Saturday 25 April 2015

నాంచారమ్మ కథ :: డా. జి వి పూర్ణచందు

“అలరుల నందనంబున
అలరారుచు నొక్క కన్య యావిర్భవమై
అలసీత మున్ను భూమిని
చెలువుగ నుదయించినట్లు శ్రీయొప్పారెన్”
శ్రీ విల్లిపుత్తూరులో కొలువై ఉన్న గోదాదేవిని మోక్ష సంపదలిచ్చేది కాబట్టి చూడికొడుత్తవళ్ అని పిలుస్తారు తమిళులు. ‘చూడికొడుత్త నా(చ్చారు’ ఆమె పేరు. నాచ్చియార్ అని ‘య’కారంతో పలకాలి. ఈమెనే నాంచారు అంటారు తెలుగువాళ్ళు. తెలుగువాళ్లలో నాంచారయ్యలూ, నాంచారమ్మలూ చాలామంది ఉన్నారు. ఈమెకు ఆండాల్, కోడై, అనే పేర్లుకూడా ఉన్నాయి. కృష్ణదేవరాయలు ఈ ‘చూడికొడుత్తవళ్‘’ జీవిత చరిత్రని ఆముక్తమాల్యద కావ్యంగా మలిచాడు. ‘‘ముక్త ’పదాన్ని మోక్షం అనే అర్థంలో జాగ్రత్తగా ప్రయోగించాడు. అత్యున్నతమైందని ఆమె సంతృప్తి చెందాకనే స్వామికి సమర్పించే తత్త్వం ఆమెకి చిన్ననాటి నుండే అలవడినట్టు చిత్రిస్తాడీ కావ్యంలో రాయలవారు.
జనకుడికి తన పొలంలో సీతాదేవి దొరికినట్టు, విష్ణుచిత్తుడికి తన పూలతోటలో ఈ నాంచారు దొరికింది. జనకుని కుమార్తెగా, రాముని భార్యగా సీత పూజనీయం అయ్యింది. విష్ణుచిత్తుని కుమార్తెగా, ఆ శ్రీ మహావిష్ణువు భార్యగా, గోదాదేవిగా నాంచారు పూజ లందుకుంది. ఇది అతి సామాన్యుడిక్కూడా తట్టే పోలిక.
కానీ, కృష్ణదేవరాయలు ఆ పుష్పవనంలో “ఒక్కబాలంకనుగొనె” అని మాత్రమే ఆముక్తమాల్యద కావ్యంలో వ్రాశాడు. ఆయన కేదో మనసులో సందేహం ఉండిఉంటుంది… ‘అయోనిజ’ లాగా సీతాదేవి దొరికిందని వ్రాయలేదు. ఆ పూలతోటలో కాముకులు స్వేఛ్ఛగా తిరగటాన్ని కూడా అదే ఆశ్వాసంలో వర్ణించటం చేత, ఏ పెళ్ళికాని తల్లో, తండ్రో ఆ పసిగుడ్డుని ఈ పూలతోటలో వదిలి వెళ్ళినట్టు నర్మగర్భంగా సూచించి వదిలాడు.
దేవాతామూర్తిగా పూజలందుకున్న వ్యక్తి చరిత్ర కాబట్టి ఎన్ని మహత్తుల నైనా ఆపాదించి రాసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, రాయలు సామాజిక దృష్టి తోనే ఆముక్తమాల్యద కావ్య రచనచేశాడని దీన్ని బట్టి భావించాలి.
పైనపేర్కొన్నపద్యం 17వ శతాబ్దికి చెందిన “‘నందవర భాష్కర శేషాచలామాత్యుడు”’ తన “‘నా(చ్చారు పరిణయం”’ కావ్యంలో చెప్పిన పద్యం ఇది. “అలరులు నిండిన ఆ తోటలో అలరారె ఒక పాపాయి అలనాడు సీత భూమిలో దొరికినట్టు చెలువుగ ఉదయించింది వెలుగులు నిండగా!” అంటాడు ఈ పద్యంలో నందవర కవి. తాళ్ళపాక తిరువేంగళ నాథుడు కూడా ‘పరమయోగి విలాసం’లో ఇదే అర్థంలో వర్ణించాడు. ఎవరి భక్తి వాళ్ళది! కొందరికి దేవుడు ముఖ్యం. కొందరికి సమాజమే దేవుడు!
“నా(చ్చారుపరిణయం”కావ్యాన్ని‘రాజుపాళయం’లో తెలుగుని కాపాడాలనే ఏకైక నినాదంతో ఆవిర్భవించిన తెలుగు విద్యాలయం పక్షాన 1987లో ప్రచురించారు. యక్షగాన సాంప్రదాయంలో వెలువడిన కావ్యం ఇది.
ఈ తెలుగు విద్యాలయానికి వెన్నుదన్నుగా నిలిచిన ముదునూరి జగన్నాథ రాజుగారు తెలుగు వారందరికీ ప్రాతః స్మరణీయుడు. ఆయన బహుభాషా ప్రవీణ. ఆధునిక సాహిత్య ప్రక్రియల్లో కూడా అనేక రచనలు చేసిన వ్యక్తి. తమిళనాట నివసిస్తున్న తెలుగు వాళ్ళు తమ మనుగడను కాపాడుకుంటూ, తమ భాషను కాపాడుకుంటూ పడుతున్న శ్రమ వర్ణనా తీతం. కొద్ది నెలల క్రితం శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారితో కలిసి రాజుపాళ్యం పరిసరాల్లో తెలుగువారి స్థితిగతులను అధ్యయనం చేయటానికి వెళ్ళే అవకాశం నాకు దొరికింది. ఆ సందర్భంలో కీ.శే. ముదునూరి జగన్నాథరాజుగారి ఇంటిని సందర్శించాము. ఆయన కుమార్తె, అల్లుడురాధాకృష్ణరాజుగారు ఇద్దరూ అంకితభావంతో జగన్నాథరాజుగారి స్మృతుల్ని పదిలపరచిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండస్థులమేడలో జగన్నాథ రాజుగారి గ్రంథాలను తెలుగు గ్రంథాలయంగా నడుపు తున్నారు. పెద్దల ఆశయాలను కొనసాగించే సంతతి అపురూపం అయిన ఈ రోజుల్లో జగన్నాథరాజుగారిని చిరస్మరణీయుణ్ణి చేస్తున్నారు.

No comments:

Post a Comment