Friday 14 August 2015

గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి డా. జి వి పూర్ణచందు

గోదావరి ఒడ్డున మరోనాగార్జునుడు
శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
డా. జి వి పూర్ణచందు

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి పేరుతో ఇద్దరు ప్రముఖులు రాజమహేంద్రి కేంద్రంగా గత శతాబ్ది తొలినాళ్ళలో దీపస్తంభాలై నిలిచారు. తెలుగు జన జీవితంలో వెలుగులు నింపిన ఇద్దరూ ఉద్దండులే! ఒకరు మహాకవి. ఇంకొకరు మహావైద్యులు.
మహాకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు (1866-1960) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవి. జన మనోహర భాషలో పత్రికలు రావాలనే లక్ష్యంతో 1901 లో రాజమ౦డ్రి ను౦డి గౌతమి దినపత్రికని తెచ్చిన జాతీయ వాది. రామాయణం, భారతం, భాగవతం మూడింటినీ తెలుగు వచన అనువాదం చేశారు.
రెండవ వారు మహావైద్యునిగా కీర్తి గడించిన రసవైద్య నిపుణులు, ఆయుర్వేద భూషణ, భిషగ్వర శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు. రసశాస్త్రంపై పట్టు సాధించి మరో నాగార్జునుడిగా కీర్తి పొందారు. అనుభవ దీపికఆయుర్వేదౌషధ రత్నాకరం, ఆంధ్ర భైషజ్య రత్నావళి’, ‘భస్మప్రకాశికమొదలైన గ్రంథాలను ఒక వైద్యుడుగా, ఒక ఫార్మాసిష్టుగా తన అనుభవాలు రంగరించి రచించారు. చరక సంహిత ఆరు స్థానాలనూ స్థానషట్కం పేరుతో అనువదించి, తులనాత్మక వ్యాఖ్యానంతో ప్రచురించారు. పరిశోధనాత్మకంగా, సాధికారికంగా వ్యాఖ్యానం సాగుతుంది. చికిత్సా విధానంలో కొత్త పోకడలకు దారులు వేశారు. వైద్యశ్రీ శ్రీపాద కృష్ణమూర్తిగారి కృషి వైద్య ప్రపంచంలో చిరస్మరణీయమైంది.
 “ఔషధం గుణాలూ, వైద్యుడి మనోశక్తి రెండూ తోడైనప్పుడే చికిత్స విజయవంతం అవుతుంది అంటారాయన. మనసా వాచా పరిశుద్ధుడై  మందుని ఇస్తున్నాను. ఇది పని చేసి తీరాలిఅనే గట్టి సంకల్పంతో ఔషధ ప్రయోగం చేస్తే అది మరింత పనిచేస్తుందనీ, రోగిని మోసగించో, అబద్ధాలు చెప్పో డబ్బు గుంజాలనే ఆలోచన లేకుండా రోగి బాధ తగ్గటమే లక్ష్యంగా ఔషధం ఇవ్వాలనీ ఆయన నమ్మకం. అలాంటివైద్యుల్ని అమృత హస్తులుగా కొలుస్తారు. శాస్త్రి గారి హస్తవాసి రాజమహేంద్రి, పరిసర ప్రజలకు బాగా తెలుసు. పురప్రముఖులు శ్రీ వై. యస్.నరసింహారావు గారు కోటిపల్లి బస్టాండ్ దగ్గర మెయిన్ రోడ్డు మీదే శాస్త్రి గారి ఆసుపత్రి ఉండేదన్నారు. వైద్యసేవ తప్ప మరో ధ్యాస లేని నిస్వార్ధుడిగా ఆయన గురించి చాలా మంది పెద్దలు చెప్పారు.
 కృష్ణపండితీయం అనే నామాంతరం కలిగిన తన ఆయుర్వేదౌషధ రత్నాకరం గ్రంథంలో ఆయన చెప్పుకున్న ప్రవరను బట్టికౌశికస గోత్రికులైన శ్రీపాద సోమయాజిగారు ఆయన తండ్రి! సుబ్బమ్మగారు తల్లి! కోనసీమలో మోడేకుర్రు గ్రామం ఆయన పుట్టిన ఊరు. బహుశా అది మాతామహుల గ్రామం కావచ్చు! ఏడుగురు మగపిల్లలూ, ముగ్గురు అక్కచెల్లెళ్ళ మధ్య రెండవ సంతానం మన శాస్త్రిగారు.
సహజంగా స్థితిమంతులు కావటాన,  ఒకరిపైన ఆధారిత జీవనం లేనందున, వైద్యపరంగానూఔషధపరంగా కూడా తాను తేదలచిన మార్పుల్ని నిస్సంకోచంగా తీసుకు వచ్చారాయన. నేటికీ అవి ప్రామాణికమే! వైద్యంలో తనదైన ముద్ర, తన వంతు పాత్రతను సూచించే మెరుగులు, తాను ప్రదర్శించిన మెరుపులు… ఇవి కృష్ణమూర్తి శాస్త్రి గారిని చిరంజీవిని చేశాయి. గోదావరీ తీరం పండిత పరివేష్టితం కాబట్టి, తన కృషికి కావల్సిన సహృదయత ఆయనకు దొరికింది. అదొక కలిసొచ్చిన అంశం.
1925-27 మధ్య కాలంలో శాస్త్రిగారు బెజవాడ రామమోహన కళాశాలలో ప్రతివాద భయంకర కృష్ణమాచార్యుల వారు
తి. . రామానుజ స్వామి గార్లతో కలిసి ఉపాధ్యాయులుగా పనిచేశారు. దగ్గరగా విద్యార్ధిని కూచోబెట్టుకుని లాలించి బోధించే పద్ధతిలో ఆయన రచనలు ఉండటానికి ఆయనలో ఉన్న ఉపాధ్యాయుడే కారణం.
భయమూ ఉదాసీనతల వలన ఆయుర్వేద వైద్యులు శాస్త్రంలో చెప్పిన ఎన్నో ముఖ్య ఔషధాలను ప్రయోగించటానికి జంకుతున్నారు. భయాన్ని పోగొట్టటానికి శాస్త్రంలో చెప్పిన అనేక యోగాల తయారీని, పాటించవలసిన మెళకువల్నీ తెలియ చెప్పటం ఒక అవసరంగా భావించారాయన. వాటి తయారీ విధానాన్ని మెరుగు పరచి, మార్పులు చేసి, తేలిక పరిచి, తయారు చేసి చూసి, తన అనుభవాన్ని డైరీల్లో నమోదు చేశారు. రస, గంథకాదుల శుద్ధితో మొదలు పెట్టి, పుటం పెట్టింది లగాయితూ ఔషధం తయారయ్యే వరకూ వండుతున్నప్పుడు ఆ ఔషధంలో వచ్చే పరిణామ క్రమాలు , రంగు రుచి వాసనలతో సహా వివరాలన్నీ ఘడియ కొకసారి నమోదు చేశారు. దానినే  అనుభవదీపిక గ్రంథంగా సలహాలూ సూచనలతో  ప్రచురించారు.
 “ఇంతయేల? పుస్తకమును వ్రాయు నప్పుడు మేము అనేక చిత్ర విచిత్రములగు మార్పులను చేయుటచే, షుమారు 20 సంవత్సరముల నుండియు సంపాదించిన ఙ్ఞానము కంటె అనేక విధములగు ఙ్ఞానమును సంపాదించితిమి. ఇంతకంటె మేమేమి వ్రాయవలయునో మాకే తెలియ కున్నదిఅని అనుభవదీపిక గ్రంథ గురించి చెప్పుకున్నారాయన. వ్రాయవలసిందంతా వ్రాశానన్న ఆత్మవిశ్వాసం ఆ మాటల్లో తొణికిస లాడుతుంది. తెలుగులో ఇలాంటి పుస్తకం లేదని సగర్వంగా చెప్పగల రచనలు అనేకం చేశారాయన.  
వైద్య రహస్యాల్ని ఇలా అచ్చువేయటం వలన గుట్టు పోతుందని, గౌరవం ఉందదనీ కొందరు అభ్యంతర పెట్టినప్పుడు కృష్ణమూర్తి శాస్త్రిగారు రహస్యములు బయలు పడుట చేతనే శాస్త్రమైననూ అభివృద్ధి నొందగలదనియు, గౌరవమును పొంద గలదనియు నా యభిప్రాయము అని సమాధానం చెప్పారు.
సూతికాభరణము, త్రైలోక్య చింతామణి, నవరత్న చింతామణి లాంటి ఔషధాల తయారీ అందరికీ సాధ్యం అయ్యేది కాదు. వాటి తయారీకి, వాటిని వైద్యులు ప్రయోగించటానిక్కూడా ప్రావీణ్యం కావాలి.  ఔషధాల  తయారీ, అందులో కలిసే ద్రవ్యాల గురించిన అవగాహన ఉంటే ఆత్మవిశ్వాసంతో చికిత్స చేయగలుగుతారు. రజతలోహ రసాయనం, కస్తూరి మాత్రలు ఇలాంటివి తెప్పించి రోగులకు వాడుతున్న వైద్యులు వాటిలో ఏవేవి కలిశాయో, వాటి తయారీ ఎలా జరిగిందో, ఆలోచించ కుండానే వాడేస్తున్నారని, తయారీదారులూ వివరాలను చెప్పటం లేదనీ, ఇలా చేయటం న్యాయమా అని ప్రశ్నిస్తారాయన. ఇంచుమించు వందేళ్ళ క్రితం సమస్యని ఆయన లేవనెత్తి ప్రశ్నించారో సమస్య అంతో ఇంతో పెరిగిందే గానీ, తగ్గలేదు.
ఒకవైపు రోగుల్ని చూసుకుంటూ, ఇంకో వైపు, ముడిఖనిజాలు, లోహాలు, మూలికలను శుద్ధులు చేసుకుంటూ వైద్యుడి పాత్రనీ, తయారీదారు పాత్రనీ ఒకేసారి పోషించారాయన. అందరికీ అది సాధ్యపడకపోవచ్చు! ప్రామాణికత కలిగిన ఫార్మసీలు నమ్మకమైన ఔషధాలు ఇచ్చినప్పుడు వైద్యులకు చికిత్సపైన ప్రయోగాలకు ఎక్కువ అవకాశం ఉంటుందంటారాయన.
శాస్త్రి గారు ప్రముఖంగా చెప్పిన ఔషధాలలో కాంతవల్లభరసం ఒకటి! క్షీణింప చేసే వ్యాధుల్లో రోగిని బతికించేందుకు విష్ణువే  స్వయంగా చెప్పిన ఔషధంగా దీన్ని ఆయన పేర్కొన్నారు. దీని గురించి శాస్త్రిగారు సూచించిన విధంగా రోగులకు ఇచ్చినప్పుడు టిబీ, ఎయిడ్స్, హెపటైటిస్, డెంగ్యూ లాంటి క్షీణింప చేసే వ్యాధుల పైన, అర్థరైటిస్, చికుంగున్యా లాంటి వాత వ్యాధుల పైన ఇది గొప్పగా పనిచేస్తోన్నతీరుని ఈ వ్యాసకర్త కూడా గమనించటం జరిగింది.శాస్త్రిగారు చెప్పిన మెళకువలు ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు బాగా ఉపయోగపడతాయి.
కాంతవల్లభరసం  ఔషధాన్ని నాలుగైదు కుప్పెల్లో ఉంచి ఇసుక నింపిన పాత్రలో(వాలుకాయంత్రం) ఉంచి, ఐదారు రోజుల పాటు వండే విధానం వివరిస్తూ, గాజుకుప్పెలో ఔషధం పాకానికి వచ్చిందో లేదో తెలియటానికి ఒక గాజు కడ్డిని ముంచి తీసి చూస్తేమణిశిల పచ్చగా అంటుకుని ఉంటుందనీ, పాదరసం తెల్లగా పట్టుకుంటుందనీ, గంధకం వాసన పూర్తిగా పోయాక పాకం పూర్తవుతుందనీ వివరించారు.  ఇలా ఔషధం సక్రమంగా తయారైందని నిర్ధారించే పరిక్షలెన్నో ఆయన చెప్పారు.
రోగి కోరే ఔషధం కాబట్టి కాంతవల్లభ రసంఅని, వసంత ఋతువులో పూసే పూవుల రసంతో భావన (నానబెట్టటం) చేసి ఔషధం తయారు చేస్తారు కాబట్టి, వసంత కుసుమాకరం అనీ, పదహారు భాగాలు గంధకం కలుస్తుంది కాబట్టి, చంద్రుడి పదహారు కళలకు గుర్తుగా, పూర్ణచంద్రోదయంఅనీ, సిద్ధుల కోసం చెప్పింది కాబట్టి, ‘సిద్ధమకరధ్వజం అని, చంద్రుడిలా చలవచేస్తుంది కాబట్టి  తారకేశ్వర రసంఅని, ఇలా ప్రతి ఔషధానికి పేరు ఎలా వచ్చిందో ఆయన చక్కగా విపులీకరించారు.
శీతాంశు రసాన్ని ఆనందభైరవినీ అల్లం రసంతో ఇస్తే దీర్ఘకాలంగా తగ్గని శీతపైత్య జ్వరాలు తగ్గుతాయి, తేలుకాటుకు విరుగుడుగా ఉపయోగపడుతుంది. సిందూరభూషణం వేడి వలన వచ్చే దగ్గు మీదా, సువర్ణ భూపతి కఫ దోషం వలన వచ్చే దగ్గుమీద, లోకనాథ రసం అజీర్తి వలన కలిగే దగ్గు మీద, మహాలక్ష్మీవిలాసరసం ద్వంద్వ దోషాలవలనవచ్చే దగ్గు మీద ఇలా ఒకే వ్యాధి పైన వివిధ ఔషధాలను ఎలా ప్రయోగించాలో తెలియచెప్పే handbook లాగా ఆయన రచనలు వైద్యులకు ఉపయోగ పడతాయి. మాత్రలు చేసేప్పుడు బిగింపు (binding) కోసం తేనెద్రాక్షలాంటివాటికి బదులుగా తుమ్మబంకని కలపటాన్ని ఆయన తీవ్రంగా నిరశించారు. కొండవీటి చాంతాడంత ప్రిస్క్రిప్షన్లు ఇచ్చే నేటి కాలపు పద్ధతుల్ని ఆయన ఖండించారు. అనేక ఔషధాల్ని ఒకేసారి ప్రయోగించటం వలన వికృతి కలుగుతుంది. అలాంటప్పుడు మందుల్ని బాగా తగ్గించి, ఒకటికో రెండుకో పరిమితం చేయాలి. లేదా కొన్ని రోజులపాటు మందూ వేయకుండా ఆపటమే మంచిదంటారాయన. 
కరోమి సూక్ష్మయా బుద్ధ్యా లోక రంజక ముత్తమమ్ ధర్మార్ధ సుఖసాధనం అయిన ఆయుర్వేద మహాశాస్త్రాన్ని నేర్పిన గురుదేవులు పండిత దీవి గోపాలాచార్యుల వారికి నమస్కరించి, లోకం మేలు కోసం తన గ్రంథ రచన సాగాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆయన ముందుకు నడిచారు. లోకం మేలు కోరటం వైద్యుడి కర్తవ్యం.

ఔషధంలో కలప వలసిన మూలద్రవ్యాలు, వాటి శుద్ధి, వండవలసిన తీరు, పక్వానికి పరిక్షలు, దాన్ని ప్రయోగించ వలసిన వ్యాధులు, మోతాదు, అనుపానం ఇన్ని విషయాలనూ సంస్కృత శ్లోకాలలో వ్రాసి, వ్యాఖ్యానం కూడా జోడించి ప్రచురించిన ఆయుర్వేదౌషధ రత్నాకరం, అనుభవ దీపిక, భస్మప్రకాశిక గ్రంథాలు వైద్యులకు కరదీపికలు కాగా, చరకానికి వారి వ్యాఖ్యానం గొప్ప మార్గ దర్శక గ్రంథంగా నిలిచింది. రస శాస్త్రం పైన, వంటౌషధాల పైన అంతటి పట్టువున్న వైద్యులు అపురూపం.. 

No comments:

Post a Comment