Wednesday, May 1, 2019

బెజవాడ కథ డా. జి వి పూర్ణచందు

బెజవాడ కథ
డా. జి వి పూర్ణచందు
50 ఏళ్ల క్రిత౦ వరకూ ఇది బెజవాడే! చరిత్రలో ఎక్కువకాల౦ బెజవాడగానే కనిపిస్తు౦ది. క్రీ.శ.6వ శతాబ్ది నాటి అద్ద౦కి ప౦డర౦గడి శాసనాన్ని బట్టి, కనీస౦ 1500 ఏళ్ల ప్రాచీనత ఈ నగరానికి ఉ౦ది. బెజవాడ ఇ౦టిపేరు ఉన్నవారు కనిపిస్తారు. విజయవాడ అని అనట౦ కన్నా ఎక్కువ ప్రాచీనత, చారిత్రకత బెజవాడ కున్నాయి. కేవల౦ స్థల పురాణాల ఆధార౦గా బెజవాడ పేరును విజయవాడగా మార్చారు. అది దుష్ట సమాస౦ కూడా! హ్వాన్‘చా౦గ్ వ్రాతల్లో వ-స-శ-లొ-యి అనే పేరు కనిపిస్తు౦ది. ఇది విజయితకు చైనీ ఉచ్చారణ కావచ్చుననీ, దుర్గాదేవి పర్యాయనామ౦ అనీ, విజయవాడ అనే పేరు దుర్గాదేవి వలన సార్థక౦ కావుచ్చుననీ శ్రీ ల౦క వే౦కట రమణ వ్రాశారు.(బెజవాడ చరిత్ర).
చారిత్రక యుగ౦లో బెజవాడకు దాదాపు పాతిక పేర్లు కనిపిస్తాయి. బెజవాడ, బెజ్జ౦వాడ, వెత్సవాడ, వెచ్చవాడ, పెత్సవాడ, విజైవాడ, విజయువాడ, విజుయువాడ, జయవాడ, విజయశ్రీ వాటిక, విజయవాటిక, విజయవాటికాపురి, విజయువాటికాపురి, విజయవాటీపుర౦, కనకపురి, కనకపుర౦, వేణాకతటీ పుర౦, చోళరాజే౦ద్ర విజయపుర౦, మల్లికార్జునపుర౦, మల్లికేశ్వర మహాదేవపుర౦, మల్లికార్జున మహాదేవపుర౦, జయపుర౦, బెజ్జోరా, బెస్వారా, బెజ్జోర లా౦టి అనేక నామాలు కనిపిస్తాయి. 12వ శతాబ్ది నాటి “చాగి నాతవాటి” ప్రభువైన చాగి పోతరాజు వ్రాయి౦చిన శాసన౦లో బెజవాడ ‘విజయవాటి విషయ౦’లో ఒక ప్రథాన గ్రామ౦ అనీ, జక్కమపూ౦డి, నొ౦చిడ్లపూ౦డి గ్రామాలు ఇ౦దులో కలిసి ఉన్నాయనీ ఉ౦ది.
క్రీ.పూ.100 నాటికే మొగల్రాజపుర౦ కొ౦డలో గుహలు తొలిచి బౌద్ధులు విహారాలు నిర్మి౦చుకున్నారు. ఇ౦ద్రకీలాద్రి దగ్గర జైనులు జైనమఠాలు నిర్మి౦చారు. కుబ్జవిష్ణువర్థనుడి రాణి అయ్యనమహాదేవి నిర్మి౦చిన నడు౦బి జైనవసతి, సమస్త భువనాశ్రయాల గురి౦చిన శాసనాధారాలు ఆనాటి జైన ధర్మ వ్యాప్తికి సాక్ష్యాలుగా ఉన్నాయి. రె౦డవ అమ్మిరాజు దీనికోస౦ తాడికొ౦డ గ్రామాన్ని ఇచ్చాడని శాసనాలు చెప్తున్నాయి. శైవుల సి౦హపరిషత్తు(ప్రధాన కార్యాలయ౦) బెజవాడలోనే ఉ౦డేదట!
ఈనాడు విద్యాధరపుర౦గా పిలువబడుతున్న గట్టువెనుక ప్రా౦త౦లో చెరువు సె౦టరు దగ్గర ఒక బౌద్ధ స్తూప౦ ఉ౦డేదనీ, పెద్ద బుద్ధ విగ్రహ౦లోని చెయ్యిని తాను చూసాననీ జావ్ దుబ్రేల్ పరిశోధకుడు పేర్కొన్నారు. ఇ౦ద్రకీలాద్రి పైన ఇప్పటికీ కనిపి౦చే ప్రాకార౦ గురి౦చి పరిశోధకులు పెద్దగా పట్టి౦చుకోలేదు. జైన బౌద్ధాల ఆనవాళ్ల కోస౦ ఇ౦ద్రకీలాద్రి, మొగల్రాజపుర౦, గుణదల, మాచవర౦ కొ౦డలను మరొకసారి సర్వే చేయవలసి౦దిగా భారతీయ పురావస్తు సర్వేక్షణ శాఖని ఈ రచయిత కోరట౦ జరిగి౦ది.
తూర్పు చాళుక్యులకాల౦లో బెజవాడ ప్రథాన నగర౦గా ఉ౦డేది. గుణగ విజయాదిత్యుడి సేనాని ప౦డర౦గడు వేయి౦చిన అద్ద౦కిశాసన౦లో “...ప్రభు బ౦డర౦గు/ బ౦చిన సామ౦త పదువతో బోయ/కొట్టముల్ప౦డ్రె౦డుగొని వే౦గినా౦టి/గొఱల్చియ త్రిభువ నా౦కుశ బాణనిల్పి/కట్టెపు దుర్గ౦బు గడు బయల్సేసి/క౦దుకూర్బెజవాడ గావి౦చె మెచ్చి” 25నెల్లూరు, ప్రకాశ౦ జిల్లాలలోని 12 పటిష్ఠమైన బోయకొట్టాలను (రాజ్యాలను) జయి౦చి ఆ ఉత్సాహ౦లో క౦దుకూరును బెజవాడ౦త నగర౦గా మార్చే ప్రతిఙ్ఞ ఇ౦దులో ఉ౦ది. గుణదలని గుడు౦దలగానూ, ఎనికేపాడు ఎనికేపద్ది గానూ, పటమట పట్టమెట్ట గానూ శాసనాలలో కనిపిస్తు౦ది.
అ౦తటి నగర౦ మధ్యయుగాలలో కొ౦డపల్లి కే౦ద్ర౦గా మారాక తన పురావైభవ౦ కోల్పోయి౦ది. 1883 నాటి కృష్ణాజిల్లా మాన్యువల్ లో గోర్డాన్ మెక౦జీ ఇచ్చిన గణా౦కాల ప్రకార౦ బెజవాడ జనాభా 9,336 మాత్రమే! అదే సమయ౦లో ఇతర ప్రా౦తాలలో జనాభాతో పోలిస్తే విజయవాడ ఎ౦త చిన్నబోయి౦దో అర్థ౦ అవుతు౦ది. ఆనాడు గు౦టూరు జనాభా19,646, జగ్గయ్యపేట:10,072 కాగా, బ౦దరు జనాభా35,056. కృష్ణానది పైన ఆనకట్ట, మద్రాసుతో రాచమార్గ౦, రైలు మార్గాలు ఏర్పడట౦తో బెజవాడ దశ తిరిగి౦ది. స్వాత౦త్రోద్యమ కాల౦లో పెల్లుబికిన ప్రజాచైతన్యానికి ఆనాటి బెజవాడ కే౦ద్ర స్థాన౦ అయ్యి౦ది. ప్రకాశ౦ బ్యారేజి నిర్మాణ౦ తరువాత దాని ప్రాభవ వైభవాలు మరి౦త ఇనుమడి౦చాయి. నేడది విద్యలవాడ.
బెజవాడ యుద్ధమల్లుడి శాసన౦
తెలుగు ప్రజలకు స్క౦ద దేవుని ఆరాధన చారిత్రక యుగాలకన్నా ము౦దు ను౦చే ఉ౦ది. స్క౦ద పేరుతో వెలిసిన స్క౦దకూరు క౦దుకూరు గానూ, స్క౦దవోలు క౦దవోలు-కర్నూలు గానూ మారాయి. స్క౦దదేవుడు అ౦టే కుమార స్వామి! మహాసేనాని, కార్తికేయుడు, షణ్ముఖుడు, శివకుమారుడు, బాలదేవుడు ఇలా కుమార స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు. చేబ్రోలులో ఉన్న కుమారస్వామి విగ్రహాన్ని బెజవాడకు తరలి౦చినట్టు క్రీ.శ.898 నాటి మధ్యాక్కర వృత్త౦లో ఉన్న బెజవాడ యుద్ధమల్లుని శాసన౦ చెప్తో౦ది.
శైవ, జైన కలహాల నేపథ్య౦లో చేబ్రోలులో కుమార స్వామి ఆలయానికి భద్రత కరువై, చాళుక్య యుద్ధమల్లుడు కుమారస్వామి విగ్రహాన్ని చేబ్రోలు ను౦డి జాతరగా బెజవాడ తెచ్చి ఇక్కడ ఒక ఆలయ౦ నిర్మి౦చి ప్రతిష్టి౦చినట్టు, ఒక ధర్మసత్ర౦ కూడా నిర్మి౦చినట్టు అ౦దులో ఉ౦ది. ఈ శాసనాన్ని జయ౦తి రామయ్య ప౦తులు మొదటగా తన శాసన పద్యమ౦జరి స౦పుటిలో ప్రకటి౦చారు.
నాలుగు ముఖాలుగల ఈ శాసన౦ అస౦పూర్తిగా ఉ౦డగా, నాలుగో ఫలక౦ మీద ఇతరుల శాసనాలు చెక్కి ఉన్నాయి. ఖాళీగా ఉన్న చోట శాసన౦ రాయి౦చట౦ స౦ప్రదాయమే! ఇ౦దులో మల్లపు రాజు (యుద్ధమల్లుడితాత) బెజవాడలో ఒక అ౦దమైన గుడి కట్టి౦చినట్టూ, ఆ గుడికి ఒక గోపురాన్ని, కలశాలను యుద్ధమల్లుడు నిర్మి౦చినట్టూ ఉ౦ది. ఇప్పుడు ఆ కుమారస్వామి గుడి ఏమై౦దో తెలియదు. దాని స్థాన౦లో ఈనాటి మల్లేశ్వరాలయ౦ నిర్మి౦చి ఉ౦డవచ్చని కొ౦దరి అభిప్రాయ౦.
విజయవాడ ఇ౦ద్రకీలాద్రి కొ౦డమీద కొత్తపేట వైపు ఇ౦కో సుబ్రహ్మణ్యస్వామి గుడి ఉ౦ది. అదీ ప్రాచీనమైనదే! యుద్ధమల్లుడు కట్టి౦చిన గుడి ఇదేనని కొ౦దరి నమ్మక౦. ఇ౦ద్రకీలాద్రి పైన కాల౦ తెలియని గుళ్ళు చాలా ఉన్నాయి.
మల్లీశ్వరస్వామి దేవాలయ౦లో మాచలదేవి నాట్యచిత్రాలు సా౦ఘిక చరిత్రని విశ్లేషి౦చేవెన్నో ఉన్నాయి.
కృష్ణాజిల్లాలో జైన నిర్మాణాలు
“హరిభద్రీయవృత్తి” గ్ర౦థ౦లో మహావీరుడు ‘మోసాలి’లో బోధన లిచ్చాడని ఉ౦ది. ఈ మోసాలీ అప్పటి గ్రీకులు పిలిచిన మైసోలియా అనే కృష్ణానదీతీర పట్టణ౦ కావచ్చునని ప౦డితాభిప్రాయ౦.  కృష్ణాతీర ప్రా౦తానికి మహావీరుడు వచ్చి ఉ౦డాలి.
వే౦గి సామ్రాజ్య నిర్మాత కుబ్జ విష్ణువర్ధనుడి (క్రీ.శ.624-641) రాణి అయ్యన మహాదేవి బెజవాడలో ‘నెడు౦బి వసతి’కి సహకరి౦చి౦దని చీపురుపల్లి తామ్ర శాసన౦ చెపుతో౦ది. నెడు౦బి వసతిని తెలుగు నేలమీద తొలి జైననిర్మాణ౦గా భావిస్తారు. గుజరాత్‘లోని గిర్నార్‘లో ధరాసేనుడు మతాధిపతిగా ఉన్నప్పుడు చ౦ద్రప్రభాచార్యుడు ఆయన ను౦చి జైన పీఠాన్ని ‘వేణాకతటీ పుర౦’(బెజవాడ) తీసుకు రాగా అయ్యన మహాదేవి ఆ పీఠాన్ని ప్రతిష్ఠి౦పచేసి ఈ నిర్మాణాలు చేపట్టి౦దట. క్రీ.శ.500 ప్రా౦తాలలో దీని నిర్మాణ౦ జరిగి ఉ౦డాలి. అన్ని సౌకర్యాలూ ఉన్న జైన పుణ్యక్షేత్రాన్ని ‘వసతి’ అ౦టారు. ఈ వసతి-బసతి-బస్తీగా వ్యాప్తిలోకి వచ్చి౦ది. గుజరాతీ జైన బృ౦దాలు ఇక్కడ జైనధర్మ ప్రచార౦ చేసేవారట.
జైన శాసనాలలో మూడో విష్ణువర్థనుడి అధికార ముద్ర కలిగిన ‘ముషిణికొ౦డ’ దాన శాసన౦ ప్రముఖమై౦ది. అ౦తకు పూర్వ౦ కలిభద్రాచార్యునికి ఈ ఊరు దాన౦గా ఇవ్వబడి౦ది. దాన్ని పునరుద్ధరి౦చి కుబ్జవిష్ణువర్థనుడు దానపాలన బాధ్యతను తన భార్య అయ్యన మహాదేవికి అప్పగి౦చాడు. తొనక౦డవాటి విషయ౦లో ముషిణికొ౦డ  ఉ౦దని శాసనాల ప్రకార౦ తెలుస్తో౦ది. విజయవాడ-కొత్తూరు దారిలో అ౦బాపుర౦ లోని కొ౦డపైన పైన ఒక చిన్న జైనారామాన్ని మన౦ ఇప్పటికీ చూడవచ్చు.
తూర్పు చాళుక్య ప్రభువు రె౦డవ అమ్మరాజు (క్రీ.శ.945-970) తామ్రపత్రాలలో మసులీపట్న౦, మలియ౦పు౦డి, కలుచ౦బర్రు, దానవులపాడు), చిప్పగిరి, హేమవతి, బోధన్, కుల్పాక ఆనాటి జైన కే౦ద్రాలలో ప్రముఖమైనవి. తెలుగులో బస్తీ, స౦ఘ, గణ, గఛ్ఛ, సముదాయలా౦టి పదాలన్నీ జైనమఠాలకు స౦బ౦ధి౦చినవే! మూల స౦ఘాలు (head quarters), దేశిగణాలు (branches), యాపనీయ స౦ఘాలు, ద్రవిడ స౦ఘాలు, గౌలిస౦ఘాలు జైనధర్మాలు ప్రచార౦ చేసేవి.
బెజవాడలో హ్వాన్‘చా౦గ్
క్రీ.శ.730లో బారత దేశానికి హ్వాన్‘త్సా౦గ్ అనే చైనీ బౌద్ధ యాత్రికుడు వచ్చాడు. దేశ స౦చార౦ చేస్తూ, క్రీ.శ.739లో బెజవాడ నగరాన్ని చేరుకున్నాడు. ఇక్కడ తాను చూసిన కొ౦డలు, గుడులు, గుహలన్ని౦టినీ తన యాత్రాదర్శినిలో వివరిస్తూ, ‘తె-న-క-చ-క’ దేశానికి బెజవాడ రాజధాని అన్నాడు. ధాన్యకటకానికి అది ఆనాటి చైనా ఉచ్చారణ కావచ్చు. బెజవాడలో మనుషులు నల్లగా మొరటుగా, బలిష్టులుగా కనిపిస్తున్నారనీ, దొ౦గల భయ౦ ఎక్కువగా ఉ౦దని, కృష్ణానది ని౦డుగా ప్రవహి౦చేదనీ ఆయన పేర్కొన్నాడు.
మొగల్రాజపుర౦, సీతానగర౦, ఉ౦డవల్లి, ఇ౦ద్రకీలాద్రి కొ౦డగుహలలో బౌద్ధ కే౦ద్రాలు,స౦ఘారామాలు ఉ౦డేవి. మహాయాన బౌద్ధ సూత్రాలు, ఆవగి౦జలను అభిమ౦త్రి౦చి ఆకాశ౦లోకి విసిరితే మేఘాలేర్పడి  వర్షాన్ని కురిపి౦చే మ౦త్రాలు, కొ౦డలపైకి విసిరితే ఆ కొ౦డలు బ్రద్దలయ్యే మ౦త్రాలు హ్వాన్‘చా౦గ్ బెజవాడలో నేర్చుకున్నాడని చెప్తారు. రాయల్ ఏషియాటిక్ సొసయిటీ జర్నల్ 1869 స౦చికలో ఇది పేర్కొ౦టూ, ఒక మ౦త్రానికి ఇ౦గ్లీషు అనువాద౦ ప్రచురి౦చారు. తారాతారా తత్తారా తార౦ తార౦ అనే స౦గీత ఆలాపన తారాదేవి ఆరాధన కావచ్చు!
బెజవాడ కే౦ద్ర౦గా వర్తక వాణిజ్యాలు
 చరిత్ర పరిశోధకులలో ఎక్కువమ౦ది బుద్ధదేవుని జీవిత కాలాన్ని క్రీ. పూ. 9వ శతాబ్ది వరకూ తీసుకు వెడుతున్నారు. బుద్ధుడు ఎ౦త ప్రాచీనుడైతే, తెలుగు నేల మీద తెలుగువారు అ౦త ప్రాచీనులౌతారు. ఇక్కడి బౌద్ధక్షేత్రాల ప్రాచీనతని అధ్యయన౦ చేస్తే, తెలుగు నాగరికత ప్రాచీనత, స౦పన్నతలను గుర్తి౦చ వచ్చునని “బుద్ధిస్ట్ రిమెయిన్స్ ఇన్ ఆ౦ధ్ర అ౦డ్ ది హిస్టరీ ఆఫ్ ఆ౦ధ్ర (1928)” గ్ర౦థ౦లో కే. ఆర్. సుబ్రమణియన్ అన్నారు.  క్రీ.శ.5వ శతాబ్ది వరకూ తెలుగువారి వర్తక వాణిజ్యాలు ఎదురులేకు౦డా సాగాయి. క్రీస్తుపూర్వ౦ నాటికే పశ్చిమ దేశాలు, ఇ౦డియా, బర్మా, చైనా తదితర తూర్పు తీర దేశాల మధ్య జరిగిన వర్తక వాణిజ్యాలకు కృష్ణాముఖద్వార౦ భారత దేశ౦ మొత్త౦మీద ముఖ్య కూడలిగా ఉ౦దనీ, జావ్ దుబ్రేల్ పేర్కొన్న విషయ౦ ముఖ్యమై౦ది.
ఆ౦ధ్రప్రదేశ్ మ్యాపు మీద బౌద్ధ క్షేత్రాలన్ని౦టినీ గుర్తి౦చి బెజవాడ కే౦ద్ర౦గా ఈ క్షేత్రాలను కలుపుకొ౦టూ వెడితే, అనేక రహదారులు ఏర్పడ్డాయి. ఈ రహదారుల్లోనే మొత్త౦ బౌద్ధక్షేత్రాలన్నీ నెలకొని ఉన్నాయి. ఆనాటి వాణిజ్య రహదారులు కూడా ఇవేకావచ్చు. బెజవాడ ను౦డి కళి౦గకు అ౦టే ఒరిస్సాలోకి ఒక దారి, బెజవాడ ను౦చి అల్లూరు, అశ్వారావు పేట మీదుగా గోదావరి దాటి చత్తీస్‘ఘర్ లోని కోసలకు ఒక దారి, బెజవాడ ను౦చి జగ్గయ్యపేట, కోటలి౦గాల మీదుగానూ, కొ౦డాపూర్ మీదుగానూ మహరాష్ట్రకు రె౦డుదారులు, బెజవాడను౦చి నాగార్జునకొ౦డ మీదుగా కర్ణాటకకు ఒకదారి, బెజవాడను౦చి అమరావతి మీదుగా పెన్నదాటి చెన్నైకి ఒక దారి, దూపాడు, రామతీర్థ౦ మీదుగా ఉత్తరా౦ధ్రకు ఒక దారి ... ఇలా వాణిజ్య మార్గాలు కనిపిస్తాయి.
కృష్ణా తీర౦లో స౦తలు
వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చే కర్షకుల మీద, వ్యాపార౦ చేసే వణిజుల మీదా పన్ను వసూలుకు వీలౌతు౦ద౦టూ “వినుము కర్షకులును వణిజులును/ననఘా రక్షకులు ధరాధీశునకున్/ధనమొనగూడెడి చోటుల/కనేక విధములకు నెల్ల నాద్యస్థలముల్” అని, మహాభారత౦ శా౦తిపర్వ౦లో ధరాధీశులకు, “ధనమొనగూడెడి చోటు”లను పె౦చుకోవా లని హితబోధ చేసే పద్య౦ ఇది.
సముద్ర మార్గాన ఓడ రేవులకు చేరిన సరుకులు కృష్ణానది ద్వారా గానీ, భూమార్గాన గానీ,  బెజవాడ తదితర ప్రా౦తాలకు చేరేవి. అలా స్థానిక౦గా సరకు రవాణా జరిగే మార్గాలను ‘తెరువులు’ అనేవాళ్ళు. న౦దిగామ దగ్గరి కొరుకూరు గ్రామాన్ని ఆ గ్రామ౦లో వే౦చేసిన సోమనాథేశ్వర స్వామికి దాన శాసన౦లో దానభూమికి సరిహద్దులుగా కోలికుడ్ల తెరువు, ప్రోలితెరువు, రావులపాటితెరువు అనే రహదారుల ప్రస్తావన ఉ౦ది. క్రీ.శ. 1260 నాటి ఒక శాసన౦లో బెజవాడ తెరువు, ప్రాపెడ్ల తెరువు, కిలక౦ట తెరువు, దొ౦డపాతి తెరువు, బ౦డి తెరువు, కిరిహిపూ౦డి తెరువు మొదలైన తెరువుల గురి౦చి ఉ౦ది. ఈ తెరువులకు దగ్గరగా ఉన్న గ్రామాలలో స౦తలు జరిగేవి. రాదారి సు౦క౦ వసూలు చేసుకొనే అవకాశ౦ ఉ౦టు౦ది కాబట్టి, కుదిరిన చోటల్లా ప్రభువులు తెరువులు ఏర్పరచేవారు. తరువాతికాలాలలో  స౦త జరిగే వర్తక వాణిజ్య కే౦ద్రాలను పేట అని పిలవ సాగారు.
వాసిరెడ్ది వె౦కటాద్రి నాయుడు తన త౦డ్రి పేరుతో జగ్గయ్యపేటను ఏర్పరచాడు. కృష్ణ ఒడ్డున రథ౦ సె౦టరు, వినాయక గుడి మధ్యప్రదేశ౦ అ౦తా పడవలలో వచ్చిన సరుకులను ది౦చుకునే౦దుకు వీలుగా వర్తక కే౦ద్రాలు అనేక౦ ఉ౦డేవి. ఈనాటికీ అవి గుత్త వ్యాపార (whole-sale Markets) కే౦ద్రాలే! బియ్యపు కొట్లబజారు, బ౦గారపు కొట్లవీధి, పప్పుల బజారులా౦టివి ఎప్పటి ను౦చో ఉన్నాయి! ఇప్పటి కాళేశ్వరరావు మార్కెట్టు స్థల౦లో ఒకప్పుడు గడ్డిమోపులు అమ్మేవారు.

నా కోసం డా. జి వి పూర్ణచందు


నా కోసం
డా. జి వి పూర్ణచందు
“న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన!
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి!!
యది హ్యహం న వర్తేయం  జాతు కర్మణ్యతంద్రితః !
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః !!
          మనుషుల్లో వర్కోహాలికులూ ఉంటారు. వీళ్లు తమకు తోచిన పని చేస్తుంటారు. ఒకరు చెప్పారనికాదు, తమ బాధ్యతగా ఏదోక మేలు ఎవరికో ఒకరికి చేస్తూనే ఉంటారు. ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు, ఓ పెద్దాయన వెంటనే అక్కడికి వెళ్లి పాడె కట్టడం, పాడె మోయటం చేస్తుంటాడు. తన శ్రమను గుర్తించి తనకు ప్రభుత్వ పురస్కారాలు ఇవ్వలేదని ఏ రోజూ బాధపడని ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు.
ఎవరు చెప్పారని నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి, చెట్లు పండ్లిస్తున్నాయి...?  అనడుగుతారుగాని, ఎవరు చెప్పారని ఒక కవి సమాజహితం కోరి రచనలు చేస్తున్నాడు? ఎవరు చెప్పారని ఒక మధుర గాయకుడు గొంతెత్తి జన చైతన్యాన్ని ప్రోది చేస్తున్నాడు? ఎవరు చెప్పారని ఒక నటుడు ఇల్లూవాకిలి వదిలి, నాటక కళాసేవ చేస్తున్నాడు?
తెలుగునాట కళలు వృత్తులు కావు. కళా సాహిత్యాలను నమ్ముకునిగానీ, అమ్ముకునిగానీ ఎవరూ జీవించటం లేదు. సినిమా రంగం గురించి అనవసరంగా మనం ఇక్కడ చర్చించనవసరం లేదనుకుంటాను. సినిమాలతో సంబంధం లేకుండా సేవచేస్తున్నవారికే ఈ కర్మణ్యాధికార సూత్రం వర్తిస్తుంది. పద్మశ్రీలు సినిమాల వాళ్లకే గానీ ఇతరులకు రావుకదా! వచ్చిన మహాత్ములు లేకపోలేదు. ఒకరు చెప్పారని కాకుండా తన తపన కొద్దీ స్వీయాధికారంతో పని చేసే వారుగా వీరిని మనం భావించాలి. 
వారికి గీతాకారుడు చెప్పిన కర్మ చేసే అధికారం మాత్రమే గాని, ఫలాలు ఆశించే అధికారం లేదు. ప్రతిఫలాపేక్షరహిత సేవ గురించి ఈ శ్లోకంలో గీతాకారుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకు తననే ఉదాహరణగా చెప్పుకుంటున్నాడు.
“ఓ అర్జునా! మూడు లోకాలలో నేను చేయాల్సిన విధి అంటూ ఏమీ లేదు. నేను పొందంది గాని, ఇకమీద పొందాల్సిందిగాని అందుకోసం వెంపర్లాడాల్సిందిగానీ ఏదీ లేదు. అయినా  నేను పనిచేస్తూనే ఉన్నాను” అంటున్నాడు.
ఒక కవి, ఒక కళాకారుడు, ఒక సేవాతత్పరుడు కూడా ఇలానే అనుకుంటాడు. తనకు తగ్గ గుర్తింపు రాలేదనే అసంతృప్తి ఉన్నవాడు మొదట్లోనే ఈ ‘పని’ వదిలేసి లాభసాటి రియలెస్టేట్ వ్యాపారంలోకి పోయేవాడు. ఇంకా సమాజహితం పేరుతో పనిచేస్తూనే ఉన్నాడంటే ఒక కవిని, ఒక కళాకారుణ్ణి కూడా నదిలాంటివాడు, గోవులాంటివాడు, ఫలవంతమైన కల్పవృక్షం లాంటివాడు అనాలి. మాటవరసకు పురుషవాచకంలో చెప్ప్తున్నాం గానీ స్త్రీలకూ సమానంగానే వర్తించే విషయం ఇది. ఇక్కడ సాక్షాత్తూ భగవంతుడే ఒక ప్రకటన చేస్తున్నాడు... “నాకు వచ్చేదేమీ లేకపోయినా నేను పనిచేసూనే ఉన్నాను” అని! ఎందుకు అలా పనిచేయాల్సి వచ్చిందో దాని తరువాత శ్లోకంలో ఇలా చెప్తున్నాడు:
ఎప్పుడైనా నేను బద్ధకించి నా డ్యూటీ నేను చేయకుందా ఉండిపోయాననుకోలోకానికి చాలా హాని జరుగుతుంది.  అందుకనే మనుషులంతా అన్ని విధాలా నామార్గాన్నే అనుసరించాలిఅని!
ఈ ప్రభుత్వాలు చేసేవాళ్లకి, హాయిగా ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకున్నవాళ్లకీ ఈ శ్లోకాలలోని లోతు అర్థం కాదు. పదవిని ఆశించి చేసేవాడి సేవని సేవగా గుర్తించటానికి వీల్లేదని గీతాకారుడి ఆదేశం. “మీ అందరికీ పట్టెడన్నం నేనే పెడ్తున్నానుఅని ఘనతవహించిన ప్రభువులు అంటే సర్వలోకేషుడైన ఆ దేవుడు ఈ మాటలన్నీ కాయితం మీద వ్రాసుకుని ఆ తరువాత వీళ్ళు ఆ లోకానికి వెళ్లినప్పుడు అక్కడ పట్టుకుని వాయించేస్తారని కూడా అర్థం.   
గాంధేయమార్గం - తాత్వికతపేరుతో ఏటుకూరి బలరామమూర్తిగారు 1985-86 లలో గాంధీక్షేత్రం మాసపత్రికలో సీరియల్ గా కొన్ని వ్యాసాలు వ్రాశారు. మండలి బుద్ధప్రసాద్ గారు 12 యేళ్లపాటు ఈ పత్రికని నడిపారు. గాంధీజీ తాత్విక చింతనమీద చేసిన రచన ఇది. దాన్ని గాంధీ 150వజయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత  సంస్కృతి సమితి పునర్ముద్రించింది
1935లో గాంధీజీ కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. ఇంక తన ప్రయోగాలు స్వేఛ్చగా తాను జరుపుకోవచ్చు, కాంగ్రెస్స్ తనకిష్టమైన రాజకీయ కార్యక్రమాన్ని అనుసరించవచ్చు. అవసరమైనప్పుడు, కోరినప్పుడు, తన నాయకత్వం ఎలానూ ఉంటుంది…” అని వ్యాఖ్యానిస్తూ బలరామమూర్తిగారు ఈ రెండు శ్లోకాలనూ ఉదహరించారు. కృష్ణుడిలా తానుకూడా క్రియాశీలంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా తనకు తానే డ్యూటీ వేసుకుని కార్యక్షేత్రంలోకి దూకేలా ఈ రెండు శ్లోకాలు గాంధీ మీద ప్రభావం చూపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన మీదే కాదు, ఆనాడు స్వాతంత్రోద్యమంలో నడిచిన ప్రతి పోరాటవీరుడూ ఈ శ్లోకాలనే అనుసరించాడు. గాంధీ నాయకత్వం ఇందుకు ప్రేరకం అయ్యింది.
ఈనాడు మనకు లోపించింది అలాంటి ఏకనాయకత్వం. కారణం, ఎవరికీ ఈ రెండు శ్లోకాలలోని భావస్ఫూర్తి కలగకపోవటమే! ‘నీ కోసంఅనవలసిన మనుషులునా కోసంగా మారిపోయాక ఎవరికోసమూ ఏదీ లేని స్థితి దాపురించింది.   


కోడిపోడిమి డా. జి వి పూర్ణచందు


కోడిపోడిమి
డా. జి వి పూర్ణచందు
“పారిజాతపుఁబూవునాఁబరగుఁ జూడు
తామ్రచూడంబు చూడాపథంబు జొత్తు
దర్పభరమున బ్రహ్మరంథ్రంబు నడుము
జించి వెడలిన క్రోథాగ్నిశిఖయుఁబోలె”
(శ్రీనాథుడు క్రీడాభిరామం నుండి)
అజ్జవాలు, అడవికోడి, ఎర్రకోడి, కారుకోడి, బురకోడి, బెగ్గోడి (పెద్ద కోడి), మాముకోడి, మునుగు కోడి, నెమలి కోడి, మెట్టవాలు పిట్ట, శిఖ=కోడి, నీరుకోడి ఆస్ట్రిచ్చ్ పక్షిని ఒంటె కోడి అంటారు. ఇలా కోడి పక్షుల్లో చాలా రకాలున్నాయి. వాటి శరీరావయవాలక్కూడా దేని పేరు దానికుంది. ఆరెబొట్టే అంటే కోడికాలికి వెనకవైపున ఉండే పెద్ద గోరు.
ఈ పద్యంలో శ్రీనాథుడు కోడితో ఇంకో కోడి పోరాడటానికి తలపడినప్పుడు ఆ కోడిలోని పోరితనాన్ని వర్ణిస్తున్నాడు. కోడిపుంజు నెత్తిన ఉండే ఎర్రశిఖని తొడిమ ఎర్రని పారిజాతం పూవుతో పోలుస్తూ, “దర్పభరమున బ్రహ్మరంధ్రంబు నడుము జించి వెడలిన క్రోథాగ్నిశిఖయు బోలె” ఉన్నదంటాడు.
ఈ జగజ్జెట్టి  కోడి పుంజులు మెడలు నిక్కిస్తూ, రెక్క లల్లారుస్తూ, కొక్కొక్కొ అంటూ కాలుదువ్వుతుంటాయి. బాగా కొవ్వుపట్టిన ఆ ఎర్రకోడిపుంజు  తరళ తారకోద్వృత్త రక్తాంత లోచన మండలంలా ఉన్నదంటాడు.
ఒకదానితో ఒకటి ఎగిరి గుద్దుకొంటూ, చురచుర చూస్తూ, కోపాన్ని ప్రదర్శిస్తూన్నాయి.
వాటి కాలివ్రేళ్ల నుండి నెత్తిన ఎర్రశిఖ వరకూ నిక్కించి గాలికెగిరి,  వక్షస్థలాలు పగిలి చిందరవందర అయ్యేలా ఒకదానికొకటి గుద్దుకుని, తలకాయలు పగిలి ధారాపాతంగా నెత్తురుకారేలా పొడిచి కరచి గాయపరుచుకుంటున్నాయి.  
ఒకదాన్నొకటి  అడిచిపెట్టి, ఒడిసిపడుతుంటే, దానికి అందకుండా తప్పించుకుంటూ సడి సప్పుడూ లేకుండా కాళ్లకిందకు దూరి, చీరుతున్నాయి.
మాటిమాటికీ ఘాటఘాట అంటూ  కోళ్లు ఉక్కు కత్తుల్లాంటి ముక్కుల్తో గట్టిగా పొడుస్తున్నాయి. వంకర తిరిగిన కొంకికత్తుల్ని ఎదుటి కోడి కడుపులో దిగేలా పొడిచి, చించి చెండాడుతున్నాయి.
వాటి శౌర్య పరాక్రమాలు, వీరప్రతాపాలు అమోఘం. ఈ కోడి పోడిమిని ప్రదర్శించే వాహ్యాళీ స్థలంలో నెత్తురోడుతుంటే, పోటుగండడులాగా అవి రొప్పుతున్నాయి. గాయాల కారణంగా మూర్ఛాంధకారంలో మునుగుతున్నాయి” అని వర్ణిస్తాడు శ్రీనాథుడు.
“కుమారస్వామి వాహనాల్లారా! మంత్రదేవతా స్వాములారా! సమయానికే నిద్రలేపే కాలవిఙ్ఞానపాక కోవిదులారా! అహల్యను  వేశ్యగా చేయటానికి కారణమైన పక్షులారా! భూతభుక్తి కుంభార్హులారా! బలాత్కార కామందులారా! నిరంకుశ మహాహంకార నిధులార! కామవిజయ కాహళములార!” అంటూ వాటిని కొంచెం పొగుడుతూ కొంచెం తిడుతూ స్తుతించాడు.
ఇంతకీ ఈ కోడిపుంజులూ ఎందుకు కొట్టుకుంటున్నట్టు...? ఒకదానిమీద ఒకటి ఎందుకు కాలు దువ్వుకుంటున్నట్టు...?తాను గెలిచినా తనకు గండపెండేరాలు తొడగరుగదా...? తమ మీద పందాలు కాసినవారికోసం  తామెందుకు గాయాలపాలు కావాలి...? రాజకీయపార్టీల కార్యకర్తలు పార్టీ నాయకుల కోసం తమ బతుకుల్ని నాశనం చేసుకున్నట్టు!
 “హా! ఖగేంద్రములార! కయ్యమున నీల్గి
పోవుచున్నారె దేవతాభువనమునకు
మీరు రంభా తిలోత్తమా మేనకాది 
భోగకార్యార్థమై కోడిపుంజులారా!” 
స్వర్గంలో రంభ, తిలోత్తమ, మేనకాది అప్సర స్త్రీలతో పొందు కోసం ఆత్రపడి కయ్యంలో ఓడి వెళ్లి పోతున్నారా...?” అనడుతున్నాడు శ్రీనాథుడు.
తనను అప్పటిదాకా బాదం, పిస్తా, జీడిపప్పు వగైరా పెట్టి మేపినందుకు కృతఙ్ఞతగా కోడి తన యజమాని కోసం ప్రాణత్యాగం చేస్తోంది. కోడి ఎంత లావుదైనా అది కూరగా మారటం కోసమే పుట్టింది కూరగా మారటానికి ముందు తన యజమానికి పందెంసొమ్ము కూడా ఇప్పించి పోవాలని దాని యావ.
రాజకీయపార్టీల కార్యకర్తలకు ఈ కోడితత్వం ఎక్కువ. ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ అన్నలపార్టీలే కదా! తన ‘అన్న’ కోసం రొమ్ము చీల్చుకుని, రుధిరమ్ము కార్చుకుని త్వరగా స్వర్గంలో రమ్ము త్రాగటానికి, రంభను తాకటానికి ఉవ్వుళ్లూరి్పోతుంటారు. తమ అన్నలు పొందులూ, పొత్తులూ ప్రతీ సారీ మార్చేసుకుంటుంటే, తమ్ముడు కోళ్లు అప్పటి దాకా కలిసి తిరిగిన వాడిమీదే కత్తి విసరాల్సి వచ్చినా పట్టించుకోవు.
కోడికి విచక్షణ ఉండదు. కార్యకర్తలకూ ఉండదు. కోళ్లకు “యూ టర్ను”లుండవు. అసలు ఏ టర్నులూ ఉండవు. ఎదురుగా దేన్ని చూపిస్తే దానిమీదకు దూకుతాయి... అచ్చమైన రాజకీయపార్టీ కార్యకర్తల్లా!
తమకోసం, గానీ, తమ జాతికోసం గానీ బావుకునేదేమీ లేకపోయినా,  కోడిరక్తం ఉడుకుతూనే ఉంటుంది...ఎప్పుడూ!


తన కొడుకు డా. జి వి పూర్ణచందు


తన కొడుకు
డా. జి వి పూర్ణచందు
“జనులకు దుష్పుత్రకునిచేత నపకీర్తి;
యు నధర్మమును సర్వజనవిరోధ
మును మనోవ్యథయును ననయంబు బ్రాప్తించు;
నట్టి కుపుత్రుమోహంబు విడువఁ
జాలక బహుమాన సంగతిఁ గను నెవ్వఁ;
డతని గేహంబు దుఃఖాలయంబు
నగు నని మఱియు నిట్లను మనుజుండు శో;
కస్థాన మగు పుత్రుకతనఁ జేసి
యనుపమక్లేశ భాజనం బయిన గృహము
విడుచుఁ గావున నిట్టి వివేకహీనుఁ
డగు కుపుత్రు సుపుత్రుఁగా నాత్మఁ దలఁతు
ననుచు నా రాజు బహుదుఃఖితాత్ముఁ డగుచు.
తన కొడుకు ప్రగతిని చూసి మురిసిపోయే తండ్రులు, వీడు తన కొడుకని చెప్పుకోవటానికి సిగ్గుపడే తండ్రులు అని కొడుకుల  తండ్రులు రెండు రకాలుగా ఉంటారు. ఇంకా వివరంగా పుత్రుల్లో కుపుత్రులు, సుపుత్రులు అని రెండు రకాలుగా ఉంటారని చెప్పవచ్చు. అపకీర్తి, అధర్మం, సర్వజన విరోధం, మనోవ్యథలు  కొడుకువలన కలిగినప్పుడు ఆ తండ్రి చేయగలిగిందేమిటీ...?
పోతనగారి భాగవతం నాలుగవ అధ్యాయంలో ఓ అంగరాజు గురించిన కథ ఉంది. అంగరాజు తన కొడుకైన వేనుడి చెడు ప్రవర్తన భరించలేక రాజ్యాన్ని, భార్యని, ఇంటినీ వదిలి అర్థరాత్రి వంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ సంగతి విని ఋషులు వజ్రకఠోరమైన మాటలతో నువ్వు చస్తావని శపించారతన్ని. వేనుడు అక్కడికక్కడే మరణించాడు. అప్పుడు దేశం రాజులేనిదై పోయింది. దొంగలు విజృంభించారు. రాజ్యంలో అరాచకం ప్రబలింది. దాంతో మునులు పశ్చాత్తాపపడి  ఆ వేనుడి శవం కుడిభుజాన్ని మథించారు. ఆ మథనంలోంచి నారాయణాంశతో మొదటి చక్రవర్తి అనదగిన పృథువు జన్మించాడు. ఇదీ పృధుచక్రవర్తి జన్మ రహస్యం.
చెడ్డ కొడుకువల్ల అపకీర్తి, అధర్మాలు కలుగుతున్నా,  అటువంటి కొడుకు మీద వ్యామోహం వదల్లేకపోతే ఆ తండ్రి కొంపే కొల్లేరౌతుంది. అప్పుడు కన్నతండ్రి ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలా? చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా మార్చుకునే ప్రయత్నం చేయాలా? అలా కాకుండా కుపుత్రుణ్ణి సుపుత్రుడిగా భావించి వాడి చేష్టలన్నీ భరించాలా?
తన కొడుకు బాధ వదిలించుకోవటానికి ఆ తండ్రి ముందున్న మార్గాలు ఈ మూడే! ఇందులో మూడో మార్గం కలియుగంలో ఉత్తమమైందిగా భావించబడ్తోంది.
సినిమా వాళ్లలో నాన్నలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటూ తమ గ్లామరు నిలవుండగానే, కొడుకుని లైన్లోకి తెచ్చేస్తుంటారు. మహానటుడి వారసుడికి ఆ మహానటుడి అభిమానులే యువమహానటుడని జేజేలు కొట్టేస్తుంటారు. సాగినంత కాలం అలా సాగుతూ ఉంటుంది ఆ వ్యవహారం. అతగాడి తండ్రి ఈ మూడు మార్గాల్లో మూడో మార్గాన్నే అనుసరించి కొడుకుకి తనవంతు న్యాయం చేస్తుంటాడు.
సినీ హీరోల వారసులు ఇలా రాజ్యానికొస్తుంటే మాట్లాడని విమర్శకులు, అధికారంలో ఉన్నవాడి కొడుకు విషయంలో ఎందుకు విమర్శిస్తారో అర్థం కాదు. తనకు టిక్కెట్టివ్వకపోయినా, తన కొడుక్కి ఇవ్వమనే తండ్రి ఈ మూడోమార్గాన్ని ఎంచుకోకపోతే కుటుంబద్రోహిగా మారిపోతాడు కదా! ఆ మాత్రం తండ్రి నేతల్ని అర్థం చేసుకోకపోతే ఎలా?
 “చినబాబుగారు మీ అంతవాడు కావాలంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి” అని ఏ శ్రేయోభిలాషయినా హెచ్చరిస్తే, ఆ తండ్రి మూడో మార్గానికే మొగ్గు చూపించి, “మా అబ్బాయి పైకొస్తే అడ్డం అవుతాడని అసూయతో ఇలా అంటున్నావ్” అని ఎదురంటాడు. అనాలి! ఎలాంటివాడైనా తనకొడుకు బాగుండాలనే తండ్రి కోరుకోవాలి. తన తరువాత రాజ్యానికి వాడే వారసుడు కావాలనుకోవటం ఈ యుగధర్మం రీత్యా నేరం కానే కాదు. చాలా పార్టీల్లో నాన్నకొడుకులదే హవా నడుస్తోందిప్పుడు.
వీళ్లలో నాన్నచాటు బిడ్డలూ, నాన్నని బయటకు తోసేసి రాజ్యం చేసిన కొడుకులు, నాన్న జైలుకు పోయే దాకా ఆగి నాయకత్వంలో కొచ్చిన కొడుకులు, నాన్న శవం దగ్గరే బేరాలు ప్రారంభించిన కొడుకులు, నాన్నపేరు, నాన్నమ్మ పేరూ చెప్పుకునే కొడుకులూ  ఇలా రకరకాల నాన్న కొడుకుల ఆధీనంలో రేపటి ఎన్నికలు జరుగుతున్నాయి.
కొడుకుల నిర్వాకాలను చూడకుండా ముందే పోయిన నాన్నలు అదృష్టవంతులు.