Wednesday 1 May 2019

నా కోసం డా. జి వి పూర్ణచందు


నా కోసం
డా. జి వి పూర్ణచందు
“న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన!
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి!!
యది హ్యహం న వర్తేయం  జాతు కర్మణ్యతంద్రితః !
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః !!
          మనుషుల్లో వర్కోహాలికులూ ఉంటారు. వీళ్లు తమకు తోచిన పని చేస్తుంటారు. ఒకరు చెప్పారనికాదు, తమ బాధ్యతగా ఏదోక మేలు ఎవరికో ఒకరికి చేస్తూనే ఉంటారు. ఎవరైనా చనిపోయారని తెలిస్తే చాలు, ఓ పెద్దాయన వెంటనే అక్కడికి వెళ్లి పాడె కట్టడం, పాడె మోయటం చేస్తుంటాడు. తన శ్రమను గుర్తించి తనకు ప్రభుత్వ పురస్కారాలు ఇవ్వలేదని ఏ రోజూ బాధపడని ఇలాంటి మనుషులు చాలా మంది ఉన్నారు.
ఎవరు చెప్పారని నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి, చెట్లు పండ్లిస్తున్నాయి...?  అనడుగుతారుగాని, ఎవరు చెప్పారని ఒక కవి సమాజహితం కోరి రచనలు చేస్తున్నాడు? ఎవరు చెప్పారని ఒక మధుర గాయకుడు గొంతెత్తి జన చైతన్యాన్ని ప్రోది చేస్తున్నాడు? ఎవరు చెప్పారని ఒక నటుడు ఇల్లూవాకిలి వదిలి, నాటక కళాసేవ చేస్తున్నాడు?
తెలుగునాట కళలు వృత్తులు కావు. కళా సాహిత్యాలను నమ్ముకునిగానీ, అమ్ముకునిగానీ ఎవరూ జీవించటం లేదు. సినిమా రంగం గురించి అనవసరంగా మనం ఇక్కడ చర్చించనవసరం లేదనుకుంటాను. సినిమాలతో సంబంధం లేకుండా సేవచేస్తున్నవారికే ఈ కర్మణ్యాధికార సూత్రం వర్తిస్తుంది. పద్మశ్రీలు సినిమాల వాళ్లకే గానీ ఇతరులకు రావుకదా! వచ్చిన మహాత్ములు లేకపోలేదు. ఒకరు చెప్పారని కాకుండా తన తపన కొద్దీ స్వీయాధికారంతో పని చేసే వారుగా వీరిని మనం భావించాలి. 
వారికి గీతాకారుడు చెప్పిన కర్మ చేసే అధికారం మాత్రమే గాని, ఫలాలు ఆశించే అధికారం లేదు. ప్రతిఫలాపేక్షరహిత సేవ గురించి ఈ శ్లోకంలో గీతాకారుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకు తననే ఉదాహరణగా చెప్పుకుంటున్నాడు.
“ఓ అర్జునా! మూడు లోకాలలో నేను చేయాల్సిన విధి అంటూ ఏమీ లేదు. నేను పొందంది గాని, ఇకమీద పొందాల్సిందిగాని అందుకోసం వెంపర్లాడాల్సిందిగానీ ఏదీ లేదు. అయినా  నేను పనిచేస్తూనే ఉన్నాను” అంటున్నాడు.
ఒక కవి, ఒక కళాకారుడు, ఒక సేవాతత్పరుడు కూడా ఇలానే అనుకుంటాడు. తనకు తగ్గ గుర్తింపు రాలేదనే అసంతృప్తి ఉన్నవాడు మొదట్లోనే ఈ ‘పని’ వదిలేసి లాభసాటి రియలెస్టేట్ వ్యాపారంలోకి పోయేవాడు. ఇంకా సమాజహితం పేరుతో పనిచేస్తూనే ఉన్నాడంటే ఒక కవిని, ఒక కళాకారుణ్ణి కూడా నదిలాంటివాడు, గోవులాంటివాడు, ఫలవంతమైన కల్పవృక్షం లాంటివాడు అనాలి. మాటవరసకు పురుషవాచకంలో చెప్ప్తున్నాం గానీ స్త్రీలకూ సమానంగానే వర్తించే విషయం ఇది. ఇక్కడ సాక్షాత్తూ భగవంతుడే ఒక ప్రకటన చేస్తున్నాడు... “నాకు వచ్చేదేమీ లేకపోయినా నేను పనిచేసూనే ఉన్నాను” అని! ఎందుకు అలా పనిచేయాల్సి వచ్చిందో దాని తరువాత శ్లోకంలో ఇలా చెప్తున్నాడు:
ఎప్పుడైనా నేను బద్ధకించి నా డ్యూటీ నేను చేయకుందా ఉండిపోయాననుకోలోకానికి చాలా హాని జరుగుతుంది.  అందుకనే మనుషులంతా అన్ని విధాలా నామార్గాన్నే అనుసరించాలిఅని!
ఈ ప్రభుత్వాలు చేసేవాళ్లకి, హాయిగా ప్రభుత్వోద్యోగాలు సంపాదించుకున్నవాళ్లకీ ఈ శ్లోకాలలోని లోతు అర్థం కాదు. పదవిని ఆశించి చేసేవాడి సేవని సేవగా గుర్తించటానికి వీల్లేదని గీతాకారుడి ఆదేశం. “మీ అందరికీ పట్టెడన్నం నేనే పెడ్తున్నానుఅని ఘనతవహించిన ప్రభువులు అంటే సర్వలోకేషుడైన ఆ దేవుడు ఈ మాటలన్నీ కాయితం మీద వ్రాసుకుని ఆ తరువాత వీళ్ళు ఆ లోకానికి వెళ్లినప్పుడు అక్కడ పట్టుకుని వాయించేస్తారని కూడా అర్థం.   
గాంధేయమార్గం - తాత్వికతపేరుతో ఏటుకూరి బలరామమూర్తిగారు 1985-86 లలో గాంధీక్షేత్రం మాసపత్రికలో సీరియల్ గా కొన్ని వ్యాసాలు వ్రాశారు. మండలి బుద్ధప్రసాద్ గారు 12 యేళ్లపాటు ఈ పత్రికని నడిపారు. గాంధీజీ తాత్విక చింతనమీద చేసిన రచన ఇది. దాన్ని గాంధీ 150వజయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత  సంస్కృతి సమితి పునర్ముద్రించింది
1935లో గాంధీజీ కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. ఇంక తన ప్రయోగాలు స్వేఛ్చగా తాను జరుపుకోవచ్చు, కాంగ్రెస్స్ తనకిష్టమైన రాజకీయ కార్యక్రమాన్ని అనుసరించవచ్చు. అవసరమైనప్పుడు, కోరినప్పుడు, తన నాయకత్వం ఎలానూ ఉంటుంది…” అని వ్యాఖ్యానిస్తూ బలరామమూర్తిగారు ఈ రెండు శ్లోకాలనూ ఉదహరించారు. కృష్ణుడిలా తానుకూడా క్రియాశీలంగా ఏ ప్రతిఫలమూ ఆశించకుండా తనకు తానే డ్యూటీ వేసుకుని కార్యక్షేత్రంలోకి దూకేలా ఈ రెండు శ్లోకాలు గాంధీ మీద ప్రభావం చూపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆయన మీదే కాదు, ఆనాడు స్వాతంత్రోద్యమంలో నడిచిన ప్రతి పోరాటవీరుడూ ఈ శ్లోకాలనే అనుసరించాడు. గాంధీ నాయకత్వం ఇందుకు ప్రేరకం అయ్యింది.
ఈనాడు మనకు లోపించింది అలాంటి ఏకనాయకత్వం. కారణం, ఎవరికీ ఈ రెండు శ్లోకాలలోని భావస్ఫూర్తి కలగకపోవటమే! ‘నీ కోసంఅనవలసిన మనుషులునా కోసంగా మారిపోయాక ఎవరికోసమూ ఏదీ లేని స్థితి దాపురించింది.   


No comments:

Post a Comment