే వేద మంత్రాది స్తోత్రాలతో సుత్తించే వారి నాయకుడని అర్థం. ఈ విశేషణా లన్నీ బుగ్వేద కాలంలో ఇంద్రుడిని ఉద్దేశించినవి! అప్పటికి ఇంద్రుడే గణపతి. మాక్స్‌ 'ముల్లర్‌ క్రీ. పూ. 2,500- 1800 నాటి బుక్కుగా దీన్ని భావిస్తే, తిలక్‌ క్రీ.పూ. 6,000 నాటిదని, ఇతరులు, క్రీ.పూ. 3,000 నాటిది కావచ్చుననీ అన్నారు.

తరువాతికాలంలో, గణపతిని రుద్రుడి రూపంగా యజుర్వేదం భావించింది. నమకం చమకంలో ''నమో గణేభ్యో గణపతి భ్యశ్చవో నమ: దేవగణాల రూపం వున్న నీకు నమస్కారం, దేవగణాలకు పతివైన నీకు నమస్కారం'' అంటుంది. దేవగణా లూ, దేవగణపతి ఇద్దరూ ఒక్కరే అయిన ఈ మహాగణపతి రుద్రుడి రూపంగా కనిపిస్తాడు. బుగ్వేద కాలంలో ఇంద్రుడూ, తరువాతి యుగంలో రుద్రుడూ గణపతులుగా వ్యవహరించి వుంటారు. ఇది క్రీ.పూ.1,000 నాటి సంగతి కావచ్చునని మాక్స్‌ ముల్లర్‌ భావన. హేరంబ, గణనాయక, గణేశ, ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి (పద్మపు రాణం), పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమి కర, అంబాసుత, సిద్ధివినాయక (సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్ర తుండ, కపిల, చింతామణి, డుంఠి(పద్మపురాణం), పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర, అంబాసుత, సిద్ధి వినాయక (సంగీత శాస్త్రాల్లో), సుముఖ, ఏకదంత, గణకర్ణిక, వికట, విఘ్నరాజ, గణాధిప, ధూమకేతు, గణాధ్యక్ష, గజానన, వక్రతుండ, శూర్పకర్ణ, స్కందపూర్వజ (నిత్య పూజా విధానంలో) ఇలాంటి అనేక పేర్లతో, వాటికి తగిన లక్షణాలతో గణేశుడు వివిధ కాలాలలో కనిపిస్తాడు.

పరిణామ క్రమంలో పాత దేవతల స్థానే, కొత్త దేవతలు చేరటం సహజ పరిణామం. తొలుత ఇంద్రుడిదే ఆధిపత్యం. తరువాత రుద్రుడు ఆ స్థానంలో కనిపిస్తాడు. అతణ్ణి శివుడి రూపంగా చెప్పుకున్నారు. రుద్రుడు, శివుడూ ఒక్కరేనన్నారు. పంచభూతాలలో ఆకాశానికి విష్ణువు, వాయువుకు సూర్యుడు, అగ్నికి శక్తి (అంబ), భూమికి శివ, జలాలకు గణేశ అధిదేవతలుగా చేసిన వర్ణనలు వున్నాయి. బహుశా జలాధిదేవత కావటం వలనే గణేశ ఉత్సవాలలో నిమజ్జనానికి ప్రాముఖ్యం వచ్చింది. కానీ, ఇది రాను రానూ అతి ధోరణిగా మారి చివరికి ఈ నిమజ్జనం అనేది జిప్సం, పీవోపీ, విషపు రంగులతో జలకాలుష్యానికి దారితీస్తోంది. ఇది వినాయక ద్రోహం అని గట్టిగా చెప్పగలగాలి. మనుస్మృతిలో, ''విప్రానాం దైవతం శమ్భు : క్షత్రియాణాం తు మాధవా :/ వైశ్యానాం తు భవేద్‌ బ్రహ్మా శూద్రానాం గణ నాయకా :- బ్రాహ్మణులు సాంబుని, క్షత్రియులు విష్ణువుని, వైశ్యులు బ్రహ్మని, శూద్రులు గణనాయకుణ్ణి దేవతలుగా కొలవటం గురించి వుంది. మనువు కాలానికి దేవగణాధిపతి అయిన గణపతి శూద్రుల దేవుడిగా ఎందుకు మారిపోయాడనేది ప్రశ్నే! ఆర్యులతో ఆర్యేతర ప్రజల సంపర్కం జరిగినట్టే, వైదిక దేవతలూ, ఆర్యేతరుల దేవతల మధ్య కూడా సంలీనాలు జరి గాయి. 

మానవ జాతి చరిత్రని సంలీనాలే నిర్మిం చాయి. గానీ, సంఘర్షణలు కాదు. సంఘర్షణల తరువాత గెలిచిన వారికి ఓడిన వారు బానిసలౌ తారు. గెలిచినవారి ద్వారా ఆ బానిసలు సంతా నాన్ని కంటారు. ఆ సంతానానికి రెండు జాతుల సంలీన లక్షణాలు ఏర్పడతాయి. ఇద్దరి ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, ఆహార వ్యవహారాలు, ఆరాధనాపద్ధతులు కూడా మిశ్రితమై ఒక కొత్త జాతి ఏర్పడుతుంది. వారి వారి దేవతలు కూడా సంలీనమై కొత్త దేవతలు ఆరాధనా క్రమంలోకి వస్తారు. ప్రధాన ఆర్యదేవతలైన శివుడు విష్ణువు బ్రహ్మలకు తోడు గణేశ, కుమారస్వామి హనుమాన్‌ లాంటి పరివార దేవతలు అలా వైదిక దేవతలుగా వ్యాప్తిలో కొచ్చారు.

ఒకప్పుడు పంచయతన పూజ వుండేది 'ఆధిత్యం, అంబికం, విష్ణు, గణనాథం మహేశ్వరం' అంటూ స్యూరుడు, అంబిక, విష్ణువు, గణపతి, శివుడు, ఈ ఐదు దేవతల అర్చననీ పంచయతన పూజ అన్నారు. శంకరాచార్యుడు (క్రీ. శ. 9వ శతాబ్ది) కుమారస్వామిని అదనంగా చేర్చి 'షణ్మత స్థాపనాచార్యుడు'గా ప్రసిద్ధుడైనాడని డా.పి వి కాణే మహాశయుడు పేర్కొన్నారు.

ఆర్య ఆరాధనా విధానంలోగానీ, ఆర్యేతరుల ఆరాధనా విధానాలలో గానీ తొలిరోజుల్లో జంతు బలి ప్రధానాంశంగా వుండేది. మాన్పించే లక్ష్యంతో శంకరాచార్యులవారు షణ్మతాన్ని ప్రవేశపెట్టారు. ఉగ్రరూపులైన ఈ దేవతలను శాంతి దూతలుగా మార్చేందుకు కృషి చేశారు. గ్రామదేవతగా వున్న బెజవాడ దుర్గమ్మ విగ్రహం దగ్గర శ్రీ చక్రాన్ని ప్రతి ష్టించి అమ్మవారిని శాంతమూర్తిగా చేశారని చెప్తారు. పశువుల తలలు నరికి ఆరాధించే విధానా నికి బదులుగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వటం, రక్తమాంసాల స్థానంలో మోదకాలు (తీపి వంట కాలు). నైవేద్యం పెట్టటం, షడ్రసోపేతమైన భోజ నాన్ని మహానివేదన పెట్టటం కల్లు, సారాయికి బదులుగా పాయసాలు తాగటం లాంటి పద్దతులు అమలుకు తెచ్చాడని చరిత్రకారుల భావన. ఈ ఘనత ఎవరిదైనా అది నిజంగా ఘనతే! అందు వలన ఆరాధనా విధానం అహింసాత్మకం అయ్యింది. శాంతికోసం ఆరాధన అనేది ఒక అలవాటయ్యింది. గణపతి ఆరాధనని గాణాపత్యం అంటారు. గాణాపత్యం ద్వారా గణపతి, వినాయక, విఘ్నేశ్వర, గజానన మూర్తులన్నీ కలగలిపి మహాశక్తిమంతమైన దేవతగా, ప్రథమ పూజనీయుడిగా రూపొందించు కున్నారు. సంస్కృత మహాభారతం అను శాసన పర్వం (150-25)లో 'ఈశ్వరస్సర్వ భూతానాం గణేశ్వర వినాయకా' అని ఉంది. ఇది క్రీ.శ. తొలి శతాబ్ది నాటి రచన అని చరిత్రకారుల అభిప్రాయం. అప్పటి వినాయకుడి గజముఖ వృత్తాంతం వ్యాప్తిలో ఉంది. గణేశ్వర, వినాయక గజానన, వక్రతుండ, మహాకాయ, లంబోదర, శూర్పకర్ణలాంటి పిలుపు లన్నీ అప్పటికే ఉన్నాయి. విఘ్నాలు సృష్టించటానికీ, వాటిని జయించి విజయం సాధించటానికీ ఈ విఘ్నేశ్వరుడే కారకుడైనాడు. లింగపురాణం శివుడి అంశతో గణపతి పుట్టినట్టు చెప్తుంది. మత్స్యపు రాణంలో పార్వతి నలుగుబొమ్మ కథ కనిపిస్తుంది. ఇంకో కథ కూడా ఉంది. పార్వతి నలుగు పెట్టుకుని ఆ మాలిన్యాన్ని నీటిలో కలిపిందనీ, ఆ నీటిని తాగిన మాలిని అనే రాక్షసి వెంటనే గర్భందాల్చి గణపతిని ప్రసవించిందనీ, పార్వతి ఆ బిడ్డను తీసుకువచ్చి పెంచిందట. బహుశా ఇలాంటి కథలవలన విఘ్నాలు కలిగించే డెమన్‌గా విఘ్నేశ్వరుణ్ణి కొందరు ప్రజలు భావించి ఉండవచ్చు. అంతకు మునుపు విఘ్నాలు కలిగించే శక్తి తరువాత కాలంలో విఘ్నాలు నివారించి విజయాన్ని, మేథా సంపత్తి, ఆహారాన్నీ, ఆరోగ్యాన్నీ ఇచ్చే శక్తిగా మార్పు పొందాడు.

'ప్రేతన్భూతగణాస్శ్చన్యేయజన్తే తామస జనా' అంటే భూతప్రేతాది తామస జనులకు నాయకు డిగా వినాయకుడు కనిపిస్తాడు. దిష్టిబొమ్మగా వినాయకుణ్ణి పెట్టటం వెనుక ఈ విధమైన ఆలోచన ఒక కారణం కావచ్చు. కీర్తిముఖాలు గోడలకు తగిలించే ఆధారం ఇంకా కొనసాగుతోంది. ఇవి క్రీస్తుశకం తొలి శతాబ్దినాటి ఆలోచనలు. భూతప్రేత పిశాదాదులు ఆయన అనుచరులే కాబట్టి ఆయన్ని మంచి చేసుకుంటే వాటిని అదుపులో పెట్టి మనల్ని కాపాడతాడని నమ్మకం.

మోదః అంటే ఆనందం. తిన్నవారిని ఆనందింప చేస్తాయి కాబట్టి వీటిని మోదకాలు అన్నారు. తీపి ఉండ్రాళ్లే కాదు, లడ్డూలవంటి స్వీట్లన్నీ మోదకాలే! వినాయకుడికి వాటిని పెట్టి ఆయనను మంచి చేసు కోవాలనే భావన కూడా చాలామందిలో ఉంది.

నారాయణోపనిషత్తు (క్రీ.శ. 550) 'తత్పురు షాయ విద్మహే/వక్రతుండాయ ధీమహి/తన్నో దన్తి ప్రచోదయాత్‌' అనే మూడు పాదాల మంత్రం చెప్పింది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల వక్రగతిని చెప్పటానికి ఉపయోగించే 'వక్ర' శబ్దాన్నీ గజాననుడి వక్రతుండానికి అన్వయిస్తారు పండితులు. వక్ర అంటే వెనుకకు కదలడం అని అర్థం. జపాన్‌లో దొరికిన గణేశ విగ్రహంలో అసలు ముఖం వెనుక వైపుకు ఉంటుంది. అంటే వినాయకుడు ద్విము ఖుడు కావచ్చునన్నమాట వెనకవైపునకూడా దృష్టికల రక్షకుడు వినాయకుడు.

'బోధాయన గృహ్య శేష సూత్ర' 'బోధాయన ధర్మ శాస్త్రం'లో చెప్పిన ప్రకారం విఘ్న, వినాయక, వీర, స్థూల, వరద, హస్తిముఖ, వక్రతుండి, ఏకదంత, లంబోదర మొదలైన పేర్లతో వేర్వేరు దేవతలు కనిపిస్తారు. బహుశా తరువాతికాలంలో వీళ్ళం దరినీ సంలీనంచేసి, ఒక మహాగణపతిని ప్రతిష్టిం చుకుని ఉంటారు. హాలుడి గాథాసప్తశతిలోనూ, అమరకోశంలోనూ, బృహత్సంహితలోనూ, హర్షుడి నలచరిత్రలోనూ, దశకుమార చరిత్రలోనూ గజాన నుడి ప్రస్తావన ఉంది. కాబట్టి గజాననుడు క్రీస్తు శకం తొలి శతాబ్దాలలోనే రూపొంది ఉండాలి.

గణపతి ప్రస్తుత రూపం గుప్తులకాలంలో స్థిరపడిందని ప్రఖ్యాత చరిత్రవేత్త డి. చటోపాధ్యాయ అన్నారు. కార్డింగ్టన్‌ తన ఏనిషియంట్‌ ఇండియా గ్రంథంలో ప్రచురించిన గణేశ విగ్రహం క్రీ.శ. 5వ శతాబ్ది నాటిదన్నారు. ఆచార్య కుమారస్వామి కూడా గుప్తులకన్నా పూర్వంనాటి విగ్రహం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాణే మహాశ యుడు 'వినాయకపూజ 6వ శతాబ్దానికి ముందే లేదా ఆ తరువాత జరిగింది అని రాశారు. అనేకవిధాల పరిణామాలు చెందిన గణేశరూపం. గణేశ ఆరాధనా విధానం పదిహేను వందల ఏళ్ళక్రితం ఒక రూపానికి వచ్చాయని కాణే ప్రభృతులు తేల్చి చెప్పారు.

× × ×

ద్రవిడాలజిస్టులు వినాయకుడు ద్రావిడుదల దేవుడనే భావిస్తున్నారు. జాతుల సంలీనం, తద్వారా దేవతల సంలీనాల వలన వైదిక దేవతలతో ఈ ద్రావిడ గణపతి సంలీనం జరిగి ఉండవచ్చు. ఇం దుకు తెలుగునేల ఒక వేదికను కల్పించి ఉండవచ్చు కూడా. హాలుడి 'గాథాసప్తశతి' క్రీ.పూ. చివరి లేదా క్రీ.శ. మొదటి శతాబ్దాల కాలంలో వెలువడిన రచన. ఇందులో గజాననుడి ప్రస్తావన ఉన్నదంటే, ఆంధ్రప్రాంతంలో ఇప్పటికి రెండువేల ఏళ్ళక్రితమే వినాయకుడి ఆరాధన ఉందని అర్థం అవుతోంది. వి. రామసుబ్రహ్మణ్యం అనే పరిశోధకుడు 'సాంప్ర దాయక సంస్కృతుల సంస్థ - మద్రాసు 'బులెటిన్‌ (యూనివర్శిటీ ఆఫ్‌ మద్రాస్‌, 1971)లో గణపతి, వినాయక, గజానన అనే వ్యాసంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 'నా తమిళ సోదరులు తొల్కాప్యం సంగమ సాహిత్యాలను క్రీస్తు పూర్వానికి తీసుకు పోవాలని చూస్తున్నారు. అలాంటి వారికి ఇది రుచించకపోవచ్చు అంటాడు. క్రీస్తుశకం తొలినాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రకు హాలుడి 'గాధాసప్తశతి', గుణాఢ్యుడి 'బృహత్కథ'లు గొప్ప ఆధారాలు. వాటినే గాసట బీసట గాథలంటారు. గాథాసప్తశతిలో గజాననుడి ప్రస్తావనరాగా, తమిళంలో క్రీ.శ. ఆరవ శతాబ్ది వరకూ గణపతి గురించిన ప్రస్తావనే లేదని రామసుబ్రహ్మణ్యంగారు స్పష్టంగా చెప్పారు.

ఆంధ్రుల దగ్గరకు వైదిక ధర్మాలు వరదలా వచ్చి ఇక్కడి ప్రజలతో సంలీనం కావటం వలన ఇది సాధ్యం అయ్యింది. ఇందుకు శాతవాహనులకన్నా ముందునాటి ఆంధ్రరాజులను ఆర్యులు ఆశ్రయిం చటం గురించి పద్మినీ సేన్‌ గుప్తా పేర్కొన్న విషయాలు గొప్పవి. మహాయాన బౌద్ధాన్ని ప్రవర్తింప చేసినవారు ఆంధ్రులు. వీళ్ళే గణపతిని విదేశాలకు తీసుకువెళ్లి ప్రచారం చేశారు. మహాయానం టిక్కెట్టు మీద గణపతి విదేశీయానం చేశాడని రామసుబ్రహ్మణ్యం గారు చమత్కరించారు. 'లాఫింగ్‌ బుద్ధా', లంబోదర వినాయక' రూపాల మధ్య సామ్యతకు తెలుగు బౌద్ధులు కారణం కావచ్చ నేది నమ్మదగిన ఊహే! అమరావతి శిల్పాలలో కన్పించే యక్షుల శరీరా కృతిని పోలి ఉంటాడు గణపతి. గజముఖం తగిలిం చుకున్న తెలుగు యక్షరూపం ఆయనది!


గణపతిని బుద్ధికి, విజ్ఞానానికీ, పాండిత్యానికీ, మేథాసంపత్తికీ, శాంతి సౌభాగ్యాలకు, పచ్చ దనానికి, పాడిపంటలకూ అధిదేవతగా ఆంధ్రులు భావిస్తారు. ప్రపంచ శాంతిని కాంక్షించే తత్త్వం ఉన్నవారు మొక్కలయ్యకు మొక్కులు తీర్చుకునే ఆరాధనా విధానాన్ని రూపొందించుకోవటంలో ఆంధ్రుల పాత్ర ముఖ్యమైంది. వినాయకచవితిని ప్రపంచ శాంతి, పర్యావరణల ప్రాముఖ్యతని తెలి యజెప్పే విధంగా జరుపుకుని ఆనందించగలిగిన ప్పుడే సార్ధకత కలుగుతుంది. ఇది ఆంధ్రులు దేశా నికి అందించిన పెద్ద పండుగ. మొక్కల పండుగ. ఇండో యూరోపియన్‌ మూల భాషలో అంధ్‌ అంటే మనిషి, ఒక మొక్క అనే అర్థాలు కనిపిస్తాయి. అంథ్‌లోంచి ఆంథ్రపాలజీ (మానవశాస్త్రం) పదం ఏర్పడింది. ఆంధ్ర శబ్దానికీ మూలం ఇదే!

No comments:

Post a Comment